కొందరు హీరోయిన్లకు విజయాలతో పని ఉండదు. కేవలం టాలెంట్తోనే పని. సాయి పల్లవి ఇదే లిస్ట్లోకి వస్తుంది. ఈమెకు విజయాలు వచ్చినా రాకపోయినా అవకాశాలు మాత్రం వస్తూనే ఉంటాయి. తెలుగులో ఫిదా సినిమా తర్వాత ఆ స్థాయి సక్సెస్ సాయిపల్లవికి మళ్లీ రాలేదు. ఎంసీఏ సినిమా హిట్ అయినా కూడా అందులో సాయిపల్లవి పాత్ర పెద్దగా లేదు. పడిపడి లేచే మనసు, కణం, ఎన్జీకే లాంటి సినిమాలు అంచనాలు అందుకోలేదు. అయినా కూడా సాయిపల్లవి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆమెకు చేతినిండా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో విరాట పర్వం, లవ్ స్టోరీ సినిమాలతో వస్తుంది సాయి పల్లవి. ఈ రెండు సినిమాలూ కేవలం 15 రోజుల వ్యవధిలో విడుదల అవుతున్నాయి.
ఏప్రిల్ 16న లవ్ స్టోరీ విడుదల అవుతుంటే.. 30న విరాటపర్వం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ రెండు సినిమాలతో కచ్చితంగా తెలుగులో మళ్లీ తన దశ మారిపోతుందని నమ్మకంగా చెబుతుంది సాయి పల్లవి. ఇదిలా ఉంటే తాజాగా మరో మంచి అవకాశం ఈమె చెంతకు వచ్చింది. నితిన్ హీరోగా నటించబోయే సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వక్కంతం వంశీ కథతో నూతన దర్శకుడు తెరకెక్కించబోయే ఈ సినిమాలో సాయిపల్లవిని హీరోయిన్గా ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాపై పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు నితిన్. ఈ ఏడాది చెక్, రంగ్ దే సినిమాలు విడుదల చేశాడు ఈయన. మరో సినిమా కూడా 2021లోనే విడుదల కానుంది. వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్న నితిన్ ఇప్పుడు మరో సినిమా కూడా ఒప్పుకున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ యాసతో నైజాంలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్న సాయి పల్లవి.. ఇప్పుడు తెలంగాణ హీరోతో జోడీ కట్టబోతుంది. మొత్తానికి జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతుంది సాయి పల్లవి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి