Kasi Majili Kathalu Episode 48 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశీమజిలీ కథలు అప్పట్లో ఆబాలగోపాలాన్ని అలరించాయి. ఈ కథల ఆధారంగానే తెలుగులో జానపద సాహిత్యం, సినిమాలు వర్ధిల్లాయి. ఉపనిషత్తుల రహస్యాలు, కావ్య మర్మాలు, ప్రబంధ సంప్రదాయాలు తెలిపి.. పామరులను సైతం రంజింప చేసేలా రచించడం వల్లనే కాశీమజిలీ కథలు కలకాలం నిలిచాయని పెద్దలు చెబుతుంటారు. వీటిని 12 భాగాలుగా మధిర సుబ్బన్న దీక్షితకవి రచించారు. ప్రస్తుతం మీరు చదవబోయేది.. మూడోభాగంలోని చివరి కథ.
మణిభద్రమనే అగ్రహారంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతిథి సేవలో అంతకు మించినవాడు లేడని చుట్టుపక్కల ఆయనకు పెద్ద పేరుండేది. ఆయన చేసే అతిథి సేవలకు భార్య కూడా ఎంతగానో సహకరిస్తూ ఉండేది.
ధార్మిక జీవనాన్ని గడపడమే పరమావధిగా ఎంచుకున్న దేవశర్మకు లౌకిక విషయాలేవీ పట్టేవి కాదు. దేవశర్మ గృహస్థుగా మారిన తరువాత నాలుగైదేళ్లపాటు ఆ భార్యాభర్తలిద్దరూ ఏ కలతలూ లేకుండా ఆనందంగా కాలక్షేపం చేశారు.
ఒకనాడు ఏదో పనిమీద గ్రామాంతరం వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి.. తన భార్య, పాలేరుతో కలిసి ఉండటం దేవశర్మ కంటబడింది. దాంతో అతని మనస్సు విరిగిపోయింది. ‘ఇలాంటి భార్య సహకారంతో ఇన్నాళ్లూ చేసిన అతిథి పూజలన్నీ వృథా అయిపోయాయి కదా!’ అని మనసులో విపరీతంగా బాధపడ్డాడు. ‘ఈ సంసారంలో ఇంకా పడి ఉండటం దేనికి?’ అనుకున్నాడు. ‘ఇన్నేళ్లనుంచి చిన్నమెత్తు అనుమానమైనా రాకుండా ఎంత జాణతనం చూపించింది?! ఎంత చిత్రమిది?! ఎంత విచిత్రం?’ అనుకుంటూ, ఇల్లు విడిచిపెట్టాడు.
కాలినడకన ఎంతదూరం ప్రయాణించాడో అతనికే తెలియదు. గడ్డం పెరిగిపోయింది. దుస్తులు పాడయ్యాయి. దారిమధ్యలో ఎవరైనా పెడితే తినేవాడు. లేదంటే లేదు. ఒకనాటి రాత్రి దేవశర్మ ఒక శ్మశానంలో ఉన్న చండీ ఆలయంలో తలదాచుకున్నాడు.
బాగా చీకటి పడిన తరువాత నెత్తిమీద గండదీపం పెట్టుకుని, ఒక అమ్మాయి ఆలయంలో ప్రవేశించింది. అప్పటివరకు ఆమెకు తోడుగా వచ్చిన వాళ్లంతా బయటే ఉండిపోయారు. ఆమె ఒక్కతే ఆలయంలో నిర్భయంగా ప్రవేశించింది. తాను తెచ్చినవన్నీ కిందపెట్టి.. ఎవరికోసమో వెతకసాగింది.
అంతలో దేవీ విగ్రహం మాటునుంచి..
“నాటకం భలేగా రక్తి కట్టించావే?!” అంటూ ఎవడో ఒకడు బయటికొచ్చాడు.
“జోగినిలాగా వేషం వేసుకుని వచ్చి.. ‘అమ్మవారి మొక్కుబడి’ అని మా వాళ్లను భయపెట్టింది నువ్వే కదా! నాటకం నీది. ఆనందం మనిద్దరిదీ” అన్నదామె.
దేవీ విగ్రహానికి సమీపంలోనే వాళ్లిద్దరూ
శృంగారంలో పడ్డారు. ఆ దృశ్యాన్ని చూసిన దేవశర్మకు వెగటు కలిగింది.
‘ఛీఛీ!’ అనుకుంటూ అక్కడినుంచి బయటపడ్డాడు.
ఆ మరునాడు చెరువుగట్టు కింద ఒక్కడే కూర్చుని ఉండగా.. ఎవరో వచ్చి ఊళ్లో సంతర్పణ జరుగుతున్నదని తీసుకుపోయారు.
‘ఆ సంతర్పణ చేస్తున్న వ్యక్తి కూతురికి నిన్నటిదాకా దయ్యం పట్టిందట. నిన్నరాత్రి చండీ అమ్మవారికి గండదీపాన్ని సమర్పించడంతో దయ్యం వదిలిపోయిందట’.. అని అందరూ చెప్పుకొంటుంటే విన్నాడు.
ఆమెకు దయ్యం పట్టలేదు. దేవీపూజ చెయ్యనేలేదు. రాత్రంతా ఎవడితోనో గడిపి వచ్చిందనే నిజం దేవశర్మ ఒక్కడికే తెలుసు. అలాంటి చోట అన్నం తినబుద్ధి కాలేదు. పదేపదే.. ‘ఎంత చిత్రం! ఎంత విచిత్రం!’ అనే మాటలు పలుకుతూ.. విస్తరి ముందు నుంచి లేచి వెళ్లిపోయాడు. ఆవేళే ఆ ఊరు కూడా విడిచి పెట్టేశాడు.
అతని దురదృష్టమేమిటో.. మరో ఊరికి వెళ్లినా అతనికన్నీ అలాంటి దృశ్యాలే ఎదురయ్యాయి.
వయసులో ఉన్న ఒక అందమైన మగవాడు తన భార్య తప్పిపోయిందని వెతుకుతున్నాడు.
‘ఎవరో ఒక కాళ్లు లేని ముష్టివాణ్ని ఎత్తుకుని, బిచ్చమెత్తుకుంటూ కొన్నాళ్లు ఈ ఊళ్లోనే ఉంది. ఇప్పుడెక్కడికి పోయిందో తెలియదు’ అని గ్రామస్తులు కొందరు ఆ యువకునికి తెలియచేశారు.
ఆ మాటలు విన్న దేవశర్మకు మరింత మతిపోయింది.
‘అందగాడు, వయసులో ఉన్నవాడైన భర్తను విడిచిపెట్టి, కాళ్లులేని ముష్టివాణ్ని వరించడం ఏమిటి?! ఈ ఆడవాళ్లు ఎంత చిత్రమైన వాళ్లు?! అంతా చిత్రమైనవాళ్లే. ఈ ప్రపంచమంతా విచిత్రమే’ అని గొణుక్కుంటూ.. ఆ ఊరినుంచి కూడా నిష్క్రమించాడు దేవశర్మ.
మన మనసు ఎప్పుడైనా తీవ్రంగా కలత చెందుతూ ఉంటే, ఆ కలతను మరింతగా పెంచే దృశ్యాల్నే.. ఈ ప్రపంచం మన కళ్లముందుకు తెస్తూ ఉంటుంది. దేవశర్మకు పాపం మరోసారి కూడా అలాగే జరిగింది.
అప్పుడతను ఓ కోట సమీపంలోని గుర్రపుశాల వద్ద నిద్రిస్తున్నాడు. చీకటిలో ఒక చిన్నతలుపు తెరుచుకుని, ఒళ్లంతా నగలతో, చేతిలో పంచభక్ష్య పరమాన్నాలతో ఒకామె గుర్రపుశాలలో ప్రవేశించింది. అక్కడున్న రౌతు ఆమెను చూస్తూనే..
“ఇంతాలస్యం చేశావు. నన్ను ఆకలితో మాడి చావమన్నావా?! ఎంత పొగరే నీకు?!” అంటూ ఆమె మూతిమీద ఒక్కటిచ్చాడు.
అతడు కొట్టిన దెబ్బతో ఆమె ముందరిపళ్లు మూడు రాలిపడ్డాయి.
“ఎంత దెబ్బ కొట్టావ్? ఇప్పుడు నేను రాజుకేమని చెప్పుకోవాలి?! దెబ్బ కొట్టినందుకు కాదు. చూడు.. నీకోసం తెచ్చిన పిండివంటలన్నీ గుర్రపు లద్దెల్లో పడ్డాయి” అంటూ శుభ్రంగా ఉన్నవాటిని ఏరి, వాడితో కొసరి కొసరి తినిపించింది. కొంతసేపు వాడితో భోగించి కోటలోకి వెళ్లిపోయింది.
మరునాడు కూడా అక్కడే ఉన్న దేవశర్మకు ఒక విషయం తెలిసింది. రాణిగారి ముందుపళ్లు రాలిపోయాయని కోటంతా ఒకటే దిగులు పడిపోతున్నది. రాజుగారి బాధకు అంతులేకుండా ఉంది. అందంగా పళ్లు కట్టే వైద్యుల కోసం అన్ని రాజ్యాలకూ కబురు వెళ్లింది. ఈ సంగతి తెలిసిన తరువాత దేవశర్మ మళ్లీ.. ‘అంతా చిత్రం.. అంతా విచిత్రం’ అని గొణుక్కుంటూ మరో ఊరు చేరుకున్నాడు.
అదో చిన్న పల్లెటూరు. ఆ ఊళ్లో అప్పటికే ఒక పిచ్చివాడున్నాడు. అతడు నోరుతెరిస్తే.. ‘అంతా దైవాధీనం’ అంటాడు తప్ప, మరో మాట రాదు. పిలిచి ఎవరైనా ఏదైనా పెడితే తింటాడు. లేదంటే ఏ అరుగు మీదనో, చెరువు గట్టుమీదనో, దేవాలయం వద్దనో అలాగే పడి ఉంటాడు. ఊరి వాళ్లందరూ అతనికి వంతులు వేసుకుని వారానికి ఒకరు చొప్పున అన్నం పెడుతున్నారు. ఆ గ్రామానికే దేవశర్మ కూడా వచ్చాడు.
“ఆ దైవాధీనంగాణ్ని మేపడమే కష్టంగా ఉందంటే.. ఇప్పుడీ విచిత్రంగాడికి కూడా పెట్టాలా?!” అని చిరాకు పడ్డాడో గ్రామస్తుడు.
“అయ్యా! ఆ ‘విచిత్రం’ అని పలికే ఆయన ముందునుంచీ పిచ్చివాడు కాదండీ! ఆయనది మణిభద్ర అగ్రహారం. గొప్ప అన్నదాత. మా అందరికీ ఎన్నోసార్లు ఆతిథ్యం ఇచ్చాడు. ఆయనకు ఇటువంటి స్థితి దాపురించడం విధిలీల కాక, మరేమీ కాదు. ఆయనను మనం పోషించాలి. తప్పదు” అని చెప్పాడు మరో పౌరుడు.
అందుకు గ్రామస్తులందరూ అంగీకరించారు. దేవశర్మకు, దైవాధీనానికి ఏ లోటూ లేకుండా రెండుపూటలా భోజనం దొరుకుతున్నది.
కొంతమంది వాళ్ల ఊతపదాలకు అర్థమేమిటో అని వేదాంత చర్చలకు దిగేవారు. ఎవరికి తోచిన అర్థాలు వాళ్లు కల్పించి చెబుతుండేవాళ్లు. వినేవాళ్లు ఆ మాటలకు ముగ్ధులైపోతూ బోలెడంత జ్ఞానాన్ని పొందేశామని భ్రమపడుతూ ఉండేవాళ్లు. మరికొందరు.. ‘పిచ్చివాళ్ల మాటలకు అర్థాలేమిటి?’ అని నవ్వేసే వాళ్లు.
* * *
కాలం హాయిగా గడిచిపోతున్నది. దేవశర్మ కానీ, దైవాధీనం కానీ ఒకరితో ఒకరు ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్లు కాదు. కానీ, వాళ్లిద్దరూ దాదాపుగా ప్రతిరోజూ ఒకేచోట ఉండేవాళ్లు. ఎవరితోనూ ఏమీ మాట్లాడరు కనుక, నిజానికి వాళ్లవల్ల ఎవరికీ ఏ నష్టం ఉండకూడదు.
కానీ, అలా జరగలేదు. చీకటిమాటున తప్పు చేయాలని ఆరాటపడే కామినీ – కాముకులకు వాళ్ల ఉనికి ఆటంకంగా మారింది. వాళ్ల కంటపడితే తమ రంకు బయట పడిపోతుందేమో అని భయపడుతుండే వారు.
ఇలా ఉండగా ఒకనాడు బాగా ముసురుపట్టి, పగలంతా ఒకటే జడివాన కురిసింది. రాత్రికి వెన్నెల లేక అంతటా గాఢాంధకారం నెలకొన్నది. అలాంటి సమయంలో పిచ్చివాళ్లిద్దరూ ఓ దేవాలయంలో పడుకున్నారు.
ఆ చీకట్లో ఉన్నట్లుండి ఎవరో దైవాధీనం కాలు తొక్కారు. అంతబాధలో కూడా అతగాడు ‘అమ్మా!’ అనడం మానేసి.. “అంతా దైవాధీనం!” అని గట్టిగా కేకపెట్టాడు. ఆ కాలుతొక్కిన వాళ్లెవరో గబగబా అక్కడినుంచి వెళ్లిపోయారు.
ఆ పొలికేక ఎవరికీ వినిపించినట్లు లేదు. విన్నా ఎవరూ పట్టించుకోలేదు కాబోలు. ఆ కాలుతొక్కిన వ్యక్తి గ్రామంలోకెల్లా సంపన్నుల కుమార్తె. చిన్నప్పుడే పెళ్లయింది కానీ, ఇంకా కాపురానికి వెళ్లలేదు. ఇంతలో ఒక పశువుల కాపరిని మోహించింది. వాడితో సంబంధం పెట్టుకుని, ప్రతి రాత్రీ ఇంట్లోవాళ్ల కన్నుగప్పి సంకేత స్థలాల్లో కలుసుకోసాగింది.
ఆవేళ చాలా ఆలస్యంగా వచ్చిన ఆమెను చూసి..
“ఇంత ఆలస్యమైందేం? మూడురోజుల నుంచి ఏమైపోయావ్?” అని అడిగాడు వాడు దగ్గరికి తీసుకుని.
“ఎప్పుడు ఇంట్లోంచి బయటికొచ్చినా ఏవో అపశకునాలు ఎదురవుతున్నాయి. ఒకసారి ఒంటిబ్రాహ్మడు వచ్చాడు. మరోసారి పిల్లి, ఇంకోసారి తుమ్ము. అందువల్లనే మొన్న రాలేకపోయాను. నిన్న చీకట్లో నువ్వే అనుకుని తట్టి లేపితే.. ‘అంతా విచిత్రం’ గాడు తగిలాడు. ఈ వేళ నీకోసం వస్తుంటే.. ‘ఆ దైవాధీనం’ గాడికి నా కాలు తగిలింది. వాడి అరుపు విని ఎవరైనా వస్తారేమో వెనక్కు పోదాం అనుకున్నాను. కానీ, తెగించి వచ్చేశాను” అని సమాధానం ఇచ్చిందామె.
“ఈ వెధవలిద్దరికీ మన సంకేత స్థలాలు ముందే తెలిసి పోతున్నట్లున్నాయి. ఎక్కడ చూసినా వీళ్లిద్దరే తగులుతున్నారు. ఈ ఒక్కరోజు ఓపిక పట్టు. రేపు రాత్రికే వాళ్లిద్దరినీ చెరో ఒక్కపోటు పొడిచి, ఏట్లో పారేస్తాను. మనకు ఈ అడ్డు ఉండదు” అన్నాడు వాడు.. ఆమెను బులిపిస్తూ.
వాళ్ల మాటలు విన్నారో లేదో కానీ.. మరునాడే దేవశర్మ, దైవాధీనం ఇద్దరూ ఆ ఊరు విడిచిపెట్టి, సానుమంతమనే నగరానికి చేరుకున్నారు.
ఈ పిచ్చివాళ్ల లోకంలో ఒక అసలైన పిచ్చివాడికి మరో నిజమైన పిచ్చివాడి తోడు భగవంతుడే సమకూరుస్తాడు కాబోలు. ఆ నగరంలో అప్పటికే మరో పిచ్చివాడున్నాడు. అతనికి కూడా ఒక ఊతపదం ఉంది. ‘ఎవరికి వారే.. ఎవరికెవరూ లేరు’ అన్నది ఆ మూడోవాడి ఊతపదం. ఆ నగరంలోని పిల్లలు ఆ మాటనే పాటలాగా పాడుతూ.. ఆ పిచ్చివాణ్ని ఆటపట్టిస్తూ ఉంటారు.
అలాంటి నగరానికే ఇప్పుడు దేవశర్మ, దైవాధీనం కూడా చేరుకున్నారు. ముగ్గురూ ఒక్కలాంటివాళ్లే కనుక, తరచుగా ఒకేచోట ఉండేవాళ్లు. ఒకనాటి రాత్రి వాళ్లు ముగ్గురూ ఓ దేవాలయంలో నిద్రపోతున్నారు.
అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా ఎవరో కొందరు ఆలయంలో ప్రవేశించారు. దైవాధీనాన్ని హడావుడిగా నిద్రలేపారు. అతని నెత్తిమీద మంత్రపూర్వకంగా నీటిని సంప్రోక్షించారు. కొత్త వస్ర్తాలు ధరింపజేశారు. నగలు పెట్టారు. నుదుట బాషికం కట్టారు.
అంతసేపూ అతని నోటివెంట ‘అంతా దైవాధీనం’ అని ఒకటే మాట వస్తున్నది.
పురోహితుడు దైవాధీనాన్ని తీసుకెళ్లి పీటలమీద కూర్చోబెట్టాడు. పదహారేళ్ల ప్రాయం ఉన్న ఒక పిల్లను తీసుకొచ్చి, అతని చేత జీలకర్ర – బెల్లం పెట్టించారు. తాళి కట్టించారు. తలంబ్రాలు పోయించారు. ఆ తరువాత పెళ్లికూతురి తండ్రి కొన్ని నగలను అల్లుడికి సమర్పించాడు. ఆ తరువాత అతణ్ని అక్కడే వదిలేసి, పెళ్లికూతురితోపాటు పెళ్లివారంతా వెళ్లిపోయారు.
తెల్లవారిన తరువాత ఒంటినిండా బంగారు నగలతో పెళ్లికొడుకులా మెరిసిపోతున్న దైవాధీనాన్ని చూసి, ఊరివాళ్లంతా విస్తుపోయారు. ఆ పూట వంతు ప్రకారం తనను భోజనానికి పిలిచిన గృహస్థుకు.. తన ఒంటిమీది నగలన్నీ ఒలిచి ఇచ్చేశాడు దైవాధీనం.
ఆ తరువాత అతనికి ఏమనిపించిందో కానీ, ఊరుదాటి.. ఉత్తరదిక్కుగా ప్రయాణించసాగాడు. దేవశర్మ, ‘ఎవరికెవరూ లేరు’.. ఇద్దరూ దైవాధీనాన్ని అనుసరించారు.
(వచ్చేవారం.. భూతాల సమావేశం)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | గెలుపు ఎప్పుడూ మంచికే!
Kasi Majili Kathalu | ఇద్దరు మోసగాళ్లు
Kasi Majili Kathalu | శ్రీశైలంలో దేవకన్య
Kasi Majili Kathalu | వామన గుహ
Kasi Majili Kathalu | నలుగురు రాకుమారులు
Kasi Majili Kathalu | ఎగిరే జింక-2
Kasi Majili Kathalu | ఎగిరే జింక
Kasi Majili Kathalu | జయభద్రుని తెలివి
Kasi Majili Kathalu | నీతిమంతురాలు
Kasi Majili Kathalu | అనంగ చంద్రిక