కొత్తగూడెం టౌన్, (నమస్తే తెలంగాణ) ఆగస్టు 1: సర్వారం గ్రామపంచాయతీ పరిధిలోని గోప తండా శివారు, రైల్వే ట్రాక్ సమీపంలో పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట స్థావరంపై శనివారం సాయంత్రం సీసీఎస్ (CCS) సిబ్బంది, సుజాతనగర్ పోలీసులు ఉమ్మడిగా దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన ఈ దాడిలో ఆరుగురిని పోలీసులు పట్టుకున్నారు.
గోప తండా శివారు, రైల్వే ట్రాక్ సమీపంలో ఆరుగురు పేకాటరాయుళ్లు పట్టుబడగా మరో ఐదుగురు పరారయ్యారు. పట్టుబడిన వారి నుంచి రూ.52,100 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 5 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం (సీజ్) చేసుకున్నామని సుజాతనగర్ ఎస్సై రమాదేవి తెలిపారు. చట్టవ్యతిరేకమైన పేకాట, జూదం
వంటి కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్సై రమాదేవి హెచ్చరించారు.
పట్టుబడిన నిందితుల వివరాలు: 1.నునావత్ సంతోష్, 2.భూక్య బిక్కులాల్, 3.నున్సావత్ అశోక్ కుమార్, 4.చల్ల రాజు, 5.భూక్య వీరన్న, 6.ఇస్లావత్ ప్రవీణ్ కుమార్.
పరారీలో ఉన్న నిందితులు: 1.కున్సోత్ వంశీ, 2.భూక్య ప్రవీణ్, 3.పల్లపు చంటి, 4.బానోత్ గోపి, 5.ధరావత్ రాజ్ కుమార్.