రాయికల్, ఆగస్టు 16 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలను నీరుగార్చేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ సర్కారు పథకాలను కొనసాగిస్తే కేసీఆర్కు ఎక్కడ పేరు వస్తుందోనని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాయికల్ మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుకు స్మార్ట్ డిజిటల్ కార్డు అనే నెపంతో అదనంగా చేర్చింది ఏమైనా ఉందంటే రేవంత్రెడ్డి ఫొటో మాత్రమేనని, తనను ప్రజలు మరిచిపోతారన్న అభద్రతా భావంతోనే ఫొటో ముద్రించుకున్నారని ఎద్దేవా చేశారు.
స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను ప్రారంభించాలనుకుంటే దానితోపాటు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను సైతం అమలు చేస్తే బాగుండేదని సూచించారు. మహిళలకు ప్రతి నెలా మహాలక్ష్మి పథకం కింద రూ.2500, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి నెలా రూ.వెయ్యి, ఆటోరిక్షా కార్మికులకు నెలనెలా రూ.వెయ్యి పెన్షన్ ఇస్తామనే హామీలిచ్చి అధికారంలోకి వచ్చి 33 నెలలు గడుస్తున్నా వాటిని అమలు చేయలేదని విమర్శించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి విధివిధానాలను ఏడాది కిందటే రూపొందించినప్పటికీ నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు.
కేసీఆర్ తన హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేశారని, అవి చారిత్రాత్మకమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా సంక్షేమ పథకాలను అమలు చేయకపోగా, కేసీఆర్ అమలు చేసిన రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, జీవన భృతి, ప్రసూతి సహాయం, కేసీఆర్ కిట్ వంటి పథకాలను నిలిపివేయడానికి రేవంత్రెడ్డి కుట్రపన్నుతున్నారని ధ్వజమెత్తారు. రైతు బీమా ప్రీమియాన్ని ఈ నెల 14లోపు చెల్లించకపోవడంతో అకాల మరణం పొందిన రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే అవకాశం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడబిడ్డల పెళ్లికి రూ.లక్ష ఆర్థికసాయంతో పాటు అదనంగా తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీ ఇచ్చారని, తులం బంగారం దేవుడెరుగు..
అసలు రూ.లక్ష సహాయానికే మోసం తెచ్చారని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిలిపి వేయాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం చాలా బాధాకరమన్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వం కోర్టులో కౌంటర్ దాఖలు చేయపోవడంలో కుట్రకోణం కనిపిస్తుందన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం వల్లనే బిల్లులు మంజూరు చేయలేకపోతున్నామని చెబుతున్న సీఎం రేవంత్.. అంతకు ముందు ఏం చెల్లింపులు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు అమలు చేయని ఆయన రాజ్యానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. చారిత్రక పథకాలను అమలు చేసిన కేసీఆర్ను ఇప్పటికీ గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ఎదురు చూస్తున్నారని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తురగ సౌజన్యశ్రీధర్రెడ్డి, కౌన్సిలర్ రాకేశ్నాయక్, బీఆర్ఎస్ మండల, పట్టణాధ్యక్షుడు మల్లేశ్యాదవ్, అనిల్, మండల పట్టణ కో ఆర్డినేటర్ శ్రీధర్రెడ్డి, నాయకులు గంగారెడ్డి, మహిపాల్రెడ్డి, గంగాధర్, హరీశ్రావు, శ్రీకాంత్, గంగల్లయ్య, మహేందర్, ఉప సర్పంచులు చాంద్, సుధీర్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.