కురవి : గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు ( Reservations ) పెంచి రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసిన మాజీ సీఎం కేసీఆర్ ( KCR ) లంబాడీ గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్( Satyavathi Rathod) అన్నారు.
మండలంలోని పెద్దతండాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిందన్నారు. గిరిజన రిజర్వేషన్ల పెంపుతోపాటు పోడు భూములకు పట్టాలు, తండాలకు నిధులు, గిరిజన విద్యార్థుల కోసం గురుకులాల ఏర్పాటు తదితర కార్యక్రమాలు చేపట్టందని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాను మారుమూల తండాలో పుట్టిన తనకు రాజకీయ జీవిత చరిత్రలో ప్రత్యేక స్థానం కల్పించిన తండ్రి సమానులు మాజీ సీఎం కేసీఆర్కు పాదాభివందనాలు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యే వరకు చెప్పులు ధరించనని 2022 సెప్టెంబర్ 17న సత్యవతి రాథోడ్ ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నాలుగేళ్లుగా చెప్పులు లేకుండానే పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై జరిగే కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. ఆరోగ్యరీత్యా చెప్పులు ధరించాలని వైద్యులు సూచించినప్పటికీ తన సంకల్పం పూర్తయ్యే వరకు పాదరక్షలు ధరించబోనని ఆమె వివరించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, బీఆర్ఎస్ నాయకులు శ్రీరాం నాయక్, ఐలి నరహరి, బోడ శీను, బాదె నాగయ్య, రాందాస్ కార్యకర్తలు పాల్గొన్నారు.