Prithviraj Sukumaran | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా అంటే కేవలం భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్ మాత్రమే కాదు.. నటీనటులకు కొన్ని ప్రత్యేక నిబంధనలు కూడా ఉంటాయని సినీ పరిశ్రమలో తరచూ చర్చ జరుగుతుంటుంది. ముఖ్యంగా ప్రధాన పాత్రలు పోషించే నటులు సినిమా పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్ట్లో పాల్గొనకూడదనే నిబంధన గురించి గతంలో ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం వారణాసి షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారని, ఇతర సినిమాలకు దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రంలో కీలక ప్రతినాయకుడి పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. అయితే ఆయన వారణాసి చిత్రంలో నటిస్తూనే మరోవైపు తన ఇతర సినిమాలను కూడా కొనసాగించడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. మలయాళ చిత్రసీమలో వేగంగా సినిమాలు పూర్తి చేసే హీరోల్లో పృథ్వీరాజ్ ఒకరు. 2026లో ఇప్పటికే రెండు చిత్రాల ద్వారా ప్రేక్షకులను పలకరించిన ఆయన, త్వరలో మరో సినిమాతో కూడా రాబోతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ‘పళ్లిచట్టంబి’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన పృథ్వీరాజ్, అనంతరం జులైలో విడుదలైన ‘I, Nobody’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆగస్టులో విడుదల కానున్న ‘ఖలీఫా’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఒకవైపు రాజమౌళి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్లో నటిస్తూనే, మరోవైపు వరుస చిత్రాల్లో కనిపించడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. రాజమౌళి సినిమాల్లో నటించే హీరోలు సాధారణంగా ఇతర ప్రాజెక్ట్లను పక్కనపెడతారనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. అయితే పృథ్వీరాజ్ మాత్రం తన కమిట్మెంట్లను సమాంతరంగా కొనసాగిస్తున్నారనే వార్తలు రావడంతో, దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. పృథ్వీరాజ్ షూటింగ్ షెడ్యూల్ను ముందుగానే ప్లాన్ చేసి, ఇతర సినిమాల తేదీలను అందుకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుని ఉండవచ్చని కూడా సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.