Kasi Majili Kathalu Episode 9 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : నాలుగు దిక్కుల్లోనూ అంతుతెలియనంత దూరం వ్యాపించిన వింతైన మర్రిచెట్టు నాలుగు కొమ్మలను ఎక్కి, నలుగురు మిత్రులు బయలుదేరారు. మొదటివాడైన వసంతుడు మాయదారి ముసలిదానివల్ల కొన ఊపిరితో ఒకానొక నిర్జనమైన దీవిలో పడి ఉన్నాడు. రెండో వాడైన రాముడు ఒక కోయదొర వల్ల కుక్కలా మారిపోయాడు. మూడో వాడైన ప్రవరుడు హేలానగరానికి మంత్రి అయ్యాడు. నాలుగోవాడైన దండుడు, మర్రిచెట్టు వద్ద కాపలాగా ఉన్న సాంబుడు విద్యాధర కన్యలను వివాహం చేసుకొన్నారు. నిర్జన దీవిలో కొన ఊపిరితో ఉన్న వసంతుని కలుసుకుని తిరిగి బతికించారు.
“అన్నా! పసిపిల్లవాడిలా ఏమిటా ఏడుపు? ఇంతకీ కళావతి ఎవరు? మాయదారి ముసలిది ఎవరు? ఆమె కళావతినెలా ఎత్తుకుపోయింది? కొంచెం అర్థమయ్యేలా చెప్పు!” అడిగాడు సాంబుడు.
“సాంబా! ఆ మర్రిచెట్టు కొమ్మనెక్కిన నేను ఈ నిర్జన పట్టణంలోకి వచ్చిపడ్డాను. ఇక్కడే కళావతిని కలుసుకున్నాను. ఒక బ్రహ్మరాక్షసి కళావతిని చిన్ననాడే తెచ్చి ఇక్కడ ఉంచి పెంచుకుంది. నేను తెలివిగా ఆ రాక్షసిని చంపేశాను. కళావతిని గాంధర్వ వివాహం చేసుకున్నాను. ఆ తరువాత మేమిద్దరం ఇక్కడినుంచి వెళ్లిపోయి ఉంటే ఈ ముప్పు తప్పి ఉండేది. కానీ, కళావతి కోరికమీద ఇక్కడే ఉండిపోయాం. ఒకరోజున ఈ దీవికి ఓ దిక్కులేని ముసలిది వచ్చింది. మమ్మల్ని కనిపెట్టుకుని ఉంది కదా అని మేమిద్దరం ఆమెను గౌరవంగా చూసుకున్నాం. బహుశా దాని ప్రబోధం వల్లనే కాబోలు, ఒకరోజున కళావతి నా ఆయువును గురించి ప్రశ్నించింది. నీవు నా ప్రాణాలను ఈ కత్తివొరలో దాచిన విషయం ఆమెకు చెప్పాను. పాపం ఆ వెర్రిబాగులది ముసలిదానితో ఆ సంగతి చెప్పి ఉంటుంది. నాకు స్మృతి తప్పించి, నా కళావతిని ఇక్కడినుంచి తప్పించి ఉండవచ్చు. నాలుగువైపులా సముద్రమే ఉన్న ఈ దీవినుంచి ఏ దిక్కుకు నా కళావతిని ఆ ముసలిది తీసుకుపోయిందో ఎలా కనిపెట్టగలం?” అని చింతాక్రాంతుడై ఉన్న వసంతుడు నెమ్మది నెమ్మదిగా జరిగిన కథంతా వివరించాడు.
అప్పుడు దండుడు..
“అన్నా! నేను కొత్తగా విమానాలు తయారుచేసే విద్య నేర్చుకున్నాను. రెండురోజుల సమయం ఇస్తే ఓ విమానం తయారు చేస్తాను. అదెక్కి మనం అన్ని దేశాలూ తిరుగుదాం. వదినగారిని ఎలాగైనా వెతికి పట్టుకుందాం. మన మిత్రులను కూడా కలుసుకుందాం” అని ధైర్యం చెప్పాడు.
ఆ మాటతో వసంతుని ముఖం వికసించింది.
మిత్రులు ముగ్గురూ కలిసి అడవిలోని చెట్లను కొట్టి, కొయ్యవిమానం తయారుచేశారు. దండుడు తన విద్య చేత దాన్ని ఎగిరేలా చేశాడు. అదృష్టంకొద్దీ వాళ్లు ముగ్గురూ ఎక్కిన విమానం పడమటి దిశలోనే ప్రయాణం చేసి హేలానగరానికి చేరింది.
“అన్నా! అదిగో దూరాన ఏదో నగరం కనిపిస్తున్నది. మనం విమానాన్ని ఈ పొలిమేరల్లోనే దాచుకుని, వదినగారి ఆచూకీ కోసం ప్రయత్నిద్దాం” అన్నాడు దండుడు.
అలా చేసిన తరువాత ముగ్గురూ కలిసి నగరంలోకి వెళ్లారు. రాత్రి అవుతుండగా సత్రంలో ప్రవేశించి భోజనం చేశారు. మరునాడు ఉదయాన్నే నిద్ర లేచి, సత్రపు అరుగు మీదికి వెళ్లి చూసిన దండునికి.. అక్కడ ప్రవరుడు వేలాడగట్టించిన చిత్రపటం కనిపించింది.
మిగతా ఇద్దరినీ బయటికి తీసుకువచ్చి..
“చూడండి.. అచ్చంగా ఇది మన ప్రవరుని చిత్రపటంలాగే ఉంది కదా!” అన్నాడు.
“మనిషిని పోలిన మనుషులు ఉండవచ్చు కదా!” అన్నాడు సాంబుడు.
“చూస్తుంటే ఈ చిత్రపటంలోని మనిషి ఎవరోకానీ పెద్ద హోదాలో ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు. ఏమో! ప్రవరుడు అంతటి వాడు కాకూడదా!” అని తన అభిప్రాయం చెప్పాడు వసంతుడు.
“నాకు మాత్రం ఈ చిత్రపటం కచ్చితంగా మన ప్రవరుడిదే అనిపిస్తున్నది” అన్నాడు దండుడు.
వాళ్లు ముగ్గురూ అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కొందరు భటులు వచ్చారు.
“అయ్యా! ఈ చిత్రపటాన్ని ఎవరైతే సాభిప్రాయంగా చూస్తారో, వారిని తమవద్దకు తీసుకురావాలని మా మంత్రిగారి ఆజ్ఞ. కనుక మీరు మాతో రావాలి” అన్నారు భటులు.
“ఇదెక్కడి అన్యాయం? చిత్రపటాలు చూడటం కూడా తప్పేనా? ఆ తిక్క మంత్రెక్కడ దొరికాడయ్యా మీకు?” వ్యంగ్యంగా అన్నాడు దండుడు.
“అయ్యా! అన్ని పటాలపైనా అటువంటి ఆజ్ఞలు లేవు. ఈ పటాన్ని చూసినవారిని మాత్రమే తీసుకు రమ్మన్నారు. శిక్షించడానికో, సన్మానం చేయడానికో మాత్రం మాకు తెలియదు. మీరు మాతో వస్తే అసలు విషయం తెలుస్తుంది” అన్నారు వారు.
“ఇంకేం.. ఆ మంత్రిగారెవరో చూద్దాం పదండి” అనుకుంటూ ముగ్గురూ బయలుదేరారు.
అల్లంత దూరాన ప్రవరుని చూస్తూనే సాంబుడు పరుగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నాడు. రెండుచేతుల్లోనూ మిత్రుణ్ని ఎత్తుకుని తీసుకువచ్చి, తక్కిన మిత్రుల ముందు నిలబెట్టాడు.
ఎన్నెన్నో కష్టాలు గడిచి, చివరికి ఆనందంగా కలుసుకున్న మిత్రులందరూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఆ పూట అందరికీ ప్రవరుని భార్య అయిన కాంచనవల్లి విందుభోజనం వడ్డించింది.
కబుర్లు చెప్పుకొంటూ మిత్రులందరూ భోజనం చేస్తుండగా, ప్రవరునికి ఒక వార్త వచ్చింది.
“మంత్రివర్యా! మీ చిత్రపటాన్ని ఇప్పుడే ఒక యువజంట సాభిప్రాయంగా చూస్తుండగా, వారిని కూడా మన భటులు తీసుకువచ్చారు. కచేరీ గదిలో వారిని ఉంచాం. మీ భోజనం పూర్తయ్యాక చూడవచ్చు” అన్నది ఆ వార్త సారాంశం.
“మన రాముడు కాడు గదా!” అన్నాడు వసంతుడు.
నలుగురు మిత్రులూ భోజనాల గదినుంచి ఒక్క ఉదుటున కచేరీలోకి వచ్చారు. అనుకున్నదే నిజమైంది. అక్కడ ఉన్నది రాముడు లతాంగి. వారిని చూడటంతో ఆ మిత్రుల ఆనందం రెట్టింపయ్యింది. వాళ్లను కూడా లోనికి తీసుకువెళ్లి, ప్రవరుడు యథోచితంగా సత్కరించాడు.
వాళ్లు తమ కథలన్నిటినీ కలబోసుకుంటున్నారు. కాంచనవల్లిని చూపించి, ఆమె కారణంగా తాను ఈ రాజ్యానికి మంత్రి అయ్యేవరకు జరిగిన తమ కథను ప్రవరుడు చెప్పాడు.
ఆ తరువాత రాముడు తన కథ చెప్పాడు. తాను మొదట పద్మగంధిని పెళ్లి చేసుకోవడం, ఆ తరువాత మిత్రులను కలుసుకోవడానికి వెళుతూ లతాంగిని కాపాడటం, ఆ తరువాత లతాంగి తనను కోయదొర బారినుంచి కాపాడి, ఈ హేలానగరానికి తీసుకువచ్చి సిద్ధుని ద్వారా తన కుక్కరూపును మార్చిందని చెప్పుకొచ్చాడు.
సాంబుడు తన కథ చెబుతూ.. రాయిగా మారిన తనను రక్షించి, రాగమంజరితో వివాహం జరిపించినందుకు దండునికి కృతజ్ఞతలు తెలిపాడు.
“అందరం కలుసుకున్నాం. చక్కని భార్యలను ఎంపిక చేసుకున్నాం. కానీ, మన వసంతుడే ఒంటరిగా మిగిలిపోయాడు. పాపం వదినగారు ఎక్కడున్నదో? ఎలాంటి కష్టాలు పడుతున్నదో? ఆమెను కలుసుకుంటే కానీ మనం తిరిగి ఇళ్లకు వెళ్లలేం!” అన్నాడు దండుడు.
అప్పుడు ప్రవరుడు గొంతు సవరించుకుని..
“వసంతా! నీతో ముందే చెబితే ఎలా స్పందిస్తావో తెలియక ఆగాను. నీ కళావతి ఇక్కడే ఉన్నది” అని చెప్పాడు.
“ఆ.. ఎక్కడ?! ఎక్కడ?! ప్రవరా ముందు నాకామెను చూపించు”.. చేతులు పట్టుకుని దీనంగా అడిగాడు వసంతుడు.
“కూర్చో వసంతా! నేను చెప్పేది పూర్తిగా విను. కళావతి చేతి కంకణాన్ని ఒక చేప మింగిందట. ఆ కంకణాన్ని చూసిన ఈ రాజ్యపు రాజు మోహంలో పడ్డాడు. నీ కళావతిని మాయోపాయం చేత తీసుకురావడానికి ఒక ముసలిదాన్ని నియోగించాడు. ప్రస్తుతం కళావతి ఇక్కడే రాజుగారి నిర్బంధంలో ఉంది” వివరంగా చెప్పాడు ప్రవరుడు.
“మరి ఇంకా ఆలోచిస్తావేం? పద ఆ రాజును చిత్రవధ చేద్దాం. వదినగారిని కాపాడుకుందాం” ఆవేశపడ్డాడు సాంబుడు.
“ఆవేశం అన్నివేళలా పనికిరాదు సాంబా! మిత్రులందరి నిర్ణయం అదే అయితే అలాగే చేద్దాం. ఎలాగూ సైన్యం మొత్తం నా అధీనంలోనే ఉంది. కాబట్టి యుద్ధం మనకు తేలికే! కానీ, ముందుగా రాజుతో సంప్రదిద్దాం. మాటలతో వినేవాడైతే ఆయుధాలకు పని చెప్పాల్సిన అవసరం ఉండదు”.. తన ఆలోచన చెప్పాడు ప్రవరుడు.
వరప్రసాదులు ఐదుగురూ కాసికోకలు బిగించి, జెట్టిలాగులు ధరించారు. పదునైన కరవాలాలను చేతబట్టి, భూమి దద్దరిల్లేలా అడుగులు వేస్తూ కందర్పకేతుని సభాభవనం చేరుకున్నారు.
వసంతుడు నేరుగా వెళ్లి, కందర్పకేతుని సింహాసనాన్ని ఆక్రమించాడు. ఒక భటుని పిలిపించి..
“వెంటనే రాజుగారిని ఇక్కడికి తీసుకురా” అని చెప్పాడు ప్రవరుడు.
ఆ సైనికుడు బిక్కుబిక్కుమంటూ రాజుగారి అంతఃపురానికి వెళ్లాడు.
“మహారాజా! ఘోరం జరిగిపోయింది. మీ సింహాసనాన్ని శత్రువులు ఆక్రమించుకున్నారు” అని వార్తను తెలియచేశాడు.
“అయితే ముందు నువ్వెళ్లి, మన మంత్రి ప్రవరుని ఇక్కడికి తీసుకురా” అన్నాడు కందర్పకేతుడు హడావుడి పడుతూ.
“అయ్యో దేవరా! అసలు ఈ కుట్రకు హేతువే మంత్రిగారు. ఆయనగారు కూడా శత్రువుల్లో కలిసిపోయారు” చెప్పాడు భటుడు.
“ఆ.. నిజమా?” అంటూ కందర్పకేతుడు శయ్యపై కూలిపోయాడు. కొద్దిసేపటికి మాట పెగల్చుకుని..
“నువ్వు చూశావా?” అని అడిగాడు.
“నా రెండు కళ్లతో చూశాను మహారాజా!” చెప్పాడు భటుడు.
“అతనికి మనమేం అపకారం చేశాం? మనపట్ల ఇంత క్రౌర్యం పూనాల్సిన అవసరం అతనికేం వచ్చింది? వచ్చినవారు శత్రువులు కారేమో!” సాలోచనగా ప్రశ్నించాడు కందర్పకేతుడు.
“శత్రువులు కాకపోతే సింహాసనాన్ని ఆక్రమిస్తారా ప్రభూ?” ఎదురు ప్రశ్న వేశాడు భటుడు.
“నిజమా? అలాగా? రాణీ! ఈ ఉదంతం విన్నావా? ఇప్పుడేమిటి చేయడం? పోనీ ఆ రహస్యమార్గం గుండా పారిపోదామా?!” అన్నాడు కందర్పకేతుడు హడావుడి పడుతూ.
అందుకామె.. “స్వామీ! సుక్షత్రియ వంశంలో పుట్టిన మీకింత పిరికితనం ఎందుకు? పారిపోయి ఎన్నాళ్లని బతుకుతాం?! పోరాడితే విజయమో, వీరస్వర్గమో లభిస్తుంది. పారిపోతే అపకీర్తిని మూటగట్టుకోవాల్సి వస్తుంది” అన్నది.
“ఆ.. యుద్ధమంటే తేలిగ్గా ఉందేమిటి నీకు?! అయినా చిన్నతనం నుంచి నేనెంత గారాబంగా పెరిగానో తెలుసా?! ఈ ఒంటిమీద ఒక్క చిన్నదెబ్బ అయినా ఎన్నడూ పడి ఎరగను.
ద్ధాల్లో నెత్తురు కారేలా కొట్టుకోవడం అంటే నాకు భయం” అన్నాడు కందర్పకేతుడు తన అసలు స్వభావాన్ని బయటపెడుతూ.
మహారాణికి తన భర్త పరిస్థితి చూసేసరికి చీదర పుట్టింది. భటుని వైపు తిరిగి..
“ఓరీ! మన మంత్రిగారిని నేను రమ్మంటున్నానని చెప్పి, ఓసారి ఇక్కడికి తీసుకురా. రాజుగారు అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పు” అన్న ది. వాడు చిత్తమని చెప్పి అక్కడినుంచి వెళ్లాడు.
కందర్పకేతుడు వణికిపోతూ..
“అతనెందుకు ఇక్కడికి రావడం? కావాలంటే నువ్వే సభాభవనానికి వెళ్లు. నీకూ వాళ్లకూ మధ్య సంధి కుదిరితే.. అప్పుడు నేనొస్తాను” అన్నాడు.
అతడికి మహారాణి ఏదో సర్ది చెబుతున్నది. ఇంతలోనే అక్కడ మనుషుల అలికిడి అయ్యింది. కందర్పకేతునికి ఏం చెయ్యాలో తెలియలేదు. మంచం ఎక్కి దుప్పటి ముసుగు పెట్టాడు. ప్రవరునితోపాటు అతని నలుగురు మిత్రులూ కత్తులు చేతబూని అంతఃపురంలో అడుగుపెట్టారు.
“మహారాణీ! రాజుగారికి ఏమిటి సుస్తీ?” అడిగాడు ప్రవరుడు. అంటూనే మంచం దగ్గరికి వెళ్లి కందర్పకేతుని చేతిని కదిలించబోయాడు. కానీ రాజు చనిపోయిన వానివలె నటించసాగాడు.
అప్పుడు మహారాణి..
“అన్నా! నిన్ను వారు ఆరోప్రాణంగా భావిస్తున్నారు కదా! అటువంటి నువ్వు మాపట్ల ఇంత కృతఘ్నునిగా ఎలా మారిపోయావు? ఎవరు వీరంతా? వీరందరికీ మేమేం అపకారం చేశాం?” అని ప్రశ్నించింది.
“మహారాణీ! ఆ సంగతంతా మీకు వివరంగా చెబుతాను. కానీ, రాజుగారిలా అచేతనంగా పడి ఉన్నారేమిటి?” అని ప్రశ్నించాడు ప్రవరుడు.
అందుకు రాణి వెంటనే సమాధానం చెప్పలేదు.
ప్రవరుడు రాజుగారి ముసుగుతీసి చూశాడు. కన్నులు తేలవేసి, పళ్లు బిగబట్టి, ఊపిరి బయటికి రానీయకుండా.. మంచానికి అతుక్కుపోయి చచ్చినట్టు నటిస్తున్న కందర్పకేతుని చూసి వరప్రసాదులు ఐదుగురూ నవ్వుకున్నారు.
అప్పుడు ప్రవరుడు..
“అన్నా! ఈరాజు గారిని కాపాడగలిగే ముసలిది ఒకతే ఉన్నది. వెంటనే దాన్ని పిలిపిస్తాను” అంటూ భటుల చేత కబురు పంపాడు. కళావతిని మోసం చేసిన మాయదారి ముసలిది ప్రవేశపెట్టబడింది. అది వస్తూనే రాజు నిజంగా చనిపోయాడనుకుంది.
“ఓరి సచ్చినోడా! ఆ పిల్లదాన్ని తెచ్చినందుకు నాకు బహుమానం ఇస్తానన్నావు. అర్ధరాజ్యం కట్టబెడతానన్నావు. నాకివ్వాల్సింది ఇవ్వకముందే ఇట్టా చేశావేమిరా?! ఇప్పుడు నేనేమి చేతురో దేవుడో!” అంటూ దీర్ఘాలు తీసింది.
ప్రవరుడు కత్తితో ముసలిదాన్ని అదిలించాడు.
“ఒసే ముసలిదానా! ఇతనెవరో గుర్తుపట్టావా?” అని అడిగాడు వసంతుణ్ని చూపిస్తూ.
అతణ్ని చూస్తూనే ముసలిది కొయ్యబారిపోయింది. వసంతుడు ఆమెను ఒక్కవేటుతో వధించబోయాడు. తక్కినవారు వారించారు.
అప్పుడు ప్రవరుడు..
“మహారాణీ! ఇతడు నా మిత్రుడు వసంతుడు. మన రాజుగారు ఎత్తుకొచ్చిన కళావతి ఇతడి భార్యే!” అని ఒక్కముక్కలో విషయం చెప్పాడు.
మహారాణి వసంతుని పాదాలమీద పడి, పతిభిక్ష పెట్టమని వేడుకుంది. వెనువెంటనే కందర్పకేతుడు కూడా మంచంమీద నుంచి లేచి వసంతుని పాదాల మీద పడ్డాడు.
“మహాత్ములారా! నా అపరాధాన్ని మన్నించండి. కళావతిని రప్పించాను కానీ, నేను ఎన్నడూ ఆమెను ముట్టుకోలేదు. ఆమె నిప్పులాంటిది. బుద్ధి తక్కువగా మిమ్మల్ని వేరుచేసి నన్ను పెద్దమనసుతో క్షమించి విడిచిపెట్టండి” అని అనేకరకాలుగా ప్రార్థించాడు.
దయార్ద్ర హృదయులైన వరప్రసాదులు రాజును మన్నించి విడిచిపెట్టారు. ముసలిదాన్ని మాత్రం మెడబట్టి గెంటుకుంటూ కళావతి వద్దకు తీసుకువెళ్లారు. వసంతుని చూస్తూనే శోకాన్ని పట్టలేక బిగ్గరగా ఏడుస్తూ వెళ్లి కౌగిలించుకున్నది కళావతి. ఆమెను ఓదార్చి మామూలు మనిషిని చేయడానికి వసంతునికి చాలా సమయం పట్టింది.
చివరికి సాంబుడు..
“వదినగారూ! మిమ్మల్ని ఇన్ని కష్టాల పాలు చేసిన మాయదారి ముసలిది ఇదిగో! దీన్ని మీరెలా చంపమంటే అలా చంపుతాను” అన్నాడు కత్తిని ఝళిపిస్తూ.
“అమ్మయ్యో! కళావతమ్మ తల్లీ! నన్ను కొంచెం బతకనివ్వమ్మా” అని గట్టిగా కేకపెట్టింది ముసలిది.
“ఆ పాపిష్ఠిదాన్ని బయటికి తోసి విడిచిపెట్టేయ్యండి” అన్నది కళావతి.
అటుపైన.. సాంబుడు, దండుడు తమ భార్యలైన రాగమంజరిని, విద్యుత్ప్రభను మనస్సులో తలచుకోగానే వారిద్దరూ అప్పటికప్పుడే హేలానగరంలో ప్రత్యక్షమయ్యారు.
దండుడు నిర్మించిన విమానంలో వరప్రసాదులు ఐదుగురూ తమ భార్యలతో సహా తమ స్వరాజ్యమైన కాశ్మీరానికి బయలుదేరారు. మార్గమధ్యంలో రాముని మొదటిభార్య అయిన పద్మగంధి కూడా విమానం ఎక్కింది.
త్వరలోనే వసంతునికి పట్టాభిషేకం జరిగింది. మిత్రులు నలుగురినీ తనకు మంత్రులుగా నియమించుకుని చాలాకాలంపాటు అతడు చల్లగా రాజ్యమేలాడు.
ఇక్కడితో కాశీమజిలీల్లోని తొలికథ అయిన ‘వరప్రసాదుల కథ’ సుఖాంతమైంది.
(వచ్చేవారం.. పురుషద్వేషిణి)
అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu Episode 7 ( కాశీ మజిలీ కథలు ) | మంత్రిగారి భార్య
Kasi Majili Kathalu Episode 6 ( కాశీ మజిలీ కథలు ) | హేలానగరంలో ప్రవరుడు
Kasi Majili Kathalu Episode 5 | రాముని మెచ్చిన లతాంగి
Kasi Majili Kathalu Episode 4 | చేపమింగిన కంకణం
“Kasi Majili Kathalu Episode 3 | పంజరంలో రామచిలుక”
“Kasi Majili Kathalu Episode 2 | దేవతా వస్త్రాలు”
“Kasi Majili Kathalu Episode 1 | జారిపడ్డ మామిడిపండు”