మెదక్, మే 27(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి నుంచి ఈదురు గాలులతో భారీ వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం వర్షానికి తడిసిపోయింది. ఈదురు గాలులు భారీగా వీచడంతో చెట్లు కరెంటు స్తంభాలు కూలిపోయాయి. మెదక్ జిల్లాలోని మెదక్, హవేలీ ఘనాపూర్, పాపన్నపేట, కుల్చారం, కౌడిపల్లి, చిలిపిచెడ్, చిన్న శంకరంపేట్, రామాయంపేట, చేగుంట తో పాటు పలు మండలాల్లో కల్లాల్లోని ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో దాన్యం బస్తాలు తడిచిపోవడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొని ఉంటే తమకు నష్టం జరిగేది కాదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొన్నిచోట్ల వడ్ల కుప్పలు ఉండగా మరికొన్ని చోట్ల వరి ధాన్యం బస్తాలో నింపించారు. కాంటజేసిన లారీలు సకాలంలో రాకపోవడంతో ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాలలో నిలువ చేశారు. అకాల వర్షానికి వరి ధాన్యం తడిచిపోవడంతో తమకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
