Kasi Majili Kathalu Episode 18 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాంచీపుర యువరాజు కామపాలుడు, మంత్రికుమారుడు బుద్ధిసాగరుడు ప్రాణస్నేహితులు. దేశాటనలో భాగంగా.. సుగుణావతిని బుద్ధిసాగరుడు, పద్మావతిని కామపాలుడు వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కామపాలుడు అనుకోకుండా చిత్రసేన ప్రేమలో పడ్డాడు. ఆమె తండ్రిని మోసపుచ్చి చిత్రసేనను పెళ్లాడాడు. పెళ్లి తరువాత మళ్లీ కొంతకాలం మిత్రులిద్దరూ దేశాటన సాగించారు. చివరికి శ్రీరంగపురం వస్తుండగా దారిమధ్యలో రెండు పక్షులు.. కామపాలునికి ఏర్పడబోయే నాలుగు గండాల గురించి చెప్పుకోసాగాయి. వాటి మాటలను బుద్ధిసాగరుడు విన్నాడు.
మిత్రులిద్దరూ శ్రీరంగపురం చేరుకున్నారు. ముందుగా కబురు చేయకపోవడం వల్ల అల్లుణ్ని స్వాగతించడానికి మహారాజు ప్రత్యేక ఏర్పాట్లేమీ చేయలేదు. కామపాలుడు ఉత్సాహంగా ముందడుగు వేస్తుంటే, బుద్ధిసాగరుడు సింహద్వారంపైనే దృష్టిని కేంద్రీకరించాడు.
అప్పటివరకూ సాధారణంగానే ఉన్న ద్వారబంధం ఒక్కసారిగా ఫెళఫెళమంటూ విరిగిపడిపోయింది. అప్రమత్తంగా ఉన్నందువల్ల, బుద్ధిసాగరుడు ఒక్క ఉదుటున కామపాలుణ్ని వెనకనుంచి తోసేశాడు. దాంతో కామపాలునికి ప్రాణగండం తప్పింది.
“మిత్రమా! నేను చూసుకోనేలేదు సుమా! ఈ ద్వారం పడిపోతుందని ఎలా ఊహించగలిగావు?” అని అడిగాడు కామపాలుడు ఆశ్చర్యంగా.
“ఎందుకో.. నా మనసుకు అలా అనిపించింది. నీ సంగతేమో కానీ కామపాలా! నాకు మాత్రం చాలా భయం వేస్తున్నది. ఇంకా గుండెదడ తగ్గలేదు. ఎందుకైనా మంచిది. ఈ ఒక్కరోజుకూ నువ్వు నన్ను విడిచిపెట్టి ఉండకు. నా చెయ్యి గట్టిగా పట్టుకో” అని బేలతనం కనబరిచాడు బుద్ధిసాగరుడు. అందుకు కామపాలుడు చిరునవ్వు నవ్వుతూ.. “నాకింకేమీ కాదయ్యా! ఫరవాలేదు” అన్నాడు.
ఇంతలో లోపలినుంచి రాజపరివారం వచ్చింది. కామపాలునికి దిష్టితీసి లోనికి తీసుకువెళ్లారు. పద్మావతి తన భర్తను స్వాగతించి, ఉచిత సత్కారాలు చేయసాగింది.
మిత్రులిద్దరికీ ఒకేచోట భోజనాలు వడ్డించారు. సరిగ్గా కామపాలుడు భోజనం మొదలుపెడుతుండగా.. “అన్నా! నాకు మొదటిముద్ద పెట్టవా?!” అని అడిగి తీసుకున్నాడు బుద్ధిసాగరుడు.
కామపాలుడు నవ్వుతూ అన్నంముద్ద అతడి చేతిలో ఉంచాడు. బుద్ధిసాగరుడు దానిని తినకుండా జాగ్రత్తగా దాచి పెట్టాడు. ఆ విధంగా.. తొలిముద్దలో చేపముల్లు గొంతులో ఇరుక్కుని చనిపోవాల్సిన కామపాలునికి రెండోగండం తప్పింది. భోజనాలు పూర్తయ్యాయి.
పద్మావతి తాంబూలపు పళ్లెం తీసుకువచ్చి మిత్రులిద్దరి ముందుపెట్టింది. భర్తకు తానే స్వయంగా చిలక చుట్టి ఇచ్చింది.
“మిత్రమా! ఈ తాంబూలం నాకు కావాలి. నీవు మరొకటి తీసుకో!” అంటూ బుద్ధిసాగరుడు ఆ తాంబూలాన్ని చొరవగా తీసుకుని వేరుగా దాచిపెట్టాడు. అలా తమలపాకులో పురుగు తిని మరణించాల్సి ఉన్న కామపాలునికి మూడోగండం కూడా తప్పిపోయింది.
నిద్రా సమయం ఆసన్నమైంది. “అన్నా! ఈవేళ నాకెందుకో ఒళ్లు బరువుగా ఉంది. ఇందాకటి భయం కూడా ఎక్కువ అవుతున్నది. ఈ ఒక్కరాత్రికీ నీ పక్కనే పడుకోవాలని ఉంది. కానీ భార్యను విడిచి, నాతో కలిసి ఉండమని చెప్పడానికి నోరు రావడం లేదు. అంచేత నీ గదికి బయటే నాకొక మంచం వేయించు. ఒకవేళ మధ్యరాత్రి భయంవేస్తే నిన్ను పిలవడానికి వీలుగా ఉంటుంది” అన్నాడు బుద్ధిసాగరుడు.
“నేను తోటలో నిద్రలేచింది మొదలు నీ ముఖం పరీక్షిస్తూనే ఉన్నాను. దేనికోగానీ చాలా భయపడుతున్నావు. సరే నీవు చెప్పినట్లే చేద్దాం” అని కామపాలుడు నవ్వాడు. తన భార్య పద్మా
వతితో చెప్పి, దైవజ్ఞులను రప్పించి బుద్ధిసాగరునికి విభూతి పెట్టించాడు.
మిత్రులిద్దరికీ పక్కలు ఏర్పాటయ్యాయి.
ఇప్పటివరకూ ఆ పక్షి చెప్పినవన్నీ చెప్పినట్లే జరిగాయి. ఈ ఆఖరి జోస్యం కూడా నిజం కావచ్చు. దాని మాటలను బట్టి, కామపాలుడు భార్య చేతిలో మరణించక తప్పదు. అందువల్ల బుద్ధిసాగరుడు నిద్రపోకుండా పక్షి వాక్యాలను స్మరించుకుంటూ కూర్చున్నాడు. మధ్యమధ్యలో లోపలి నుంచి ఏదైనా అలికిడి వినిపిస్తుందేమోనని చెవివేసి వింటున్నాడు. కొద్దిసేపు ఆలుమగలిద్దరూ కుశల ప్రశ్నాదికాలతో కాలక్షేపం చేశారు.
“ప్రయాణ బడలిక అధికంగా ఉంది. ఈవేళ తొందరగా నిద్రపోతాను” అన్నాడు కామపాలుడు. “సరే స్వామీ!” అన్నది పద్మావతి.
గదిలో దీపం తగ్గించి ఉన్నది. ‘నా మిత్రుడు కామపాలుడు, భార్యచేతిలో ఎలా మరణిస్తాడో? అతణ్ని ఎలా రక్షించుకోవాలో?!’ అని ఆలోచించుకుంటూ.. గది కిటికీ నుంచి లోపల ఏం జరుగుతున్నదో గమనించసాగాడు బుద్ధిసాగరుడు.
గదిలో కామపాలుడు చిన్నగా గురక తీయడం ఆరంభించాడు. అతని పక్కనే శయనించిన పద్మావతి చప్పుడు చేయకుండా మంచం దిగింది. గదిలో ఓమూలగా ఉన్న బొమ్మకు కింద ఉన్న మీటను తిప్పింది. అక్కడో తలుపు తెరుచుకుంది. ఆ తలుపు వెంట పద్మావతి లోపలికి వెళ్లింది.
వెనువెంటనే బుద్ధిసాగరుడు ఆ గదిలోకి వచ్చాడు. పద్మావతి వెళ్లిన దారిలో తానూ నడవసాగాడు. అదో నేలసొరంగం. చీకటిగా ఉన్న ఆ సొరంగంలో నడవగా నడవగా అది ఓ బుట్టలు అల్లుకునేవాడి ఇంటికి వెళ్లింది.
* * *
ఆ ఇంట్లోని కుక్కిమంచంమీద ఓ మనిషి నిద్రపోతున్నాడు. బుద్ధిసాగరుడు ఓ మూలగా నక్కి, అక్కడేం జరుగుతున్నదో గమనించసాగాడు. పద్మావతి ఆ మనిషిని తట్టి లేపింది. వాడు లేస్తూనే పద్మావతిని చాచి ఒక చెంపదెబ్బ కొట్టాడు. “ఏమే దౌర్భాగ్యురాలా! తిండి తీసుకువస్తానని చెప్పి, ఇంత ఆలస్యం చేశావేం?! నేను ఆకలితో చచ్చిపోవాలనా?!” అన్నాడు.
పద్మావతి ఉబికివస్తున్న కన్నీటిని ఓ చేతితో తుడుచుకుంటూ.. “అనుకోకుండా నా మగడు వచ్చాడు. ఎంతగా ఇష్టం లేకున్నా కట్టుకున్నవాడు కదా! అతడు నిద్రించే వరకూ వేచి చూడాల్సి వచ్చింది” అంటూ తాను తెచ్చిన ఫలహారాలు వాడిముందు పెట్టింది.
ఆ పళ్లేన్ని ఆబగా అందుకుని.. “నేరక కొట్టేశాను. ఏమనుకోకేం!” అన్నాడు వాడు.. ఒక్కొక్క పదార్థాన్ని ఇష్టంగా తింటూ. పద్మావతి ఏమీ మాట్లాడకుండా అతని పక్కన కూర్చుంది.
“నొప్పి పుట్టిందా?” అన్నాడు వాడు ఆమె బుగ్గ నిమురుతూ. “ఒకవేళ మా ఆయన తనతో తీసుకుపోతాడేమోనని భయంగా ఉంది” అన్నది పద్మావతి దిగులుగా.
“ఎప్పటికైనా తప్పదు కదా! ఒకపని చేయ్. వాడు నీ గదిలోనే ఉన్నాడు కదా! ఈ కత్తి తీసుకుపోయి వాడి తల నరికేయ్” అన్నాడు కత్తిని పద్మావతి చేతికి అందిస్తూ.
పద్మావతి కత్తిని అందుకుని, బయలుదేరింది. అప్పటివరకూ ఆ ఇంటిలో నక్కి ఉన్న బుద్ధిసాగరుడు ఆమె వెనుకనే బయలుదేరాడు. అలవాటైన దారికనుక పద్మావతి గబగబా నడవసాగింది. ఆ చీకటిలో బుద్ధిసాగరుడు కొంచెం వెనుకపడ్డాడు. సరిగ్గా అదే ప్రమాదానికి కారణం అయ్యింది.
ముందుగా మందిరానికి చేరుకున్న పద్మావతి, కత్తితో కామపాలుని శిరస్సు ఖండించింది. వెనువెంటనే తనగదిలో కనిపించిన బుద్ధిసాగరుని చూసి కంగుతిన్నది. వెనువెంటనే సర్దుకుని, తన జుట్టు చెరుపుకొని, వస్ర్తాలు చింపుకొని బిగ్గరగా అరవసాగింది. మిత్రుని మరణాన్ని కళ్లారా చూసిన బుద్ధిసాగరుడు చేష్టలు దక్కి, శిలలా మారిపోయి ఉన్నాడు. అక్కడేం జరుగుతున్నదో అతడికి తెలియడం లేదు. కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తున్నాడు.
పద్మావతి అరుపులు విన్న రాజపరివారం మేల్కొంది. బుద్ధిసాగరుడే తన మిత్రుణ్ని చంపి, పద్మావతిని చెరబట్టబోయాడని అపార్థం చేసుకున్న శ్రీరంగపురం మహారాజు.. అతడికి మరణశిక్ష విధించాడు. వెనువెంటనే అతణ్ని వధ్యశిలకు తీసుకుపోయారు. మరొక్క క్షణంలో మెడపై కత్తివేటు పడబోతుందనగా అతడికి ఒంటిమీద తెలివి వచ్చింది. మొదటినుంచి బుద్ధిసాగరుని వైనాన్ని గమనిస్తున్న తలారి..
“బాబూ! నీ ముఖం చూస్తుంటే తప్పుచేసినట్లు అనిపించడం లేదు. నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే చెప్పుకో. నేను కాసేపు ఆగుతాను” అన్నాడు. బుద్ధిసాగరుడు ఒక్కక్షణం ఊపిరి తీసుకుని విడిచిపట్టాడు.
“సరే.. ప్రాణమిత్రుడే మరణించిన తరువాత నాకెలాగూ ప్రాణాలపై ఆశలేదు. కానీ ఈ నిందమోసి, ఎందుకు చావాలి? నన్ను మీ మహారాజు దగ్గరికి తీసుకుపో” అని కోరాడు.
మహారాజు ముందు పద్మావతి చేసిన నేరాన్ని నిరూపించాడు బుద్ధిసాగరుడు. తన కూతురి దుష్ప్రవర్తన గురించి విని, కళ్లారా చూసిన మహారాజు కుమిలిపోయాడు. అటుపై బుద్ధిసాగరుడు ఎంతచెప్పినా వినకుండా నేరస్థులిద్దరినీ ఉప్పుపాతర వేయించాడు.
ఆ తరువాత..
“ఏ నేరమూ చేయని నిన్ను అన్యాయంగా వధించబోయాను. నన్ను మన్నించు” అన్నాడు బుద్ధిసాగరుని చేతులు పట్టుకుని.
“మహారాజా! నా మిత్రుని శవం కుళ్లిపోకుండా రసాయనాలతో నింపి, ఒక పెట్టెలో పెట్టి ఇస్తే సంతోషిస్తాను” అని అడిగాడు బుద్ధిసాగరుడు. మహారాజు అలాగే చేయగా ఆ పెట్టెను తీసుకుని, బుద్ధిసాగరుడు శ్రీరంగపురం నుంచి బయలుదేరాడు. ముందుకు నడుస్తూ ఉండగా, ఎందుకో అతడికి తన భార్య ప్రవర్తన ఎటువంటిదో కూడా తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. వెంటనే తన ప్రయాణాన్ని అత్తవారింటి వైపు సాగించాడు. రెండురోజుల ప్రయాణంతో మధ్యార్జునం చేరుకున్నాడు.
చాలాకాలం తరువాత భర్తను చూసిన ఆనందంలో సుగుణావతి అతడికి, తగిన మర్యాదలు చేసింది. బుద్ధిసాగరుడు మామగారితో కలిసి భోజనాదికాలు ముగించి, పెట్టెతో సహా అంతఃపురానికి చేరుకున్నాడు.
సుగుణావతి అతడి పాదాలు కడిగి, శిరస్సున చల్లుకుంది. తడి ఒత్తి, వినయంగా చేయి అందించి.. శయ్యపైకి చేర్చింది.
బుద్ధిసాగరుడు అలసినవాడి వలె, నిద్రకు ఉపక్రమించాడు. సుగుణావతి అతడికి పాదాలు ఒత్తుతూ కబుర్లు చెప్పసాగింది.
“నాథా! మీరు మరో పదిదినాలు ఆలస్యం చేసివుంటే నాకు మరణమే దిక్కయ్యేది” అన్నది.
కపటం లేని ఆమె ప్రేమను బుద్ధిసాగరుడు శంకిస్తున్నాడు. అందువల్లనే భార్యను ప్రేమగా దగ్గరికి తీసుకోలేక పోతున్నాడు. ఆమెను పరీక్షించడంలో భాగంగానే నిద్రపోతున్న వాడివలె
నటించసాగాడు.
కొంతసేపు భర్తకు సపర్యలు చేసిన తరువాత, సుగుణావతి మెల్లిగా మంచం దిగింది. ఒక పళ్లెంలో పళ్లు, పూలు వంటివి పెట్టుకుని, తలుపు తీసుకుని ఇల్లు దాటింది. చీకటిలో ధైర్యంగా నడుస్తూ ఊరి చివరికి చేరుకుంది. బుద్ధిసాగరుడు అనుసరిస్తూ ఉండగా, ఆమె చండీ ఆలయంలోకి ప్రవేశించింది.
* * *
తాను తీసుకువచ్చిన పళ్లు, పూలు దేవి ముందు పెట్టి..
“అమ్మా! నీ మహిమలు అవాఙ్మానస గోచరములు. నేను కోరినట్లుగానే నా భర్తను తిరిగి రప్పించావు. ఇక నీ మొక్కు చెల్లించుకో” అంటూ ఒక కత్తి తీసుకుని, తన శిరస్సును తానే తెగ నరుక్కోబోయింది.
అప్పుడు ఉన్నట్లుండి దేవి ప్రత్యక్షమైంది.
“సాధ్వీ! నీ సాహసం మానుకో! నీ సత్యవ్రతానికి మెచ్చుకుంటున్నాను. కపటం లేని నీ భక్తికి నేను ఆనందించాను. ఏదైనా వరం కోరుకో. నెరవేరుస్తాను” అన్నది.
సుగుణావతి అమాయకంగా..
“తల్లీ! నా భర్తను క్షేమంగా తిరిగి రప్పించమని నిన్ను కోరాను. అది నువ్వు నెరవేర్చావు. ఇకపైన ఏమైనా కోరవలెనంటే నా భర్త అనుమతి కావాలి. నువ్వు కొద్దిగా సమయం ఇస్తే.. ఆయన వద్దకు వెళ్లి, ఏం కోరుకోవాలో కనుక్కుని వస్తాను” అన్నది.
అమ్మవారు ఆమెకు అనుమతించింది.
జరుగుతున్నదంతా దూరం నుంచి గమనిస్తున్న బుద్ధిసాగరుడు త్వరత్వరగా నడిచి, భార్యకంటే ముందుగా అంతఃపురానికి చేరుకున్నాడు. నిద్రపోతున్నట్లు నటించసాగాడు. వెనుకనే గదిలో ప్రవేశించిన సుగుణావతి, భర్తకు నిద్రాభంగం కలిగించడానికి ఇబ్బంది పడసాగింది. అది కనిపెట్టి, బుద్ధిసాగరుడు అప్పుడే మేల్కొన్నవానిలా లేచి కూర్చున్నాడు.
సుగుణావతి జరిగినదంతా భర్తకు విన్నవించింది. అందుకు బుద్ధిసాగరుడు..
“వనితా! మనకు ధనకనక వస్తువాహనాలన్నీ ఉన్నాయి. కనుక కొంత మంచి కోరిక కోరుకుందాం. నీవు చేయివేస్తే చచ్చినవారు బ్రతకాలని అమ్మవారిని కోరుకో” అన్నాడు.
సుగుణావతి అలాగేనంటూ తిరిగివెళ్లి అమ్మవారి సన్నిధిలో నిల్చున్నది. భర్తమాటను తు.చ. తప్పకుండా వల్లించింది.
“చచ్చిన అందరినీ నీవు చేయివేస్తే బతికేలా చేయగలిగే శక్తి నాకు లేదు. కానీ, ఒక్కసారి మాత్రం అలాగే జరుగుతుంది” అని చండీదేవి సెలవిచ్చింది.
వరం పుచ్చుకుని, సుగుణావతి ఆలస్యం చేయకుండా భర్తవద్దకు వచ్చింది.
అప్పుడు బుద్ధిసాగరుడు..
“సుదతీ! నీకోసం ఓ గొప్ప బహుమానం తెచ్చాను. ఆ పేటికలో దాచి ఉంచాను. తీసుకో” అన్నాడు.
సుగుణావతి సరేనంటూ పెట్టెలో చేయిపెట్టింది. అంతే.. తల, మొండెం వేరుపడి చచ్చి శవమైన కామపాలుడు.. నిద్రనుంచి మేల్కొన్నవాడి వలె లేచి కూర్చున్నాడు.
ఎదురుగా కనిపించిన సుగుణావతిని వెంటనే పోల్చుకోలేక.. ఆ పక్కనే బుద్ధిసాగరుని చూసి..
“మిత్రమా! మనం ఎక్కడున్నాం? ఇక్కడికెలా వచ్చాం?!” అని అడిగాడు.
“అన్నా! అదో పెద్దకథ” అంటూ.. తాను పక్షిమాటలు వినడం మినహా, జరిగినదంతా చెప్పుకొచ్చాడు. అదంతా విన్న తరువాత కామపాలుడికి పద్మావతి క్రూరత్వం తెలిసివచ్చింది. దాంతో ఎక్కడలేని వైరాగ్యం ముంచుకొచ్చింది.
“మిత్రమా! ఆమె కథ అలాగైంది. ఇక నా రెండోభార్య చిత్రసేన కూడా అటువంటిదే కాబోలు కదా!” అన్నాడు.
“ఛీఛీ అలాగనవచ్చునా?! కూతురి మనోభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఆమెను వీర్యశుల్కంగా ప్రకటించాడు మహారాజు. శరభసాళువాన్ని నిర్జించే వాడికోసం దీర్ఘకాలంపాటు కూతురికి పెళ్లి చేయకుండా విడిచిపెట్టేశాడు. ఆమె కట్టుతప్పిపోయిందంటే అది ముమ్మాటికీ ఆ తండ్రి తప్పే. ఇక చిత్రసేన మాటంటావా?!.. ఆమె నీకు మనసిచ్చి పుచ్చుకున్నది. అరమరికలు లేక నీతో తన జీవితాన్ని పంచుకున్నది. అటువంటి ఇల్లాలిని అనుమానించడం అన్యాయం” అని చెప్పాడు బుద్ధిసాగరుడు.
మిత్రుని మాటతో కామపాలుడు సమాధాన పడ్డాడు.
“అవునుగానీ మిత్రమా! పద్మావతి నన్ను చంపగలదని నీకెలా తెలిసింది?” అని అడిగాడు.
“అన్నా! ఎందుకో నా మనసుకు అలా అనిపించింది” అని మాత్రమే చెప్పాడు బుద్ధిసాగరుడు.
కామపాలుడు అతిత్వరలోనే కాంచీపురం చేరి, చిత్రసేనను కాపురానికి తెచ్చుకున్నాడు. మరికొంత కాలానికి అతడికి పట్టాభిషేకం జరిగింది. బుద్ధిసాగరుని మంత్రిగా చేసుకుని, చాలాకాలం రాజ్యాన్ని ఏలాడు.
(వచ్చేవారం… చేప ఊరికే నవ్వదు)
అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu Episode 17 ( కాశీ మజిలీ కథలు ) | చిత్రసేన
Kasi Majili Kathalu Episode 16 ( కాశీ మజిలీ కథలు ) | శరభసాళువం
Kasi Majili Kathalu Episode 15 ( కాశీ మజిలీ కథలు ) | దైవమిచ్చిన భార్య
Kasi Majili Kathalu Episode 14 ( కాశీ మజిలీ కథలు ) |ధీమంతుడు
Kasi Majili Kathalu Episode 13 ( కాశీ మజిలీ కథలు ) | కీలుగుర్రం -2
Kasi Majili Kathalu Episode 12 ( కాశీ మజిలీ కథలు ) | కీలుగుర్రం