మహబూబాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని ఖనిజ సంపద అక్రమంగా ఆంధ్రాకు తరలిపోతున్నది. ఇక్కడి విలువైన ఖనిజ సంపదపై కన్నేసిన అక్రమారులు గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే అటవీ భూముల నుంచి తరలించి తెలంగాణ ఖనిజాన్ని లూటీ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం శేరిపురం, పోచారం, కోట్యానాయక్ తండా, బాలాజీతండా, నగరం గ్రామాల పరిధిలోని సమీప అటవీ ప్రాంతంలో సుమారు వెయ్యి ఎకరాల్లో విలువైన బైరైటీస్ ఖనిజం నిక్షిప్తమై ఉన్నది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ అనుమతి పొందిన పలు కంపెనీలు తొలుత 1962లో, అనంతరం 2006-12 వరకు ఇక్కడి ఖనిజాన్ని ఆంధ్రాకు తరలించారు. ఖనిజాన్ని బయటి రాష్ర్టాలకు పోనిచ్చేది లేదని ఉమ్మడి రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు కూడా కొనసాగాయి. 2014లో స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బైరైటీస్ రవాణా అనుమతులు రద్దు చేసింది. దీంతోపాటు మైనింగ్ చేస్తున్న ప్రాంతం అటవీ భూమి కావడం.. ఆ శాఖ అడ్డుచెప్పడంతో తవ్వకాలు పూర్తిగా నిలిచిపోయాయి.
అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బైరైటీస్ అక్రమ రవాణాకు మళ్లీ తెర లేచింది. బైరైటీస్ ఖనిజాన్ని రాత్రి వేళ ట్రాక్టర్ల ద్వారా సమీప గ్రామాల్లోని రహస్య ప్రాంతాలకు తరలించి, అక్కడి నుంచి జేసీబీతో టిప్పర్లలో లోడ్ చేసి గుట్టు చప్పుడు కాకుండా ఆంధ్రాకు తరలించుకుపోతున్నారు. అక్రమ రవాణాకు పక్కనే ఉన్న ఖమ్మం జిల్లాలోని ఓ బైరైటీస్ లీజ్ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని ఆంధ్రాకు తీసుకెళ్తున్నారు.
నాలుగు రోజుల క్రితం నగరం అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి బైరైటీస్ను టిప్పర్లో లోడ్ చేస్తుండగా, సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది దాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. రవాణాదారుల వద్ద ఖమ్మం జిల్లాకు చెందిన ఓ బైరైటీస్ క్వారీకి సంబంధించిన వే బిల్లును గుర్తించారు. లోడింగ్కు ఉపయోగించిన జేసీబీని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినా అక్రమార్కులు ప్రతిఘటించడంతో దానిని అక్కడే వదిలేసి, పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఖనిజం తరలింపునకు అటవీ, పోలీస్, మైనింగ్ శాఖ అడ్డుకట్ట వేయలేకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
బైరైటీస్ అక్రమంగా తరలింపు ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నది. ఖనిజ తరలింపునకు సంబంధించి మైనింగ్ శాఖకు రాయల్టీ చెల్లించాల్సి ఉండగా, అనుమతి లేకుండా అక్రమ మార్గంలో తరలిస్తున్నారు. బైరైటీస్ ఖనిజానికి అంతర్జాతీయ మారెట్లో మంచి డిమాండ్ ఉన్నది. నాణ్యతను బట్టి టన్నుకు రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు ధర పలుకుతున్నది. అక్రమ రవాణాదారులు ఒకో లారీలో 35 టన్నుల బైరైటీస్ ఖనిజాన్ని తరలిస్తుండగా, లారీకి సుమారు రూ.4 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. సమీప గ్రామాలకు చెందిన కొందరు గిరిజనులను మచ్చిక చేసుకొని, వారికి డబ్బుల ఆశ చూపి కోట్ల రూపాయల ఖనిజాన్ని కొల్లగొడుతున్నట్టు తెలుస్తున్నది.
గార్ల మండల పరిధిలోని శేరిపురం, పోచారం 58వ, 57, 76, 99వ సర్వే నంబర్ల పరిధిలో సుమారు 356 హెక్టార్లలో 2013 వరకు విశ్వభారతి మైనింగ్ కంపెనీ, ఇండియన్ బైరైటీస్, ధర్సింగ్ నాయక్ మైన్స్, పోచారం ట్రైబల్ లేబర్ మైనింగ్ సొసైటీ, లక్ష్మీ ఎస్ అండ్ టీ ఎంఎల్ కోఆపరేటివ్ సొసైటీ, కనకదుర్గ ట్రైబల్ సొసైటీ వంటి పలు కంపెనీలు, సొసైటీలు బైరైటీస్ రెవెన్యూ భూముల్లో లీజులు పొంది ఖనిజాన్ని వెలికితీశారు. సంబంధిత భూములు అటవీ శాఖ భూములుగా తేలడంతో ఆ శాఖ మైనింగ్ను అడ్డుకున్నది. దీంతో లీజుదారులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సర్వే ఆఫ్ ఇండియా, మైనింగ్, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు 2015లో సంయుక్తంగా నెల రోజులపాటు సర్వే చేసి సర్కార్కు నివేదిక అందించారు. మైనింగ్ జరుగుతున్న ప్రాంతం అటవీ శాఖ భూములుగా తేల్చుతూ గత ఏప్రిల్ నెలలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో అటవీశాఖ అధికారులు ఖనిజం ఉన్న ప్రాంతం చుట్టూ కందకాలు తీసి రక్షణ చర్యలు తీసుకున్నా అక్రమార్కులు వాటిని పూడ్చి అక్రమ రవాణా సాగిస్తున్నారు.
బయ్యారం రేంజ్ గార్ల అటవీ ప్రాంతంలోని కంపార్ట్మెంట్ నంబర్ 42, 43, 44వ భూముల్లోని బైరైటీస్ ఖనిజం తరలిపోకుండా నిఘా ఏర్పాటు చేస్తాం. కొన్ని నెలల క్రితం మైనింగ్ జరిగిన ప్రాంతాన్ని అటవీ శాఖ భూములుగా గుర్తించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అనంతరం చుట్టూ కందకాలు తవ్వి రక్షణ ఏర్పాటు చేశాం. కొందరు కందకాలు పూడ్చి ఖనిజాన్ని తరలిస్తున్నట్టు తెలుస్తున్నది. నాలుగు రోజుల క్రితం బైరైటీస్ తరలిస్తున్న టిప్పర్ను సీజ్ చేశాం. కందకాలు లేనిచోట్ల తవ్వించి, ప్రత్యేకంగా బేస్ క్యాంప్ సిబ్బందితో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తాం. ఖనిజం తరలకుండా పటిష్ట చర్యలు చేపడుతాం.
– రవి కిరణ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, బయ్యారం