న్యూఢిల్లీ : కరోనాకు వ్యతిరేకంగా టీకాలు వేయడంలో ‘ఇండియా ఫస్ట్’ విధానాన్ని ఎందుకు అవలంభించలేదని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ నేత శక్తిసిన్హ్ గోహిల్ ప్రశ్నించారు. దేశ పౌరులు మహమ్మారితో పోరాడుతున్న సమయంలో ఆరు కోట్ల వ్యాక్సిన్ మోతాదులను ఇతర దేశాలకు ఎగుమతి చేశారని విమర్శించారు. దేశంలో థర్డ్ వేవ్ను నిరోధించేందుకు సార్వత్రిక టీకా కార్యక్రమం ద్వారా 60శాతం జానాభాకు టీకాలు వేయాలని డిమాండ్ చేశారు. ప్రతి వంద మందిలో ఒక్క మోతాదు కరోనా వ్యాక్సిన్ ఇచ్చే ప్రపంచదేశాల్లో భారతదేశం 77వ స్థానంలో ఉండడం విచారకమన్నారు. యూకే, యూఎస్ సహా అనేక దేశాలు విజయవంతమైన, వేగవంతమైన టీకా డ్రైవ్ను అమలు చేశాయని, జనాభాలో 80శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేశాయన్నారు.
దేశంలో కేవలం 10.08 శాతం మందికి మాత్రమే సింగిల్ డోస్ వేశారని, 2.8శాతం మందికే రెండు మోతాదు అందిందన్నారు. టీకా విషయంలో భారతీయులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పార్లమెంట్ స్థాయీ సంఘం అక్టోబర్లో చేసిన సిఫారసులను భారత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. అమెరికా సహా పలు దేశాలు తమ పౌరులకే ప్రథమ ప్రాధాన్యం విధానంతో టీకాలు ఇచ్చాయని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు మోదీ ప్రభుత్వంలో ఇందులో విఫలమైందన్నారు. వ్యాక్సిన్లతో సహా వనరులను విదేశాలకు ఎగుమతి నాశనం చేసిందని విమర్శించారు.