Kasi Majili Kathalu Episode 22 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : ఇరావతి అనే పట్టణాన్ని ఇంద్రద్యుమ్నుడనే రాజు పాలిస్తున్నాడు. సింహం వల్ల బాధలు పడుతున్న కోయవారిని రక్షించడానికి ఒకసారి అతడు అడివికి వెళ్లాడు. అక్కడ ఆత్మహత్య చేసుకోబోతున్న విశాలాక్షిని రక్షించాడు. ఆమె కాశీరాజు కూతురు. ఆ కాశీరాజు ఇంద్రద్యుమ్నునికి వరుసకు తమ్ముడు. విశాలాక్షి తెలియక వెర్రివాడైన కింశుకశాస్త్రినివరించింది. అంతలో శత్రురాజులు దాడిచేయడంతో కోట విడిచిపెట్టాల్సి వచ్చింది.
“పుస్తకంలో చాలా రహస్య మార్గాలు ఉన్నాయి. నేను జాగ్రత్తగా ఒక మార్గాన్ని ఎంచుకున్నాను. కొన్ని విలువైన రత్నాలను, ఆహార పదార్థాలను మూటగట్టుకుని, ఒక గుర్రానికి జీనువేసి సిద్ధం చేశాను. ఎవరికీ చెప్పకుండా ఒక రాత్రివేళ కోటలోని ఒక మీటను తిప్పి, రహస్యమార్గం తెరిచాను. నా మగణ్ని వెనుక కూర్చోబెట్టుకుని, గుర్రంతోసహా బిలమార్గంలో ప్రవేశించాను. అనేక మణులు పొదగడం వల్ల గుహలోపలి భాగమంతా పట్టపగలులా కాంతులు విరజిమ్ముతున్నది. రాజవీధిలా ఒప్పుతున్న ఆ బిలంలో గుర్రాన్ని నడిపిస్తుంటే, ఆ వేగానికి నా మగడు భయపడసాగాడు. నా నడుము వదలకుండా పట్టుకుని.. ‘కుయ్యో! మొర్రో!’ అని కేకలు పెట్టసాగాడు. అతణ్ని సముదాయిస్తూ, ఎన్నిరోజులు ఆ బిలమార్గంలో ప్రయాణించామో తెలియదు. చివరికి నిన్నటి సాయంకాలానికి అదిగో ఆ కొండ శిఖరంపైన గుహమార్గం అంతమైంది. అక్కడున్న ఒక విచిత్ర కవాటం తెరిచి, మేమిద్దరం బయటపడ్డాం. నాకు దొరికిన పుస్తకంలో ఇంకా చాలా వివరాలున్నాయి. కానీ, అవన్నీ చదివి తెలుసుకునే ఓపిక లేక గుహకు పక్కనే ఒకచోట దాచిపెట్టాను. ఆ తరువాత మెల్లగా శిఖరంపైనుంచి కిందికి దిగాం. ‘శత్రువుల చేతికి మాత్రం చిక్కకుండా బయటపడ్డాం కదా!’ అని హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. కొండదిగినా గుర్రం దిగకుండా రాత్రంతా గడిపాం. తెల్లవారుతూనే ఒక భయంకరమైన సింహగర్జన వినిపించింది. అది విని, నా గుర్రం బెదిరింది. నేనెంత కళ్లెం బిగబట్టినా ఎగిరెగిరి పడుతూ అతివేగంగా పరిగెత్తసాగింది. మొదటిగంతులోనే నా మగడు కెవ్వున కేకపెడుతూ, దబ్బుమంటూ గుర్రంమీంచి జారిపడ్డాడు. ఆయన పడిపోయిన వేగానికి ఇంకా బతికి ఉంటాడని ఆశ లేదు. బహుశా ఆయన ఈపాటికి స్వర్గసుఖాలు అనుభవిస్తూ ఉండవచ్చు. దైవం వంటి పెనిమిటిని చేజేతులా చంపుకున్న పాపాత్మురాలిని నేను. ఆ దుఃఖంలోనే కంఠానికి ఉరిపెట్టుకోబోతుంటే మీ భటులు వచ్చి కాపాడారు”.. .. అని విశాలాక్షి తన కథ చెప్పడం పూర్తిచేసింది.
* * *
అంతా ప్రశాంతంగా విన్న ఇంద్రద్యుమ్నుడు..
“తల్లీ! ఎన్ని కష్టాలుపడ్డా చివరికి నువ్వు మాకు దక్కావు. అదే చాలు. నీ మగడు క్షేమంగానే ఉండి ఉంటాడని నీ ముఖం చూస్తేనే తెలుస్తున్నది. నువ్విక్కడే మీ పెద్దమ్మవద్ద విశ్రాంతి తీసుకో. నేను వెళ్లి మీ ఆయనను వెతికి తీసుకొస్తా” అని బయలుదేరాడు.
విశాలాక్షి చెప్పిన గుర్తుల ప్రకారం కింశుకశాస్త్రి గుర్రం పైనుంచి జారిపడ్డ చోటును వెతుక్కుంటూ వెళ్లాడు. అక్కడెవరూ కనిపించలేదు. వాళ్లద్దరూ దిగివచ్చిన కొండపైకి ఎక్కాడు. గుహ పక్కనే విశాలాక్షి దాచి ఉంచిన పుస్తకం కంటబడింది. దానిని జాగ్రత్తగా తన రొంటిన దోపుకున్నాడు. విశాలాక్షి వచ్చివెళ్లిన తరువాత, మళ్లీ ఎవరూ ఆ గుహ తలుపులు తెరిచిన జాడ కనిపించలేదు. దాంతో కొండ దిగివచ్చి, అడవిలో ఎన్ని రోజులు తిరిగాడో తెలియదు. అప్పుడతనికి ఒక కోయగూడెం కనిపించింది. అక్కడివారిని విశాలాక్షి మొగడి గురించి వాకబు చేశాడు.
“ఆ అయ్యగోరు చూడ్డానికి చాలా మెతక మనిషిలాగా ఉంటాడు గానీ, అంతలావు సింహాన్ని ఒక్కేటున చంపేసినాడు మారాజా!” అని చెప్పారు వాళ్లు.
“ఏడీ.. ఎక్కడున్నాడు?” ఆత్రంగా అడిగాడు రాజు.
“ఇంకా ఇక్కడెందుకు ఉంటాడు?! అప్పుడే పది రోజులైంది వెళ్లిపోయి” అన్నారు వాళ్లు.
.. అంటే తాను విశాలాక్షి మగణ్ని వెతుక్కుంటూ వచ్చి అప్పుడే పది రోజులైపోయాయి. అక్కడ మహారాణి, తన సేనలు, విశాలాక్షి ఏమయ్యారో ఏమిటో.. అనుకుంటూ ఇంద్రద్యుమ్నుడు తిరిగి ఆ ప్రాంతానికి మళ్లాడు. అక్కడెవరూ లేరు. గూడెం ఖాళీగా ఉంది. కొంతసేపు అక్కడే తచ్చాడుతుండగా.. ఒక చెట్టుమీద నుంచి, “మహారాజా!” అని కేక వినిపించింది. పైన ఒక భటుడు ప్రాణభయంతో కనిపించాడు.
“మరేం భయం లేదు. ఆ సింహం చచ్చింది. ఇక చెట్టు దిగిరారా!” అన్నాడు ఇంద్రద్యుమ్నుడు.
చెట్టుదిగిన భటుడు.. “మహారాజా! మీరటు వెళ్లగానే సింహం ఇలా వచ్చింది. మన సేనలన్నిటినీ చెల్లాచెదురు చేసింది. మనవాళ్లు కొందరు మహారాణిగారికి రక్షణగా నిలిచి రాజధానికి తీసుకువెళ్లారు. నన్ను మీరొచ్చేదాకా ఇక్కడే కనిపెట్టుకుని ఉండమని చెప్పి వెళ్లారు” అని చెప్పాడు.
“విశాలాక్షి క్షేమమే కదా!” అడిగాడు మహారాజు.
“ఆ గలాభాలో ఆవిడగారు ఏమైందో తెలియదు ప్రభూ!” అని చెప్పాడు భటుడు.
“సరే! నువ్వు కూడా రాజధానికి వెళ్లిపో. నేను విశాలాక్షి ఎక్కడుందో వెతుకుతాను” అంటూ బయలుదేరాడు మహారాజు. అడవి మార్గం వెంట అనేక కోయగూడేలు, గ్రామాలు వెతుకుతుండగా ఆరునెలల కాలం గడిచిపోయింది. అరణ్యమార్గాలు విడిచిపెట్టి పట్టణాలు, నగరాలను శోధించడం మొదలుపెట్టాడు. అలా మరో ఆరునెలల కాలం గడిచిపోయింది. చివరికి అతనికి సముద్రతీరం కనిపించింది. దూరంగా ఒక పట్టణం ఉన్నట్లు గోచరించింది. అప్పుడు అక్కడ కనిపించిన ఒక మనిషిని ఆపి, “అయ్యా! ఈ దేశం పేరేమిటి? ఈ పట్టణం ఎవరిది? ఇక్కడి రాజధర్మాలు ఎటువంటివి? ప్రజలు ఎటువంటివారు?” అని ప్రశ్నించాడు ఇంద్రద్యుమ్నుడు.
అందుకా కొత్తవ్యక్తి.. “అయ్యా! ఇది మలయాళదేశం. దీనిని సంవత్సరకాలం నుంచి చండవర్మ అల్లుడు సింహకేతుడు పాలిస్తున్నాడు. ఈ దేశంలో స్త్రీల పెత్తనం అధికం. ప్రజలంతా శక్తి ఆరాధకులు. విదేశస్థులు ఎవరైనా కంటబడితే, ఈ నవరాత్రి దినాలలో అమ్మవారికి బలిచ్చేస్తుంటారు. కొత్తరాజు వచ్చిన తరువాత ఈ సంవత్సరం నుంచి బలుల్ని నిషేధించాడు. విదేశీయుల కోసం ఒక సత్రం వేయించాడు. మీరు బస చేయదలుచుకుంటే అక్కడికి వెళ్లండి. ఇక్కడి స్త్రీలు మహామోసగత్తెలు. వాళ్లమాయలో పడబోకండి” అని హెచ్చరించి అక్కడినుంచి వెళ్లిపోయాడు.
ఇంద్రద్యుమ్నుడు పట్టణంలోకి ప్రవేశించాడు. విశాలమైన వీధులు, ఆకాశాన్ని అంటే మేడలతో ఆ పట్టణ ఐశ్వర్యం చూస్తుంటే కుబేరుని అలకాపురిని తలపిస్తున్నది. చుట్టూ అన్నీ మేడలే కానీ, ఒక్క గుడిసె కూడా కనిపించలేదు. పట్టణంలోని వింతలన్నీ చూస్తూ ఇంద్రద్యుమ్నుడు బాట వెంట నడువసాగాడు.
మధ్యలో ఒకరిని.. “అయ్యా! విదేశీయులు బసచేసే సత్రం ఎంత దూరంలో ఉంది?” అని ప్రశ్నించాడు.
అందుకతడు బదులిచ్చేలోపుగా దాపునే ఉన్న ఒక ఇంటినుంచి ఒక వాలుకళ్ల వయ్యారి భామిని ఇంద్రద్యుమ్నుని ముందుకొచ్చింది.
“అయ్యా! ఇటురండి. తమరు పరదేశస్థులు కాబోలు. మీరడిగే సత్రం చాలాదూరంలో ఉంది. ఈ రాత్రికి మా ఇల్లు పవిత్రం చేసి, ఉదయాన్నే పోవచ్చు. మీ మనసుకు నచ్చే విందులు చేస్తాను” అని పిలిచింది.
ఆమె పలుకులు విని వెరగుపడుతూ.. ‘ఈ చిన్నది మర్యాదస్థురాలిగా కనిపిస్తున్నది. ఇంత చక్కటి సౌందర్యవతి అయినప్పటికీ గర్వం లేకుండా నాకు అతిథి మర్యాదలు చేస్తున్నది. కొందరు మందమతులు ఇంటికి వచ్చిన బంధువులకు సైతం తగినరీతిన సత్కారం చేయరు. ఇటువంటి సాధ్వి అయిన భార్యవల్ల కదా యజమానునికి కీర్తి వచ్చేది’ అనుకున్నాడు.
ఆమెతో మాత్రం.. “సుందరీ! నేనిక్కడ ఆగలేను. సత్రానికి పోవాల్సి ఉన్నది” అని చెప్పి ముందడుగు వేశాడు. అలా కొంతదూరం వెళ్లాక మళ్లీ దారి కనుక్కోవడం కష్టమైంది. ఈసారి మరో కాంతామణి ఎదురుపడి, తన ఇంటికి ఆహ్వానించింది. ఆమె ఆహ్వానించిన తీరు చూసిన ఇంద్రద్యుమ్నుడు తికమక పడ్డాడు.
‘ఇక్కడి స్త్రీలెంతో మర్యాదస్థుల్లా కనిపిస్తున్నారు. ఎందుకోగానీ, ఆ టక్కరి బాటసారి నాతో అన్నీ అబద్ధాలే చెప్పాడు. అతడెందుకు చెప్పాడో తెలియదు. ఎందుకైనా మంచిది, సత్రానికే పోదాం’ అనుకున్నాడు.
అలా దారి అడుగుతూ వెళుతున్న సమయంలో వరుసగా ముగ్గురు స్త్రీల అభ్యర్థనలను మహారాజు తిరస్కరించాడు. చివరికి ఒకానొక స్త్రీ తన ఇంటికి రమ్మని బతిమాలిన తీరు చూసి, కాదనలేక ఆమె ఇంట ఆతిథ్యం తీసుకోవడానికి అంగీకరించాడు. ఆమెతో వెళ్లాడు. పరిచారికలు బంగారు కలశాలతో నీళ్లు తెచ్చారు. కాళ్లు కడుక్కునే ముందు, ఇంద్రద్యుమ్నుడు తన వద్దనున్న విశాలాక్షి కోట రహస్యాలు గల పుస్తకాన్ని చావడి గుమ్మంపై ఒక అరలో ఉంచాడు. అనంతరం అతణ్ని ఆహ్వానించిన చిన్నది అతణ్ని మేడమీదికి తీసుకుపోయింది. ఒక బంగారు పీటపై కూర్చోబెట్టింది. రాజోచితమైన ఉపచారాలు చేసింది. పిమ్మట కమ్మని భోజనం పెట్టించింది.
“ఆర్యా! నెమ్మదిగా భుజించండి. ఎక్కువ కూరలు లేవు. పొద్దుపోవడం చేత తమకు తగినంత ఏర్పాట్లు చేయలేకపోయాను” అంటూ విసనకర్రతో విసురుతూ, మధ్యమధ్య తానే నెయ్యి వడ్డించసాగింది.
ఇంద్రద్యుమ్నుడు మొహమాట పడుతూనే భోజనం పూర్తి చేశాడు. పరిచారికలు పడకటింటికి తీసుకుపోయారు. ఇంతలో ఆతిథ్యమిచ్చిన మోహనాంగి కర్పూర తాంబూలంతో వచ్చింది. అతనికి అందించి, కొంతసేపు వీనులవిందుగా వీణావాదనం చేసింది. నిద్రకు కన్నులు కూరుకుపోతుండగా రాజు వద్దకు చేరి..
“చాలా దూరం నడిచి వచ్చినట్లున్నారు. బడలిక తీరేలా కాసేపు పాదాలొత్తనా?!” అని అడిగింది.
ఇంద్రద్యుమ్నుడు గబుక్కున కాళ్లు ముడుచుకున్నాడు. “మా దేశంలో పరస్త్రీలను ముట్టుకోకూడదు. ఇంతవరకూ చేసిన ఉపచారాలతో చాలా సంతోషించాను. ఇక నీవు విశ్రాంతి తీసుకో” అన్నాడు.
అప్పుడా చిన్నది.. “ఆర్యా! మీరు చెప్పినట్లే చేస్తాను. మాకు అతిథిని సంతోషపెట్టడం కంటే ఉత్తమ వ్రతం లేదు” అంటూ గదిలో దీపం తగ్గించి, తలుపు వారగా వేసి వెళ్లిపోయింది.
‘ఆహా! ఇంద్రియ వ్యామోహం ఎంత చెడ్డది? విద్వాంసుని సైతం మోసం చేయగలదు కదా!’ అనుకుంటూ రాజు నిద్రకు ఉపక్రమించాడు.
తెల్లవారుతూనే అతడికి మెలకువ వచ్చింది. మంచంమీద నుంచి లేవబోయాడు. కానీ.. కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేసి ఉన్నందువల్ల కదలలేకపోయాడు. కొంతసేపు గింజుకున్నాడు. సంకెళ్లు సడలించే ప్రయత్నం చేశాడు. కానీ లాభం లేకపోయింది.
‘అయ్యయ్యో! ఈ ఊరిలో ఆడవాళ్లు మోసపుచ్చగలరని ఆ బాటసారి ముందే చెప్పాడు. నేనే అతడి మాటలు లక్ష్యపెట్టకుండా కోరి కష్టం తెచ్చిపెట్టుకున్నాను. ఇప్పుడేం చేయగలను?
ఎంత బలం కలిగినదైనా బోనులో పడ్డ సింహం ఏమి చేయగలదు?! ఓహో నవరాత్రి దినాలు దగ్గరలోనే ఉన్నాయి. నన్ను శక్తికి బలిస్తారు కాబోలు. కానిమ్ము. ఎప్పటికైనా తప్పని మరణం ఇహనో ఇప్పుడో రాబోతున్నప్పుడు వగచి లాభమేమి విశాలాక్షిని కనిపెట్టలేకపోయానన్న చింత తప్ప నా జీవితానికి లోటేమున్నది?!’ అనుకున్నాడు.
శత్రుభయంకరుడై, రాజ్యలక్ష్మిచేత వరించబడి, అనేక భోగాలను అనుభవించిన మహారాజు దిక్కులేక బందీగా ఆ ఇంటిలో కాలక్షేపం చేయసాగాడు. ఇదిలా ఉండగా ఒకనాడు, ఆ ఊరిలో ఉన్న శక్తి ఆరాధకులందరూ ఒకచోట కలుసుకున్నారు.
“కొత్త మహారాజు మన నవరాత్రి బలులు సాగనివ్వడం లేదు. మన ఇళ్లన్నీ సోదా చేయిస్తున్నాడు. మంత్రశాస్త్ర గ్రంథాలన్నీ లాక్కున్నాడు. మనం వందమంది బలిపురుషులను బంధించాం. మరో పదమూడుమంది స్త్రీలు కూడా ఉన్నారు. ఈ కొత్తరాజు చేసే సోదాల్లో వీళ్లలో ఎవరైనా రాజభటుల కంటబడితే చాలా ప్రమాదం వస్తుంది. ఇప్పుడేం చేయాలో ఆలోచించాల్సి ఉంది” అన్నాడు గ్రామపెద్ద.
అందుకు ఒక వృద్ధుడు.. “ఇటువంటి రాజులు గతంలో కూడా లేకపోలేదు. దీనికి ప్రతిక్రియగానే మన పూర్వులు ఊరికి సమీపంలోని అడవిలో ఒక పాతాళ గృహాన్ని నిర్మించారు.
అందులో వేయిమంది బందీలను దాచిపెట్టవచ్చు. వీళ్లందరినీ అక్కడ బంధిద్దాం. పరీక్ష దినాలు పూర్తయిన తరువాత క్షేమంగా మళ్లీ మన ఇళ్లకు రప్పించుకోవచ్చు” అని సలహా చెప్పాడు. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఒకనాటి రాత్రి బందీలందరినీ పాతాళ గృహానికి చేర్చారు.
(వచ్చేవారం.. విశాలాక్షి కల)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu Episode 21 ( కాశీ మజిలీ కథలు ) | విశాలాక్షి మొగుడు
Kasi Majili Kathalu Episode 20 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు – 2
Kasi Majili Kathalu Episode 19 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు
Kasi Majili Kathalu Episode 17 ( కాశీ మజిలీ కథలు ) | చిత్రసేన
Kasi Majili Kathalu Episode 16 ( కాశీ మజిలీ కథలు ) | శరభసాళువం
Kasi Majili Kathalu Episode 15 ( కాశీ మజిలీ కథలు ) | దైవమిచ్చిన భార్య