న్యూయార్క్ : కరోనాతో పోరాడుతున్న భారతదేశానికి న్యూయార్క్ సిటీ సాయం ప్రకటించింది. క్లిష్ట పరిస్థితుల్లో అవసరమైన వైద్య సామగ్రి పంపనున్నట్లు మేయర్ బిల్ డి బ్లాసియో శుక్రవారం ప్రకటించారు. 40 లక్షల టెస్ట్ కిట్లు, మూడు లక్షల పల్స్ ఆక్సీమీటర్లు, 300 వెంటిలెటర్లు, బిపాప్ యంత్రాలు, ఇతర వైద్య సామగ్రిని పంపుతున్నట్లు తెలిపారు. ఏడాది క్రితం న్యూయార్క్ నగరం ప్రపంచ మహమ్మారికి కేంద్రంగా ఉందని, ఇప్పుడు సంక్షోభ సమయంలో సహాయం చేయడం తమవంతని.. కరోనాపై పోరాటంలో ఎవరూ ఒంటరిగా లేరని, ఈ మేరకు స్పష్టమైన సందేశం ఇచ్చేందుకు వైద్య పరికరాలను పంపుతున్నట్లు చెప్పారు. మేయర్ ప్రకటనపై భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్ అభినందనలు తెలిపారు. న్యూయార్క్ విరాళంగా ఇచ్చిన వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లు భారతదేశంలో మహమ్మారిపై పోరాడేందుకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. గొప్ప నగరం చూపిన దాతృత్వం ప్రశంసనీయమన్నారు.