బెంగళూరు: కరోనా ఉధృతిని నివారించడానికి కర్ణాటకలో అమలుచేస్తున్న లాక్డౌన్ను మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉన్నది. లాక్డౌన్ విధించడం వల్ల కొత్తగా నమోదవుతున్న కేసులు తగ్గుతున్నాయని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ఆర్. అశోక అన్నారు. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, ఢిల్లీల్లో లాక్డౌన్ వల్ల కేసులు భారీగా తగ్గాయని, అదేవిధంగా కర్ణాటకలో కూడా 14 రోజుల లాక్డౌన్ను మే 24 తర్వాత కూడా పొడిగిస్తే బాగుంటుందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ వంటి ఆంక్షలను కరోనా కర్ఫ్యూ పేరుతో గత నెల26 సీఎం యెడియూరప్ప ప్రకటించారు. అనంతరం మే 7న దానిని ఈ నెల 24 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.
లాక్డౌన్కు ముందు బెంగళూరులో ప్రతిరోజు 25 వేలకుపైగా కేసులు నమోదవగా, ఆంక్షలు అమలుచేయడం వల్ల ప్రస్తుతం అవి 17 వేలకు తగ్గాయని చెప్పారు. మరోమారు లాక్డౌన్ను పొడిగించడం వల్ల కేసులు తక్కువైతాయని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ఈ నెల 24తో ముగుస్తుందని, దానికి ఒక రోజుముందు మంత్రిమండలి సమావేశమవనుందని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులను సమీక్షించి లాక్డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అయితే లాక్డౌన్ పొడిగించాలని నేను కోరతానని, ఈ విషయంలో తుది నిర్ణయం సీఎం యెడియూరప్పదేనని చెప్పారు.
రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 41,779 పాజిటివ్ కేసులు నమోదవగా, 373 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 21,30,267 చేరగా, మరణాలు 21,085కు పెరిగాయి. ఇందులో ఒక్క బెంగళూరు అర్బన్లోనే 14,316 కేసులు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి