Kasi Majili Kathalu | కాశ్మీర పాలకుడైన శూరసేనుడు తన నలుగురు మంత్రులతో సమావేశం నిర్వహిస్తుండగా, ఆకాశం నుంచి ఒక మామిడిపండు జారిపడుతుంది. అది సంతాన దాయకమైన పండు. నలుగురు మంత్రులతో కలిసి ఆ మామిడిపండును శూరసేనుడు భుజించగా, వారికి ఐదుగురు కుమారులు కలుగుతారు. వారందరి పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి.. వారిని అందరూ ‘వరప్రసాదు’లని పిలుస్తుంటారు.
వరప్రసాదులు పెరిగి పెద్దవారయ్యారు. తమ తండ్రులలాగే వారు ఐదుగురు కూడా ప్రాణస్నేహితులు. సమవయస్కులైన వారికి ఒకే సమయంలో విద్యాభ్యాసం పూర్తయింది. గురుకులం నుంచి రాజధానికి చేరుకున్న కొద్దిరోజులకు, ఒకనాటి సాయంకాలం ఐదుగురూ ఒకచోట కలుసుకున్నారు.
మంత్రి కుమారుడైన రాముడు ముందుగా.. “మిత్రులారా! మనం అనేక విద్యలు నేర్చాం. ప్రాయానికి మించిన పాండిత్యాన్ని గడించాం. అయితే దేశాటన చేసినప్పుడు కానీ మన విద్యాపాటవం తేటతెల్లం కాదని నా అభిప్రాయం” అన్నాడు.
అందుకు రాజకుమారుడైన వసంతుడు.. “మంచి మాట చెప్పావు మిత్రమా! వెంటనే మనం దేశాటనం చేయాల్సిందే! ఈ తరుణం దాటిపోతే, మెడకు లంకెలు తగిలించుకున్న తరువాత అడుగు తీసి బయటపెట్టలేం” అని ఆమోదించాడు.
బ్రాహ్మణ కుమారుడైన ప్రవరుడు.. “నూతిలో కప్పల్లాగా దేశాన్ని తిరిగి చూడనివాడు.. పండితుడైనా మూర్ఖుడేనంటారు” అన్నాడు ఊతమిచ్చినట్లుగా.
ఈ ప్రతిపాదనకు వైశ్య కుమారుడైన సాంబుడు కొంత వెనుదీశాడు. కానీ, కళాదుని కుమారుడైన దండుడు సర్ది చెప్పాడు.
“దేశాటనం చేసి, అనుభవం గడించినవాళ్లెందరో ఉన్నారు. మనం ఏడాది గడువు లోపల తిరిగివస్తామని రాసిపెట్టి వెళదాం. మిత్రమా! నీ పెళ్లిని ఒక్క ఏడాది వాయిదా వేయమని మీ వాళ్లకు లేఖ రాయి. ఏమో! దేశాటనలో మనకు ఎటువంటి కన్యలు ఎదురుపడతారో చెప్పలేం. మన హృదయాలను ఎవరైనా దోచుకుపోయినా ఫరవాలేదు. ఇక మన ఆయువులకు మృత్యుభయం లేకుండా వాటిని నేను దాచిపెట్టగలను” అన్నాడు.
ఐదుగురు మిత్రులకూ ఒప్పందం కుదిరింది. రెండురోజుల తరువాత నాటి రాత్రి, వేర్వేరుగా అశ్వాలను అధిరోహించి.. పశ్చిమ దిక్కుగా ప్రయాణం సాగించారు. రాళ్లతో నిండిన గుట్టలు దాటి, దట్టమైన అడవులను దాటి వారంతా ఐదురోజుల పాటు నిర్విరామంగా ప్రయాణించారు. ఆరోనాటి మధ్యాహ్నానికి అడవి పలచబడింది. వ్యవసాయ భూములు కానవచ్చాయి.
“అదుగో.. అక్కడేదో నగరం ఉన్నట్లుంది” అని సాంబుడు అల్లంతదూరానికి వేలుపెట్టి చూపించాడు. అందరూ ముందుకు సాగారు. కొంతదూరం వెళ్లిన తరువాత ప్రవరుడు..
“మిత్రులారా! ఒకసారి గుర్రాలను ఆపండి” అన్నాడు.
అందరూ ఆగిన తరువాత.. “ఇది నిజంగా నగరమే అయితే మనుషులు కనిపించాలి. ఇక్కడ వ్యవసాయం చేస్తున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మనుషుల అలికిడి మాత్రం లేదు. ఇదేమి మాయ?” అని సందేహం వెలిబుచ్చాడు.
“మాయా నగరమైతే మనకేమి? మన ఆయువులను నేను రహస్యంగా దాచిన విషయం మరిచిపోయారా? మరేం భయం లేదు. పోయి ఆ వింత ఏమిటో చూద్దాం” అన్నాడు దండుడు.
అందరూ సరేనంటూ గుర్రాలను అదిలించారు. ఆ మిట్టమధ్యాహ్నం అర్ధరాత్రిలా ఆ నగరమంతా నిశ్శబ్దంగా ఉంది. ఇళ్ల తలుపులన్నీ మూసి ఉన్నాయి. మరికొంత దూరం వెళ్లేసరికి ఒక వీధిలో కొందరు మనుషులు అరుగుల మీద నిద్రిస్తూ కనిపించారు.
వసంతుడు ఆ వింత చూసి వెరగు పడుతూ.. “మిత్రులారా! ఇదేదో నిశాచరుల రాజ్యంలా ఉంది” అన్నాడు. ఇంతలో అక్కడికి కొందరు రాజభటులు వచ్చారు.
“ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ అర్ధరాత్రి సమయంలో నిర్భయంగా సంచరిస్తున్నారేంటి?” అంటూ గద్దించారు.
రాముడు ఒక్కసారి ఆకాశంలో సూర్యుని వంక చూసి.. “ఇది అర్ధరాత్రా? పట్టపగలు కాదా? మీ మాటలు ఇంత విపరీతంగా ఉండటానికి కారణమేమిటి?” అని ప్రశ్నించాడు.
“ఇది పగలు అన్నవారిని శిక్షించమని రాజుగారి శాసనం. మొదటి తప్పు కనుక వదిలేస్తున్నాం. పోయి ఎక్కడైనా నిద్రపోండి. చీకటిపడి నగరం నిద్రలేచాక మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు” అన్నారు వారు.
“సరే.. ఈ పూటకి మేం నిద్రపోవడానికి సత్రమేదైనా చూపించండి” అడిగాడు సాంబుడు.
“పరదేశీయులకు సాయం చేయడానికి రాజాజ్ఞ లేదు” అంటూ రాజభటులు వెళ్లిపోయారు.
ఆ మధ్యాహ్నమంతా వరప్రసాదులు ఒక అరుగుమీద గడిపారు. సాయంకాలమైంది. కోడికూతతో ఊరు మేలుకున్నట్లు మొగసాలమీద గడియారం మోతతో నగరమంతా మేలుకుంది. ఉదయాన్నే అందరూ ఎలాగైతే కాలకృత్యాలు తీర్చుకుని, తమతమ పనులకు ఉపక్రమిస్తారో అలాగే.. నగర జనులందరూ ప్రవర్తించసాగారు.
వరప్రసాదులు నిద్రపోతున్న అరుగు మీది తలుపులు తెరుచుకుని, ఆ ఇంటి యజమాని కొద్దిగా ఆలస్యంగా వచ్చాడు. వీరిని పలకరించి వివరాలడిగాడు.
అప్పుడు ప్రవరుడు.. “అయ్యా! మీ నగరజనులంతా ఇలా నిశాచరులు కావడానికి కారణం ఏమిటో తెలియలేదు. దయచేసి మాకు తెలియచేయవలసింది” అని అడిగాడు.
ఆ ఇంటి యజమాని వారైదుగురినీ లోనికి తీసుకువెళ్లి, యథోచితంగా అతిథి సత్కారాలు చేశాడు. ఆ తర్వాత ఒక రహస్య స్థలానికి తీసుకుపోయి, ఆ నగర వృత్తాంతాన్ని చెప్పాడు.
* * *
“అయ్యా! ఇది లాటదేశం. ఈ రాజ్యాన్నేలేది కానీనుడు. మా రాజుకు దుష్టబుద్ధి, సుబుద్ధి అని ఇద్దరు మంత్రులున్నారు. వారి ఆలోచనల ప్రకారం రాజ్యాన్ని ఏలుతూ ఉన్న కానీన మహారాజు, సుమారు పది సంవత్సరాల క్రితం ఒక మహాసభ నిర్వహించాడు.
ఆ సభలో రాజు.. ‘అమాత్యులారా! నా మనసులో ఇప్పుడో మహాసంకల్పం కలిగింది. మీరు పూర్తిగా విని మంచిచెడులు చెప్పండి. భూమి పుట్టింది మొదలు నేటివరకూ దీనిని పాలించిన రాజులందరూ ఒక్కరీతిగానే వ్యవహరించారు. వారికంటే ముందు తరాలవారు ఏం చేశారో వీళ్లు కూడా అవే పద్ధతులను గుడ్డిగా అనుసరించారు. మేం కాస్త కొత్తగా ఆలోచించ దలుచుకున్నాం. దీనిమూలంగా మాకు, మనదేశానికి గొప్ప కీర్తి వస్తుంది. ఇంతకూ మా ఆలోచన ఏమిటంటే.. నిద్రాహారాల వేళలను బట్టి మనవారు కాలాన్ని పగలు, రాత్రిగా విభజించారు. నిద్రించేది రాత్రి అని, విహరించేది పగలని నిర్ధారించారు. దానికి బదులుగా పగటి పనులు రాత్రిపూట, రాత్రి సమయంలో చేయాల్సిన పనులను పగటిపూట చేయాలని మేం నిర్ణయించాం. ఇకమీదట మా రాజ్యంలో ఎవ్వరూ ఆకాశంలో సూర్యుడు ఉండే సమయాన్ని పగలు అని పిలవకూడదు. జాము పొద్దెక్కేదాకా కాదు.. అసలు సూర్యుడు ఉండగా ఎవ్వడూ నిద్ర లేవడానికి వీలులేదు. చంద్రుడు ఉండగా నిద్రపోయేందుకు వీల్లేదు. తినడం, తాగడం, పనీపాటా.. అన్నీ రాత్రివేళల్లోనే! పగటిపూట ఇవన్నీ నిషేధిస్తున్నాం. పగటిపూట పనిచేసేవారు కఠినదండనకు గురవుతారని నేడే రాజ్యమంతా దండోరా వేయిస్తాం’ అన్నాడు.
ప్రభువులు, అధికారుల మెరమెచ్చుల కోసం వారు చెప్పినట్లల్లా తోకలు ఆడించడం, వాళ్ల తలతిక్కలకు తగ్గట్లుగా తందనాలు పలకడం ఏ రాజ్యంలో అయినా మామూలే. మా రాజ్యం కూడా మినహాయింపు కాదు.
‘స్వర్గానికి ప్రతిస్వర్గాన్ని సృష్టించిన విశ్వామిత్రునికి వలె మీ కీర్తి అజరామరం అవుతుంది మహారాజా!’ అన్నాడు మంత్రులలో ఒకడైన దుష్టబుద్ధి.
సుబుద్ధి కొంచెం మంచి ఆలోచన చెప్పబోయాడు.
‘మనుషులను మనం చెప్పినట్లు వినేలా చేయవచ్చు. బెదిరించి కొందరిని, తాగుడు, జూదం లాంటి విలాసాలకు అనువుగా ఉంటుందని మభ్యపెట్టి మరికొందరిని మన దారిలోకి తేవచ్చు. కానీ, రాజ్యంలోని పశుపక్ష్యాదులు మాత్రం అలాంటివి కావు. అవి ప్రకృతి ధర్మాలను మీరి నడుచుకోవు. మీలాంటివారిని ఆదర్శంగా తీసుకుంటే రేప్పొద్దున వేరొక రాజు పాదాలతో కాకుండా చేతులతో నడవమంటాడు. ఇంకొకడు కళ్లతో విని, చెవులతో చూడమంటాడు. ఇది సరైన విధానం కాదు’ అని తేటతెల్లంగా చెప్పాడు.
కానీ, సుబుద్ధి మాటలకు విలువ లేకుండా పోయింది. కానీన మహారాజుగారి బుర్రలో పుట్టిన వెర్రిమొర్రి ఆలోచన చూశారుగా.. మా రాజ్యాన్ని ఏ గతికి తెచ్చిందో. రాజుగారి కఠిన శిక్షలకు భయపడి మేమంతా ప్రకృతికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం..” అంటూ ఆ ఇంటి యజమాని తమ రాజ్యపు కథను వినిపించాడు.
* * *
వరప్రసాదులు ఐదుగురూ ఆ రాత్రంతా తమలో తాము చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ రాజ్య ప్రజలకు మేలు చేసి, రాజుకు బుద్ధి చెప్పిన తరువాత కానీ అక్కడినుంచి కదలకూడదని నిశ్చయించుకున్నారు.
మరునాడు రాత్రికి కానీన మహారాజు కొలువుకు వెళ్లారు.
“రాజేంద్రా! మాది కాశ్మీర దేశం. మా పుణ్యం కొద్దీ మిమ్మల్ని చూడగలిగాం. ఇక మా సంగతి.. విచిత్రమైన వస్త్రాలు నేయడంలో మాకు సాటి ఎవరూ లేరు. భూమండలమంతా మా పేరు మారుమోగుతూ ఉంటుంది. బహుశా మీరు వినే ఉంటారు” అన్నాడు వసంతుడు.
వారెవరో నిజానికి తెలియకపోయినా.. తెలుసన్నట్లు గంభీరంగా తలాడించాడు కానీనుడు.
“రాజా! మేము ఆరుమాసాలకు ఒక ధోవతి, ఉత్తరీయం, పాగా వస్త్రాన్ని మాత్రమే నేస్తూ ఉంటాం. మేము నేసేవి మామూలు వస్త్రాలు కావు. దేవతా వస్త్రాలు. మేము నేసిన వస్త్రాలను ధరించి ఊరంతా ఊరేగి, ఆ రాత్రికి భార్యతో గడిపితే ఆ దంపతులకు దేవసమానుడైన పుత్రుడు జన్మిస్తాడు. అయితే అవి దేవతావస్త్రాలని మనవి చేశాం కదా! జారులకు, చోరులకు, అబద్ధం చెప్పేవారికి ఆ వస్త్రాలు కనబడవు. అటువంటి వస్త్రాలను మీకోసం నేసి ఇవ్వాలని మా కోరిక” అన్నాడు ప్రవరుడు.
దేవతా వస్త్రాలనగానే రాజుకు ఆశ పుట్టింది. “వెంటనే పని మొదలుపెట్టండి” అన్నాడు.
“మహారాజా! మాకోసం ఓ భవంతిని కేటాయించండి. నేతపని పూర్తికాగానే మాకు యాభైవేల మాడలు దక్షిణగా ఇవ్వాలి. పని జరుగుతున్నకాలం మీరు ప్రత్యక్షంగా ఆ వస్ర్తాలను చూడకూడదు” అన్నాడు సాంబుడు.
వారి షరతులన్నింటికీ కానీనుడు ఒప్పుకొన్నాడు.
“రాత్రింబవళ్లనే తిరగేసిన మాకు.. దేవతా వస్త్రాలను కట్టుకుని, దేవసమానుడైన పుత్రుణ్ని పొందిన కీర్తి దక్కవద్దా? ఈ మాత్రపు చిల్లర ఖర్చుకు వెనుదీస్తామా?” అన్నాడు.
రాజు కోసం దేవతా వస్త్రాలను నేసే పని అప్పగించడం పూర్తయింది. వరప్రసాదులు అడిగినట్లుగానే ఓ భవంతిని కేటాయించారు. రాట్నాలు, మగ్గాలు అన్నీ భవంతిలో సమకూర్చారు. ప్రతిరోజూ రాత్రిపూట ఆ భవంతినుంచి మగ్గం ఆడుతున్న చప్పుడు వినిపించేది. కానీ, నూలు లేకుండా వట్టి మగ్గమే చప్పుడు చేస్తున్నదనే విషయం చాలామందికి తెలియదు.
కొంతకాలానికి పని ఎంతవరకూ వచ్చిందో తెలుసుకురమ్మని ఇద్దరు మంత్రులను పంపించాడు కానీనుడు. వచ్చిన మంత్రులను సాదరంగా ఆహ్వానించారు వరప్రసాదులు. తమ పనిని బహువిధాలుగా వర్ణించసాగారు.
“అయ్యా! ఈ నూలు పట్టుకుని చూడండి. ఎంత మెత్తగా ఉందో గమనించారు కదా!” అని ఒక ఖాళీ కండెను మంత్రుల చేతిలో పెట్టాడు సాంబుడు.
వచ్చిన వారికి మతిపోయింది. నోరు తెరిచి ఏదో చెప్పబోయారు. కానీ, జారత్వం, చోరత్వం, అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్నవాళ్లకు ఆ వస్త్రాలు కనిపించవని ముందుగా చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది.
“చాలా బాగున్నది. చాలా బాగున్నది” అంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు.
రాజు వద్దకు వెళ్లి.. “అటువంటి నూలు మా జన్మలో చూడలేదు. ఆ సొగసును మేం వర్ణించలేం. నిజంగా అది భూలోకానికి చెందినది కాదు మహారాజా!” అని వింతలు వింతలుగా చెప్పుకొచ్చారు.
నిజమేననుకున్నాడు కానీనుడు. బుద్ధి పుట్టినప్పుడల్లా ఎవరినో ఒకరిని.. “దేవతా వస్త్రాలు నేసే పని ఎంతవరకూ వచ్చిందో చూసిరండి” అని పంపుతూనే ఉన్నాడు. వెళ్లినవాళ్లు ఖాళీ రాట్నాలను, మగ్గాలను చూసివచ్చి, కనబడలేదంటే పరువు పోతుందని.. “అబ్బో అబ్బో.. వస్త్రాలు గొప్పగా ఉన్నాయి..” అని చెబుతూ, కొద్దిసేపు నటించి వెళ్లిపోతూ ఉండేవాళ్లు.
ఆరునెలల గడువు పూర్తయింది.
రాజుగారికి దేవతావస్త్రాలను సమర్పించే రోజు రానే వచ్చింది. ముందస్తుగా యాభైవేల మాడల దక్షిణతో కూడిన పళ్లేన్ని ప్రవరుడు రాజునుంచి అందుకున్నాడు. ఎర్రని పట్టువస్త్రంతో కప్పి ఉంచిన పళ్లెంలో దేవతావస్ర్తాలను వసంతుడు రాజుకు అందజేశాడు.
“రాజా! వీటిని ధరించి, మీరు దేవతా సమానులు కావాలని మా ఆశ. పవిత్రమైన ఈ వస్త్రాలను మీ ఏకాంత మందిరానికి వెళ్లి ధరించండి. అనంతరం మదగజాన్ని అధిరోహించి నగరవీధులలో ఊరేగండి. మీ కీర్తిప్రతిష్ఠలు వీటివల్ల రెట్టింపు కాగలవు” అన్నాడు.
మహారాజు సంశయిస్తూనే ఆ వస్త్రాలను అందుకున్నాడు. కంటికి కనిపించని వాటిని ‘కనిపించట్లేదు’ అని చెప్పడానికి వెనకాడాడు. అంతఃపురానికి వెళ్లి, మామూలు వస్త్రాలను విడిచి దేవతావస్త్రాలను ధరించాడు. మహారాణి వారిస్తున్నా వినకుండా ఊరేగింపునకు బయలుదేరాడు.
జరగవలసిన ఘోరమంతా జరగనే జరిగింది. రాజ్యపౌరుల మధ్య రాజుకు భంగపాటు ఎదురైంది. పూర్తి నిజం తెలుసుకున్న తరువాత మహారాజు ఆగ్రహోదగ్రుడయ్యాడు.
వరప్రసాదులను పట్టి బంధించి తీసుకురమ్మని భటులను పంపించాడు.
కానీ, అప్పటికే ఆ ఐదుగురూ రాజ్యపు పొలిమేరలు దాటి వెళ్లిపోయారు. వారు నివసించిన భవంతిలోని గోడలపై ఒక లేఖ దర్శనమిచ్చింది. దాంట్లో ఇలా ఉంది..
కానీన మహారాజుకు.. దుష్టబుద్ధితో నీవు లోకవిరుద్ధమైన మార్పులను చేశావు. ప్రజలను కష్టాల పాలు చేశావు. నీచేత ఈ పనులన్నీ మాన్పించడానికి దేవేంద్రుని దూతలుగా మేం వచ్చాం. ఈ విశ్వంలోని జీవులందరితోపాటు మానవుడు కూడా ప్రకృతి ధర్మాలకు అనుగుణమైన స్వేచ్ఛతో ఆనందంగా జీవించవచ్చు. ధర్మాన్ని పాడుచేస్తే మహమ్మారులు చుట్టుముడతాయి. కడగళ్లు వచ్చిపడతాయి. ఇకమీదనైనా నీ బుద్ధి మార్చుకో. నీ విపరీత శాసనాన్ని వెంటనే విరమించుకో. లేదంటే మరోసారి వచ్చి, నిన్ను రాజ్యభ్రష్టుణ్ని చేయాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త!
– ఇది వరప్రసాదుల హెచ్చరిక!!
* * *
(వచ్చేవారం.. పంజరంలో రామచిలుక)
అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | జారిపడ్డ మామిడిపండు
కుదుపు…“చిల్లర రాళ్లకు మొక్కుతు ఉంటే చిత్తము చెడురా ఒరే ఒరే!