Kasi Majili Kathalu Episode 16 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాంచీపురాన్ని ఏలే విష్ణుచిత్తుడు చాలాకాలం వివాహం చేసుకోలేదు. చిట్టచివరికి పాండ్యరాజు కూతురైనసుశీలను ఒక్కసారైనా చూడకుండా పట్టపురాణిగా చేసుకున్నాడు. కానీ, ఒక కపట గురువు కారణంగా సుశీలను అడవిలో విడిచిపెట్టేశాడు. మంత్రి దీర్ఘదర్శి ఉపాయం వల్ల విష్ణుచిత్తుడు అడవిలో సుశీలను కలుసుకున్నాడు. వాళ్లు తమ గతాన్ని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. హాయిగా కాపురం చేశారు. వారి కుమారుడే కామపాలుడు.
కాంచీపుర యువరాజు కామపాలుడు. అతడికి ప్రాణస్నేహితుడు మంత్రి కుమారుడైన బుద్ధిసాగరుడు. వాళ్లిద్దరూ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తరువాత దేశాటన కోసం బయలు దేరారు. కొన్ని రోజుల ప్రయాణం అనంతరం ద్రవిడ దేశంలోని మధ్యార్జునమనే పట్టణానికి చేరుకున్నారు.
అక్కడో పూటకూళ్లింటికి వెళ్లి, పెందలకడనే స్నానం, భోజనం ముగించారు.
“అవ్వా! ఈపూటకు మేమిద్దరం వీధి అరుగుమీద నిద్రపోతాం. కాస్త దుప్పట్లేమైనా ఉంటే ఇస్తావా?” అని అడిగారు.
ఆమాటకు అదిరిపడిన పూటకూళ్లవ్వ గుండెలమీద చెయ్యి వేసుకుని..
“అమ్మ బాబోయ్” అన్నది.
బుద్ధిసాగరుడు, కామపాలుడు ఆశ్చర్యపోతూ వింటుండగా..
“బాబూ! మీకీ సంగతి తెలియదు కాబోలు. రాత్రిపూట మా ఊరికి ఒక భేరుండపక్షి వస్తుంది. దొరికినవారిని దొరికినట్లు పొడిచి తినేస్తుంది. అందువల్ల వీధిలో నిద్రించడం ప్రమాదం. ఈ
పూటకు మీకు ఇంటిలోపలే పక్కలు ఏర్పాటు చేస్తాను. పరవాలేదు రండి” అన్నది.
ఆమె మాటలు పూర్తిగా ఆలకించిన వారిద్దరూ తేలిగ్గా నవ్వేశారు.
“అవ్వా! మరేం భయం లేదు. మా జోలికి వస్తే ఆ భేరుండ పక్షికే ఆయువు మూడిపోతుంది. మేము వీధిలోనే పడుకుంటాం” అని అవ్వ ఎంత చెప్పినా వినకుండా అరుగు మీద పక్కలు
వేసుకున్నారు.
మధ్యార్జున పట్టణంలోని ప్రజలంతా చీకటి పడటంతోనే ఇళ్లలో దాక్కున్నారు. అర్ధరాత్రి కాగానే అలవాటు ప్రకారం భేరుండపక్షి ఎగురుతూ వచ్చింది. కొట్టాల్లోని పశువులు భయంతో అరుస్తున్నాయి. చెట్లకొమ్మలు పెళపెళమని విరిగి పడుతుండగా అతిపెద్దవైన రెక్కలను అల్లాడిస్తూ భీకరాకారంతో భేరుండం ఆకాశంలో ఎగురుతున్నది. కంటికి నచ్చే కబళం కోసం వెతుకుతున్నది.
కామపాలుడు, బుద్ధిసాగరుడు దాని కంట్లో పడ్డారు. శరవేగంగా వారివైపు దూసుకువచ్చిందది. అప్పుడు బుద్ధిసాగరుడు ఒరనుంచి కటారిని పెరికి, దాని రెక్కలు రెండూ నరికివేశాడు. అటుపై దాని తల తెగవేశాడు. భయంకరంగా అరుస్తూ భేరుండం నేలమీద పడి గిలగిలా కొట్టుకుంటూ కొంతసేపటికి ప్రాణం వదిలింది.
అప్పటికింకా తెల్లవారలేదు.
“అవ్వా! మేము పోయివస్తాం” అని కేకవేసి మిత్రులిద్దరూ ఊరు విడిచిపెట్టి వెళ్లిపోయారు.
వాళ్లు వెళ్లిన కొద్దిసేపటికి, ఆ ఊళ్లో కట్టెలు కొట్టుకుని జీవించే మంగపతి అనేవాడు ఆ దారిలో నడుచుకుంటూ వచ్చాడు. అక్కడ చచ్చిపడి ఉన్న పక్షి వాడి కంట్లో పడింది. వెంటనే వాడి మనసులో ఒక దురుద్దేశం కలిగింది. చేతిలో ఉన్న గొడ్డలితో ఆ పక్షి అవయవాలన్నీ ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టాడు.
అప్పటికి తెల్లగా తెల్లవారింది. ఊళ్లో జనాలంతా పోగుపడ్డారు. మంగపతి భేరుండాన్ని చంపాడన్న వార్త నిమిషాలమీద పాకిపోయింది. మధ్యార్జునాన్ని పాలించే సింహకేతుడనే రాజు స్వయంగా వచ్చి భేరుండాన్ని చూశాడు.
మంగపతిని పిలిపించి..
“ఏరా నిజం చెప్పు! నువ్వే దీన్ని చంపావా?!” అని గంభీరంగా ప్రశ్నించాడు.
“అవును దేవరా!” అన్నాడు వాడు.
“ఇన్నాళ్లూ ఎందుకు చంపలేదు? ఊరుకుని ఏడిశావేం?!” అడిగాడు రాజు.
“ఇన్నాళ్లూ అది నాజోలికి రాలేదండీ. ఈయేళ తెల్లారుతూనే నేను గొడ్డలి పుచ్చుకుని అడవికి బైల్దేరాను. ఆ పక్షి నన్ను చంపడానికి మీదికొచ్చింది. ప్రాణం మీద తీపికొద్దీ గొడ్డలి తీసుకుని దాని తలమీద ఒక్కటేశాను. అది నెత్తి తడుముకుంటుంటే మళ్లీ రెండో దెబ్బకూడా తలమీదే కొట్టాను. దాంతో అది నేలమీద కూలబడింది. అప్పుడు నేనేమో గొడ్డలి తీసుకుని ముక్కలు ముక్కలుగా నరికేశాను” అని తన పరాక్రమగాథను వర్ణించాడు.
ఆ మాటలు వింటూ సింహకేతుడు చింతాక్రాంతుడయ్యాడు. భేరుండ పక్షిని చంపేవాడు సామాన్యుడు కాబోడనే ఉద్దేశంతో..
‘దాన్ని చంపేవాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను’ అని ప్రకటించి ఉన్నాడాయన. ఇప్పుడీ మంగపతికి తన కూతురిని ఇవ్వాల్సిరావడం ఆయనకు చింతా కారణమైంది.
‘ప్రతిజ్ఞా భంగం చేస్తే సరిరాజులు నవ్విపోతారు. ఇప్పుడు అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను, వీడికిచ్చి పెళ్లి చేసినా నవ్వులపాలు కాక తప్పదు. దీనికేదైనా ప్రతిక్రియ చేయాలి’ అనుకుంటూనే పెళ్లి ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించాడు.
యువరాణి పెళ్లివార్త కొద్దిగా ఆలస్యంగా పూటకూళ్లవ్వకు తెలిసింది. ఆమె పరుగుపరుగున రాజు వద్దకు వెళ్లింది. ఆరోజు తనింటికి కామపాలుడు, బుద్ధిసాగరుడు రావడం.. వాళ్లిద్దరూ వీధి అరుగుమీద నిద్రించి తెల్లవారుజామున వెళ్లిపోతూ తనకు చెప్పడం వంటివన్నీ రాజుకు పూస గుచ్చినట్లు వివరించింది.
“నిద్రలో ఉండటం వల్ల నేను సరిగ్గా గుర్తించలేక పోయాను. కానీ, మహారాజా! తప్పకుండా వాళ్లిద్దరే భేరుండపక్షిని సంహరించి ఉండవచ్చు” అని చెప్పింది.
సింహకేతుడు వెంటనే కామపాల, బుద్ధిసాగరులను వెతకడానికి భటులను పంపాడు. రాజభటులు కొద్ది ప్రయత్నంతోనే వాళ్లను కనుక్కోగలిగారు. బుద్ధిసాగరుడే ఆ పక్షిని చంపాడని కామపాలుడు సాక్ష్యం చెప్పాడు. తన కూతురికి తగిన వరుడు లభించాడని సింహకేతుడు సంతోషించాడు. అబద్ధం చెప్పినందుకు మంగపతిని ఉరి తీయమని ఆజ్ఞాపించాడు.
సుగుణావతి బుద్ధిసాగరుల వివాహం అంగరంగ వైభవంగా జరిపించాడు. కొంతకాలం బుద్ధిసాగరుడు సుఖభోగాలను అనుభవించాడు. అటుపైన సుగుణావతిని ఒప్పించి, మిత్రులిద్దరూ మళ్లీ దేశాటనకు బయలుదేరారు.
* * *
రాత్రిపూట నగరాన్ని విడిచిపెట్టి అడవి మార్గం పట్టారు మిత్రులిద్దరూ. ఎంతదూరం నడిచినా వారికి ఆవేళ నివాసయోగ్యమైన పట్టణమేదీ కనిపించలేదు.
సాయంకాలం కావస్తుండగా ఆ రాత్రికి అడవిలోనే మజిలీ వేయాలని నిశ్చయించుకున్నారు. తగినచోటుకోసం వెతుకుతూ ఉండగా, ఒక విశాలమైన మర్రిచెట్టు కనిపించింది. దానికింద భూమి అంతా చక్కగా బాగుచేసి ఉంది. ఎక్కడా ఒక్క రాయి కానీ, గడ్డిపరక గానీ లేదు.
‘మనుష్య సంచారం లేనిచోట ఈ ప్రదేశాన్ని ఇంత పరిశుభ్రంగా ఉంచుతున్నది ఎవరై ఉంటారో!?’ అని ఆలోచిస్తున్నంతలోనే చీకటి పడసాగింది. వెంటనే వారిద్దరూ ఒక గుబురుకొమ్మ మీద ఎక్కి కూర్చున్నారు. వెన్నెల విరగ కాస్తున్నది.
కొద్దిసేపటికి అక్కడికి కొన్ని కోతులు, ఎలుగుబంట్లు వచ్చాయి. వాటి చర్యలు అద్భుతంగా ఉన్నాయి. నేలంతా మరోసారి శుభ్రపరిచాయవి. మరికొద్దిసేపటికి ఒక నక్క, దానివెనుక తోడేళ్ల గుంపు, అడవిపందులు జాతికొక్కటి చొప్పున వచ్చి చేరాయి. పరస్పరం విరోధం కలిగిన జంతువులన్నీ నిర్భయంగా వచ్చి, ఆ చెట్టుకింద అన్యోన్యంగా కూర్చుని మాట్లాడుకోసాగాయి.
రాత్రి జాము పొద్దెక్కేసరికి చెట్టుకింద జాగా అంతా జంతువులతో నిండిపోయింది. వాటి నడుమ మూడు జంతువులకు మాత్రమే చోటుంది. మానవుడు, జంతువు, పక్షి కలగలిసిన రూపంతో శరభసాళువం అక్కడికి వచ్చి చేరింది. అనేక కాళ్లు, పంజాలు, వెనుకవైపున విచ్చుకునే రెక్కలు, రెండువైపులా గుర్రపు తోకలతో కనిపించే అద్భుతమైన ఆ పక్షి రాజసంగా కూర్చుంది. మిగిలిన మృగాలన్నీ లేచి దానికి దండాలు పెట్టినట్లుగా ముట్టికాళ్లు వేశాయి.
ఉరుములాంటి గొంతు విప్పి శరభసాళువం మాట్లాడటం మొదలుపెట్టింది. “ఏరా అబ్బాయ్! అందరూ వచ్చినట్లేనా?! అన్నట్లు నా మంత్రి భేరుండం కనిపించదేం?” అన్నది.
అప్పుడు నక్క ఒకటి మెల్లిగా శరభసాళువం పక్కకు చేరింది.
“దేవా! మీ మంత్రిగారు రాత్రిపూట మధ్యార్జునపురానికి వెళ్లి, అక్కడ మనుషుల్ని తినడం బాగా మరిగారు. ఈమధ్య అక్కడికో ఇద్దరు రాజపుత్రులు వచ్చారు. వారిని సామాన్యులనుకుని మంత్రిగారు అలవాటు చొప్పున కలియబడ్డారు. దాంతో వాళ్లలో ఒకడు శూరకత్తి చేతపుచ్చుకుని, మంత్రిగారి పీక తరిగేశారు” అని చెప్పింది.
దానికి శరభసాళువం ముట్టి నేలకు రాస్తూ కొద్దిసేపు క్రోధాన్ని ప్రకటించింది.
“ఈ మనుషులెంత దుర్మార్గులు?! దైవం మనకిచ్చిన తిండిని కూడా కడుపునిండా తిననియ్యరు. అసలు మా భేరుండాన్ని చంపగలిగే మొనగాడు ముల్లోకాల్లోనూ లేడనుకున్నాను. ఎంత పని జరిగింది?! నేను శ్రీరంగపురానికి, మా మంత్రి మధ్యార్జునానికి వెళ్లాలని మేమిద్దరం ఏర్పరుచుకున్న నియమమే! పోనివ్వండి. మధ్యార్జునంలో మనుషుల్నే హాయిగా బతకనివ్వండి. ఏం చేస్తాం?!” అన్నది విచారంగా.
మరికొంత సమయం గడిచింది. ఇందాకటి నక్క మరోసారి గొంతు సవరించుకుంది.
“దేవా! ఏడాదికొక్కసారి మాత్రమే మనమంతా ఇలా కలుసుకుంటాం. కిందటేడాది ఈ సభకు వచ్చినవారిలో కొందరు కనిపించడం లేదు. పై ఏటికి ఎందరు పరలోకం చేరుకుంటారో చెప్పలేం. ఈ తుచ్ఛ మానవులు భయంతోటి, ఆకలితోనూ ఇంకా మనలో ఎంతమందిని చంపుతారో చెప్పలేం. ప్రభూ! మన మృగజాతిలోనే కట్టుబాటు ఉంటే ఈ మనుషులెంత?! కానీ రోజులు అలాలేవు. ఇప్పటివరకూ మీకు భయపడి కొంతలో కొంత నయం అనిపించుకుంటున్నాం. రేపు మీరు కూడా అటోయిటో అయితే.. ఇక మా గతేం కావాలి?!” అని
విచారంగా ప్రశ్నించింది.
ఆ మాటలకు శరభసాళువం పైనున్న మర్రిచెట్టు కూలిపడేలా వికటాట్టహాసం చేసింది.
“ఒరే కుర్రనక్కా! చిచ్ఛీ అవేం మాటలురా! భేరుండమూ నేనూ ఒకటే అనుకున్నావా?!” అని మరికొంతసేపు నవ్వు గర్జనలు సాగించింది.
“నేను ఆషామాషీగా చచ్చేవాడిని కాను. చూడండి. మీరందరూ నాకు ప్రాణంతో సమానం కనుక, చెబుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. ఈ మర్రిచెట్టు తొర్రలో ఒక ఎలుక ఉంటుంది. దానిలో నా ప్రాణాలు దాచిపెట్టాను. దాన్ని చంపితే తప్ప నేను చావను. ఈ చెట్టంతా నరికినా, దాని కలుగును, కలుగులో ఎలుకను పట్టడం కష్టం. కనక నాకేం భయంలేదు.. మరేమీ బెంగ పెట్టుకోకండి” అన్నది.
జంతువులంతా ముట్టికాళ్లు వేసి, శరభసాళువానికి దండాలు పెడుతూ తమ సంతోషాన్ని ప్రకటించాయి. మరికొంతసేపు అఖిల మృగాల సమ్మేళనం కొనసాగింది.
తెలతెలవారుతుండగా ఎక్కడి జంతువులు అక్కడికి సర్దుకున్నాయి. మళ్లీ తిరిగిరావని నిర్ధారించుకున్న తరువాత కామపాలుడు, బుద్ధిసాగరుడు చెట్టుదిగి కిందికి వచ్చారు.
తమతోపాటు తెచ్చుకున్న మిఠాయి ఉండను చెట్టుతొర్రలో జారవిడిచారు. మరో ఉండను పైన చల్లారు. మిఠాయి వాసన పసిగట్టిన ఎలుక బయటికి వచ్చింది. దానిని జాగ్రత్తగా ఒడిసిపట్టి, తాళ్లతో కట్టేశారు.
దారిమధ్యలో కాలకృత్యాలు తీర్చుకుని, శ్రీరంగపురం దిశగా ప్రయాణించారు.
ఇంతకుముందు కథలో అంటే మధ్యార్జునంలో.. రాత్రిపూట ఆరుబయట శయనించి, బుద్ధిసాగరుడు తన కరవాలం చేత భేరుండాన్ని చంపాడు. రాకుమార్తెను చేపట్టాడు.
సరిగ్గా అప్పటిలాగే శ్రీరంగపురంలో తన బుద్ధిబలాన్ని ఉపయోగించి, కామపాలుడు శరభసాళువాన్ని నిర్జించాడు. దాంతో శ్రీరంగపురవాసులకు ప్రాణభయం తొలగింది. హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ పురాధీశుడు తన కుమార్తె అయిన పద్మావతిని కామపాలునికిచ్చి వివాహం చేశాడు. మిక్కిలి చక్కనిదైన పద్మావతితో కామపాలుడు కొంతకాలం స్వర్గభోగాలు అనుభవించాడు.
కానీ, దేశాటనే ప్రథమ ధ్యేయంగా కలిగిన ఆ మిత్రులిద్దరికీ ఎక్కువకాలం శ్రీరంగంలో కాలు నిలవలేదు. పద్మావతికి మాత్రం తెలియచేసి, అక్కడినుంచి బయలుదేరారు.
* * *
ఈసారి వారి మజిలీ చంద్రగుప్తమనే పట్టణానికి చేరింది. అక్కడ కూడా ఎన్నో మలుపులు.
అక్కడో విప్రుని ఇంట బసచేసి, కొన్నిదినాలు ఉన్నారు. ఒకనాటి సాయంకాలం పట్టణ విశేషాలు తెలుసుకోవడం కోసం వీధుల వెంట నడవసాగారు. కోటగోడ వెంబడి అంగళ్లను పరిశీలిస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
ఆ సమయంలో కామపాలుని మేనిపై శుభసూచకంగా ఒక తలవెంట్రుక పడింది. దాన్ని చేతితో కొలిచి చూడగా బారకంటే పెద్దదిగా ఉన్నది. ‘ఇంతచక్కని కురులు కలిగిన తరుణీమణి ఎవరై ఉండవచ్చునోహో’ అని ఊహించుకుంటూ తలపైకెత్తి చూశాడు. అక్కడ పిట్టగోడమీద పట్టణపు రాజు కూతురైన చిత్రసేన సఖులతో కూడి జడ ఆరబెట్టుకుంటున్నది.
యథాలాపంగా ఆమె కూడా కిందికి చూసేసరికి, కామపాలునితో చూపు కలిసింది. ఆ చూపులే పురోహితులై వారిద్దరి మనస్సులకూ బ్రహ్మముడి వేశాయి. ఒకరి సౌందర్యం మరొకరికి వింత సంతోషం కలుగచేసింది.
అప్పుడు కామపాలుడు..
“బుద్ధిసాగరా! అటు చూశావా?! పట్టపగలే చందమామ ఆ మేడమీద కూర్చున్నట్లుంది” అన్నాడు.
“అవును” అన్నాడు బుద్ధిసాగరుడు.
“మనం కొంచెంసేపు ఇక్కడే ఉందాం. మళ్లీ ఆమె చూసే అవకాశం రావచ్చు” అన్నాడు కామపాలుడు. అన్నాడు కానీ, ఎక్కువసేపు వేచిచూడటానికి అతనిలోని మదనతాపం అంగీకరించడం లేదు.
“ఎకాయెకీ మేడమెట్లెక్కి పైకి పోదామా?!” అన్నాడు.. కొంతసేపు ఆగి.
“మరీ అంత తొందరపడబోకు మిత్రమా!” అని అతికష్టంమీద ఆపాడు బుద్ధిసాగరుడు.
వారలా మాట్లాడుకుంటున్నంతలోనే మేడపైనుంచి ఒక పూలదండ సరిగ్గా కామపాలుని మెడలో పడింది. దాంట్లో దాచివుంచిన ఉత్తరంలో ఇలా ఉంది..
“ఆర్యా! నా మనస్సు నీపై లగ్నమైనది. నీ రూపము, ప్రాయము దొంగలవలె నా చిత్తమనే విత్తాన్ని అపహరించాయి. ఆ అపరాధానికి గానూ నీ కాళ్లకు సంకెళ్లు వేయాల్సి ఉంది. నిన్ను చూసింది మొదలు ఇంతవరకూ మన్మథుని పూలబాణాల తాకిడితో నా స్వాంతము సంతాపం చెందుతున్నది. కాలవ్యవధి లేదు. తప్పులుంటే మన్నించు. మా తండ్రి మహా కఠినాత్ముడు. పోతుటీగనైనా పరీక్ష చేయకుండా అంతఃపురంలో చొరబడనీయడు. మనకు రెండే మార్గాలున్నాయి.
నీవు బలవంతుడవైతే నన్ను ఎత్తుకొనిపోయి రాక్షస వివాహం చేసుకో. లేదా రేపు రాత్రి కోటగోడ మీదనుంచి గొలుసు వేసుకుని నేనే నీవున్న చోటుకు వస్తాను. రెండిటిలో ఏమార్గం ఎంచుకుంటావో వెంటనే జవాబివ్వాలి. లేదంటే స్త్రీహత్య చేసిన నేరాన్ని కూడా తమరే మోయాల్సి వస్తుంది”..
ఉత్తరాన్ని కామపాలుడు చదవగా విన్న బుద్ధిసాగరుడు.. “ఆమె చెప్పిన రెండు మార్గాలూ సరైనవి కావు” అన్నాడు.
(వచ్చేవారం.. చిత్రసేన)
అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu Episode 15 ( కాశీ మజిలీ కథలు ) | దైవమిచ్చిన భార్య
Kasi Majili Kathalu Episode 14 ( కాశీ మజిలీ కథలు ) |ధీమంతుడు
Kasi Majili Kathalu Episode 13 ( కాశీ మజిలీ కథలు ) | కీలుగుర్రం -2
Kasi Majili Kathalu Episode 12 ( కాశీ మజిలీ కథలు ) | కీలుగుర్రం
“Kasi Majili Kathalu Episode 11 ( కాశీ మజిలీ కథలు ) | పురుషద్వేషిణి- 2”
Kasi Majili Kathalu Episode 10 ( కాశీ మజిలీ కథలు ) | పురుషద్వేషిణి