న్యూఢిల్లీ: నాలుగు రోజుల క్రితం ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరిగిన పరస్పర రాకెట్ దాడుల్లో మృతి చెందిన కేరళ మహిళ సౌమ్య సంతోష్ మృతదేహం భారత్ చేరింది. ఇవాళ ఉదయం ఇజ్రాయెల్ నుంచి న్యూఢిల్లీకి వచ్చిన ప్రత్యేక విమానంలో ఆమె మృతదేహాన్ని తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి వీ. మురళీధరన్, ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారి రాన్ యెడిడియా క్లెయిన్ ఆమె ప్రార్థీవదేహానికి నివాళులర్పించారు. న్యూఢిల్లీ నుంచి ఆమె శవపేటికను కేరళ తరలించనున్నారు.
ఈనెల 11న ఇజ్రాయెల్పై పాలస్తీనా జరిపిన రాకెట్ దాడిలో అక్కడ పనిచేస్తున్న కేరళకు చెందిన 31 ఏళ్ల సౌమ్య మృతిచెందారు. ఇజ్రాయెల్లోని అష్కెలోన్ నగరంలోని తన ఇంటి వద్ద నుంచి కేరళలోని తన భర్తతో వీడియో కాల్లో మాట్లాడుతుండగా ఈ ఘటన చోటుచేకుంది. ‘‘వీడియో కాల్లో మా అన్నకు పెద్ద శబ్దం వినిపించింది. హఠాత్తుగా ఆమె ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది. దీంతో వెంటనే మేము అక్కడ పనిచేస్తున్న తోటి మళయాళీలను సంప్రదించాం. అప్పుడే మాకు ఈ విషయం తెలిసింది..’’ అని సంతోష్ సోదరుడు సాజీ వెల్లడించారు. కేరళలోని ఇడుక్కి జిల్లా కంజిరామ్తానమ్కు చెందిన సౌమ్య.. గత ఏడేండ్లుగా ఇజ్రాయెల్లో హెల్పర్గా పనిచేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి