Kasi Majili Kathalu Episode 40 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కుంభకోణ రాజ్యపు యువరాజు కందర్పునికి విదేశాలు చూసిరావాలని కోరిక. నేలపై నడిచివెళితే దేశాలన్నీ చుట్టిరావడంఆలస్యమవుతుంది. కనుక, ఓ ఎగిరే జింకను సంపాదించాడు. ఆకాశంలో ఎగురుతూ వెళ్లి, హిమాలయాలకు ఆవల ఉన్న దేశంలో దిగాడు. అక్కడ వినోదాలు చూడాలని సరదా పడుతున్నంతలో.. అతణ్ని రక్షకభటులు బంధించారు.
“అయ్యా! ఆ తోలుబొమ్మ నా ప్రాణం లాంటిది. దయచేసి తిరిగివ్వండి” అని కందర్పుడు చాలా బతిమాలాడు.
కానీ, రక్షకభటులు వినిపించుకోలేదు. కొత్వాల్ వద్దకు తీసుకుపోయారు. అతగాడు కందర్పుణ్ని ఎగాదిగా చూసి, రెండుమూడు ప్రశ్నలడిగాడు. కానీ, ఆ గోలేమిటో కందర్పునికి అర్థం కాలేదు. ఇతని ఘోష, భాష వాళ్లకు తెలియలేదు.
“వీణ్ని ఖైదు చేయండి. తర్వాత చూసుకుందాం” అన్నాడు కొత్వాల్.
రక్షకభటులు కందర్పుని రెక్కలు పుచ్చుకుని, చెరసాలవైపు నడిపించసాగారు. అంతలోనే అక్కడికి ఓ అశ్వ శకటాన్ని అధిరోహించి, ఒక యువతి వచ్చింది. కందర్పుని వైపు కన్నార్పకుండా చూడసాగింది.
“బావా! ఎవరితను?” అని కొత్వాల్ను అడిగింది.
“ఏమో తెలియదు చండికా! వాడి భాష అర్థమై చావడం లేదు” అని గొణిగాడు అతగాడు.
“చూస్తుంటే దొంగలా అనిపించడం లేదు. ఇతనికి నేను పూచీ ఉంటాను. విడిపించి మనింటికి తీసుకుపోదాం. మెల్లగా అడిగి, విషయం తెలుసుకుందాం” అని బతిమాలింది చండిక.
మరదలి బులపాటాన్ని కాదనకుండా తీర్చడమే ఏ దేశంలో అయినా బావల పని. అందుకే కందర్పుణ్ని కూడా శకటం ఎక్కించండని భటులను ఆజ్ఞాపించాడు కొత్వాల్.
‘హమ్మయ్య బతికాను!’ అనుకుంటూ కందర్పుడు తన తోలు జింకకేసి చూపించి, చేతులు జోడించి చండికను బతిమాలుకున్నాడు. రెండుచేతులూ జోడించి నమస్కారం పెట్టడం ఆ దేశంలో అలవాటు లేకపోవడం వల్ల విచిత్రంగా అనిపించినా, చండిక కొంత అర్థం చేసుకోగలిగింది. భటులతో చెప్పి, తోలు జింకను తిరిగి ఇచ్చేలా చేసింది. వెంటనే కొత్వాల్తోపాటు చండిక, కందర్పుడు అధిరోహించిన శకటం ముందుకు కదిలింది. కొత్వాల్ ఇంటిలోని పై అంతస్తులో ఒక గది కందర్పుని కోసం కేటాయించారు. స్నానాదులు పూర్తి చేసుకున్న తరువాత.. అతని కోసం ఆహారం వచ్చింది.
అందులో అన్నిరకాల మాంసాలూ ఉన్నాయి. స్వతహాగా మాంసాహారి అయినప్పటికీ కందర్పునికి వాటిని చూస్తే వాంతి వచ్చినంత పనైంది. మాంసంతోపాటు మద్యం, మరికొన్ని రసాలు కూడా పంపారు. కందర్పుడు వాటన్నిటినీ వదిలిపెట్టి, పాలు మాత్రం తాగాడు. సేవకులకు అతణ్ని చూస్తే చెప్పలేనంత జాలేసింది. మిగిలిన ఆహారాన్ని తమ వాటాగా తీసుకుని వెళ్లిపోయారు.
ఇక చేయాల్సిన పనేమీ లేక తన గదిలోనే తచ్చాడుతూ ఉండిపోయాడు కందర్పుడు. అంతలో అతనికి చిత్రపటాలు గీయడానికి తగిన సరంజామా కనిపించింది. వాటితో ఒక బొమ్మ గీశాడు. తాను సింహాసనంపై కూర్చుని ఉండగా, చుట్టూ అనేకమంది సేవకులు ఉన్నట్లు అందులో చూపించాడు. కొద్దిసేపటి తరువాత ఆ గదిలోకి చండిక ప్రవేశించింది. కందర్పుడు ఆ బొమ్మలో ఉన్న తనను చూపించి, ఆమెకు సైగలు చేశాడు. వాటివల్ల అతను సామాన్యుడు కాదని, ఏదో దేశానికి రాజు అని చండిక గుర్తించగలిగింది. మరో కాగితం, కుంచె తీసుకుని ఆ బొమ్మలోనే కందర్పుని పక్కన తాను సింహాసనంపై కూర్చున్నట్లు గీసింది. దానిని చూపించి.. “ఈ కొత్వాల్ మా అక్క మొగుడు. ఈ మధ్యనే మా అక్కయ్య చనిపోయింది. వీడు నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. నాకిష్టం లేదు. నువ్వు అంగీకరిస్తే నీతోపాటు మీ దేశం వచ్చేస్తాను” అని వీలైనంత అర్థమయ్యేలా చెప్పింది.
కందర్పుడు ఆ బొమ్మను చేతిలోకి తీసుకుని, అందులో చండిక బొమ్మను కొట్టివేశాడు. ఆ రకంగా ఆమెను పెళ్లాడటం ఇష్టం లేదని అర్థమయ్యేలా చెప్పాడు.
అప్పుడామె మరోబొమ్మ గీసి చూపించింది. అందులో తాను కందర్పుని శిరస్సును కత్తితో నరికేసినట్లు గీసింది. ‘నా ప్రేమను అంగీకరించకపోతే నిన్ను ఇలాగే చంపేస్తాను’ అని చెప్పకనే చెప్పింది.
కందర్పుడు దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. చండిక అనేక రకాలుగా బెదిరించాలని ప్రయత్నించింది. కానీ, మౌనమే అతని సమాధానం అయింది. చివరికి తన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయని చండికకు అర్థమైంది. ఆరోజు సాయంత్రం మళ్లీ కందర్పునికి ఆహారం పంపే వేళకు ముందుగా సేవకులను చండిక తన వద్దకు రప్పించుకుంది.
“మన ఇంటికి వచ్చిన ఆ కొత్త అతిథి.. ఏ వంటకాన్ని చాలా ఇష్టంగా తిన్నాడు?” అని ప్రశ్నించింది.
“అతనికి మద్యం అంటే బాగా ఇష్టం అమ్మాయిగారూ” అని సేవకులు ముక్తకంఠంతో చెప్పారు.. వచ్చిన అతిథులు వదిలేసింది తాము తీసుకోవచ్చు. మద్యం అయితే కందర్పుడు ముట్టుకోడు కనుక, మొత్తమంతా తామే తాగేయొచ్చని అంచనా వేశారు.
“సరే! కొంచెంసేపట్లో వచ్చి, అతనికి భోజనం పట్టుకెళ్లండి” అని వాళ్లను పంపేసి, మద్యంలో కాలకూట విషం కలిపి ఉంచింది చండిక.
ఈలోపుగా కొత్వాల్ ఇంటికి వచ్చాడు. వచ్చీరాగానే భోజనం వడ్డించమని సేవకులను ఆదేశించాడు. ఒకేసారి అతిథికి, యజమానికి కూడా వేర్వేరు గదుల్లో భోజనం వడ్డించాల్సి రావడంతో సేవకులు కొద్దిగా తడబాటు పడ్డారు. ఆ సందట్లో యజమాని కోసం పట్టుకువెళ్తున్న మద్యం కాస్తా నేలపాలైపోయింది.
చేసేది లేక, కందర్పునికి ఇవ్వకుండా తమకోసం దాచుకున్న మద్యపాత్రను తీసుకుపోయి యజమానికి సమర్పించారు సేవకులు. అది తాగిన కొద్దిసేపటికే కొత్వాల్ కళ్లు తేలేసి, నురగలు కక్కుకుని చచ్చిపోయాడు.
ఒక్కసారిగా ఆ ఇంట్లో కల్లోలం పుట్టింది. రాజుతో పాటుగా, రాజవైద్యులు వచ్చారు. మద్యపాత్రలో విషం కలిసినట్లు గుర్తించారు. మహారాజు విచారణ చేపట్టాడు. మద్యపాత్రలు తారుమారైనట్లు తెలిస్తే తమ ప్రాణాలు పోతాయనే భయంతో సేవకులంతా ముక్తకంఠంతో..
“కందర్పుడే మాచేత ఆ మద్యపాత్రను మా యజమానికి ఇప్పించాడు మహారాజా! తాను ఆ మద్యంలో సిద్ధౌషధాన్ని కలిపాననీ, అది తాగితే యజమాని మమ్మల్ని మెచ్చుకుని బహుమానాలు ఇస్తాడని కందర్పుడు చెప్పడం వల్లనే మేము ఆ పని చేశాం!” అని అబద్ధపు సాక్ష్యం ఇచ్చారు
ఒకరి తరువాత ఒకరిగా సేవకులందరినీ మహారాజు విచారిస్తున్నాడు. అప్పటివరకు అక్కడే ఉన్న కందర్పునికి జరుగుతున్నదేమిటో కొద్దికొద్దిగా అర్థమవుతున్నది.
‘నాపైనే నింద మోపుతున్నారు. వీళ్ల భాష రానందు వల్ల నేను నిర్దోషినని నిరూపించుకునే అవకాశం లేదు. సేవకుల మాటలే నిజమని మహారాజు నిర్ధారించుకుంటే.. నన్ను బంధించడం ఖాయం’ అనుకున్నాడు కందర్పుడు. ఆ క్షణంలోనే అక్కడినుంచి మెరుపులా దౌడు తీశాడు. తనకు విడిదిగా ఏర్పాటు చేసిన మేడమీది గదిలోకి కందర్పుడు పరుగెత్తుతుంటే, రాజభటులు వెంబడించారు.
అంతకుముందే కందర్పుడు తోలుజింకను పూరించి, కిటికీ సమీపంలో నిలబెట్టి ఉంచాడు. గదిలో ప్రవేశించడం, జింకపైకి ఎక్కడం.. కీలు తిప్పడం.. గాలిలోకి ఎగిరిపోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. వెనుక పరుగెత్తుతూ వచ్చిన భటులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. బల్లెమో, బాణమో విసిరి ఆకాశంలో ఎగురుతున్నవాణ్ని కొట్టాలని కూడా ఎవరికీ తోచలేదు. ఆయుధాలకు అందనంత ఎత్తువరకు వెళ్లిన తరువాత కందర్పుడు గాలిలోనే జింకను ఆపాడు. రాజభటులకు ఆశ్చర్యం రెట్టింపయింది. కిందికి వెళ్లి, మహారాజుకు ఈ సంగతి నివేదించారు. మహారాజు బయటికి వచ్చి చూశాడు. అప్పుడు కందర్పుడు తన చేతిలోని కాగితాలను మహారాజు ముందు పడేలా జారవిడిచాడు. అందులో చండికతో సైగల ద్వారా మాట్లాడటం కోసం తాను గీసిన చిత్రాలున్నాయి.
“మహారాజా! నేను నిరపరాధిని” అని ఆకాశంనుంచే గట్టిగా అరిచాడు కందర్పుడు.
మహారాజుకు ఆ చిత్రాలవల్ల కొంత అర్థమైనట్లే అనిపించింది. ఇంక తాను ఆ దేశంలో నిలవడం మంచిది కాదని, ముందే నిర్ణయించుకున్న కందర్పుడు తన జింకను చంద్రుడు ఉన్న దిక్కును ఆధారంగా చేసుకుని దక్షిణాభిముఖంగా పోనిచ్చాడు.
* * *
తెల్లవారేసరికి తాను సముద్రంపై ఎగురుతున్నట్లుగా గుర్తించాడు. మళ్లీ అప్పటినుంచి సూర్యుడి దిక్కును ఆధారంగా చేసుకుని, తూర్పుముఖంగా ప్రయాణించ సాగాడు. మధ్యాహ్న వేళకు నేల కనిపించింది. మరికొంతదూరం ప్రయాణించేసరికి ఒక ఉద్యానవనం కనిపించింది. అక్కడి సరస్సులో స్నానం చేసి, చెట్ల పండ్లతో ఆకలి తీర్చుకున్నాడు. మరికొంతసేపు విశ్రాంతి తీసుకుందామని చూస్తున్నంతలో అక్కడేదో సందడి మొదలైంది.
పదిమంది దాకా ఆడపిల్లలు బిలబిలలాడుతూ వచ్చారు. కందర్పుడు వారికి కనిపించకుండా గబగబా ఓ చెట్టెక్కి కూర్చున్నాడు. ఆ ఆడపిల్లలంతా సరస్సులో స్వేచ్ఛగా క్రీడించసాగారు. తమ ఈడుకు తగినట్లుగా సరస సల్లాపాలు సాగించారు. వారి మాటల వల్ల అది మహారాష్ట్ర దేశమని, వారిలో ఒకామె ఆ దేశపు యువరాణి మనోరమ అని.. మిగిలిన వారంతా ఆమె చెలికత్తెలని తెలిసింది. అడుగడుగునా తమ యువరాణి అందాన్ని పొగుడుతూ చెలికత్తెలు ఆమెను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె ఒంపుసొంపులను అదేపనిగా వర్ణించసాగారు. వారి మాటలను ఆలకిస్తున్న కొద్దీ కందర్పుని కన్ను ఆ యువరాణి శరీర భాగాలవైపు పదేపదే పరుగెత్తకుండా ఆగలేకపోయింది. అతనిలో విరహతాపం అంతకంతకూ ఎక్కువ కాజొచ్చింది.
సాయంత్రం కావస్తుండగా వాళ్లంతా కోటకు తిరిగి బయల్దేరారు. కందర్పుడు రహస్యంగా వారిని అనుసరించాడు. వారు కోటలో ప్రవేశించిన తరువాత, మరికొద్దిసేపు అక్కడే తచ్చాడాడు. యువరాణి మనోరమ మందిరం ఎటువైపు ఉంటుందో ఓ అంచనాకు వచ్చాడు.
తరువాత అక్కడినుంచి పట్టణంలోకి వచ్చి, ఓ సత్రంలో బస చేశాడు. ఊరంతా సద్దుమణిగిన తరువాత మెల్లగా తన జింకను బయటికి తీశాడు. ఆకాశమార్గంలో ప్రయాణించి మనోరమ మందిరానికి వెళ్లాడు. హంసతూలికా తల్పంపై మనోరమ నిద్రిస్తున్నది. ఆ మందిరంలోనే మరికొందరు చెలికత్తెలు కూడా నిద్రిస్తున్నారు. చప్పుడు చేయకుండా కందర్పుడు మనోరమ శయ్యను సమీపించాడు. ఆమెను తనివితీరా చూసుకున్నాడు. ఆమె అపురూప సౌందర్యానికి ముగ్ధుడవుతూ తనలోని మదనజ్వాలను ఎలా అణచుకోవాలో తెలియక చాలాసేపు తబ్బిబ్బయ్యాడు.
శయ్యకు పక్కనే ఒక చందనపు గిన్నె కనిపించింది. మనోరమకు నిద్రాభంగం కాకుండా ఆమె ఒంటిపై అక్కడక్కడా గంధాన్ని పూశాడు. కొన్నిచోట్ల తన పేరు రాసి ఉన్న ఉంగరాన్ని అద్దాడు. దాదాపు తెల్లవారవస్తుండగా అక్కడినుంచి బయటికి వచ్చేసి, తాను విడిది చేసిన సత్రం చేరుకున్నాడు. మరి కొద్దిసేపటికే యువరాణి మందిరంలో మేలుకొలుపులు మొదలయ్యాయి.
“చెలీ! ఏమిటిది? బుగ్గలనిండా ఇంత గంధం పూసుకున్నావు?” అని ఓ చెలికత్తె అడిగింది.
దానికి మనోరమ తబ్బిబ్బు పడింది.
“పరిహాసాలు చాలులే! నిద్రలో ఉన్నవాళ్లకు గంధం పూయడం ఏమిటి?!” అని నెపం చెలికత్తెపైనే వేసి, మంచం దిగబోయింది.
బిగించి కట్టిన రవికముడి కత్తిరించినట్లు అప్పటికి తెలిసింది. సర్దుకోబోతుంటే వక్షస్థలంపై కూడా గంధపు పూతలున్నాయి.
“మధురికా! ఏమిటీ పిచ్చిపనులు” అని చెలికత్తెను చివాట్లేసింది మనోరమ.
“ఒట్టు! నేనెరుగను. చూడు.. ఈ గంధపు పూతలపై ఏవో అక్షరాలు కనిపిస్తున్నాయి” అన్నది మధురిక.
దేవనాగరి లిపిలో ‘కందర్ప’ అన్నపేరు చదివి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. మనోరమకు ఎడమకన్ను, ఎడమభుజం అదరసాగాయి.
“దేవలోకం నుంచి మన్మథుడే నిన్ను వలచి వచ్చినట్లున్నాడు. లేకపోతే పోతుటీగ కూడా చొరబడలేని ఈ అంతఃపురంలోకి ఇతరులెవరు వస్తారు చెప్పు?” అన్నది మధురిక
“చాల్లే ఊరుకో! ఎవరైనా వింటే నవ్విపోతారు” అంటూ గంధపు పూతలను తుడిచి వేసింది మనోరమ.
“ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకు” అని మధురికను హెచ్చరించింది.
“నిన్నరాత్రి నీ అందాన్ని తనివితీరా చూసిన ఆ మన్మథులవారు ఈవేళ రాత్రికి కూడా వస్తే..” అని అర్ధోక్తిగా ఆగింది మధురిక.
సిగ్గువల్ల మాట్లాడలేక, తలదించుకుంది మనోరమ.
“ఈవేళ కూడా ఆయన రాకపోడు. వస్తే దొరగారి గుట్టు పసిగట్టాలి.. జాగారానికి వీలుగా రాత్రంతా పాడుకుంటూ గడుపుదాం” అన్నది మధురిక.
అనుకున్నట్లుగానే ఆ సాయంత్రం మనోరమ మందిరంలో చాలాసేపు గానవినోదం సాగింది. కానీ, అర్ధరాత్రి దాటిన తరువాత మనోరమ నిద్రకు తాళలేక పోయింది. ఆమెతోపాటు మందిరమంతా క్రమంగా నిద్రలో కూరుకుపోయింది. ఆ నిశ్శబ్ద సమయంలో కందర్పుడు మళ్లీ గవాక్షం నుంచి మందిరంలో ప్రవేశించాడు.
(వచ్చేవారం.. ఎగిరే జింక-3)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | జయభద్రుని తెలివి
Kasi Majili Kathalu | నీతిమంతురాలు
Kasi Majili Kathalu | అనంగ చంద్రిక
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | అదృష్టదీపుడు – 2
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | అదృష్టదీపుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | పాటపాడే చెట్టు