న్యూఢిల్లీ : కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ ఈ నెల 17న అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో సమావేశంకానున్నారు. ఈ సందర్భంగా విద్యారంగంపై కొవిడ్ మహమ్మారి ప్రభావంపై సమీక్షించనున్నారు. వర్చువల్ విధానంలోనే జరిగే సమావేశంలో ఆన్లైన్ ఎడ్యూకేషన్ను ప్రోత్సహించడం, నూతన జాతీయ విద్యా విధానం అమలుపై సమీక్ష జరుపనున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారని సంబంధిత శాఖ వర్గాలు పేర్కొన్నాయి. కొవిడ్-19ను ఎదుర్కొవడానికి రాష్ట్ర విద్యాశాఖలు చేసిన సన్నాహాలు, మహమ్మారి సమయంలోనూ ఆన్లైన్ విద్యను ఎలా కొనసాగించవచ్చో కేంద్రమంత్రి సమీక్ష నిర్వహిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ 10వ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షను రద్దు చేయగా.. 12వ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షను వాయిదా వేసింది. మేలో జరగాల్సిన ఉన్నత విద్య అన్ని పరీక్షలను సైతం మంత్రిత్వ శాఖ వాయిదా వేసింది.