Kasi Majili Kathalu Episode 25 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశీమజిలీ కథలను 1930వ దశకంలో మధిర సుబ్బన్న దీక్షితులు రచించారు. ఆయన అప్పటికే శంకరవిజయం, పండితరాయల కథలవంటి అనేక కావ్యాలను రచించి లబ్ధప్రతిష్ఠులయ్యారు. ఉపనిషత్ రహస్యాలను తెలిసిన మహాపండితుడైనా, పామరులను సైతం రంజింపచేసేలా ఆయన ప్రాణంపోసిన కాశీమజిలీ కథలు తెలుగు సాహిత్యంలో మహోన్నత స్థానాన్ని పొందాయి. ప్రస్తుతం మీరుచదవబోయే ఈ కథ.. కాశీమజిలీ కథలు రెండోభాగం లోనిది.
పూర్వం జగన్నాథపురి క్షేత్రంలో బలదేవుడు అనే మాలికుడు ఉండేవాడు. అతను నిత్యం అందమైన పూలమాలలు కట్టి జగన్నాథస్వామికి సమర్పించేవాడు. అతని భక్తివిశ్వాసాలను గమనించిన పట్టణ ప్రజలు.. అతణ్ని ‘హరిదాసు’ అని పిలిచేవాళ్లు. సంతానం కోసం జగన్నాథుడిని చాలాకాలంపాటు సేవించిన బలదేవుడికి.. దివ్యతేజస్సుతో ఒక కొడుకు పుట్టాడు. దైవజ్ఞుల సూచన ప్రకారం బలదేవుడు ‘రుచికుడు’ అని నామకరణం చేశాడు.
రుచికుడు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. అప్పటినుంచి తల్లీతండ్రి తానే అయి బలదేవుడు కొడుకును పెంచుతున్నాడు. బాల్యం నుంచే రుచికుడు తండ్రివద్ద పూలమాలలు అల్లడం నేర్చుకున్నాడు. పూలబంతులు, మాలలు, జడలు అల్లడంలో తనంతటివాడు లేడని పేరు తెచ్చుకున్నాడు. ఎనిమిదేండ్ల వయసులో గురుకులానికి వెళ్లాడు. అనేక విద్యల్లో ఆరితేరాడు. అయినా మాలలు అల్లే వృత్తినే ఇష్టంగా ఎంచుకున్నాడు.
రుచికునికి గురుకులంలో గౌతముడనే పిల్లవానితో స్నేహం కుదిరింది. గౌతముడు ఒకనాడు రుచికుని దగ్గరికి వచ్చి.. “మిత్రమా! ఈ మూల కూర్చొని దండలు అల్లుకుంటూ ఉంటే నీకు సరిగ్గా తెలియడం లేదు కానీ, పట్టణంలో నీకెంత పెద్ద పేరుందనుకున్నావ్?!” అన్నాడు కండ్లు గుండ్రంగా తిప్పుతూ.
“ఏమిటయ్యా నీగోల?!” అని ప్రశ్నించాడు రుచికుడు దండలల్లడం ఆపకుండానే.
“గోల అంటావేంటి? విను.. నీ దండలంటే ఈ ఊళ్లో జనాలంతా పడి చస్తున్నారు. మరీ ముఖ్యంగా వేశ్యావాటికల్లో చూడాలి నీ గొప్పతనం. నువ్వు కట్టిన మాలను కొప్పులో తురుముకోని ఆడది లేదు. నువ్వు కట్టిన బంతులతో విటులను ఆకర్షించాలని ప్రయత్నం చేయని వారకాంత లేదు. సరే.. నువ్వు అల్లిన పూల తొడవులను చేతులకు కట్టుకుని తిరగని విటుడు లేడంటే నమ్ము! ఒక్కమాట చెబుతాను వింటావూ?!”..
“చెప్పు.. అదేమిటో!”..
“మీ నాన్న నిన్ను ఇల్లు కదలనివ్వడు. అందుకే లోకంలో ఏం జరుగుతున్నదో నీకు తెలియడం లేదు. రోజూ సంతకు పంపిన పూలదండలను అమ్మి, ఆ వ్యాపారులిచ్చే డబ్బుతో సరిపెట్టుకుంటున్నావు. అలా కాకుండా నువ్వే స్వయంగా వేశ్యావాటికలకు వెళ్లి దండలమ్మితే ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. ఆ డబ్బు చూపిస్తే మీ నాన్న కూడా సంతోషిస్తాడు” అని తన ఆలోచన చెప్పాడు గౌతముడు.
రుచికునికి ఆ సలహా రుచించింది. మరునాడు బలదేవుడు ఆలయానికి వెళ్లగానే.. బుట్టనిండా పూలదండలతో మిత్రులిద్దరూ వేశ్యావాటికకు వెళ్లారు. అప్పుడు గౌతముడు..
“రుచికా! ఇటువంటి మేడలు మన వీధుల్లో ఎప్పుడైనా చూశామా?! ఆహా! ఇది స్వర్గం కాదు కదా?! ఆ కనిపించేవాళ్లు అప్సరసలేమో!” అన్నాడు.. తన స్నేహితుడి ఆనందానికి మాటల రూపాన్ని కల్పిస్తూ. మిత్రులిద్దరూ వింతలన్నీ చూస్తూ చాలాసేపు తిరిగారు.
ఒకచోట ఒకే వేశ్యకోసం ఇద్దరు పోట్లాడుకుంటుంటే వాళ్ల మధ్యలో దూరి విడిపించారు. ఆ పెనుగులాటలో రుచికుని వద్దనున్న పూలదండలు కొంచెం నలిగిపోయాయి. నిరాశతో ఇంటికి తిరిగి వెళ్లబోతుండగా ఒక వారకాంత వారి దగ్గరికి వచ్చింది.
“బావా! ఇన్ని పూలు తెచ్చావేం?! మా ఇంటికోసారి రాకూడదూ!” అని పిలిచింది.
“నేనీ దండలు అమ్మకానికి తెచ్చాను. ఇవి కాస్తా నలిగిపోయాయి” అన్నాడు రుచికుడు బేలగా.
అందుకు ఆ వారకాంత గలగలా నవ్వేసి, పూలతట్టను తీసుకుంది. పరీక్షించి చూసి..
“ఇలాంటి దండలు రుచికుడు తప్ప మరెవ్వరూ అల్లలేరు. నిజం చెప్పు.. ఎవరు నువ్వు?!” అని అడిగింది.
“అవును. ఆ రుచికుడిని నేనే. ఈవేళ స్వయంగా అమ్ముదామని తీసుకొచ్చాను. కానీ..” అంటూ ఇంకేదో చెప్పబోయాడు.
ఆ వారకాంత చటుక్కున రుచికుని చెయ్యి పట్టుకుంది.
“ఎన్నాళ్లకు కనబడ్డావయ్యా మహానుభావా! నువ్వు త్వరగా నాతో రావాలి. మా సఖురాలు ఎప్పుడూ నీ పేరే పలవరిస్తూ ఉంటుంది. నీ దగ్గర ఈ మాలలు అల్లే విద్య నేర్చుకోవాలని తహతహపడుతున్నది” అన్నదామె.
రుచికుడు గుబులుగా ఆమె చేతిని విడిపించుకున్నాడు.
“ఎందుకలా విదిలిస్తావ్?! మా చంద్రలేఖ కూడా మావంటిదే అనుకున్నావేమో?! ఇంతవరకూ పురుషస్పర్శ ఎరగదామె. అన్ని విద్యలలో ఆరితేరిన వాడినే వరిస్తానని పట్టుపట్టుకుని కూర్చుంది. ఇప్పటిదాకా ఎంతమందిని తీసుకువచ్చినా దానికి నచ్చలేదు. నిన్ను చూస్తే మనసు మారవచ్చు. ఏమంటావ్?!” అన్నదా వారకాంత మళ్లీ.
రుచికుడు కొంచెం మెత్తబడ్డాడు. కానీ, గౌతముడు ఒప్పుకోలేదు. “అలాంటిదేమీ వద్దు. కావాలంటే ఈ దండలు తీసుకుపో” అన్నాడు.
“కాదయ్యా గౌతమా! పోనీ ఓసారి పోయొద్దాం. ఊరికే కాసేపు కూర్చుని మాట్లాడివస్తే ఏం పోయింది?” ముందడుగు వేయబోయాడు రుచికుడు.
“నేను రాను. కావాలంటే నువ్వు వెళ్లిరా. నేనిక్కడే ఉంటాను. సాయంత్రం లోపుగా నువ్వు రాకపోతే.. నేను వెళ్లి మీ నాన్నను తీసుకొచ్చేస్తాను చూసుకో” బెదిరించాడు గౌతముడు. ‘సరే’ అంటూ చంద్రలేఖ ఇంటిలోకి ప్రవేశించాడు రుచికుడు.
* * *
స్నేహితురాలి వెంట వచ్చినవాడు రుచికుడని తెలుసుకున్న చంద్రలేఖ.. అతనికి తగిన రీతిగా ఉపచారాలు చేసింది.
“ఆర్యపురుషా! నిన్ను చూడకపోయినా నువ్వు కట్టిన దండలతో నాకు గాఢమైన పరిచయం ఉంది. నీ విద్య అద్భుతం. నీ రూపం అంతకంటే అపురూపంగా కనిపిస్తున్నది. నీ గురువులు ఎవరు?” అని అడిగింది.
ఆమె చూపులు రుచికునిలో మదనవికారాన్ని కలిగించాయి. ఆమె అడిగిన విషయాలు కాకుండా వేరే ఏవో చెప్పసాగాడు. ఆ చాంచల్యాన్ని గుర్తించినప్పటికీ చంద్రలేఖ కపటంగా మాట్లాడుతూ.. అతని ముందు పాటలు పాడుతూ కొంతసేపు అలరించింది.
ఆ మాటల్లో, పాటల్లో వారికి కాలం తెలియలేదు.
చీకటి ముసిరేవేళకు వీధిద్వారం వద్ద ఏదో సందడి వినిపించింది. అవతల రాజభటులు తలుపులు తీయండంటూ అరుస్తున్నారు. ఆ రొద విన్న రుచికుడు అదిరిపడ్డాడు.
“అయ్యో! కదలక కదలక ఇల్లు కదిలి ఇంత అల్లరి పాలయ్యానేమిటి? గౌతముడు పోయి, మా నాన్నను తీసుకొచ్చినట్లున్నాడు. ఆయన నన్నిక్కడ చూస్తే ఎంత ఏడుస్తాడో చెప్పలేను. దయచేసి నన్నెక్కడైనా దాచిపెట్టు” అని చంద్రలేఖను బతిమాలుకున్నాడు.
“నువ్వు భయపడకు. మా ఇంట్లో దాక్కున్నవాణ్ని పరమేశ్వరుడు కూడా పట్టుకోలేడు” అంటూ చంద్రలేఖ అతనికి ఓ చోటు చూపించింది.
“దీనికంటే మంచిది చూపించు!” అని రుచికుడు కోరడంతో మరోచోటు చూపింది.
“ఇంతకంటే రహస్యమైన ప్రదేశం లేదా!?” అని మరోసారి అడిగాడు రుచికుడు. అప్పుడు చంద్రలేఖ తన ఇంటి దగ్గరలో ఉన్న ఒక తోట చూపించి..
“దీనికి రెండోదారి లేదు. ఇందులో దాక్కుంటే పదిరోజులు వెతికినా, ఎవరూ పట్టుకోలేరు” అని అతణ్ని అందులోకి తోసి, తలుపు తాళం వేసింది.
అంతలో రాజభటుల అరుపులు ఎక్కువయ్యాయి. చంద్రలేఖ తట్టుకోలేక తలుపులు తీయించింది. రాజభటులతోపాటు గౌతముడు, బలదేవుడు లోపలికి చొచ్చుకువచ్చారు.
“ఈయన కొడుకును నువ్వు నీ ఇంట్లో అట్టే పెట్టేసుకున్నావని ఫిర్యాదు వచ్చింది. మంచిమాటలతో పంపుతావా? లేదంటే మా వాడుక ప్రకారం చేయమంటావా?!” అన్నారు భటులు.
“ఈయనెవరో.. ఈయన కొడుకెవరో మాకు తెలియదు. మీ పద్ధతి ప్రకారం చేసుకోవచ్చు” అన్నది చంద్రలేఖ పెడసరంగా. రాజభటులు కరదీపికలు తెచ్చి అణువణువూ సోదాలు జరిపారు. ఎక్కడా రుచికుడి జాడలేదు. చివరికి వారికి తోట ప్రహరీ కనిపించింది. దాని తలుపు తాళం వేసి ఉండటం గమనించారు.
“ఈ తాళం తీయ్!” అని చంద్రలేఖను గద్దించారు.
“ఆ తోట మాది కాదు. తాళం తీసే అధికారం నాకు లేదు” అని చంద్రలేఖ జవాబిచ్చింది.రాజభటులు రాయితో తాళం పగులగొట్టి ఉద్యానంలో ప్రవేశించారు. జాము పొద్దెక్కేవరకూ ఆ ఉద్యానంలో గాలించారు. ప్రయోజనం లేకపోవడంతో వెనుదిరిగారు. చంద్రలేఖ ఆశ్చర్యపోయింది. రుచికుని కోసం వెతికింది. ఆమెకు కూడా అతని జాడ తెలియలేదు. ఎలాగో తప్పించుకుని ఉంటాడని అనుకుంది.
* * *
రెండురోజుల తరువాత ఆమెను వెతుక్కుంటూ గౌతముడు వచ్చాడు.
“సుందరీ! నువ్వు మామూలు వేశ్యవి కావని నేను ఎరుగుదును. మా బలదేవుడు పాపం కొడుకు కోసం చాలా దుఃఖిస్తున్నాడు. పెద్దవాడు. ఆయన ప్రాణం పోగొట్టిన పాపం ఎందుకు కట్టుకుంటావు?! మా రుచికుణ్ని విడిచిపెట్టు” అని దీనంగా అడిగాడు.
ఆ మాటలు వింటూనే చంద్రలేఖ బొటబొటా కన్నీళ్లు కార్చసాగింది. చాలాసేపటి తరువాత దుఃఖాన్ని ఆపుకొని, జరిగినదంతా గౌతమునికి వివరించి చెప్పింది.
అదంతా విన్న గౌతముడు..
“ఆ తోటకు రెండోదారి లేదంటున్నావు. తప్పించుకునే వీలులేదు. దొరికితే మాకు దొరకాలి. లేదా అందులోనే ఉండి ఉండాలి. ఏమైపోయినట్లు? ఏదైనా పక్షి ఎత్తుకుని పోయిందేమో అనుకుంటే, రాత్రిపూట పక్షులు తిరగవు. రాజభటుల సందడికి తోటలో తెల్లవారింది లగాయితు ఒక్కపిట్ట కూడా లేదు. నువ్వు చెబుతున్నదాన్ని బట్టి నాకు ఏమనిపిస్తున్నదంటే.. మనవాడు ఏదైనా చెట్టుపై దాక్కుని ఉండవచ్చు. రాత్రికి రాత్రి ఆ చెట్టు ఆకాశంలోకి ఎగిరిపోయి ఉండొచ్చు. లోకంలో అరుదుగా చెట్లు సంచరిస్తూ ఉంటాయని వింటూ ఉంటాం” అన్నాడు.
“నిజమా..! అలా కూడా జరుగుతుందా?. గౌతమా! అతనికేదైనా జరిగితే బలదేవుడే కాదు, నేను కూడా ప్రాణాలతో ఉండలేను. నువ్వు కూడా అంతే అనుకుంటాను. ఒకపని చేద్దాం. నీకు కొంత డబ్బిస్తాను. దేశ సంచారం చేసి, అతను ఎక్కడున్నాడో కనిపెట్టు. ఏవైనా విశేష వార్తలుంటే నాకు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉండు” అని బతిమాలింది చంద్రలేఖ.
గౌతముడు అందుకు ఒప్పుకొన్నాడు. దేశాలు తిరిగి, రుచికుణ్ని వెతక సాగాడు.
అలా అతడు వెళ్లిన కొంతకాలానికి చంద్రలేఖకు ఒక ఉత్తరం వచ్చింది. అందులో ఇలా ఉంది.
“చంద్రలేఖా! ఇప్పుడు నేను సముద్రప్రాంతంలోని రామచంద్రనగరంలో ఉన్నాను. ఇక్కడ ఒక విశేషం కనిపించింది. ఈ నగరాన్ని శూరసేనుడనే రాజు పాలిస్తున్నాడు. ఆయనకు తిలోత్తమ అనే కూతురుంది. విద్యారూపాల్లో, గుణశీలాల్లో ఆమె అసామాన్యమైనది.
ఆమె కోసం తండ్రి ఎన్ని సంబంధాలు తెచ్చినా ఆమె ఎవరినీ వరించలేదు. తండ్రి ఎంతగానో నచ్చజెప్పిన తర్వాత ఒక చిత్రఫలకాన్ని రచించింది. ఆ చిత్రంలో కనిపించే పురుషుణ్ని తీసుకువస్తే పెళ్లాడతానని చెప్పింది. శూరసేన మహారాజు ఆ చిత్రఫలకాన్ని ఈ ఊరిలో ఒక దేవాలయంలో వేలాడదీశాడు. ఆ చిత్రంలో అచ్చంగా మన రుచికుని ఆకృతే ఉన్నది.
మనవాడు తిలోత్తమకు ఎప్పుడు కనిపించాడో, వాళ్లిద్దరికీ సంబంధమేమిటో నాకు అంతుపట్టడం లేదు. కానీ పాపం ఆమె, మనవాడు కనిపించక ఎంతో విచారపడుతున్నదట. నేనామెను కలుసుకోవడానికి సాహసం చేయలేకపోతున్నాను. నువ్వు స్వయంగా వచ్చి, నీ విద్యాపాటవాలు ప్రదర్శిస్తే తిలోత్తమ తప్పక నీకు నెచ్చెలి కాగలదు. దానివల్ల మనకు కొన్ని విషయాలు తెలియగలవు. ఇట్లు గౌతముడు”.
.. ఆ ఉత్తరం అందుకున్న చంద్రలేఖ వెంటనే రామచంద్రనగరానికి బయలుదేరి వెళ్లింది. ఆమె వెళ్లేసరికి, గౌతముడు కనిపించలేదు. రెండుమూడు రోజులపాటు వెతికినా ఫలితం కనిపించలేదు.
బాగా ఆలోచించిన తర్వాత చంద్రలేఖ రామచంద్ర నగరంలో ఒక సంగీత కచేరీ చేసింది. ఆమె పేరు ప్రఖ్యాతులు నగరమంతటా వ్యాపించాయి. దాంతో శూరసేనుని నుంచి ఆహ్వానం అందింది.
రాజసభలో చేసిన కచేరీ కారణంగా తిలోత్తమ అంతఃపురంలోకి కూడా ప్రవేశించ గలిగింది. కొద్దికాలంలోనే తిలోత్తమకు చంద్రలేఖ సన్నిహితురాలు అయ్యింది.
(వచ్చేవారం.. దొంగల తప్పిదం)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | జగన్నాథ స్వామి
Kasi Majili Kathalu Episode 23 ( కాశీ మజిలీ కథలు ) | విశాలాక్షి కల”
Kasi Majili Kathalu Episode 22 | మలయాళ దేశం
Kasi Majili Kathalu Episode 20 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు – 2
Kasi Majili Kathalu Episode 19 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు