హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన వాదనలను మళ్లీ మొదటి నుంచి వినాలని సుప్రీంకోర్టు భావించింది. ఈ కేసులో గతంలో కొంతమేర జరిగిన విచారణను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసు విచారణను మళ్లీ మొదటినుంచి ప్రారంభిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది. ‘ఓటుకు నోటు కేసు’ను ఎన్నికల చట్టాల నియమావళి కింద కాకుండా, అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేశారని, ఆ కేసు చెల్లదని 22 జూలై 2021న కేసులో ప్రధాన నిందితుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (క్రిమినల్) దాఖలు చేశారు.
‘2015 లో నమోదైన ఓటుకు నోటు కేసులో అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్-12 కింద నాపై కేసు నమోదు చేశారు. అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్లు 7, 11 కింద లంచం తీసుకోవడమే నేరం. అంతే తప్ప లంచం ఇవ్వడానికి కుట్ర చేశారనడం ఆ సెక్షన్ల కింద చెల్లదు. ఆ తర్వాత, 2018లో లంచం ఇవ్వడం, అందుకు ప్రేరేపించడం వంటివి కూడా నేరంగా పరిగణించేలా ఈ చట్టంలోని సెక్షన్ 8ని సవరించారు. ఇది 2015లో నమోదు చేసిన కేసు కాబట్టి, ఆనాటి చట్టాలే వర్తిస్తాయి. అలాగే, సెక్షన్ 7,11,12 అధికారిక విధి నిర్వహణ (ప్రభుత్వ ఉద్యోగాలు) చేసే వారికి మాత్రమే వర్తిస్తాయి.
శాసనమండలి ఎన్నికల్లో ఓటు వేయడం లేదా ఓటు వేయకపోవడం అనేది ఈ చట్టం పరిధిలోకి రాదు. కావున, నిబంధనలకు విరుద్ధంగా నమోదు చేసిన కేసు చెల్లదు’ అని రేవంత్రెడ్డి తన పిటిషన్లో పేరొన్నారు. ఓటుకు నోటు కేసులో తన పేరునూ తొలగించాలని కోరుతూ 13 ఏప్రిల్ 2021న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ గురువారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి, జస్టిస్ వీ మోహనతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.
పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు హాజరయ్యారు. విచారణ ప్రారంభం కాగానే ఇరుపక్షాల న్యాయవాదులు కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ కేసుకు సంబంధించి ఇరుపక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు వినిపించాల్సిన అవసరం ఉన్నదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో సీజేఐ స్పందిస్తూ.. గతంలో ఈ కేసు విచారణను చేపట్టిన ధర్మాసనంలో ఒక న్యాయమూర్తి రిటైర్ అయ్యారని తెలిపారు. అందుకే, ఈ కేసులో ఇప్పటివరకూ జరిగిన విచారణను పకన పెడుతున్నట్టు వెల్లడించారు. కేసు విచారణను మళ్లీ మొదటినుంచి చేపడుతామని తెలిపారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేశారు.