సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో రూపొందించిన షార్ట్సిరీస్ ‘దందా’తో గుర్తింపును సంపాదించుకున్నారు దర్శకుడు ఆదిత్య దేవులపల్లి. చాయ్షాట్స్ నుంచి వచ్చిన ఈ సిరీస్కు మంచి ఆదరణ దక్కింది. ఈ నేపథ్యంలో దర్శకుడు ఆదిత్య దేవులపల్లి సిరీస్ తాలూకు విశేషాలను పంచుకున్నారు. సినిమాల మీద వ్యామోహంతో ఇంజనీరింగ్ మధ్యలో వదిలేసి దర్శకుడు కావాలని నిర్ణయించుకున్నానని, కొంతకాలం జర్నలిస్ట్గా పనిచేసిన అనంతరం సినిమాలపై దృష్టి పెట్టానని చెప్పారు. “దందా’ సిరీస్లో సైబర్క్రైమ్స్ వెనకున్న దారుణాలను చూపించాం. చిన్న ఓటీపీతోనే మన అకౌంట్ నుంచి లక్షలు మాయమైపోతున్నాయి. నిందితులను మనం పట్టుకోలేకపోతున్నాం.
వినోదప్రధానంగా కథ చెబుతూనే సైబర్ నేరగాళ్ల అసలు రూపాన్ని బయటపెట్టి ప్రజల్లో అవగాహన పెరిగేలా ప్రయత్నించాం’ అని ఆదిత్య దేవులపల్లి అన్నారు. ఇది అసలైన జెన్జీ మాస్ సిరీస్ అని, ప్రతీ సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగుతుందని, మైక్రో డ్రామానే అయినా.. అది క్రియేట్ చేసే ఇంపాక్ట్ చాలా రోజులు గుర్తుండిపోతుందని అన్నారు. ఈ సిరీస్పై ఇప్పటివరకు ఒక్క నెగెటివ్ రివ్యూ రాలేదని, చూసినవారందరూ ఇన్నోవేటివ్ కంటెంట్ అని ప్రశంసిస్తున్నారని, వర్టికల్ స్టోరీటెల్లింగ్లో ఇదొక ట్రెండ్ క్రియేట్ చేసిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను ఓ యాభైఏళ్ల వయసున్న నేరస్థుడి నేపథ్యంలో కథ సిద్ధం చేస్తున్నానని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని ఆదిత్య దేవులపల్లి పేర్కొన్నారు.