మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 17 : మిర్యాలగూడ మండలం గూడూరు సమీపంలో అక్రమంగా తరలిస్తున్న కల్తీ కోళ్ల దాణాను తెలంగాణ పౌల్ట్రీ అసోసియేషన్ బృందం పట్టుకుంది. రెండు డిసీఎం వాహనాల్లో తరలిస్తున్న దాదాపు 30 టన్నుల కల్తీ దాణాను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఇటీవల మార్కెట్లో కోళ్ల దాణా ధరలు గణనీయంగా పెరగడాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు ఈ దందాకు తెరలేపినట్లు పౌల్ట్రీ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ దాణాలో దాదాపు 60 శాతం వరకు రాయి పొడి, వరి పొట్టు కలిపి విక్రయిస్తున్నట్లు వారు గుర్తించారు. మిర్యాలగూడ కేంద్రంగా హాలియా, ఆంధ్రప్రదేశ్లోని పిడుగురాళ్ల నుండి హైదరాబాద్ మార్కెట్కు ఈ కల్తీ దాణా భారీగా సరఫరా అవుతోందని వెల్లడించారు. అనుమానంతో కొంతకాలంగా నిఘా ఉంచి వాహనాలను చాకచక్యంగా పట్టుకున్నట్లు చెప్పారు. కల్తీ దాణా తినడం వల్ల కోళ్లకు లివర్, కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చి పెద్ద ఎత్తున చనిపోతున్నట్లు పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ రాయుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి నిఘా పెంచాలని పౌల్ట్రీ ఫామ్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు.