హైదరాబాద్ : పాస్పోర్ట్ దరఖాస్తుల పరిశీలన ( Passport Services), పోలీసు ధృవీకరణ ప్రక్రియలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ పోలీస్ ( Telangana Police ) శాఖకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. 2025-26 సంవత్సరంలో పాస్పోర్ట్ దరఖాస్తుల ధృవీకరణలో విశిష్ట సేవలు అందించిన రాష్ట్ర పోలీసు సంస్థగా తెలంగాణ పోలీస్ శాఖను ఎంపిక చేస్తూ ఇన్స్టిట్యూష నల్ పెర్ఫార్మెన్స్ అవార్డు ( Institutional Performance Award) ను ప్రకటించింది.
ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ , చీఫ్ పాస్పోర్ట్ ఆఫీసర్ బి.ఎస్. ముబారక్, డీజీపీ సి.వి. ఆనంద్ ( DGP CV Anand ) కు అధికారిక లేఖను పంపారు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో నిర్వహించే పాస్ పోర్ట్ సేవ సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది పాస్పోర్ట్ సేవా దివస్, పాస్పోర్ట్ అధికారుల సదస్సు జూన్ 18, 19 తేదీల్లో న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ భవన్లో నిర్వహించనున్నారు.న్యూ ఢిల్లీలో జూన్ 19న జరిగే కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ చేతుల మీదుగా డీజీపీ సీవీ ఆనంద్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోనున్నారు.
రాష్ట్ర పోలీసు శాఖ చేపట్టిన సాంకేతిక ఆధారిత పోలీసు ధృవీకరణ విధానం, వేగవంతమైన సేవలందింపు, ప్రజా కేంద్రిత దృక్పథం వల్లే ఈ జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని డీజీపీ తెలిపారు. ఈ అవార్డు తెలంగాణ పోలీసుల సేవా నిబద్ధతకు, వృత్తిపరమైన నైపుణ్యానికి మరో నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ పురస్కారం ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్ఠ మరింత పెరిగిందని, భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇది ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.