Abhijit Dipke : మహారాష్ట్రలోని కొన్ని గిరిజన హాస్టళ్లలో బాలికలకు ప్రెగ్నెన్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఈ అంశంపై దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో హాస్టళ్లలోని మౌలిక వసతులపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంటినుంచి హాస్టల్కు తిరిగి వచ్చిన బాలికలకు గర్భస్త పరీక్షలు నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. అభిజీత్ దీప్కే తాజాగా మహారాష్ట్ర, నాగ్పూర్లోని ఒక గిరిజన బాలికల హాస్టల్ను సందర్శించారు.
ఈ సందర్భంగా అక్కడి బాలికలు హాస్టల్లో ఉన్న పరిస్థితులపై దీప్కేకు వివరించారు. ఒక బాలిక మాట్లాడుతూ.. తాను ఇంటి నుంచి సెలవుల తర్వాత హాస్టల్కు రాగానే తమ మేడమ్ ప్రెగ్నెన్సీ పరీక్ష కోసం తనను ఆస్పత్రికి పంపించిందని వివరించారు. మేడమ్ సూచన మేరకు తన సోదరుడితో కలిసి ప్రెగ్నెన్సీ పరీక్ష కోసం హాస్పిటల్కు పంపించిందన్నారు. అక్కడ పరీక్ష కోసం అందరూ పెళ్లైన మహిళలే ఉన్నారని, వాళ్లంతా తనను తప్పుగా చూశారని ఆ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. మరో విద్యార్థిని కూడా ఇదే తరహా ఫిర్యాదు చేసింది.
తాను హాస్టల్లో చేరగానే తనను కూడా ప్రెగ్నెన్సీ పరీక్ష కోసం పంపించారని ఆవేదన వ్యక్తం చేసింది. బాలికలు సెలవుల్లో ఇంటికి వెళ్లొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఇలా ప్రెగ్నెన్సీ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అని పలువురు విద్యార్థినులు తెలిపారు. దీంతో ఈ అంశంపై అభిజీత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ గిరిజన హాస్టళ్లలోని విద్యార్థినులకు ఇలా గర్భస్థ పరీక్షలు నిర్వహించడం ఏంటని దీప్కే ప్రశ్నించారు. మహారాష్ట్రలోని మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కూతుళ్లకు కూడా ఇలా ప్రెగ్నెన్సీ పరీక్షలు నిర్వహిస్తారా అని దీప్కే ప్రశ్నించారు.
అలాగే, 150 మంది ఉండే హాస్టళ్లలో రెండు, మూడు వాష్రూమ్లు మాత్రమే ఉన్నాయన్నారు. విద్యార్థినులు పడుకోవడానికి సరైన బెడ్స్ కూడా లేవన్నారు. హాస్టళ్లలో సరైన మౌలిక వసతులు కూడా లేవన్నారు. ఇలాంటి హాస్టళ్లలో ప్రజా ప్రతినిధులు తమ పిల్లల్ని చదివిస్తారా అని ప్రశ్నించారు.