న్యూఢిల్లీ : పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల వర్చువల్ సమావేశాలకు అనుమతించాలని కోరుతూ చైర్మన్ వెంకయ్యనాయుడుకు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన విజ్ఞప్తిని రాజ్యసభ తిరస్కరించింది. ఈ మేరకు ఆయనకు రాజ్యసభ సచివాలయం సమాచారం అందించింది. వర్చువల్ సమావేశాలు గోప్యంగా జరగాల్సి ఉందని నిబంధనలు ఉన్నాయని, ఈ మేరకు వాటికి మార్పులు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మార్పులకు పార్లమెంట్ ఆమోదం అవసరమని జాయింట్ సెక్రెటరీ స్థాయి అధికారి ఖర్గేకు సమాచారం అందించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఖర్గే లేఖ, స్టాండింగ్ కమిటీల వర్చువల్ సమావేశాలను అనుమతించాలనే పలువురు ప్రతిపక్ష నాయకులు డిమాండ్ నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ అంశంపై చర్చించారని పేర్కొన్నాయి.
గురువారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అధీర్ రంజన్ చౌదరి సైతం ఇదే డిమాండ్తో స్పీకర్కు లేఖ రాశారు. వర్చువల్ విధానంలో భేటీలు జరపడంపై ఇంతకుముందే చైర్మన్, స్పీకర్ చర్చలు జరిపారని తెలిపింది. దీన్ని రూల్స్ కమిటీకి పంపాలని కూడా భావించారని తెలిపింది. అయితే, తగిన జాగ్రత్తలు పాటిస్తూ భౌతిక రూపంలోనే తరచూ సమావేశాలు జరుగుతున్నందున వర్చువల్ భేటీలు అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని పేర్కొంది. పరిస్థితి మెరుగుపడిన తర్వాత కమిటీల సమావేశాలను త్వరలో పరిగణించవచ్చని రాజ్యసభ సెక్రరేటియట్ మల్లికార్జున ఖర్గేకు సమాచారం అందించనట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.