Kasi Majili Kathalu Episode 33 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : గోపాలుణ్ని తోడుగా తీసుకుని, మణిసిద్ధుడు అనే యతి కాశీయాత్ర చేస్తున్నాడు. మణిసిద్ధుడు తన వద్దనున్న మణి సహాయంతో దారిలో ఎదురయ్యే అన్ని సంగతులూతెలుసుకుని, గోపాలునికి కథలుగా చెప్పేవాడు. అలా వాళ్లిద్దరూ చెప్పుకొన్నవే.. కాశీమజిలీ కథలు. వీటిని మధిర సుబ్బన్న దీక్షితులు 12 సంపుటాలుగా రచించారు. ఇప్పటివరకూ మీరు రెండు సంపుటాల్లోని కథలు చదివారు. ఇకనుంచి మూడోసంపుటి కథలు.
మణిప్రస్థ నగరాన్ని కుంతీభోజుడనే రాజు పాలిస్తుండేవాడు. ఆయనకు ఏడుగురు కొడుకులు. వారిలో చివరివాడి పేరు జయభద్రుడు. అతను పుట్టినప్పుడు జాతకాన్ని గణించిన జ్యోతిషులు.. “ఇతడు భార్యవల్ల భూలోకమంతా వ్యాపించే గొప్ప కీర్తి సంపాదిస్తాడు. మీ సింహాసనానికి వారసుడవుతాడు” అని పలికారు.
ఆనాటినుంచి మహారాజు తన కుమారుణ్ని ఉన్నత విద్యావంతునిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాడు. మంత్రి కుమారుడు సుమిత్రుడు అతనికి సహవిద్యార్థి అయ్యాడు. కాబోయే చక్రవర్తికి అన్ని కళల్లోనూ, విద్యలలోనూ ప్రవేశం ఉండాలనే ఉద్దేశంతో మహారాజు అనేకమంది ఉపాధ్యాయులను కోటకే రప్పించేవాడు. క్రమేపీ జయభద్రుడు అన్ని విద్యలలోనూ మేటిగా, సాటిలేని వీరునిగా గురువుల వద్ద మంచిపేరు తెచ్చుకున్నాడు. చూస్తుండగానే అతనిలో యవ్వనం అంకురించింది. ఆ సమయంలో కామశాస్ర్తాన్ని బోధించడానికి ఒక కొత్త ఉపాధ్యాయుడు కుదిరాడు. అన్ని శాస్ర్తాల్లోనూ ఆరితేరిన వాడైనా.. జయభద్రునికి కామశాస్త్రంపై మాత్రం అభిరుచి కుదరలేదు. అప్పుడు ఆ ఉపాధ్యాయుడు..
“రాజపుత్రా! ఈ శాస్ర్తాన్ని ఎరిగినవాణ్నే రసికుడని పిలుస్తారు. రసికత లేనివాడు సాటివారిలో గౌరవాన్ని పొందలేడు. తనలోని భావాలను ఎదుటివారి వద్ద సమతూకంలో ప్రదర్శించలేడు. తరచుగా భావోద్వేగాలకు గురవుతుంటాడు. మనలో వెల్లువెత్తే భావతరంగాలను కట్టడి చేయాలన్నా, స్వేచ్ఛగా సంచరింప చేయాలన్నా కామశాస్ర్తాన్ని సక్రమంగా చదివి, అనుభూతిలోకి తెచ్చుకోవాలి. ఊహించని సంఘటనలు ఎదురైనప్పుడు స్తంభించి పోతుంటాం. మన ప్రమేయం లేకుండానే మనలో ప్రళయాలు పుడుతుంటాయి. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇవన్నీ సాత్త్విక భావాలు. ఇవి కాకుండా నిర్వేదం, గ్లాని, శంక వంటి తామసిక భావాలు ఉన్నాయి. ఇటువంటి భావాలను కామశాస్త్రం ద్వారా మాత్రమే చక్కగా అనుభూతిలోకి తెచ్చుకోగలం. శృంగార రసానికి స్థాయీ భావం రతి. అది అనుభవైకవేద్యం కాకముందే శాస్త్రం మనకు అనుభూతి స్థాయిలో చక్కని పాఠాలను చెబుతుంది. ఈ శాస్ర్తాన్ని ఒంట బట్టించుకున్న వాడు సర్వదా ఉత్తముడు అవుతాడు. దయచేసి జాగ్రత్తగా చదువు నాయనా!” అని బోధించాడు.
కానీ, ఆయన మాటలేవీ జయభద్రుని చెవులకు ఎక్కలేదు. అందువల్ల ఈ విషయంలో సుమిత్రుడు కలగ చేసుకోవాల్సి వచ్చింది.
“మిత్రమా! ఇన్ని శాస్ర్తాలను మధించినవాడివి.. కామశాస్త్రం ఒక లెక్కలోనిదా? ఎందుకు ఇంతటి నిరసన భావం?” అని ప్రశ్నించాడు సుమిత్రుడు.
అందుకు జయభద్రుడు వేదాంతిలా నవ్వి..
“చిత్త వికారాన్ని వర్ణించడానికి ప్రత్యేకించి ఒక శాస్త్రమెందుకు?! ఆ శృంగార వర్ణనలన్నీ అదేపనిగా చదువుతూ పోతే కామం పెరుగుతుందే కానీ, కామాన్ని గెలవడం సాధ్యమేనా?” అని ఎదురు ప్రశ్నవేశాడు.
“ఎంత మాటన్నావు?! దీనిని సరిగా చదివిన వాడు చెడిపోడని ఉపాధ్యాయుడు చెప్పిన మాట వినలేదా?! సరే ఒక పనిచేద్దాం. ఇప్పుడు మనమిద్దరం ఒకచోటుకు పోదాం” అంటూ దారితీశాడు సుమిత్రుడు.
అప్పటివరకూ జయభద్రుడు ఎరగని లోకమది. అదో వేశ్యావాటిక. ఆ వీధుల వెంట నడుస్తుండగా దారికి ఇరువైపులా నిల్చున్న వేశ్యల ఓరచూపులు, వారి రూపురేఖా విలాసాలు జయభద్రుణ్ని విస్మయానికి గురిచేశాయి. వారి ముఖచంద్రబింబాల నుంచి ప్రసారమవుతున్న మందహాస కిరణాల వల్ల జయభద్రుని కళ్లు అనే కలువలు వికసించసాగాయి. వారి మెడ వంపులు, వయ్యారాలను చూసిన జయభద్రుని హృదయమనే చిత్తడి నేలలో మన్మథ మొలకలు పుట్టసాగాయి. మంత్రించిన వానిలా సుమిత్రుని వెంట వెళ్తున్న జయభద్రునికి ఒక వేశ్యామణి అడ్డొచ్చింది. వయ్యారంగా నమస్కరించి..
“ఆర్యా! అతి సుకుమారులైన ఈయన పాదచారిగా నడుస్తుంటే చూసే నా మనసుకు కష్టంగా ఉంది. ఇదే మా ఇల్లు. దయచేసి ఒక్కసారి లోనికి వచ్చి, కొద్దిసేపు విశ్రమించండి” అని కోరింది. మిత్రులిద్దరూ ఆమె కోరికను మన్నించి, లోనికి వెళ్లారు. వారికి అర్ఘ్యపాద్యాలిచ్చి, మధుర పానీయాలను సమర్పించి, ఒక పూలపాన్పుపై జయభద్రుని కూర్చోబెట్టింది.
“మనోహరులారా! మీ రాకతో మా ఇల్లు పావనమైంది. మీవంటి ఉత్తమ అతిథులను సత్కరించడానికే మా భవనం నిర్మితమైంది. ఎందరో రాజభుజంగ శేఖరులను సేవించి వన్నెకెక్కిన వంశం మాది. నన్ను అనంగ చంద్రిక అని పిలుస్తుంటారు” అని చెప్పింది.
ఆమె మాటలను వింటూ జయభద్రుడు మైమరిచి పోతున్నాడు. ఆమెకు బదులిస్తూ సుమిత్రుడు..
“కళానిధీ! నువ్వు చేసిన ఉపచారాలు మా మనసులకు హాయి గొలిపాయి. ఇతడు కుంతీభోజ మహారాజుగారి ఏడో కొడుకు జయభద్రుడు. మీ వాడలోని విశేషాలు చూపించడానికి తీసుకువచ్చాను. మేము త్వరగా వెళ్లిపోవాలి” అని పలికాడు.
ఆ మాటలకు అనంగచంద్రిక కళ్లు పెద్దవయ్యాయి.
“ఆహా! నేటికి నా జన్మ ధన్యమైంది. భూలోక మన్మథుడని కీర్తి గడించిన జయభద్రుల వారిని చూడగలిగాను” అంటూ పన్నీరు, పునుగు, జవ్వాది వంటి సుగంధద్రవ్యాలతో జయభద్రునికి మరిన్ని ఉపచారాలు చేసింది. అతని మెడలో పూలమాల వేసి, పూల విసన కర్రతో వీచసాగింది. ఆమె చేతిస్పర్శ తగలగానే జయభద్రుని శరీరంలో పులకరింతలు కలిగాయి. దాచి పెట్టలేని కొత్త వికారాలన్నీ ఎప్పటికప్పుడు అతని కళ్లలో స్పష్టంగా కనిపిస్తుండగా, వాటిని కనిపెట్టి అనంగచంద్రిక మరింతగా రెచ్చగొట్టసాగింది. ఇంతలో హజారపు గంట మోగింది.
“మిత్రమా! అదుగో సాయంకాలమైంది. మహారాజుగారికి తెలిసే లోపుగా మనం కోటలోకి వెళ్లిపోవాలి. పదపద” అంటూ జయభద్రుని రెక్కపుచ్చుకుని బలవంతంగా లాక్కెళ్లాడు సుమిత్రుడు.
చాలాదూరం వచ్చేవరకూ జయభద్రుడు ఏదో మైకం కమ్మినట్లే ఉన్నాడు. అప్పుడు తెలివి తెచ్చుకుని..
“మిత్రమా! ఆమె ఎవరు? నువ్వు ఆమెతో ఏదో మాట్లాడావు కానీ, నాకేమీ వినిపించలేదు. మళ్లీ మనం వారింటికి పోవచ్చా?” అని ప్రశ్నించాడు.
అందుకు సుమిత్రుడు..
“మిత్రమా! ఆమె ఒక వారకాంత. అమరకోశంలో వారస్త్రీ, గణికా, వేశ్యా.. అని మనం చదువుకున్న పర్యాయ పదాలన్నీ ఆమెకు వర్తిస్తాయి. వాళ్లింటికి ఎప్పుడు వెళ్లినా ఆటంక పెట్టేవాళ్లు ఎవరూ ఉండరు. కానీ, వెళ్లడం మంచిది కాదు సుమా! ఆమెను చూడగానే నీలో మన్మథభావం ఉదయించింది. మన్మథ అవస్థలు ‘పది’ అని శాస్త్రం చెబుతున్నది. చూపులు కలవడాన్నే దృక్కు అంటారు. చూపులతో మనసులు సంగమిస్తాయి. ఎలాగైనా ఆమెను పొందాలనే సంకల్పం కలుగుతుంది. దానివల్ల నిద్ర దూరమవుతుంది. చూస్తుండగానే మనిషి కృశించిపోతాడు. ఇతరమైన విషయాలపై ఆసక్తి కోల్పోతాడు. సిగ్గుఎగ్గులు విడిచిపెడతాడు. ఆపైన కూడా ఆమె దక్కకపోతే ఉన్మాదం కలుగుతుంది. మూర్ఛలు వస్తాయి. చివరికి వియోగం కంటే చావే మేలనిపిస్తుంది. ఇవన్నీ మనసులో ఎవరి ఉపదేశం లేకుండానే పుడుతూ పోతూ ఉంటాయి. వీటన్నిటికీ మూలం దృష్టి, మనసుల కలయిక. అటువంటి దృష్టిని సరిచేయడానికే శాస్ర్తాలు ఉన్నాయి. ఇందాకా కామశాస్ర్తాన్ని ఎద్దేవా చేశావు. ఇప్పుడేమో కంటికి నదురైన వేశ్య కనిపించగానే గుటకలు మింగుతున్నావు. ఇంక దీన్ని మరిచిపో. ఇదొక చక్కటి గుణపాఠంగా తీసుకో. రేపోమాపో మన విద్యాభ్యాసం పూర్తయిందని గురువులు ప్రకటిస్తారు. మీ తండ్రిగారు నీకు వివాహం చేసి, రాచరికపు బాధ్యతలు అప్పగిస్తారు. వాటిపై దృష్టి పెట్టు” అని చెప్పాల్సినదంతా చెప్పాడు. కానీ, అతని ప్రయాసంతా వృథానే అయ్యింది.
* * *
మరునాడు పాఠం వేళకు జయభద్రుడు కోటలో కనిపించలేదు. తానొక్కడే అనంగచంద్రికను వెతుక్కుంటూ వేశ్యావాటికకు వెళ్లిపోయాడు. ఆ సంగతి గ్రహించిన వెంటనే సుమిత్రుడు కూడా వెళ్లాడు. కోటకు తిరిగి వచ్చేయమని మిత్రుణ్ని కోరాడు.
“మిత్రమా! సాయంత్రం వరకు నన్నిక్కడే ఉండనివ్వు” అని బతిమాలుకున్నాడు జయభద్రుడు.
సాయంత్రం మళ్లీ వెళ్లి అడిగితే..
“రేప్పొద్దున్నే నేనే వచ్చేస్తాను కదా!” అన్నాడు.
ఆ మరునాడు కూడా సుమిత్రుడు తానే వెళ్లి, తన మిత్రుణ్ని అనంగచంద్రిక కౌగిళ్లనే చెరసాల నుంచి విడిపించుకుని రావాల్సి వచ్చింది.
కోటలోకి వెళ్తుండగా కుంతీభోజుడు ఎదురుపడ్డాడు.
“ఏమిటి సుమిత్రా! నీ మిత్రుని కళ్లు ఇంత ఎర్రగా ఉన్నాయేంటి?” అని ప్రశ్నించాడు.
“మహారాజా! పాపం తనకు రాత్రంతా చదువుతోనే సరిపోయింది” అని సుమిత్రుడు సమాధానం ఇచ్చాడు.
“మరీ అంతగా చదవక్కర్లేదు. మీరిద్దరూ ఉత్తీర్ణులైనట్లు గురువులు ప్రకటించారు” అన్నాడు కుంతీభోజుడు. అప్పటివరకూ తండ్రి కళ్లలోకి చూడలేక తలదించుకుని ఉన్న జయభద్రుడు లోనికి వెళ్లిపోయాడు.
“సుమిత్రా! నీతో ఒక పని ఉంది. ఇలా రా” అని పిలిచాడు కుంతీభోజుడు.
“నీ మిత్రునికి చాలా సంబంధాలు వస్తున్నాయి. అన్నిరకాలుగా ఆలోచించిన మీదట ఇంద్రసేన మహారాజుగారి కుమార్తె సునీతితో వివాహం జరిపించాలని నిర్ణయించాం. దీనికి అతగాణ్ని అంగీకరింప చేసే బాధ్యత నీదే” అని రాకుమార్తె చిత్రపటాన్ని సుమిత్రుని చేతిలో ఉంచాడు. ఆ చిత్రపటాన్ని తీసుకెళ్లి, జయభద్రునికోసం విద్యామందిరంలో వేచి చూడసాగాడు సుమిత్రుడు. సాయంకాలమైనా అతని జాడలేదు. ఒకవేళ నిద్రపోతున్నాడేమోనని అంతఃపురంలోకి వెళ్లి చూశాడు. కానీ అక్కడ లేడు.
‘అయ్యయ్యో! అనవసరంగా నేనే జయభద్రుణ్ని చెడగొట్టినట్లున్నానే! ఈ రహస్యం ఇతరులకు తెలిస్తే పరువు పోవడం తప్ప ఒరిగేదేమీ లేదు. ఎలాగోలా నేనే వీడిని ఆ వేశ్యనుంచి రక్షించాలి’ అనుకున్నాడు సుమిత్రుడు.
నేరుగా అనంగచంద్రిక ఇంటికి వెళ్లి..
“రాజపుత్రా! నీ చర్యలు మరీ విపరీతంగా ఉన్నాయి. ఈ వేశ్యల సంగతి నీకు సరిగా తెలియదు. తన రూపాన్నే సమిధగా చేసి పురుషునిలో మదనాగ్నిని వెలిగించేది వేశ్య. ఆ జ్వాలల్లో పురుషుల యవ్వనం, ధనం ఆహుతి అయిపోతుంటాయి. దయచేసి ఇంటికి రా! మీ తండ్రిగారు నీకు చక్కని సంబంధం కుదిర్చారు. ఆమె చిత్రపటాన్ని కూడా తెప్పించారు. ఈ అనంగచంద్రిక సౌందర్యం కాబోయే నీ భార్య సౌందర్యంలో వెయ్యోవంతు కూడా ఉండదు” అని బతిమాలుకున్నాడు.
కానీ జయభద్రుడు అంగీకరించలేదు.
“నేను చిత్రపటాన్ని చూశానని చెప్పు. పెళ్లికి అంగీకరించానని కూడా చెప్పు. నువ్వు ఇంటికిపో. నేను తీరిక చేసుకుని వస్తాను” అని సుమిత్రుణ్ని పంపేశాడు.
* * *
జయభద్రుని పెళ్లి ముహూర్తం కుదిరింది. రాజసంప్రదాయం ప్రకారం కత్తికి బాసికం కట్టిపంపితే సునీతి ఆ కత్తినే వరించి, వివాహమాడింది. ఆ తరువాత ఆమె కాపురానికి కూడా వచ్చింది. అప్పటికే అనంగచంద్రిక వ్యామోహంలో పీకల్లోతుగా మునిగిపోయాడు జయభద్రుడు. తాను కాపురానికి వచ్చి ఇంతకాలమైనా తన భర్త ముఖమైనా చూపించలేదని.. అత్తమామలతో, తోటికోడళ్లతో చెప్పుకోవడానికి సునీతికి అవకాశం కలగలేదు. అది ఆమె ఓర్పునకు పరీక్షగా మారింది. అలాంటి సమయంలో సుమిత్రుడు ఆమెకు ఒక రహస్య లేఖ రాశాడు. దానిలో జయభద్రుని పరిస్థితినంతా వివరంగా తెలియచేశాడు. గుట్టుబయట పడకుండా కాపురాన్ని సరిచేసుకోమని, అందుకోసం తనవంతు సాయం తప్పకుండా అందిస్తానని లేఖ ద్వారా వాగ్దానం చేశాడు. సునీతికి తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియలేదు. చివరికి కాపురానికి వచ్చేటప్పుడు తనతోపాటు వచ్చిన అరణపుదాసి అయిన భ్రమరికతో ఈ విషయాన్ని చర్చించింది. ఆమె చెప్పినదంతా విన్న తరువాత.. “సాధువుల దగ్గర వశీకరణ తాయెత్తులు, మూలికలు ఉంటాయి. వాటితో ఎంతటి మగాడినైనా కొంగున కట్టేసుకోవచ్చు” సాలోచనగా చెప్పింది భ్రమరిక.
(వచ్చేవారం.. నీతిమంతురాలు)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | అదృష్టదీపుడు – 2
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | అదృష్టదీపుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | పాటపాడే చెట్టు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | స్వర్గంలో మానవుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | ఎగిరే చెట్లు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |కాశీ మజిలీ కథలు : దొంగల తప్పిదం
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |రహస్య స్నేహితుడు