జెనీవా: భారత్లో ఉన్న కోవిడ్ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్లో అనేక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఆందోళనర రీతిలో పెరుగుతున్నాయని, చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారని, మరణాలు కూడా అధికంగానే చోటుచేసుకుంటున్నట్లు డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియేసిస్ తెలిపారు. ప్రపంచ దేశాలకు టెడ్రోస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మహమ్మారి సోకిన తొలి ఏడాది కన్నా.. రెండవ ఏడాది మరింత ప్రమాదకరంగా ఉంటుందని, మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆయన హెచ్చరించారు.
భారత్లో వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఉదృతిని అడ్డుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకరిస్తోందని ఆయన అన్నారు. ఇప్పటికే ఆ దేశానికి వేల సంఖ్యలో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ను సరఫరా చేసినట్లు టెడ్రోస్ తెలిపారు. మొబైల్ హాస్పిటళ్లకు టెంట్లు, మాస్క్లు, ఇతర మెడికల్ సామాగ్రిని పంపినట్లు చెప్పారు. జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఇండియాకు సపోర్ట్ ఇస్తున్న అన్ని దేశాలకు ఆయన థ్యాంక్స్ తెలిపారు.