కొవిడ్పై యుద్ధంలో ధీరవనితలు
చైతన్యం కల్పిస్తూ.. సేవ చేస్తూ..
ప్రాణాలకు ఎదురొడ్డి పోరాటం
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కరోనాపై పోరులో అంగన్వాడీలు ధీరవనితలుగా నిలుస్తున్నారు. గ్రామీణ, పట్టణ, అటవీ ప్రాంతాలనే తేడా లేకుండా అలుపెరుగకుండా పోరాడుతున్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనతతో ఉన్నవారిని గుర్తించి, వారికి పౌష్టికాహారాన్ని అందించటం లాంటి పనులు చేస్తున్నారు. అంతేకాకుండా గర్భిణులను సమయానుసారం దవాఖానలకు తీసుకెళ్లడంతోపాటు ప్రసవాలు చేయించి ఇండ్లకు చేర్చటం, తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టడం లాంటి పనులు చేస్తున్నారు. వారి జాబ్చార్ట్లో గత సంవత్సరం నుంచి కరోనా కూడా చేరడంతో ఆ మహమ్మారిపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారిని ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించింది. కరోనాపై పోరుతోపాటు స్త్రీ, శిశు సంక్షేమంలో అంగన్వాడీల సేవానిరతిని సాక్షాత్తూ ముఖ్యమంత్రే కీర్తించిన దాఖలాలు అనేకం ఉన్నాయి.
ఇంటింటి ఆప్తులు
అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు రాష్ట్రంలోని ఇంటింటికీ ఆప్తులై ప్రజలతో మమేకమవుతున్నారు. వారి భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇంటింటా ఆరోగ్య పరిస్థితులపై సర్వే (ఫీవర్ సర్వే) నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. ఈ సర్వే బృందం (ఆశా వర్కర్, సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఏఎన్ఎం)లో అంగన్వాడీ కార్యకర్త కీలక భూమిక పోషిస్తున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్పై అపోహలతో టీకాలు వేయించుకునేందుకు జంకుతున్న ప్రజల్లో ధైర్యం నింపేందుకు అంగన్వాడీ టీచర్లు, సహాయకులే ముందు వరుసలో నిలబడి వ్యాక్సిన్ వేయించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75.70% (46,808) మంది అంగన్వాడీలు తొలిడోసు, 73.18% (45,248) మంది రెండో డోసు టీకా వేయించుకోవడం విశేషం.
అడవిలో ఆరేండ్ల పాపకు అమ్మలా..
అడవిలో ఆరేండ్ల పాపకు కరోనా సోకింది. గూడెమంతా అల్లాడిపోయింది. కాళ్లు చేతులు ఆడని స్థితి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. ఈ గూడేనికి ఆత్మబంధువు కొట్టెం చంద్రకళ. ఆమె రాష్ట్రపతి మెచ్చిన అంగన్వాడీ కార్యకర్త. ‘కొవిడ్-ఉమెన్ వారియర్-ది రియల్ హీరోస్’ అవార్డుకు ఎంపికైన తెలంగాణ ఆడబిడ్డ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త ఆమె. తను ఉండేచోటు నుంచి 5 కిలోమీటర్లు.. అదీ అడవిలో కాలిబాటన సరుకులు నెత్తినెత్తుకొని ఇల్లిల్లూ తిరుగుతూ పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల టేకులగూడెంలో కళం రమేశ్ అనే వ్యక్తితోపాటు ఆయన కుమార్తె (6)కు కరోనా సోకినట్లు గుర్తించారు. వారికి అవగాహన కల్పించడంతోపాటు.. క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని వివరించారు. చంద్రకళ చొరవతో ఆ తండ్రీబిడ్డలు కోలుకోవటమే కాకుండా ఆ గూడెంలో కరోనా వ్యాప్తి జరగకపోవడం విశేషం.