హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఇంతకుముందే ఇద్దరు యువతులకు ప్రపోజ్ చేశాడని, ఆ తర్వాత బాధితురాలితో సాన్నిహిత్యం ఏర్పరచుకున్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఉదయ్కృష్ణారెడ్డి మానసిక స్థితిని రిమాండ్ రిపోర్ట్లో ప్రముఖంగా ప్రస్తావించారు. ఉదయ్ నేపథ్యాన్ని తెలుసుకొని బాధితురాలు సానుభూతి చూపించినట్టు తెలిపారు. బాధితురాలికి ఉదయ్ జూనియర్ అని, అతడు ముందుగా ప్రపోజ్ చేసిన ఇద్దరిలో ఒక యువతి పెండ్లికి నిరాకరించిందని చెప్తున్నారు. ఆ తర్వాత బాధితురాలతో ఉదయ్ సన్నిహితంగా ఉంటూ వచ్చాడని తెలిసింది. ఉదయ్ వింత ప్రవర్తన, దురుసుచర్యలతో బాధితురాలు విసిగిపోయి అతన్ని దూరం పెట్టడంతోనే ఆమెను వేధించి ఆమెపై హత్యాయత్నం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
అశోక్నగర్లోని ఉదయ్ కృష్ణారెడ్డి తాత్కాలిక నివాసంలో పోలీసులు జరిపిన సోదాల్లో మరో ఆసక్తికర విషయం వెల్లడైంది. అతని ఇంట్లో లభ్యమైన ఒక సెల్ఫోన్, ల్యాప్టాప్, మరికొన్ని ఆధారాల ప్రకారం అతనికి ‘అభ్యాస ఐఏఎస్ అకాడమీ’ ఉన్నట్టు, దానిని అతడే నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ సాధించిన తర్వాత అతడి సక్సెస్ జర్నీ గురించి సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలో బాధితరాలు కూడా అతడికి మెసేజ్ చేసినట్టు పోలీసులు చెప్పారు. ఐపీఎస్కు సెలెక్ట్ అయిన బాధితురాలు.. అక్కడి నుంచే ఐఏఎస్కు సిద్ధపడుతున్నట్టు అతడికి చెప్పారని, అలా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని తెలిపారు. ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తనలో మార్పులు రావడం, అతని దగ్గరున్న వీడియోలు బాధితురాలి అనుమతి లేకుండానే ఆమె భర్తకు చేరడం, ప్రశ్నించిన ఆమెపై హత్యాయత్నం చేయడం వంటి ఘటనలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. బాధితురాలి కంటే ముందు అతడు ప్రపోజ్ చేసిన మరో ఇద్దరు ట్రైనీలను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. కాగా, ఉదయ్ నివాసంలో దొరికిన ఫోన్, ల్యాప్టాప్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపినట్టు తెలిసింది.