Kasi Majili Kathalu Episode 34 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : మణిప్రస్థ నగరాన్ని ఏలే కుంతీభోజుని ఏడో కుమారుడు జయభద్రుడు. అతడు అనంగచంద్రిక అనే వేశ్య వలలో పడ్డాడు. తల్లిదండ్రులు అతనికి సునీతి అనే అమ్మాయితో వివాహం జరిపించారు. కానీ, వేశ్యాలోలుడైన జయభద్రుడు ఇంటిముఖమే చూడటం మానేశాడు. అతణ్ని ఇంటికి రప్పించడానికి స్నేహితుడు సుమిత్రుడు, భార్య సునీతి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
భ్రమరిక తన ప్రయత్నాలు తాను మొదలుపెట్టింది. నగరంలోని ఒక దేవాలయం వద్ద ఉండే పేరుమోసిన సాధువు దగ్గరికి వెళ్లింది.
“అయ్యా! నా స్నేహితురాలి భర్త వేశ్యాలోలుడిగా తయారయ్యాడు. కట్టుకున్న భార్యను పట్టించుకోకుండా.. ఇంటి ముఖమైనా చూడకుండా… ఆమెను అనేక కష్టాలపాలు చేస్తున్నాడు. దయచేసి తమరేదైనా వశీకరణ తాయెత్తు కానీ, మూలికగానీ ఇస్తే వారి కాపురం నిలుస్తుంది” అని బతిమాలుకుంది.
ఆమె కోరికలోని నిజాయతీని సాధువు గ్రహించాడు. తన మూటలోంచి ఒక ఆకు బయటికి తీశాడు.
“అమ్మాయీ! ఈ ఆకు పసరు తీసి, అతని ఒంటిపై చల్లమని నీ మిత్రురాలితో చెప్పు. లేదా స్నానం చేసే నీళ్లలోనైనా కలపమను” అని చెప్పాడు.
భ్రమరిక ఆ ఆకు తీసుకుని, సాధువుకు వినయంగా నమస్కరించి అక్కడినుంచి వచ్చేసింది. సునీతికి దానిని ఉపయోగించే విధానమంతా వివరంగా చెప్పింది.
“ఎలాగైనా ఈ రాత్రికి నీ భర్తను తీసుకురమ్మని, సుమిత్రుల వారితో చెప్పాను. మీ అత్తగారితో చెప్పి, ఈవేళ నువ్వే ఆయనకు భోజనం వడ్డించు. ఆ సమయంలో ఈ పసరు ప్రయోగించు” అని బోధించింది.
సునీతి సరేనని తలాడించింది. ఆవేళ అనంగచంద్రిక ఇంటినుంచి.. జయభద్రుణ్ని తీసుకురావడానికి సుమిత్రుడు పడ్డ కష్టాలను మాటల్లో వర్ణించలేం.
“ఇల్లాలిని కలతపెట్టి, వేశ్యలతో కులికేవానికి పతనం తప్పదు” అంటూ ఎన్నెన్నో హితబోధలు చేశాడు.
“నువ్వు తక్షణం ఇంటికి రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా!’ అని బెదిరించాడు కూడా.
ఏ కళనున్నాడో కానీ, జయభద్రుడు లొంగివచ్చాడు. రాత్రి భోజనం ఇంటివద్దనే చేస్తానని అంగీకరించాడు. అన్నమాట ప్రకారమే వచ్చాడు కూడా.
సునీతి చక్కగా అలంకరించుకుని, భర్తకు ఎదురొచ్చి సకల ఉపచారాలు చేసింది. షడ్రసోపేతమైన విందు వడ్డించింది. భోజనం చేస్తున్నంతసేపూ జయభద్రుడు ఆమెను కన్నెత్తయినా చూడలేదు. ఒకవేళ చూసినా లాభమేముంది గనక.. ఆమె చిత్రపటాన్ని కూడా అతడు చూడనే లేదు. తనకు వడ్డన చేస్తున్నది తన భార్యేనని అతగాడికి తెలిసే అవకాశం లేదు.
భోజనం చేస్తున్న సమయంలో అతని ఒంటికి ఆకుపసరు పూయమని భ్రమరిక చెప్పిన మాటలు సునీతి చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. కానీ ఆమె కళ్లు మాత్రం భర్తగారి సౌందర్యాన్ని తనివి తీరా చూడటంలో మునిగి ఉన్నాయి. కన్నులు ఆమె బుద్ధికి పొరలు కమ్మేలా చేశాయి.
‘ఈ ఆకుపసరు పూయడం వల్ల వశీకరణకు బదులుగా.. ఆయనకు ఏదైనా ప్రమాదం వాటిల్లితే నా గతేం కావాలి. ఒకవేళ దీనివల్లనే అనురాగం కలిగితే.. అది ఎంతకాలం నిలుస్తుంది. సహజంగా నాపై ప్రేమ కలిగేవరకు ఓపిక పడతాను’ అని అనుకున్నదామె. పసరు దాచిన భరిణను పక్కకుపెట్టి, మౌనంగా వడ్డన పూర్తిచేసింది. జయభద్రుడు భోజనం అయిపోగానే ఒక్కక్షణం కూడా ఆగకుండా అనంగచంద్రిక ఇంటికి పరుగులు తీశాడు. పసరు పూయలేదని, భ్రమరికకు తెలిస్తే గోల పెడుతుంది కనుక.. ఆమెతో అబద్ధం చెప్పాలని సునీతి నిశ్చయించుకుంది. వంటశాల నుంచి తన మందిరానికి వెళ్లే దారిలో గోడవారగా ఆ పసరు పారబోసింది.
తన భర్త రూపాన్నే ఊహించుకుంటూ నిద్రకు ఉపక్రమించింది. మరికొద్దిసేపటికి ఆమె ఏకాంత మందిరం తలుపులు చప్పుడయ్యాయి. ఆ సమయంలో తానొక్కతే ఉండటం వల్ల సునీతి స్వయంగా వెళ్లి తలుపు తీసింది.
ఎదురుగా జయభద్రుడు నిలబడి ఉన్నాడు. ఇందాక తాను చూసిన దానికంటే రెట్టింపు తేజస్సుతో వెలిగిపోతున్నాడు. భార్యను చూసి చిరునవ్వు నవ్వాడు. ప్రేమగా పలకరించాడు. సునీతి తన కళ్లను తానే నమ్మలేకపోయింది.
భర్తకు ఆ సమయంలో చేయదగిన ఉపచారాలన్నీ చేసింది. జయభద్రుడు తన అంగిచాటునుంచి ఒక రత్నహారాన్ని బయటికి తీశాడు. భార్య మెడలో అలంకరించాడు. ఆమె చేతిని స్పృశించాడు. అప్పటివరకు ఆమె ఎరుగని ఆనందానుభూతులను పంచిపెట్టాడు.
ఆనాటినుంచి ప్రతిరాత్రి జయభద్రుడు ఇంటికి వచ్చేవాడు. రాత్రంతా సునీతితోనే ఉండేవాడు. ఆమె పెట్టింది తినేవాడు. ఆమెతో సుఖభోగాలు అనుభవించేవాడు. తెల్లవారగానే ఆమె మందిరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయేవాడు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఏదో ఒక నగను బహుమానంగా తీసుకువచ్చేవాడు. ఆ నగలన్నీ ఒక్కొక్కటి కోట్లాది రూపాయల విలువైనవి.
కొంతకాలం గడిచింది. సునీతి వద్ద అనేక నగలు పోగయ్యాయి. వాటిని దాచి ఉంచడం కష్టం కావడంతో ఆమె ఆ నగలను అమ్మివేయసాగింది. అలా వచ్చిన ధనంతో దానధర్మాలు చేయడం మొదలుపెట్టింది. రాజ్యంలోని బీదవారెందరో సునీతి ఇంటి ఎదుట రోజూ బారులు తీరేవారు. ఎక్కడెక్కడివారో వచ్చి ఆమె ముందు చేయిచాచి సంపన్నులయ్యేవారు. తమ జీవితంలో ఒక్కసారి సునీతి ముఖం చూస్తే చాలు.. ఎంతటి దరిద్రమైనా తుడిచి పెట్టుకుపోయేది.
అతిత్వరలోనే సునీతి పేరుప్రఖ్యాతులు దేశమంతా పాకిపోయాయి. దూరదేశాల నుంచి కూడా ఆమె వద్ద దానం పుచ్చుకోవడానికి వస్తుండేవారు. ఆ విషయాలన్నీ మెల్లిగా అనంగచంద్రిక చెవిలో కూడా పడ్డాయి.
“డబ్బు గురించి ఎప్పుడు ప్రస్తావించినా.. ‘నేను తండ్రి చాటు బిడ్డను. డబ్బు తెచ్చివ్వగలిగే స్వతంత్రుడిని కాను. కొంతకాలం ఓపిక పట్టు’ అని చెబుతాడీ జయభద్రుడు! ఆ కట్టుకున్న పెళ్లాం అంతలేసి దానధర్మాలు చేస్తుంటే.. ఇతగాడివద్ద చిల్లిగవ్వ లేకపోవడం ఏమిటి?!” అన్నది అనంగచంద్రిక, వార్త తెచ్చిన దాసితో.
“ఏమో.. ఆ డబ్బంతా ఆమె పుట్టింటినుంచి తెచ్చుకున్నది ఎందుకు కాకూడదు?” సాలోచనగా అన్నది దాసి.
“అయినా నిజమేమిటో నేను తేల్చేస్తాను కదా!” అని ముక్తాయించి.. పేదముత్తయిదువగా తయారై, సునీతి వద్దకు వెళ్లింది దాసి.
ఆమెతో ముఖాముఖిగా మాట్లాడుతూ..
“తండ్రి, సోదరులు ఎప్పుడైనా ఆడదానికి పరిమితమైన సంపదలే పంచుతారు. భర్త ఒక్కడే అమితంగా ఇవ్వగలడు. నీ వైభవానికి నీ మగడే కారణం అనుకుంటాను” అన్నది తెలివిగా.
“నువ్వన్నది నిజమే అవ్వా! నా భర్త వల్లనే నేనిన్ని మంచిపనులు చేయగలుగుతున్నాను. ఇది వారి స్వార్జితం కనుకనే యథేచ్ఛగా ఖర్చు పెట్టగలుగుతున్నాను” అని సునీతి సమాధానం ఇచ్చింది.
ఆ సమాధానాన్ని యథాతథంగా అనంగచంద్రికకు చేరవేసింది దాసి. దాంతో అగ్గిమీద వేసిన గుగ్గిలంలా భగభగలాడింది అనంగచంద్రిక. ఒక్క రాగిడబ్బు కూడా విదల్చని విటుడిని, ఎలా వదలించుకోవాలో ఆమెకు బాగా తెలుసు. తలనొప్పి సాకుగా పెట్టి, ఆ రాత్రికి జయభద్రుడికి తన మంచంమీద చోటివ్వకుండా తప్పించుకుంది.
వసారాగదిలో అతడొక్కడే నిద్రిస్తుండగా.. ఇద్దరు దొంగలు మంచంతో సహా ఎత్తుకుపోయారు. రాత్రికి రాత్రి నగరం దాటించారు.
నడిరాత్రిలో జయభద్రునికి మెలకువ వచ్చింది. ఆకాశంలో నక్షత్రాలు చూసిన తరువాత, తనకు ప్రమాదం ఏర్పడిందని తెలిసింది. దొంగల మాటల వల్ల మరికొన్ని విషయాలు తెలిశాయి.
‘ఇటువంటి తుచ్ఛురాలి కారణంగా ప్రాణం వంటి మిత్రునితోనూ, భార్యతోనూ విరోధం తెచ్చుకున్నాను. నాకీ శాస్తి జరగాల్సిందే. చూద్దాం ఏం జరగనుందో’ అనుకున్నాడు. కొద్దిసేపటికి అతని మంచాన్ని ఒక పాడుబడ్డ బావి వద్ద దించారు. కొన్ని కట్లు ఊడదీసి, మరికొన్నిటిని అలాగే ఉంచి.. దొంగలిద్దరూ సాయంపట్టి జయభద్రుణ్ని ఎత్తి బావిలో పారేశారు.
బావి నిండా నీళ్లు ఉన్నందువల్ల జయభద్రునికి దెబ్బలు తగల్లేదు. ఈతొచ్చిన వాడు కాబట్టి, మెల్లిగా బావి గోడలపై మొలిచిన మర్రిమొక్కను పట్టుకుని అలసట తీర్చుకున్నాడు. తెల్లవారిన తరువాత తన అవస్థ చూసిన వారెవరైనా సాయం చేయకపోతారా అని ఎదురు చూడసాగాడు.
అంతలో బావిలో ఏదో జంతువు పడ్డట్లు దబ్బున శబ్దం అయింది. నీళ్లు అతని ముఖాన పెళ్లున తగిలాయి. మరికొద్దిసేపటికి నీటిలో వేలాడుతున్న జయభద్రుని పాదాలకు ఏదో తగిలింది. మృదువైన మనిషి వేళ్లు తనను చుట్టుకున్నట్లు అనిపించగానే.. ఆ వేళ్లకు తన కాళ్లందించాడు. అతిప్రయత్నం మీద ఆ మనిషిని పొదివి పట్టుకుని రక్షించాడు. మెత్తని అవయవాలను బట్టి ఆమె ఆడమనిషి అని పోల్చుకున్నాడు. తాను పట్టుకున్న మర్రికొమ్మను ఆమె చేతికందించి, తాను వేరొక కొమ్మ ఆసరాగా చేసుకున్నాడు.
వారి అదృష్టం కొద్దీ కొంతసేపటికి లోకబాంధవుడు ఉదయగిరిని అలంకరించాడు. వారి హృదయాల్లోని చీకట్లతోపాటు బావిలోని చీకటి కూడా మటుమాయం అయింది. దొంగలు తన ఒంటిపై కట్టిన తాళ్లను విడదీసి, ఒక్కటిగా పేని నెమ్మదిగా జయభద్రుడు తాను బయటపడటమే కాకుండా, ఆమెను కూడా గట్టెక్కించాడు.
అలసట తీరిన తరువాత..
“తరుణీ! నేను మణిప్రస్థ నగరాధీశుడైన కుంతీభోజుని కుమారుణ్ని. నాపేరు జయభద్రుడు. రాజకుమారులలో ఉత్తముడినని నా గురించి చెప్పుకొనేవారు. కానీ, చెడ్డదినాలలో ఎంత బుద్ధిమంతులకైనా మంచి ఊహలు పుట్టవు. ఒక వారకాంత మాయలో పడి, గుణవతి అయిన భార్యను దూరం చేసుకున్నాను. నా మిత్రుడు నాకెంతో నచ్చజెప్పబోయాడు. కానీ, పైత్యరోగం ఉన్నవాడి నాలుకకు పంచదార కూడా సహించనట్లు.. అతని మాటలు నాకు కర్ణకఠోరాలయ్యాయి. ఫలితంగా ఇలాంటి కష్టాల పాలయ్యాను. ఇది నా కథ. నీ గురించి కూడా తెలుసుకోవాలని ఉంది. అభ్యంతరం లేకపోతే చెప్పు” అన్నాడు.
అందుకు ఆ అతివ..
“ఆర్యా! అడవిలోని కాయను, సముద్రంలోని ఉప్పును దైవం చిత్రంగా కలుపుతుంటాడు. నా కథ వింటే మీకు విస్మయం, సంతాపం కలగక మానవు. మీ తండ్రిగారైన కుంతీభోజుడు మా తండ్రిగారికి స్నేహితులే. మాది మగధదేశం. మా తండ్రి మంత్రపాలుడు. తల్లిపేరు చంద్రమతి. వారికి నేను పార్వతీదేవి కటాక్షం వల్ల జన్మించానని, నాకు హైమవతి అని పేరు పెట్టుకున్నారు. అల్లారుముద్దుగా పెంచారు.
ఇటీవలే మా తండ్రిగారు నాకు వివాహం చేయాలని నిశ్చయించారు. అనేకమంది రాజపుత్రుల చిత్రపటాలు తెప్పించారు. వాటిలో నేను మీ చిత్రపటాన్ని ఎంపిక చేసి, మా తండ్రిగారికి చూపించాను. ఆయన చాలా ఆనందించారు. సంబంధం కోసం రాయబారం చేయబోతే, అప్పటికే మీకు వేరొకచోట వివాహం కుదరిందని తెలిసింది. నా ఎన్నిక తప్పినందువల్ల మా తల్లిదండ్రులిద్దరూ కలిసి, చిత్రపటాల ఆధారంగా ఇద్దరు రాకుమారులను నాకు తగినజోడుగా నిర్ణయించారు.
“కళింగదేశపు రాకుమారుడు గుణవర్మ పేరుకు తగ్గవాడు. చదువుల్లో బృహస్పతి. రూపంలో మన్మథుడు. కానీ, వారి దేశం ఫలవంతమైనది కాదు. సామాన్యమైన ఐశ్వర్యవంతులు. అయితేనేం?! గుణవంతుడే అందరికంటే ఐశ్వర్యవంతుడు కనుక, అమ్మాయిని ఇతనికి ఇవ్వడం మంచిదని నా నిర్ణయం” అని మా తండ్రిగారు చెప్పారు.
అప్పుడు మా తల్లి..
“నాథా! ఆడది తనకు కాబోయే భర్త రూపవంతుడు కావాలనుకుంటుంది. మామగారు తన అల్లుడు విద్యావంతుడైతే చాలనుకుంటాడు. అత్తగారు ఎప్పుడైనా ఐశ్వర్యవంతుడైన అల్లుణ్నే మెచ్చుకుంటుంది. నిజానికి భాగ్యవంతుడే సమాజంలో గౌరవంగా బతకగలడు. దాత కాగలడు. నలుగురిలో తన మాట నెగ్గించుకోగలడు. డబ్బుంటే వేలాది గుణాలున్నట్లే. ఇది లోకరీతి. అందువల్ల మన ముగ్గురిలోనూ నా ఎంపికే సరైనది. లాటదేశపు రాకుమారుడు ధనవర్మ మన అమ్మాయికి తగినవాడు” అని వాదించింది.
నా పెంపకం విషయంలో మొదటినుంచీ వాళ్లంతే. ఒకరి అభిప్రాయాలు వేరొకరితో కలిసేవి కావు. నా దురదృష్టం కొద్దీ నాకు కాబోయే భర్త విషయంలో మా తల్లిదండ్రుల అభిప్రాయాలు వేరయ్యాయి. వాదనలతో సరిపుచ్చకుండా వారు చేతల్లోకి కూడా దిగారు.
పెళ్లికి తరలిరమ్మని మా తండ్రిగారు గుణవర్మకు శుభలేఖ పంపారు. రహస్యంగా వచ్చి, మా అమ్మాయిని పెళ్లాడమని మా తల్లి ధనవర్మకు సందేశం పంపింది. నా రూపలావణ్యాల గురించి విన్న తరువాత, నన్నే పెళ్లాడాలని వాళ్లిద్దరూ పట్టుదల పట్టారు. పెళ్లికి తరలివచ్చారు.
(వచ్చేవారం.. హైమవతి – సునీతి)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | అనంగ చంద్రిక
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | అదృష్టదీపుడు – 2
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | అదృష్టదీపుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | పాటపాడే చెట్టు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | స్వర్గంలో మానవుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | ఎగిరే చెట్లు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |కాశీ మజిలీ కథలు : దొంగల తప్పిదం
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |రహస్య స్నేహితుడు