ఇన్ని రోజులు మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలు ఉన్నారు. ఒకరు కాకపోతే మరొకరు అంటూ వాళ్ల చుట్టూ తిరిగారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు వాళ్లకు మరో బెస్ట్ ఆప్షన్ దొరికింది. ఆ ఆప్షన్ పేరు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో సంచలన ఎంట్రీ ఇచ్చాడు ఈ హీరో. ఈ ఒక్క సినిమాతోనే స్టార్ హీరో అయిపోయాడు. ఈయన కోసం ఇప్పుడు దర్శకులు క్యూ కడుతున్నారు. రామ్ చరణ్ సహా ఇండియాలో డెబ్యూ హీరోల రికార్డులన్నీ ఒక్క సినిమాతోనే తుడిచేశాడు వైష్ణవ్. దాంతో ఈయనతో సినిమాల కోసం నిర్మాతలు కూడా పోటీ పడుతున్నారు. మరోవైపు హిట్ వచ్చిన తర్వాత వైష్ణవ్ కూడా తొందరపడటం లేదు. మెల్లగా జాగ్రత్తగా తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన క్రిష్ సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఉప్పెన షూటింగ్ పూర్తైన తర్వాత ఈ సినిమాను పూర్తి చేశాడు వైష్ణవ్. కొండపాలం పేరుతో ఈ సినిమా వస్తుంది. ఆ నవల ఆధారంగానే సినిమాను తెరకెక్కిస్తున్నాడు క్రిష్. కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ అంతా పూర్తి చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ కావడం విశేషం. సినిమా అంతా అడవిలోనే ఉంటుంది. ఉప్పెనకు ముందు ఈ సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ ఇప్పుడు ఈ సినిమా కోసం భారీ రేట్ అడుగుతున్నారు నిర్మాతలు. దాదాపు రూ.14 కోట్ల వరకు క్రిష్ సినిమా బిజినెస్ చేస్తుంది.
మరోవైపు మూడు, నాలుగు సినిమాలను కూడా ముందుగానే లైన్ లో పెట్టేశాడు వైష్ణవ్ తేజ్. తాజాగా ఆయన మూడో సినిమా తమిళ దర్శకుడు గిరీశయ్యతో కమిట్ అయ్యాడు. తమిళ్ అర్జున్ రెడ్డి సినిమాను ఆయన తెరకెక్కించాడు. ఈయన చెప్పిన కథ నచ్చి వైష్ణవ్ సినిమా చేస్తున్నాడు.
అలాగే నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ఈయన ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు. కొత్త దర్శకుడు ఒకరు చెప్పిన కథ నచ్చి మెగా మేనల్లుడితో సినిమా నిర్మిస్తున్నాడు నాగార్జున. ఈ సినిమా కోసం వైష్ణవ్ తేజ్కు మూడు కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఈయన ఐదో సినిమా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా చేయబోతున్నట్లు తెలుస్తోంది. నాని కోసం ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథను ఇప్పుడు వైష్ణవ్కు సెట్ చేస్తున్నారు. అక్కడ నో చెప్పడంతో.. ఈయన ఎస్ చెప్పాడు. దాంతో నాలుగో సినిమా అక్కడ చేయబోతున్నాడు వైష్ణవ్ తేజ్. ఏదేమైనా కూడా ఒక్క సినిమాతోనే 5 సినిమాలను లైన్ లో పెట్టేశాడు మెగా చిన్న మేనల్లుడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి