ముంబై: మండే ఎండలకు ఒక కోతి దాహంతో అల్లాడిపోయింది. తాగు నీరు కోసం ఏకంగా ఒక బస్సును ఆపింది. దాని దీన పరిస్థితికి ప్రయాణికులు చలించిపోయారు. తమ బాటిల్లోని నీటిని ఆ కోతికి తాగించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Thirsty Monkey Stops Bus) మహారాష్ట్రలోని యవత్మల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాషిమ్ నుంచి పుసాద్ వెళ్తున్న మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్ ఆర్టీసీ) బస్సు అటవీ ప్రాంతమైన ఖండాలా ఘాట్ వద్దకు చేరుకున్నది.
కాగా, ఒక కోతి అకస్మాత్తుగా రోడ్డుపైకి పరిగెత్తుకు వచ్చింది. సరిగ్గా బస్సు ముందు నిల్చొన్నది. గమనించిన డ్రైవర్ ఆ బస్సును ఆపాడు. డ్రైవర్, ప్రయాణికులు ఆ కోతిని రోడ్డు పక్కకు తరిమేందుకు ప్రయత్నించారు. అయితే ఆ కోతి అక్కడి నుంచి కదలలేదు.
మరోవైపు తీవ్ర ఎండ వేడిమి వల్ల ఆ కోతి ఇబ్బంది పడుతున్నట్లు కొందరు వ్యక్తులు గ్రహించారు. అది దాహంతో అల్లాడిపోతున్నట్లు భావించారు. ఒక వ్యక్తి బాటిల్లోని నీటిని అందించగా ఆ కోతి తాగింది.
అయితే క్షణాల్లోనే మరి కొన్ని కోతలు కూడా అక్కడకు వచ్చాయి. ఆ బస్సును చుట్టుముట్టాయి. దీంతో కొందరు ప్రయాణికులు వాటర్ బాటిల్స్ ద్వారా నీటిని అందించారు. తాగు నీటి కోసం ఆ కోతులు విలవిలలాడటాన్ని బస్సులోని వారు గమనించి భావోద్వేగం చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
पुसद के खंडाला घाट में प्यासे बंदरों ने रोका रास्ता, देखें भावुक वीडियो! #MaharashtraHeatwave #ViralVideo #KhandalaGhat #PusadNews #MSRTC #Monkeyvideo #PeoplesUpdate pic.twitter.com/ketUnTLnIU
— People’s Update (@PeoplesUpdate) May 21, 2026