Kasi Majili Kathalu Episode 13 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశీమజిలీ కథలను పన్నెండు భాగాలుగా మధిర సుబ్బన్న దీక్షితులు 1930వ దశకంలో రచించారు. మణిసిద్ధుడు అనే యతి కాశీకి వెళుతూ గోపాలుడిని తనకు తోడుగా తీసుకువెళతాడు. దారిలో వాళ్లిద్దరూ వందలకొద్దీ మజిలీల్లో చెప్పుకొన్న కథలే కాశీమజిలీలు. ఇప్పటివరకూ మొదటి భాగంలో తొమ్మిది మజిలీలు పూర్తయ్యాయి. పదో మజిలీలో రాజధాని నడిబొడ్డున గోపాలుడు చూసిన సోమశర్మ విగ్రహం కథను మణిసిద్ధుడు ఇలా చెప్పాడు.
కొండపల్లిలో సోమశర్మ అనే నిరుపేద బ్రాహ్మణుడు నివసించేవాడు. అతనికి ఏ వృత్తి చేపట్టినా కలిసి రాలేదు. పట్టిందల్లా ఉత్త మట్టిగా మిగిలిపోయేది. జీవితంలో ఏనాడూ ఒక్క కాసైనా చేతిలో నిలిచేది కాదు. పేదరికంతో బాధపడుతూనే నడివయసుకు చేరుకున్నాడు.
ఒకనాటి మధ్యాహ్నం నట్టింటిలో పైకప్పు చిల్లులోనుంచి ఆకాశాన్ని చూస్తూ పడుకుని ఉన్నాడు సోమశర్మ. ఆ సమయంలోనే అతని భార్య అక్కడికి వచ్చింది. అప్పుడతను.. “పిల్లా! మన ఇరుగు పొరుగున ఉన్న భాగ్యవంతులను చూస్తుంటే నాకు చాలా విచారంగా ఉంది. వాళ్లంతా హంసతూలికా తల్పాల పైన నిదురిస్తారు. మనకేమో ఈ నల్లులు కుట్టే నులక మంచమే గతి. వాళ్లింట్లో అద్దాల్లాంటి గది గోడలమీద గాజు దీపాల కాంతులు పడుతూ ఉంటాయి. మనకొంపలో చీకటి పొద్దులో గుడ్డి దీపమైనా సరిగా వెలగదు. ఒక్కనాడైనా చీపురుపట్టి దుమ్మూ ధూళి దులపవు. నువ్వేమో ఎప్పుడు చూసినా మాసిన చీరలే కడతావు. కనీసం తల దువ్వుకోవు” అన్నాడు.
ఆమె సమాధానమేమీ చెప్పలేదు.
“పిల్లా! నా జాతకం గొప్ప మలుపు తిరిగే సమయం వచ్చింది. కానీ, ఆ మలుపు ఈ ఇంటిలో సంభవించదు. అందువల్ల నేను రేపు ఉదయాన్నే బయలుదేరి కొంతకాలం దేశాటన చేసి వస్తాను. నేను తిరిగి వచ్చేవరకూ జాగ్రత్తగా కాలక్షేపం చేయి” అన్నాడు సోమశర్మ.
భర్తమాట జవదాటని ఆ ఇల్లాలు వెంటనే సరేనంది. అప్పటికప్పుడు బజారుకు వెళ్లి, తన మెడలోని మంగళసూత్రాన్ని తెగనమ్మింది. ఆ డబ్బుతో బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు, జాజికాయ, జాపత్రి వంటివన్నీ కొనితెచ్చింది. అయితే అప్పటికే చీకటి పడటం వల్ల దుకాణదారుడు పొరబాటుగా జాజికాయకు బదులు వసనాభి దుంప ఇచ్చాడు. ఆమెకూడా గమనించలేదు. ఆ సరుకులన్నీ కలిపి, ఇరవై నాలుగు అరిసెలు తయారుచేసింది. మూటకట్టి భర్తకు అందించింది.
తెల్లవారక ముందే సోమశర్మ గ్రామం విడిచిపెట్టి, అరణ్యమార్గంలో ప్రయాణించసాగాడు. జాము పొద్దెక్కేవరకు నడిచిన తరువాత ఒక చెట్టుకొమ్మకు అరిసెల మూట కట్టి, స్నానం కోసం చెరువులో దిగాడు. అదే సమయానికి ఓ దొంగల ముఠా వచ్చింది. వాళ్లదగ్గర బోలెడన్ని మూటలున్నాయి. దోచుకున్న సొమ్మును పంచుకోవడానికి వచ్చినవారికి సోమశర్మ అడ్డంకి అయ్యాడు. దొంగల్లో ఒకడు కత్తిదూసి శర్మపైకి దూకబోయాడు. వెంటనే అతడు రెండుచేతులూ అడ్డంపెట్టి.. “ఒరే బాబూ! ఆగాగు!! నన్ను చంపితే ఏమొస్తుంది? నేనో పెద్ద జ్యోతిషుణ్ని. మీరీవేళ ఈ సమయానికి ఇక్కడికి రాబోతారని నాకు ముందే తెలుసు. అందుకే మీరెంతమంది ఉన్నారో.. సరిగ్గా లెక్కబెట్టి అన్ని అరిసెలే మీకోసం తెచ్చాను. కావాలంటే ఆ మూట విప్పి చూసుకోండి” అన్నాడు.
దొంగలు ఆశ్చర్యంగా మూటవిప్పారు. అరిసెల లెక్క సరిపోయింది. దెబ్బతో దొంగల ముఠా మొత్తం సోమశర్మకు పాదాక్రాంతం అయింది.
“ఒరే బాబులూ! ముందు అరిసెలు తినండి” అన్నాడు సోమశర్మ జాలి చూపిస్తూ. ఆ అరిసెల్లో కలిసిన వసనాభి వెంటనే పనిచేసింది. విపరీతమైన మత్తు ఆవరించి, దొంగలంతా ఒకరి తర్వాత ఒకరు నేలమీద పడి మరణించారు.
‘దైవమా! నీ లీలల ముందు పురుష ప్రయత్నం ఏపాటిది?’ అనుకున్నాడు సోమశర్మ. దొంగలు తెచ్చిన సొమ్ముల మూటలు విప్పి చూశాడు. ‘ఎవరో రాజుగారి ఖజానా దొంగిలించి తెచ్చినట్లున్నారు. వీటి ఆచూకీ తెలిస్తే ఆ రాజభటులు బంధించకుండా ఊరుకోరు. పోనీ వదిలేసి పోదామంటే మనసొప్పడం లేదు. ఒక్కణ్నే మోసుకు పోవాలంటే శక్తి చాలదు. ఏమిటి చేయడం?’ అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇంతలో దూరాన అలికిడి వచ్చింది. సమీపంలోని చెట్టెక్కి చూసేసరికి రాజ భటులు కనిపించారు. సోమశర్మ గబగబా చెట్టుదిగి, ఒక కత్తి తీసుకుని దొంగల మృతదేహాలన్నీ ముక్కలు చేశాడు. ఆ శవాలకు పహరా కాస్తున్న వాడివలె కత్తి పుచ్చుకుని నిలబడ్డాడు. తన సమీపంలోకి వచ్చిన రాజభటులను గంభీరంగా చూస్తూ.. “ఎవరు మీరు?” అని ప్రశ్నించాడు.
“అయ్యా! మేము మహారాజు భూరిశ్రవుడి భటులం. నిన్నరాత్రి కోటలో పెద్ద దొంగతనం జరిగింది. దొంగలను వెతుక్కుంటూ వచ్చాం. వీళ్లందరినీ మీరొక్కరే హతమార్చారా?” అని అడిగారు ఆశ్చర్యపోతూ.
“అవును” అన్నాడు సోమశర్మ.. ముఖంలో గాంభీర్యాన్ని తగ్గనివ్వకుండా. కొద్దిసేపాగి..
“మీరందరూ అజాగ్రత్తగా ఉండబట్టే కదా! దొంగలు మీ ఖజానా దోచుకుపోగలిగారు. ఇప్పుడు మీరీ సొమ్ములు తీసుకుపోవడానికి వీల్లేదు. పోయి మీ రాజుగారిని తీసుకురండి. అప్పుడే వీటిని ముట్టుకోనిస్తాను” అని పలికాడు.
మధ్యాహ్న సమయానికి భూరిశ్రవ మహారాజు అడవిలోకి విచ్చేశాడు. సోమశర్మకు వినయంగా నమస్కరించి.. “స్వామీ! మీరెవరు? ఇక్కడికెలా వచ్చారు? నామీద ఇంత అనుగ్రహం చూపించడానికి కారణం ఏమిటి?” అని ప్రశ్నించాడు.
“నా మహిమ నేనే చెప్పుకోవడం ఎందుకు? నేను నరికేసిన దొంగలు, వారు దోచుకెళ్లిన ధనం అంతా ఇక్కడే ఉంది! ఒక్క పూచిక పుల్ల అయినా పోయిందేమో చూసుకో” అన్నాడు శర్మ.
“స్వామీ! మీవల్ల నా పరువు నిలిచింది. మీ మేలు మరిచిపోలేను. దయచేసి మీరు మా ఆస్థానంలో ఉండిపోవాలి. మీరేం కోరితే అది ఇవ్వడానికి నేను సిద్ధం” అని చెప్పాడు భూరిశ్రవుడు.
“అలాగే మహారాజా! కోటకు వెళ్లిన తరువాత నాకేం కావాలో చెబుతాను. నేనేం కోరినా కాదనకూడదు” అన్నాడు సోమశర్మ బింకంగా.
“అలాగే” అన్నాడు రాజు. అడవిలోని ధనమంతా బళ్లమీదకు ఎక్కించి, సోమశర్మతో కలిసి కోటకు తరలివెళ్లాడు.
* * *
కొద్దిరోజులపాటు రాజుగారి ఆతిథ్యం స్వీకరించిన తరువాత ఒకనాడు..
“రాజా! నీ సైన్యం మొత్తం కలిపి ఎంతమంది?” అని ప్రశ్నించాడు సోమశర్మ.
“ఆరు లక్షలు” జవాబిచ్చాడు రాజు.
“ఇంతమంది ఉన్నా కోటలో దోపిడీ తప్పలేదు. సరే! నీ సైన్యంలో ఓ రెండులక్షల మందిని తగ్గించి, వారి జీతాలు నాకిస్తే శాశ్వతంగా నీ కోటలో ఉండిపోతా. లేదంటే ఈవేళే నన్ను నా దారిన పోనివ్వండి” అన్నాడు సోమశర్మ.
“మీకు మాటిచ్చిన తరువాత తప్పనే తప్పను” అన్నాడు రాజు. అప్పటికప్పుడే రెండులక్షల సైన్యాన్ని తగ్గించి, వారి జీతాన్ని సోమశర్మకు సమర్పించాడు.
సోమశర్మ తన భార్యను తీసుకువచ్చి, ఇంద్ర భవనంలాంటి ఇంటిలో కాపురం పెట్టాడు. ఒకప్పటి నిరుపేద ఇల్లాలు.. ఇప్పుడు ఒంటినిండా బంగారంతో మహాలక్ష్మిలా ఆ భవంతిలో యజమాని వలె తిరగసాగింది. రాజుగారి దివాణంలో ఉన్న ఉద్యోగులందరికీ సోమశర్మమీద అసూయ పెరగసాగింది. ఉద్యోగాలు కోల్పోయిన సైనికులంతా శత్రురాజును ఆశ్రయించారు.
ఇదిలా ఉండగా.. రాజధానికి చేరువలో ఉన్న ఒక గ్రామంలో సింహం బెడద ఎక్కువగా ఉందని ఫిర్యాదు వచ్చింది. ఎవరైనా ఒక వీరుడిని సింహాన్ని వధించేందుకు నియమించమని రాజు ఆజ్ఞాపించాడు. సోమశర్మమీద అక్కసుతో ఉన్న మంత్రి.. ఈ వ్యవహారాన్ని సోమశర్మ ఒక్కడే పరిష్కరించగలడని సలహా చెప్పాడు.
సోమశర్మ వీరాలాపాలు పలుకుతూ.. “ఈ రాత్రికే సింహాన్ని వధిస్తా!” అని ప్రతిజ్ఞ చేశాడు. ఇంటికి వెళ్లి పెందలకడనే భోజనం చేశాడు. గతంలో తాను వధించిన దొంగల కత్తులు ఉంచిన మూటను అటకమీంచి దించాడు. దాన్ని నెత్తిన పెట్టుకుని, గ్రామానికి వెళ్లాడు. ఒక ఎత్తయిన చెట్టుపై కూర్చుని, సింహం రాకకోసం ఎదురు చూడసాగాడు.
ఒకరాత్రివేళ సింహం రానేవచ్చింది. చెట్టుపై నుంచి సోమశర్మ గట్టిగా పెడబొబ్బలు పెట్టాడు. అందనంత ఎత్తులో కబళాన్ని చూసిన సింహం దిక్కులు పిక్కటిల్లేలా గర్జించసాగింది.
ముందరి కాళ్లతో చెట్టును ఊపేస్తూ, తోక నేలకేసి కొడుతూ తీవ్రకోపంతో సోమశర్మపైకి ఎగరడానికి ప్రయత్నించసాగింది. సింహం నోరుతెరిచి పైకి ఎగిరినప్పుడల్లా సోమశర్మ తన మూటలోని ఒక్కో కత్తిని దానినోట్లోకి విసిరేయసాగాడు. ఒకదాని వెంట ఒకటిగా నోటిలో చిక్కుకున్న కత్తుల వల్ల పేగులు తెగి, సింహం కొద్దిసేపటికే చనిపోయింది. మహారాజుకు మరోసారి సోమశర్మ పరాక్రమాన్ని మెచ్చుకోక తప్పలేదు. ఆనందంలో ‘మీకేం కావాలో కోరుకోండి” అని నోరు జారాడు.
“మరో రెండులక్షల సైన్యం తగ్గించి, వారి జీతం నాకిచ్చేయండి” అన్నాడు సోమశర్మ.
రాజు అలాగే చేశాడు. పూర్వంలాగే కొత్తగా ఉద్యోగాలు కోల్పోయిన సైన్యం కూడా శత్రురాజునే ఆశ్రయించింది. భూరిశ్రవుని సైన్యబలం పూర్తిగా పడిపోయింది. అదనుకోసం వేచిచూస్తున్న శత్రురాజు యుద్ధం ప్రకటించాడు.
“ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి?” అని మంత్రిని ప్రశ్నించాడు రాజు. అందుకు మంత్రి సలహా ఇవ్వడం మాని.. “మహారాజా! లోకంలో అనితరసాధ్యమైన పనులు చేసే సోమశర్మలాంటి వారు చాలామంది ఉంటారు. మీరు వారి ప్రతిభను చూసి మెచ్చుకోవాలి. సాధ్యమైనంతలో సన్మానించాలి. అంతేకానీ వారి మాటలను విని, సైన్యాన్ని తగ్గిస్తే ఎంత ప్రమాదం వచ్చిందో చూశారు కదా!” అని రాజును దెప్పిపొడిచాడు.
వెంటనే సోమశర్మకు పిలుపు వెళ్లింది.
“రాజా! నావంటి బంటు ఉండగా మీరు చింతించడం ఎందుకు? ఒక్కరోజులో శత్రు సైన్యాన్ని మట్టుబెడతాను” అన్నాడు సోమశర్మ.
“స్వామీ! మీకు కావలసిన సైన్యాన్ని తీసుకువెళ్లండి” అన్నాడు రాజు.
“అక్కరలేదు. నేను ఒంటరిగానే ఎదుర్కొంటాను” అని సోమశర్మ వీరాలాపాలు పలికాడు.
ఆనాటి అర్ధరాత్రివేళ తాను చంపిన సింహపు చర్మాన్ని, కత్తుల మూటను తీసుకుని శత్రువుల గుడారాలకు చేరుకున్నాడు. శత్రుసైనికులు ఆద మరిచి నిద్రిస్తున్న వేళలో సింహపు చర్మాన్ని ఏనుగుల మీదికి ఎగురవేశాడు. “కొట్టు.. పొడువు.. చంపు!” అని అరవసాగాడు. ఇంకా పచ్చి ఆరని సింహపు తోలు వాసన చూసిన ఏనుగులు బెదిరి గొలుసులు తెంచుకున్నాయి. సేనల మీద పడి కలియ తొక్కేయసాగాయి. అరుపులు ఎక్కడినుంచి వస్తున్నాయో తెలియని సైనికులు తమలో తాము పొడుచుకోసాగారు. అలా తెల్లవారేసరికి శత్రుసైన్యం అంతరించింది.
సోమశర్మ విజయుడై దివాణంలో అడుగు పెట్టాడు. భూరిశ్రవుడు అతణ్ని కౌగిలించుకుని.. “మహాత్మా! మీరు మనుష్యమాత్రులు కాదు. మామూలు మానవులకు ఇంతటి కార్యం ఒంటరిగా నెరవేర్చడం శక్యమా?! ఎప్పటికప్పుడు నా ఆపదల నుంచి గట్టెక్కించడానికి భగవంతుడిచ్చిన వరమే మీరని నమ్ముతున్నాను. మీకేం కావాలో కోరుకోండి” అని అడిగాడు.
అప్పుడు సోమశర్మ..“మహారాజా! మొదటిసారి రెండులక్షల సైన్యం తగ్గించి వారి వేతనం నాకిచ్చారు. రెండోసారి సింహాన్ని చంపినప్పుడు మరో రెండులక్షల సైన్యాన్ని తగ్గించారు. ఈసారి మీ ఆరులక్షల సైన్యంలో మిగిలిన రెండులక్షలూ తగ్గించమని నేను అడిగితే మీరు అలాగే చేస్తారు కదా!” అని ఆగాడు.
“తప్పకుండా చేస్తాను. ఆజ్ఞాపించండి” అన్నాడు భూరిశ్రవుడు. “మీరు అలా చేసేముందు మీకో కథ చెప్పాలి. సావధానంగా ఆలకించండి” అని సోమశర్మ ఇలా చెప్పాడు..
* * *
వెనుకటికి మీలాంటి ఓ రాజుగారుండేవారు. ఒకనాడు ఆయనకు తనకు గెడ్డం గీసిన క్షురకుని పనితనం ఎందుకోగానీ తెగనచ్చేసింది.
“ఒరే వెంకన్నా! నీకేం కావాలో కోరుకోరా?” అన్నాడు రాజు.
“అలాగంటారు కానీ, నిజంగా ఇత్తారా బాబయ్యా!” అన్నాడు క్షురకుడు.
రాజుకు పౌరుషం తన్నుకొచ్చింది.
“ముమ్మాటికీ ఇస్తాను. ఏం కావాలో కోరుకోరా?” అన్నాడు రాజు.
“అయితే మంత్రిగారి ఉజ్జోగం తీసేసి, నాకిచ్చేత్తే ఆ కుర్చీలో కూచోవాలని నా కోరికండీ” అన్నాడు క్షురకుడు. ఆనాటి నుంచి వెంకన్నే ఆ రాజ్యానికి మంత్రి అయ్యాడు. కొంతకాలం మంత్రి దర్జా వెలగబెట్టాడు. ఇంతలో రాజ్యం మీదికి శత్రురాజులంతా ఒకేసారి మూకుమ్మడిగా దండెత్తి వచ్చారు.
రాజు వెంటనే మంత్రికి కబురు పంపించాడు. బెంబేలెత్తిన కొత్తమంత్రి.. “మా అమ్మకు నేనొక్కడినే కొడుకుని. నన్నిడిసి పెట్టేయండి బాబయ్యా!” అనేసి పారిపోయాడు.
అప్పుడు రాజు పాతమంత్రికి కబురుపెట్టాడు. పాతసంగతులు మనసులో పెట్టుకోకుండా దేశాన్ని కాపాడటానికి ఆయన ఒప్పుకొన్నాడు.
‘పాతమంత్రితో పొత్తుపెట్టుకుంటే యుద్ధం లేకుండానే కోట మీ వశమైపోతుంది’ అని శత్రు కూటమిలో నీలివార్త వ్యాపింప చేశాడు. ఆ మాట పట్టుకుని వారంతా కలిసి మంత్రిగారిని తమలో ఒకడిగా ఆహ్వానించారు. అందుకు ప్రత్యుత్తరంగా.. “కోట మీ వశం చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ, గెలిచిన తరువాత ఎవరు ఈ కోటను పరిపాలిస్తారో తేల్చి చెప్పండి” అని వారికి రాసి పంపాడు. శత్రురాజులందరూ తమలో ఎవరు కోటను కైవసం చేసుకోవాలో తేల్చుకోవడానికి ఒకరితో మరొకరు యుద్ధం చేసుకుని మరణించారు. అలా యుద్ధం లేకుండానే మంత్రి సాయం వల్ల ఆ రాజుగారు విజయం సాధించారు”..
* * *
..ఇంతవరకూ కథ చెప్పి కొద్దిసేపు ఆగాడు సోమశర్మ. సభనంతా కలియచూశాడు. ఆయన ఏం కోరుకోబోతున్నాడో తెలియక సభాసదులందరూ ఊపిరి బిగపట్టి వింటున్నారు.
“మహారాజా! నేను పనిగట్టుకుని తీసేయించిన నాలుగు లక్షల సైన్యం నీ దగ్గర జీతాలు తీసుకుంటూ, శత్రురాజులకు అనుకూలంగా పనిచేసింది. ఇప్పుడు మీ దగ్గర మిగిలినవారంతా దేశ భక్తులే. ఇంతకుముందే నేను చెప్పిన కథలోని మంత్రిలా.. మీ మంత్రి కూడా మీకు యుద్ధాన్ని గెలిచే ఉపాయం చెప్పి ఉండాల్సింది. అలా చెప్పని కారణంగా ఈ మంత్రిని పదవినుంచి తొలగించి, ఏదైనా చిన్నపాటి ఉద్యోగంలో నియమించండి. ఉత్తముడైన మరోమంత్రిని నియమించుకోండి” అన్నాడు సోమశర్మ.
ఆ మాటలతో మహారాజు పరమానంద భరితుడయ్యాడు. సోమశర్మ కంచువిగ్రహాన్ని చేయించి రాజధానిలో ప్రతిష్ఠించాడు. అటుపైన చాలాకాలంపాటు భూరిశ్రవుడు రాజ్యమేలాడు. గుణవంతుడైన సోమశర్మ అపరిమిత ధనవంతుడుగా కూడా మారి, చిరకీర్తిని పొందాడు.
(వచ్చేవారం.. దైవమిచ్చిన భార్య)
అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu Episode 13 ( కాశీ మజిలీ కథలు ) | కీలుగుర్రం -2
Kasi Majili Kathalu Episode 12 ( కాశీ మజిలీ కథలు ) | కీలుగుర్రం
“Kasi Majili Kathalu Episode 11 ( కాశీ మజిలీ కథలు ) | పురుషద్వేషిణి- 2”
Kasi Majili Kathalu Episode 10 ( కాశీ మజిలీ కథలు ) | పురుషద్వేషిణి
Kasi Majili Kathalu Episode 9 ( కాశీ మజిలీ కథలు ) | తిరిగి కలిసిన మిత్రులు
Kasi Majili Kathalu Episode 8 ( కాశీ మజిలీ కథలు ) | విద్యాధరి రాగమంజరి