TGSRTC | ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లుగా అపాయింటెడ్ డే ప్రకటించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (TJMU) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జూన్ 1వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద సామూహిక దీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు.
యూనియన్ ఎన్నికలకు ముందుగా ఉద్యోగుల ప్రక్రియ పూర్తి చేయాలని.. 2026 మే 1 నుంచి అపాయింటెడ్ డే ప్రకటించాలని టీజేఎంయూ నాయకులు డిమాండ్ చేశారు. అపాయింటెడ్ డే కంటే ముందుగా యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రకటించడంతో ఉద్యోగుల్లో అయోమయం నెలకొందని వారు అభిప్రాయపడ్డారు.
జూన్ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద దీక్ష నిర్వహించనున్నట్లు టీజేఎంయూ వ్యవస్థాపక రాష్ట్రకార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తెలిపారు. ప్రభుత్వంలో విలీనం కోరుకునే ఉద్యోగులంతా యూనియన్లకు అతీతంగా ఈ దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ దీక్షకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమాఖ్య కూడా మద్దతు ప్రకటించింది. యాజమాన్యం వద్ద పరిష్కారం కావాల్సిన 29 సమస్యలపై చర్చలు కొనసాగుతున్న సమయంలో ఎన్నికలకు వెళ్లడం వల్ల కార్మికులు నష్టపోతారని కార్మిక సమాఖ్య నాయకులు కె.రాజిరెడ్డి తెలిపారు. విలీనం అనంతరం యూనియన్లు కొనసాగితే ఎన్నికల అంశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. విలీనానికి సంబంధించిన విధివిధానాలు రూపొందించే కమిటీలో ప్రతి యూనియన్కు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. అపాయింటెడ్ డే ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.