Kasi Majili Kathalu | మూలం – అనుసృజన
సంసార వ్యామోహాన్ని విడిచిపెట్టి సన్యాసం స్వీకరించిన మణిసిద్ధుడు అనే యతి.. కాశీయాత్ర చేయాలని నిశ్చయించుకుంటాడు. అయితే యాత్రలకు ఒంటరిగా వెళ్లరాదనే నియమాన్ని పురస్కరించుకొని, తనకు తోడుగా రమ్మని ఒక గోపాలకుణ్ని కోరతాడు. కథలంటే మక్కువ కలిగిన ఆ గోపాలకుడు.. ‘దారిలో కనిపించే విశేషాలన్నిటినీ నాకు
విడమరిచి చెబితేనే మీతో వస్తాను’ అని షరతు పెట్టాడు. మణిసిద్ధుని వద్ద ఒక అపురూపమైన మణి ఉంది. దాని సాయంతో దారిలో కనిపించిన ప్రతి విశేషాన్ని తెలుసుకొని, ఎప్పటి
కప్పుడు ఆ గోపాలకుడికి కథలు కథలుగా చెబుతాడు. అవే.. కాశీ మజిలీ కథలు ( Kasi Majili Kathalu ).
1930వ దశకంలో మధిర సుబ్బన్న దీక్షిత కవి రచించిన కాశీ మజిలీ కథలు తెలుగు పాఠకలోకాన్ని ఉర్రూతలూగించాయి. పూర్తి జానపద శైలితో సాగినప్పటికీ, సామాన్యులకు అంతగా రుచించని వేదాంత, వ్యాకరణాది అంశాలను పరమార్థ బోధారూపంగా అందించిన అద్వితీయ రచన కాశీమజిలీ కథలు. ఆనాటి శిష్ట వ్యావహారిక భాషలో వీటిని సుబ్బన్న దీక్షితులు రచించారు. నేటికి ఆ భాష శుద్ధ గ్రాంథికంగా మారిపోయింది. అప్పట్లో పన్నెండు సంపుటాలుగా వెలువడిన ఈ కథలు తరువాతి కాలంలో అనేక రచనలకు, సినిమాలకు స్ఫూర్తిగా నిలిచాయి. మూలగ్రంథానికి సరళానువాదాలు వెలువడ్డాయి. కొత్త తరాల కోసం మరింత సులభమైన శైలిలో కాశీ మజిలీ కథలను ధారావాహికగా అందిస్తున్నాం. మూలంలోని మెరుపు చమక్కులను విడిచిపెట్టని ఈ రమ్యమైన అనుసృజన మిమ్మల్ని అలరిస్తుందని మా విశ్వాసం.
వసంతకాలపు సాయం సమయం. అది కాశ్మీర పాలకుడైన శూరసేనుడి ఏకాంత కొలువు కూటపు సౌధానికి పైభాగం. పైకప్పు లేని ఆ చోట నాలుగువైపులా స్తంభాలకు వట్టివేళ్ల చాపలు కట్టి ఉన్నాయి. ఆ చాపల తేమను తాకుతూ, భవంతి పైదాకా పాకిన లతల పూల సువాసనలను కూడా మోసుకుంటూ మలయమారుతం మేనికి హాయి గొలిపేలా వీస్తున్నది.
ఆ ఏకాంతపు కొలువులో ఆ రోజు తమ రాజుకోసం నలుగురు మంత్రులు ఎదురు చూస్తున్నారు. వారిలో మొదటివాడు నీతిశాస్త్ర పారంగతుడైన ప్రధానమంత్రి. రెండోవాడు జ్యోతిషంలో అందెవేసిన చేయి అయిన పురోహితుడు. మూడో మంత్రి వర్తక ప్రముఖుడు కాగా, నాలుగో మంత్రి సకల యంత్ర రచనా నిపుణుడైన కళాదుడు.
వారంతా అక్కడ సమావేశమైన కొద్దిసేపటికి మహారాజు శూరసేనుడు వచ్చాడు. మౌనంగా తన స్థానంలో కూర్చున్నాడు. ఆ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడో, చాలాసేపు పెదవి విప్పి మహారాజు చెప్పడం లేదు. కనుసన్నలతో సైతం తన మనోభావాన్ని తెలియచేయడం లేదు. అతని ముఖ విలాసాన్ని చూడబోతే ఏదో గడ్డు సమస్యే అయి ఉంటుందని మంత్రులు ఊహించారు. కానీ, అదేమిటో మాత్రం పోల్చుకోలేక పోతున్నారు.
కొద్దిసేపటికి ప్రధానమంత్రి వినయనిధి.. “రాజా! చూడబోతే తమరేదో తీవ్ర విచారంలో ఉన్నట్లున్నారు. మాతో చెప్పండి. అది ఎటువంటి కార్యమే కానీ, మా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా మేము నిర్వహిస్తాం” అన్నాడు.
రాజు దీర్ఘ నిశ్వాసాన్ని విడిచి.. “మిత్రులారా! మాకు ఏ కొరతా లేదు. నేటి ఉదయాన ఒక వార్త విన్నాం. మన రాజ్యంలో ఒక కోటీశ్వరుడు అకాలమృత్యువాత పడ్డాడు. అతనికి ఎలాంటి సంతానం కానీ, సమీప బంధువులు కానీ లేకపోవడం చేత.. మరణశాసనం రాయకపోవడం చేత, అతని ఆస్తినంతా మన ఖజానాకు తరలించారు” అని చెప్పి కొద్దిసేపు ఆగాడు.
“ఈ వార్త మేమూ విన్నదే. సమంజసం కూడానూ!” అన్నాడు ప్రధానమంత్రి.
“కావచ్చు. కానీ, సంతానం లేనివాడికి ఎటువంటి గతి పట్టిందో చూశారా?! రేపు మనదీ అదే పరిస్థితి కదా అనే చింత మమ్మల్ని ఎక్కువగా బాధిస్తున్నది. ఇప్పటికే మనకు పూర్వప్రాయం గడిచిపోయింది. తెల్లవారితే ఎవరేమవుతారో చెప్పలేం. మనలో ఒక్కరికైనా ఒక్క పుత్రుడైనా లేకపోయాడు కదా! మన అనంతరం ఈ రాజ్యం ఎవ్వరి పాలు కానున్నదో అని చింతిస్తున్నాం” అన్నాడు శూరసేనుడు.
అప్పుడు పురోహితుడు లేచి నిలబడి..“రాజా! చింతించకండి. సంతానం పొందడానికి శాస్త్రంలో అనేక మార్గాలున్నాయి. దశరథుడు పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించి రామాదులను పొందాడు. ద్రుపదుడి వంటివారు హోమాలు నిర్వర్తించారు. దానం చేత, తీర్థసేవ చేత పుత్రులను పొందిన వారున్నారు. కడుపున పుట్టినవారే కాకుండా సంతానాన్ని శాస్త్రం అనేక రకాలుగా చెప్పింది” అన్నాడు.
యంత్ర నిపుణుడైన కళాదుడు.. “రాజా! వైద్యశాస్ర్తాన్ని ఎరిగినవారు, సంతానం దైవికమని నమ్మలేరు. ఔషధ సేవనం చేత ఆరోగ్యవంతులైన సంతానాన్ని పొందవచ్చు. మీరు అధైర్య పడకండి” అని సలహా చెప్పాడు.
వారి చర్చలు కొనసాగుతున్నాయి. అందరూ తమకు తెలిసిన పురాణేతిహాస గాథలను, తమ దృష్టికి వచ్చిన అనేక ఇతర విషయాలను కూడా కలబోసుకుంటున్నారు.
గోధూళివేళ అయింది. పక్షుల కిలకిలారావాలు వినవస్తున్నాయి. ఆ కొలువుకూటానికి నాలుగువైపులా స్తంభాలకు కట్టి ఉంచిన వట్టివేళ్ల చాపలను సేవకులు తొలగించారు. నలుగురు మంత్రులకూ, రాజుకూ మధ్య వేసి ఉంచిన బల్లపై.. పానపాత్రలను కూడా తీసివేశారు.
దాదాపు చీకటి పడబోతున్నది. సంతానం పొందడానికి ఏ మార్గం మంచిది అనే విషయంలో వారింకా ఓ నిర్ణయానికి రాలేదు. అలాంటి సమయంలో..
అంతరిక్షం నుంచి వారి ముందున్న బల్లపై ఒక మామిడిపండు రాలిపడింది. దానిని తన కాళ్లసందు నుంచి జారవిడుచుకున్న గద్ద ఒకటి.. ఆశగా ఓసారి వెనక్కు మరలివచ్చి ఆకాశంలో వలయాకారంగా తిరిగి, ఆ పండు తనకిక దక్కదని నిర్ణయించుకొని, తనదారిన తాను ఎగిరిపోయింది. శూరసేనునికి, మంత్రులకు ఆ సంఘటన విభ్రాంతి గొలిపింది.
అప్పుడు ప్రధానమంత్రి తన బుద్ధి కుశలత చేత పురోహితునితో..
“ఈ పండు వృత్తాంతం ఏమిటో ప్రశ్న రూపంగా చెప్పగలవా?” అని అడిగాడు.
పురోహితుడు ఆ పండు తమముందు పడిన సమయానికి లగ్నం వేసి చూశాడు.
కొద్దిసేపు ఆలోచించి..“మరేమీ సందేహం లేదు. ఇది.. సంతాన కారకమైన ఫలం” అని తేల్చి చెప్పాడు. ఆ మాటతో అందరూ ఆశ్చర్యపోయారు. అది దైవ ప్రసాదమే అని తలచి, ఆ పండును అప్పటికప్పుడే విడదీశారు.
రాజు టెంకను, మంత్రి తోలును.. పురోహితుడు, వర్తకుడు, కళాదుడు రసఖండాలైన ముక్కలను తమ వాటాలుగా తీసుకున్నారు. ఆ రాత్రికి వాటిని తమ భార్యలతో కలిసి భుజించారు. ఆ రాత్రికి రతిభోగాలతో ఆనందించారు.
తెల్లవారేసరికి వారి హృదయాలకు పుత్రోదయం కాగల శుభసూచనలు అనేకం కలిగాయి.
* * *
ఆ మామిడి పండు కథ విచిత్రమైనది..
కర్ణాటక దేశంలో శుద్ధమతి అనే వేదపండితుడు ఉండేవాడు. అతడు చాలాకాలం కాశీలో విద్యాభ్యాసం చేసి, నడివయసులో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఇక అప్పుడు వివాహం చేసుకొని, తన ఇంటినే గురుకులంగా మార్చుకొని కాలక్షేపం చేయసాగాడు. ఆ గురుకులంలో అనేకమంది విద్యార్థులు ఉండేవారు.
పదిహేడేళ్ల ప్రాయంలో శుద్ధమతి భార్య కాపురానికి వచ్చింది. కొత్తల్లో మెట్టినింట లజ్జావతిగా ఉన్నప్పటికీ.. క్రమంగా తన భర్త శిష్యులను పుత్రులుగా భావిస్తూ ప్రౌఢగా సంచరించడం మొదలుపెట్టింది. విద్యార్థులు కూడా గురుపత్నియందు మాతృభావంతో చనువుగా మసలుకునేవారు.
నడివయసులో యవ్వనవతిని పెళ్లాడిన శుద్ధమతికి కాలం గడిచేకొద్దిగా కొద్దిగా మతి చెడింది. భార్య ప్రవర్తనను అనుమానించ సాగాడు. ఆమె జారిణి అని ఏ రుజువులూ లేకపోయినా, భార్య ప్రవర్తన తనకు పరువు చేటు అనుకున్నాడు. ఇంతటి అపఖ్యాతిని మూటగట్టుకున్నాక ఇక, శుద్ధమతికి సొంత ఊళ్లో ఉండబుద్ధి కాలేదు.
ఎవరికీ చెప్పకుండా ఒకనాటి రాత్రి ఊరు విడిచి పెట్టి వెళ్లిపోయాడు. గురువు ఊరు విడిచిపెట్టబోతున్న వైనం ఎలా తెలిసిందో, ఏమో కానీ అతడి శిష్యుల్లో ఒక నలుగురు అతడిని వెంబడించారు. ఎంతగా చెప్పినా గురువును వదిలిపెట్టి పోవడానికి వారు ఇష్టపడలేదు. దాంతో చేసేది లేక శుద్ధమతి, తన శిష్యులతో కలిసి ముందుకు నడుస్తూ పొద్దున పది గంటల వేళ ఒకానొక గ్రామానికి చేరుకున్నాడు. ఆ గ్రామంలోని చెరువు వద్ద వారంతా స్నానాదులకు ఉపక్రమించారు
ఆ సమయంలో అక్కడికి ఒక గృహస్థు భార్య మంచినీటి బిందెతో వచ్చింది. వీరిని చూసి..
“అయ్యా! మీరెవరు?” అని అడిగింది.
“అమ్మా! మేము పరదేశీయులం” అని సమాధానమిచ్చాడు శుద్ధమతి.
అందుకు ఆ ప్రౌఢ స్త్రీ కన్నులు విప్పార్చి నవ్వి.. “కాదు” అని చెప్పి బిందెనెత్తుకొని వెళ్లిపోయింది.
‘కాకపోవడమేమిటి?’ అనుకున్నారు శుద్ధమతితోపాటు అతడి శిష్యులు.
కొద్దిసేపటికి ఆ స్త్రీ మంచినీళ్ల బిందెతో అక్కడికి మళ్లీ వచ్చింది.
“అమ్మా! మేము పరదేశీయులం కాకపోతే మార్గస్థులం” అన్నాడు ఒక శిష్యుడు. ఆమె మళ్లీ అదేవిధంగా నవ్వి.. “కాదు” అని చెప్పేసి వెళ్లింది.
ఈసారి ఆమె మళ్లీ వచ్చేలోపుగా వీళ్లంతా ఆలోచించుకొని.. “మేము బాటసారులం” అన్నారు.
“కాదు” అన్నదామె మళ్లీ.
“మేము వెర్రివాళ్లం. ఒట్ఠి మూర్ఖులం” అన్నాడొకడు చివరికి ఒళ్లుమండి.
“అయ్యయ్యో! కోపగించుకోకండి స్వాములూ! మీరు అటువంటివారు కానేకారు” అన్నదామె.
“ఏదీ కాకపోతే మేమెవరో నీవే చెప్పవమ్మా! చూడబోతే మాకంటే పండితురాలివిగా కనిపిస్తున్నావు. దయచేసి చెప్పు” అడిగాడు శుద్ధమతి.
అందుకు ఆ స్త్రీ.. “అయ్యా! అదిగో అదే మా ఇల్లు. ఈ పూటకు మా ఇంట దేవతార్చన చేసుకోండి. మీ స్వయంపాకానికి కావాల్సిన సామగ్రి సమకూరుస్తాను” అన్నదామె.
వారంతా ఆమె ఇంటికి వెళ్లారు.
వారికి ఓ గదిని చూపించి.. “అయ్యా! నా మగడు రాజుగారి కొలువులో పురాణం చెప్పి రావడానికి వెళ్లాడు. మధ్యాహ్నానికల్లా తిరిగి వస్తాడు. ఆయన వచ్చేలోపుగా మీ వంట, భోజనం పూర్తి కావాలి. అసలే ఆయనకు అనుమానం జాస్తి. మిమ్మల్ని ఇక్కడ చూస్తే ఊరుకోడు. కనుక..” అన్నదామె మర్యాదగా.
“సరేనమ్మా! నీ మగడు వచ్చేలోపే భోజనాలు కానిచ్చి.. వెళ్లిపోతాం” అన్నాడు శుద్ధమతి.
శిష్యులు వంట ప్రయత్నాల్లోనూ, గురువు దేవతార్చనలోనూ మునిగిపోయారు. ఎంత వేగంగా కానిచ్చినా మధ్యాహ్నం లోపుగా వారి భోజనాలు పూర్తి కాలేదు. ఇంతలోనే ఆ గృహస్థు వచ్చాడు.
భార్యను అనుక్షణం అనుమానించే లక్షణం కలిగిన అతగాడు ముందస్తుగా గదులన్నీ వెతికాడు. ఓ గదిలో శుద్ధమతి, అతడి శిష్యులు భోజనాల్లో మునిగి ఉన్నారు. మరో గదిలో తన భార్య ఉన్నది. చప్పుడు కాకుండా ఆ రెండు గదులకూ తలుపులు మూసి, బయటినుంచి గొళ్లాలు పెట్టాడు గృహస్థు.
పరుగు పరుగున తన రాజు వద్దకు వెళ్లాడు.
“రాజా! కట్టుకున్న భార్యను విడిచిపెట్టి, వేరే ఆడవాళ్లను పెళ్లి చేసుకొనే మగవాళ్లను ఘోరమైన శిక్షల పాల్జేస్తారు మీరు. మీ శాసనానికి భయపడి, వ్యభిచారిణి అయిన నా భార్యను పంటిబిగువున భరిస్తున్నాను. ఇప్పుడామె అయిదుగురు విటులతో కులుకుతుండగా నా కళ్లారా చూశాను. వాళ్లందరినీ నా ఇంటిలోనే బంధించి వచ్చాను. మీరు కూడా కళ్లారా చూసి, ఆమెను దండించాలి. తక్షణం బయలుదేరండి” అన్నాడు.
రాజు అతని మాటలకు విస్తుబోతూ ఆ పురాణ పండితుడి ఇంటికి వచ్చాడు. వేర్వేరు గదుల్లో బందీలుగా ఉన్న పండితుడి భార్యను, శుద్ధమతిని, శిష్యులను చూశాడు.
శుద్ధమతిని చూసి.. “ఏమయ్యా! గృహస్థు ఇంటిలో లేని సమయంలో, స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా రావచ్చునా?! ఎందుకు వచ్చావు?” అని ప్రశ్నించాడు.
“మహారాజా! మామూలుగానైతే నేను రాకపోదును. కానీ, ఆమె మా కంటికి గొప్ప విద్వాంసురాలిగా కనిపించింది. మేము మా గురించి చెప్పుకొన్న ప్రతిమాటనూ ఆమె ఖండించింది. ఆమె వైదుష్యానికి అబ్బురపడి, ఆమె దృష్టిలో మేము ఎవరమో తెలుసుకోవాలనిపించి ఇలా వచ్చాం. మా సందేహానికి సమాధానం దొరికితే ఇక్కడినుంచి వెళ్లిపోతాం” అన్నాడు శుద్ధమతి.
పురాణ పండితుడి భార్యను రావించి ఆమెకు నమస్కరించి.. “సాధ్వీమణీ! నీ పాతివ్రత్య మహిమను మా రాజ్యమంతా కొనియాడుతుంది. ఏదో ఒక సందర్భంలో నిన్ను దర్శించి నీకు నమస్కరించాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ, ఇటువంటి సందర్భంలో నిన్ను చూడటం బాధాకరంగా ఉంది. వారి సందేహాలకు సమాధానాలు దయచేసి చెప్పవమ్మా” అని అడిగాడు రాజు.
“వారు మా ఆతిథ్యం స్వీకరిస్తారని అలా మాట్లాడాను. అంతకంటే మరేమీ లేదు” అని సమాధానమిచ్చింది ఆమె.
“అలాకాదు. నీ వైదుష్యాన్ని తక్కువ చేయలేం. దయచేసి చెప్పు. వారు తాము పరదేశీయులం అని చెబితే నీవు కాదన్నావెందుకు?”.
“మహారాజా! ఒకే భాష మాట్లాడేవారి మధ్య పరదేశీయులన్న మాట చెల్లదు. మాతృభాషను బట్టి ఏ ప్రాంతాలవారైనా సోదరభావాన్ని కలిగించుకోవాలి”.
“మరి మార్గస్థులంటే ఎందుకు కాదన్నట్లు?”.
“మనకన్నా ముందుగా మార్గమందుండేవి అన్నోదకములే. మనం కాదు”.
“మరి బాటసారుల మాట?”.
“నిరంతరాయంగా నడిచే సూర్యచంద్రులకు చెల్లుతుంది”.
“ఇక చివరిగా వెర్రివాళ్లం, ఒట్ఠి మూర్ఖులం అన్నారు కదా!”.
“అంతలేసి చదువుకున్నవారిని వెర్రివాళ్లనలేం. ఇక పై మాట..” అని అర్ధోక్తిలో ఆగిపోయిందామె.
“సందేహించక చెప్పవమ్మా!” అన్నాడు రాజు.
“మిట్టమధ్యాహ్నం ఒక గృహిణి తన భర్త కళ్లు గప్పి అయిదుగురు విటులను ఇంటికే రప్పించుకోగలదని నమ్మి, న్యాయవిచారణకు వచ్చిన మీకు చెల్లవచ్చునేమో కానీ.. వారికి కాదు” అన్నదామె.
ఆ మాటతో రాజుకు, పురాణ పండితుడికే కాకుండా భార్యపై అనుమానంతో ఆమెను విడిచి వచ్చిన శుద్ధమతికి కూడా కనువిప్పు కలిగింది. శుద్ధమతి అక్కడినుంచి వెనక్కుమళ్లి, తన ఇంటికి చేరుకున్నాడు. భార్యతో అరమరికలు లేకుండా కాపురం సాగించాడు.
కొంతకాలానికి అతనికి సంతానం పొందాలనే వాంఛ జనించింది. కాశీకి పోయి, విశ్వనాథుని ఉద్దేశించి కల్పోక్త ప్రకారంగా పాశుపత వ్రతం చేశాడు. వ్రతం పరిసమాప్తి అయ్యే రోజున విశ్వనాథుడు స్వప్న దర్శనమిచ్చాడు.
“శుద్ధమతీ! నీవు నా పట్ల సగం భక్తితో వ్రతం చేశావు. అయినా కల్పోక్తంగా వ్రతాన్ని చేసినందు వల్ల నీకు ఫలితం ఇవ్వక తప్పదు. ఇదిగో సంతాన కారకమైన ఈ మామిడి పండు తీసుకువెళ్లి, నీ భార్యతో కలిసి తిను. ఒక్క విషయం గుర్తుంచుకో! దీనిని ఎక్కడా నేలపై పెట్టకూడదు” అన్నాడు.
స్వప్నం నుంచి మేల్కొని, శుద్ధమతి కన్నులు తెరిచేసరికి ఎదురుగా మామిడిపండు కనిపించింది. దానిని జాగ్రత్తగా పట్టుకొని స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఆ పండును చెట్టుకొమ్మకు వేలాడగట్టి చెరువులో స్నానానికి దిగాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ గద్ద దానిని కాళ్ల సందున ఇరికించుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది.
* * *
అలా గద్దకు చిక్కిన ఆ మామిడిపండు తిన్న తరువాత కొద్దిరోజులలోనే కాశ్మీర పాలకుడైన శూరసేనుడు, అతని నలుగురు మంత్రులకు చక్కని పుత్ర సంతానం కలిగింది. రాజపుత్రునికి వసంతుడని, మంత్రి కుమారునికి రాముడని నామకరణం చేశారు. బ్రాహ్మణుడు ప్రవరుడని, వైశ్యుడు సాంబుడని, కళాదుడు దండుడని తమ కుమారులకు పేర్లు పెట్టుకున్నారు. తండ్రుల వలెనే వారు సైతం చక్కని స్నేహితులై, ఒక్కటిగా కలిసి పెరిగారు. రాజ్యంలోని వారంతా వాళ్లందరి పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి ఆ అయిదుగురినీ ఒకే పేరుతో.. ముచ్చటగా వరప్రసాదులని పిలవసాగారు.
అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ