న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ఒక్కో లావాదేవీకి రూ.5 చొప్పున స్థిరమైన మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) చెల్లించాల్సి వస్తే ఇప్పటికే చాలా తక్కువగా ఉన్న తమ లాభాలపై అది మరింత భారం మోపుతుందని దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంప్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రూ.2 వేలు, అంతకంటే ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులను స్వీకరించడం నిలిపివేసి, కేవలం నగదు లావాదేవీలకే పరిమితం అవుతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రభుత్వం తన చమురు మార్కెటింగ్ కంపెనీల(ఓఎంసీ) ద్వారా లీటరుకు సుమారు రూ.2.40-3.40 లాభాన్ని తమకు నిర్దేశిస్తుందని, ఈ అతి తక్కువ లాభాలపై ఏ రూపంలోనైనా ఎండీఆర్ ఒక అదనపు భారం అవుతుందని ఢిల్లీ ఎన్సీఆర్, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, ముంబై, కర్ణాటక, రాజస్థాన్కు చెందిన పెట్రోల్ పంప్ డీలర్లు తెలిపారు. ఇంధన రిటైలర్లకు మినహాయింపు ఇవ్వకపోతే రూ.2,000, అంతకంటే ఎక్కువ ఉన్న యూపీఐ చెల్లింపులను స్వీకరించడం మేము ఆపివేయాల్సి రావచ్చు అని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా పెట్రోలియం ట్రేడర్స్(ఎఫ్ఏఐపీటీ) ప్రతినిధి మాంటీ సెహగల్ అన్నారు.
పెట్రోలియం రిటైల్ అవుట్లెట్లను సాధారణ రిటైల్ వ్యాపారాలతో పోల్చలేమనే కారణంతో మినహాయింపు కోరుతూ అఖిల కర్ణాటక పెట్రోలియం ట్రేడర్స్ ఫెడరేషన్(ఏకేఎఫ్పీటీ) కేంద్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలకు లేఖ రాసింది. పెట్రోలియం డీలర్లు నిర్దేశిత డీలర్ కమీషన్, మార్జిన్ విధానం ప్రకారం కార్యకలాపాలు సాగిస్తారు. ఏదైనా నిర్దిష్ట డిజిటల్ చెల్లింపు విధానాన్ని స్వీకరించడానికి అయ్యే ఖర్చు పెరిగినంత మాత్రాన పెట్రోల్ లేదా డీజిల్కు చెందిన రిటైల్ అమ్మకపు ధరను పెంచే స్వేచ్ఛ డీలర్కు ఉండదు అని లేఖలో పేర్కొన్నారు.
కస్టమర్పై భారం!
ఇదిలా ఉండగా ఈ చర్య డిజిటల్ చెల్లింపు వ్యవస్థల విస్తరణను ప్రభావితం చేయగలదని పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. ఎండీఆర్ అనేది వ్యాపారి చెల్లించాల్సిన చార్జీ అని స్పష్టంగా నిబంధన ఉన్నప్పటికీ రక్షిత వర్గాల వెలుపల ఉన్న వ్యాపారులు ఈ ఖర్చులో కొంత భాగాన్ని వినియోగదారులపై మోపవచ్చని వినియోగదారుల సర్వేలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాయి. ‘అమలు బలహీనంగా ఉంటే చక్కగా రూపొందించిన వ్యవస్థ కూడా డిజిటల్ చెల్లింపులపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయగలదు’ అని బీమాపే సీఈఓ హనుత్ మెహతా అన్నారు.
‘వెన్నెముక ఉంటే.. వెంటనే యూపీఐ పన్ను ఉపసంహరించండి’
యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ విధిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సాష్టాంగ నమస్కారం చేయడానికి మోదీ నిర్ణయించుకున్నారని ఆరోపించారు. వెన్నెముకతో నిలబడండి.. యూపీఐ పన్నును వెనక్కి తీసుకోండి అని పేర్కొన్నారు.
అమెరికా డిమాండ్కు తలొగ్గే సున్నా శాతం ఉన్న ఎండీఆర్పై మోదీ ప్రభుత్వం యూపీఐపై చార్జీలు విధిస్తున్నదని విమర్శించిన ఆయన ‘నోటా’ను పునర్నిర్వచించారు. ‘నరేంద్రాస్ ఆన్ గోయింగ్ ట్రంప్ అపీజ్మెంట్’ (ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి మోదీ కొనసాగిస్తున్న ప్రయత్నాలు) గా దానిని పేర్కొన్నారు. యూపీఐపై చార్జీ విధించడం ద్వారా ప్రతి పౌరునిపై కూడా పన్ను భారం మోపి, ఆ మొత్తాన్ని అమెరికాకు చెల్లిస్తారని రాహుల్ విడుదల చేసిన ఒక వీడియోలో ఆరోపించారు. యూపీఐతో పోటీపడేందుకు వీలుగా, అమెరికా కార్డ్ కంపెనీల కోసం ఎండీఆర్ను ప్రకటించారా? అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు. యూపీఐను విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం బలహీనం చేయవద్దని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా పేర్కొన్నారు.