‘నాన్నకు బాగోలేదు..’ ఇంటిదగ్గర నుండి సమాచారం వచ్చింది. నేను పెద్దగా స్పందించలేదు. గత పదేండ్లుగా ఈ సమాచారం చాలాసార్లు వచ్చింది. కానీ, నేనెప్పుడూ అటువైపు అడుగు తొక్కలేదు.చిన్నప్పట్నుండీ నాన్నంటే నాకు ద్వేషం. అది ద్వేషమో, కోపమో, కసో! నాకే తెలియని పరిస్థితి.పదేండ్ల కింద అమ్మ చనిపోయాక, ఇంట్లోంచి కాలు బయటపెట్టిన నేను.. ఇప్పటివరకూ మా ఊళ్లో కాలు మోపలేదు. నాన్న ఎలా ఉన్నాడని వాకబు చేయలేదు. ఆయన నా పట్ల ప్రవర్తించిన తీరుకు, ఇంతకంటే ఏ రకంగా కసి తీర్చుకోగలనో తెలియలేదు. ఎవరు చెప్పినా నా మనసు మారలేదు. ఇప్పుడు నాన్న మంచం పట్టాడన్న విషయం తెలిసినా, కదలాలనే ఉత్సాహం కలగడం లేదు. నా భార్యాపిల్లలు పోరినా పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు ఎదురైన అనుభవాలు, నేను అనుభవించిన బాధలు వాళ్లకు తెలియవు కదా!ఒకటా, రెండా? ఎన్నని చెప్పను! పుట్టి బుద్దెరిగిన్నుండి ఆయన నాకు చేసిందేమీ లేదు. ఒక్క జన్మనివ్వడం తప్ప. పదిహేనేండ్ల వయసులోనే నా బతుకు నేను చూసుకున్నా. నా చదువు నేనే చదువుకున్నా. నా ఉద్యోగం నేనే సంపాదించుకున్నా. చివరికి నా పెండ్లి కూడా నేనే చేసుకున్నా. ఇవన్నీ కాదు. అసలు నా ఎదుగుదల కోసం ఆయనిచ్చిన ప్రోత్సాహం ఏమీలేదు. పైగా అడుగడుగునా అవమాన పరుస్తూ, అవహేళన చేస్తూ అసంతృప్తికి గురిచేశాడు. మెట్టుమెట్టులో కిందికి జార్చే ప్రయత్నం చేశాడు. అటువంటి తండ్రికి నేనేం చేసేది?
నాకు చదువే రాదన్నాడు. నాకు ఉద్యోగ యోగమే లేదన్నాడు. ఏ పని చేసినా వెన్నుతట్టాల్సిందిపోయి.. అది నావల్ల కానే కాదన్నాడు. అసలు నేనెందుకూ పనికిరాని వాడన్నట్టు మాట్లాడేవాడు. పదో తరగతి పరీక్ష ఫీజుకోసం మా ఊరి గుడికి రంగులేశాన్నేను. కొడుక్కోసం ఫీజుకూడా కట్టని మహానుభావుడు. ఈ రోజు మంచం పడితే నేనెందుకు వెళ్లాలి? బాధ్యత కాబట్టి, నలుగురి కోసం వెళ్లాలన్నా మనస్కరించనంత నరకం చూపాడు నాకు. ఏ తండ్రీ ఏ కొడుకుతో ప్రవర్తించని రీతిలో అడుగడుగునా నిరుత్సాహపరిచాడు. ఈ రోజు నా హోదా, పలుకుబడీ, పేరు ప్రఖ్యాతులూ అంతా.. అంతా నా సొంత సముపార్జన మాత్రమే. నా జీవితంలో తండ్రిగా ఆయన పాత్ర.. శూన్యం మాత్రమే!
“ఏవండీ! ఒక్కసారి వెళ్లొద్దాం”.. అంటూ నా భార్య కదిలించి చూసింది.
నాకు రుచించలేదు. “అక్కర్లేదు” అన్నాను.ఆమె నిర్వేదంగా చూసింది నావైపు.“ఏ.. ఎందుకు వెళ్లాలి?” అన్నాన్నేను. “కన్నతండ్రి కాబట్టి”“హూ! కన్నతండ్రి! కన్నతండ్రి కొడుకు ఏదైనా సాధిస్తే పొంగిపోతాడు. నలుగురికీ చెప్పి ఆనంద పడతాడు. నా తండ్రి అట్లా కాదు. నలుగురి ముందూ నాకు ఏదీ సాధ్యం కాదని దెప్పిపొడిచేవాడు. అసలు నాకు ఏ టాలెంటూ లేదని కించపరిచేవాడు. నేను కసిగా నా ప్రతిభను నిరూపించుకున్నా, సంతృప్తి చెందని వ్యక్తి! నీకు తెలుసా భార్గవీ! ఆయన నన్ను ఎంతగా అణచివేశాడో?”
ఆమె మౌనంగా ఉండిపోయింది.నా ఆలోచనలు బాల్యంలోకి మళ్లాయి.
“నాన్నా నేనూ ఇట్లానే కవిత్వం రాస్తా” అన్నాన్నేను మా తెలుగు ఉపాధ్యాయుడు రాసిన పుస్తకాన్ని చూపిస్తూ.ఆయన ఎగాదిగా చూశాడు. “కవిత్వం రాయడమంటే మాటలా? అది అందరివల్లా కాదు. నీలాంటి వాడికి అస్సలు రాదు” అన్నాడు.నాలో కసి బుస కొట్టింది.‘అందరివల్లా కాదంటే కొందరివల్ల అవుతుందనేగా. ఆ కొందరు ఎవరు? వాళ్లు ఆకాశం నుండి ఊడిపడి ఉంటారా? నాకెందుకో కవిత్వం రాయడం తేలికే’ అనిపించింది. దీక్షగా కూర్చొని ఓ పాట రాశాను. తోచిన భావాలన్నిటినీ ఒకచోట లయబద్ధంగా కూర్చితే పాటయింది. వాళ్లవీళ్ల కవిత్వాల్ని మెచ్చుకొనే నాన్న వద్దకు నా పాటను తీసుకెళ్లి చూపించాను. ఆయన నాలుగైదు లైన్లు చదివి..
“దీన్ని కవిత్వం అనరు. అయినా నువ్వు కవిత్వం రాయడమేంది?” అన్నాడు చులకనగా.
నా మనస్సు చివుక్కుమంది.
‘బాగానే రాశానే!’ అనుకొంటూ, నేను పాడి వినిపించాను. రాస్తున్నప్పుడే లయబద్ధంగా పాడుతూ రాశాను కాబట్టి పాడటం తేలికైంది. నేను రాసిన పాట నేనే పాడి వినిపించి గర్వంగా చూశాను.. మా నాన్న మెప్పుకోసం. ఆయన మెచ్చుకోలేదు.
“కవిత్వం ఎట్లో పాడటం కూడా అట్లే! ఒక కళ. పాటలు పాడటం, నాటకాలేయడం అందరివల్లా అయ్యే పని కాదు. దానికి పెట్టి పుట్టాలి. రాసిపెట్టి ఉండాలి. మనలాంటి వాళ్లు పాడితే వినేవాళ్లుండరు మరి!” అన్నాడు.
ఆ మాటలకు నా మనసు బాధతో మూలిగింది. అంటే.. పాటలు పాడటం కూడా మనతో కాదన్నమాట! కానీ, నాకెందుకో నేను మంచిగానే పాడుతున్నానని అనిపించింది. స్కూల్లో తెలుగు పుస్తకంలోని గేయాలు, పద్యాలుగానీ చదివితే నా తోటి మిత్రులంతా మెచ్చుకొనేవారు కూడా. మా సారు కూడా.. ‘షబ్బాష్ రో’ అంటాడు. మరి పాటలు పాడాలంటే పెట్టి పుట్టాలంటాడేంది నాన్న? పెట్టి పుట్టడమంటే ఆ వయసులో అర్థంకాలేదు. కానీ, ‘నేనెందుకు పాడలేను?’ అనే కసి నాలో బాగా పాడాలనే కోరికను బలంగా నాటింది. ఆ ప్రయత్నంలో నేను గాయకుల్ని అనుకరిస్తూ సినిమా పాటలను పాడటం మొదలుపెట్టాను. పాఠశాల వేదికల మీద బహుమతులు కూడా పొందాను. కానీ, నాన్న మనసును మాత్రం ఆకర్షించలేక పోయాను. నాన్న నా బహుమతుల్ని చూసి..
“నువ్వు పాటల పోటీలో గెలుపొందావా? అతడెవరో తెలివి తక్కువ దద్దమ్మ, నీ పాటకు ప్రైజు ఇచ్చుంటాడు” అన్నాడు.
నా హృదయం భగ్గుమంది. నా తండ్రిని నలుగురి ముందుకూ లాక్కెళ్లి.. ‘ఈయన ముందు పొగడండ్రా నన్ను!’ అని అరవాలని అనిపించింది. కానీ, అది సాధ్యంకాదు. వాళ్లు పొగిడే చోట.. మా నాన్న ఉండడు. అది జరగాలంటే నేను పదిమంది మెచ్చేంత గొప్ప పాటగాణ్ని కావాలి!
మళ్లీ నాలో కసి బుసకొట్టింది. పాటలు పాడటం సాధనతో వస్తుందన్న విషయం నాకు అప్పట్లో తెలియకున్నా, నిరంతర శ్రమ నిజంగానే నన్ను గాయకుడిగా మార్చింది. కాలక్రమంలో నా పాటకోసం చెవికోసుకొనే వాళ్లను తయారు చేసుకున్నాను.
ఆరో, ఏడో చదువుతున్న రోజులవి.
ఓ రోజు మా మేనత్త కొడుకు నాగార్జున్ వచ్చాడు మా ఇంటికి. బొమ్మలు చక్కగా వేస్తాడు. ఆ రోజు కాలక్షేపం కోసం కొండనెత్తుతున్న హనుమంతుడి బొమ్మ వేశాడు. మా నాన్నకు అది బాగా నచ్చింది. తెగ పొగిడేశాడు.
“బొమ్మలు గీయడం ఒక కళ. అది అందరికీ రాదు” అన్నాడు నన్ను చూస్తూ.
నాకు నాగార్జున్ మీద ఈర్ష్యతోపాటు అతనితో పోటీ పడాలనిపించింది. నేనెందుకు గీయొద్దు అనిపించింది. అతను గీసిన హనుమంతుడి బొమ్మనే నేనూ గీశాను. కొంచెం అటూ ఇటుగా నాదీ బాగానే వచ్చింది. నాన్నకు చూపిస్తే.. వెటకారంగా నవ్వి,
“నీకు బొమ్మలు గీయడం కూడా వస్తదా? అదేమన్నా అల్లాటప్పా పని అనుకున్నావా?” అన్నాడు.
ఒళ్లంతా కంపరమెత్తింది నాకు. గీసిన చిత్రాన్ని ఉక్రోశంతో ముక్కలు చేసి పడేశాను.
నాన్న నన్ను జాలిగా చూస్తూ.. “ముఖం బాగా లేదని అద్దం పగలగొట్టుకుంటే ఏమొస్తది? అందరికీ ఈ కళ అబ్బేది కాదు” అన్నాడు ఎప్పట్లానే..
నాలో ఉక్రోషం పెల్లుబికింది. దాంతో పంతం కూడా పెరిగింది. మా నాన్న.. చిత్రకారుల్ని మెచ్చుకొంటుంటే, ఎట్లాగైనా చిత్రకారుణ్ని కావాలన్నంత కసి. కంటికి నచ్చిన ప్రతి బొమ్మనూ గీయడం మొదలుపెట్టాను. ఆ వయసులోనే ప్రకృతి చిత్రాలతో పాటు, సినిమా నటులు, జాతీయ నాయకులు, స్నేహితుల రూపురేఖల్ని కూడా గీశాను.
అందరూ నన్ను చిత్రకారుడని ఒప్పుకొంటుంటే మా నాన్న మాత్రం.. ఏనాడూ ‘మావాడు మంచి ఆర్టిస్టు!’ అనలేకపోయాడు. అందుకే తండ్రంటే రోజురోజుకూ రోషం పెరిగిపోయింది. నేను నాటకాలేసినా, శిల్పాలు చెక్కినా, చతుష్షష్టి కళల్లో నైపుణ్యం ప్రదర్శించినా.. మెచ్చిన దాఖలాలు లేవు.
ఆ వైఖరి నాలో అసంతృప్తిని మరింత పెంచి.. అది పెనుభూతమై కుదిపేసింది. పదో తరగతి పూర్తయినా పెద్ద చదువులు చదివించే ఆలోచన చేయని నాన్న. నాతో ఏ పనీ చేతకాదని నిరుత్సాహపరిచే నాన్న. ఆయనతో ఎట్లా వేగేది?
ఫలితం.. ఇల్లు వదిలి కాలు బయటపెట్టి సిటీ బాట పట్టడం.
పదో తరగతి చదువుతో పట్నంబాట పట్టిన నాకు ఆదరణ చూపేదెవరు? కసిగా బుసకొట్టి మా నాన్న నాతో సాధ్యం కాదన్నవన్నీ సాధించి చూపిన నేను, ఇప్పుడు బతుకు దెరువును వెదుక్కోవడం ఎట్లా? ఆ ప్రయత్నంలో నాకు అండగా దొరికింది చిత్రకళ. పదిహేనేండ్లు కూడా నిండని నేను, ఆర్టిస్టు అవతారం ఎత్తాను. బతుకు దెరువుకు మెలమెల్లగా బాటలు వేసుకొన్నాను.
‘మన ఇంట ఉన్నత చదువులు అబ్బవ్’ అని అన్న మా నాన్న భావనను అధిగమిస్తూ, ఉన్నత చదువులకు ఉపక్రమించాను. దూరవిద్యలోనే డిగ్రీ, పీజీ చేశాను. కమర్షియల్ ఆర్టిస్టుగా నేను సంపాదించిన ఒక్కో పైసా, నా చదువులకే వెచ్చించాను. పనిలో పనిగా ఉపాధ్యాయ శిక్షణనూ పూర్తి చేసుకొన్నాను. ఈ ప్రయత్నంలో ఎన్నో ఆటుపోట్లు.. ఎన్నో నిద్రలేని రాత్రులు.. మరెన్నో ఉపవాస దీక్షలు. ఆకలిని జయించిన అజేయుణ్ని నేను! నిద్రను దిగమింగిన నిశాచరుణ్ని నేను!
“నీకు ఉద్యోగం రావడం కల్ల” అన్నాడు ఓ రోజు బంధువుల పెండ్లిలో కనిపించిన నాన్న.
ఆయనకు దూరంగా బతుకుతూ.. నన్ను నేను నిరూపించుకొన్నా, మళ్లీ అదే దిగజార్చే మాట.
“ఎందుకు రాదు? చదువుకొన్నాను గదా!” అన్నాను ఉక్రోషంగా.
“మన కుటుంబంలో ఉద్యోగాలు రాసిపెట్టిలేవు” అన్నాడు తనో జ్యోతిష శాస్త్రవేత్తలా.
నాకు ఒళ్లంతా కంపరమెత్తింది.
‘ఏవో చాదస్తపు భావాలు పట్టుకొని వేలాడే నా తండ్రికి నా జాతకాన్ని నిర్దేశించే అధికారం ఎక్కడిది? నన్ను నీరుగార్చే అవసరం ఏమిటి?’ అనుకొంటూ కసిగా బయటకొచ్చిన నేను, మరో మజిలీ కోసం ప్రస్థానం మొదలుపెట్టాను.
ఇప్పుడు నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి. అది ఎట్లా నాకు రాసిపెట్టి లేదో నిర్ధారించుకోవాలి. కేవలం మా నాన్నమీద కసితో చదివాను. నిద్రాహారాలు మాని చదివాను. అదో యజ్ఞం! సుదీర్ఘంగా మూడేండ్లపాటు నా మెదడులోని ప్రతికణమూ ప్రభుత్వోద్యోగం కోసమే పనిచేసింది.
ఫలితం.. వేలమందితో పోటీపడి సాధించిన ఉద్యోగం! నాకు పదిమందిలో కార్యసాధకుడిగా గుర్తింపునిచ్చినా, నా తండ్రి మాత్రం నా ఉన్నతిని ఒప్పుకొన్నట్టే అనిపించలేదు. తర్వాత నా సహోపాధ్యాయినితో జరిగిన నా పెండ్లికీ.. పెండ్లిపెద్దగా నిలవలేదు. నేను నిలపలేదనడం సరైందేమో!
“వెళ్దాం పదండీ!”.. గుర్తు చేసింది మా ఆవిడ.
“ఎక్కడికి వెళ్లేది?” అంటూ తలెత్తి చూశాను.
“మీ నాన్నగారికి ఆరోగ్యం ఏ మాత్రం బాగాలేదట. ఆసుపత్రికి తీసుకెళ్తే నాలుగు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి, కోలుకోవడం కష్టమని మళ్లీ ఇంటికి పంపించేశారట. నేడో రేపో అన్నట్టు ఉన్నారట! అవసానదశలో ఉన్నాయనతో పంతాలేంటి మీకు?” అన్నది అర్ధాంగి.
పంతమా? పట్టుమని పది రూపాయలు కూడా ఇచ్చి ఎరుగని, పదో తరగతి పరీక్ష ఫీజు కూడా కట్టని, చదువుకోవడానికో, స్వావలంబనకో బాసటగా నిలువని తండ్రిని.. అవసాన దశలోనైనా దర్శించాలనే ఆసక్తి కలగని నాది.. పంతమేనా? కాదు. ఇది అయిష్టత అంతే!
“నేను ఎందుకూ పనికి రానన్నాడు. ఈ రోజు యోగ్యుణ్నయ్యాను. నాకు ఉద్యోగమే రాదన్నాడు. ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయుణ్నయ్యాను. నాకు కవిత్వమే రాదన్నాడు. వందలాది కథలు, కవితలు, పాటలు రాసి పదులసంఖ్యలో పుస్తకాలు వెలువరించాను. ఒకనాడు ఇవేవీ నాతో కానేకావన్నాడు మా నాన్న. ఇప్పటికీ నా గొప్పతనాన్ని ఒప్పుకోని అహంభావి” అన్నాను కసిగా.
“ఆయన మీ గొప్పతనాన్ని ఒప్పుకోకుంటేనేమి? సమాజం ఒప్పుకొనేలా చేశారుకదా!” అన్నది భార్గవి. తలెత్తి చూశాను ఆమె వైపు.
“అవును! మీరు ఈ స్థాయికి రావడంలో మీ నాన్నగారి పాత్ర ఏమీ లేదన్న అసంతృప్తితో ఇప్పటివరకూ ఆయన మీద ద్వేషం పెంచుకున్నారు. కానీ, అసలు మీరు ఈ స్థాయికి రావడంలో మీ నాన్న పాత్రే ఎక్కువ ఉన్నదన్న అసలు సత్యం గ్రహించడం లేదు మీరు”
ఆ మాటలు వింటూ నేను వెర్రిగా చూస్తున్నాను ఆమెనే! ఆమె కొనసాగిస్తూ..
“ఏండ్ల తరబడి మీరు మీ నాన్నగారి మీద కోపంతో రగిలిపోతుంటే, అప్పుడప్పుడూ మీరు ఆయన గురించి బయటపడిన తీరును బట్టి, నిజంగానే ఆయన మీపట్ల అన్యాయంగా ప్రవర్తించారనుకొన్నాను. ఇప్పుడు మీ ఆవేదన, ఆక్రోశం దాచుకోకుండా వెళ్లగక్కాక ఆలోచిస్తే.. మీ నాన్నగారు నిజంగానే మీకు ఎనలేని మేలు చేశారనిపిస్తున్నది”.. విస్పష్టంగా చెప్పింది భార్గవి.
ఆమె ఏం చెబుతున్నదో అర్థం కానట్టు చూస్తుండి పోయాను.
“నిజానికి ‘మీతో ఇది కాదు’ అని రెచ్చగొడితే అది సాధించి తీరుతారనీ, మీకై మీరు దేనిమీదా దృష్టి పెట్టరనీ నాకూ తెలుసు. ఈ విషయం మీ నాన్నగారు మీ బాల్యంలోనే గుర్తించారు. అందుకే, ప్రతిదీ ‘నీతో కాదు’ అంటూ.. మీలో వ్యతిరేక ప్రేరణ కలిగించారు. ఏదైతే మీరు చేయలేరన్నారో దాన్ని కసితో చేసి చూపించారు. అయితే, మీరు ఒకటి సాధించి అంతే తీవ్రంగా.. అది చేయలేవన్న మీ నాన్నగారిని ద్వేషిస్తూ మిమ్మల్ని గుర్తించే అవకాశం లేనంతగా దూరం చేసుకొన్నారు. ఏదేమైనా ఆయన మిమ్మల్ని అసమర్థులు అనడంవల్లే.. మీ సమర్థతను నిరూపించుకున్నారన్నది వాస్తవం”..
ఆమె మాటలు విన్న నేను.. విచలితుణ్నయ్యాను. ఎక్కడో.. హృదయాంతరాళాల్లో, మనసు అంతర్గత పొరల్లో ఏదో కదిలిన సవ్వడి. నా మనోగృహానికి కట్టిన తెరలు నెమ్మది నెమ్మదిగా తొలగిపోతున్న భావన.
‘అవునా?’.. చిన్నప్పట్నుండీ నాకుగా నేను ఏ పనికీ పూనుకోనన్నది నాకూ తెలుసు కదా! అందుకే నన్ను రెచ్చగొట్టి, ఆయా కళల్లో రాణించేందుకు మా నాన్నే పురిగొల్పాడా? నిజంగా.. ఆయన నా మనోభావాలపై దెబ్బకొట్టి ఉండకపోతే, నేనసలు ఇల్లు దాటి కాలు బయట మోపేవాడినా? అసలాయన అట్లా గుచ్చిగుచ్చి ‘నీవల్ల కాదు’ అని అనకుంటే.. నేను ఆర్టిస్టును అయ్యేవాడినా? మా నాన్న నన్ను.. ‘కవిత్వం రాయలేవు’ అనడం వల్లే.. ఇన్ని పుస్తకాలు రాసే స్థితికి ఎదిగానా? చివరికి నేను ఉద్యోగం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా అహరహం శ్రమించిందీ.. వ్యతిరేక ప్రేరణ వల్లేనా? అసలు నాలో ఇంతగా కసి రగుల్కొనడానికి ప్రేరకుడెవరు? ఎవరు.. మా నాన్నే కదా!
నా మనోఫలకంపై పరుచుకొన్న మకిలి పూర్తిగా తొలగిపోయిందిప్పుడు. నా కండ్ల ముందు మా నాన్న మహోన్నత రూపం గీతోపదేశం చేస్తున్న శ్రీకృష్ణుడిలా గోచరిస్తున్నది.
‘యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా
తత్తదేవావగచ్చ త్వం మమ తేజోంశ సంభవం’
అన్న గీతా శ్లోకం గుర్తుకొస్తున్నది.
ఇప్పటివరకూ నా జీవితంలో నాన్న పాత్ర ‘జీరో’ అనుకొన్నాను. కానీ, నన్ను జీరోగా చూడకుండా ఉండటం కోసం తన పాత్రను సమర్థంగా పోషించిన మహోన్నతుడు.
నాన్న! నాన్నను చూడాలి.
“భార్గవీ! పదా నాన్నను చూడాలి. ఇంతకాలం నా అవివేకం, అహంభావంతో ఆయన్ను చాలా బాధించాను. ఆయన కాళ్లమీద పడి క్షమించమని వేడుకోవాలి. పద”..
నా హృదయోద్వేగాన్ని అర్థం చేసుకొన్న భార్గవి వెంటనే కదిలింది.
ఇప్పుడు మేం ప్రయాణిస్తున్న కారు, మా పుట్టినూరువైపు పరుగులు తీస్తోంది. ఎట్లాగైనా నాన్నను చూడాలి. ఆయనతో మాట్లాడాలి. పదేండ్ల సుదీర్ఘ ఎడబాటును, ఇన్నేండ్లుగా నా నుండి పొందని ఆత్మీయతను ఆయన ఎదనిండా నింపాలి! పదేండ్ల తర్వాత మా ఊళ్లో అడుగుపెట్టిన నేను, ఆత్రంగా మా ఇంటి ముందు కారును ఆపాను. నలుగురైదుగురు చుట్టుపక్కల వాళ్లు ఇంటిముందు ఉన్నారు. నా గుండె లయతప్పి కొట్టుకొంటుంటే, ఆర్తిగా ఇంట్లోకి ప్రవేశించాను. అప్పటికే నా సోదరులిద్దరూ, ఇద్దరుముగ్గురు బంధువులు వచ్చి ఉన్నారు.
“నా.. న్నా!” నా పిలుపు ఇంట్లో నలువైపులకూ వినిపించింది. అక్కడ వరండాలో మంచంపై.. నాన్న! నా పిలుపు విని కండ్లు తెరిచి ఆనందించలేదు. నిస్తేజంగా పడుకొని ఉన్నాడు. నేను మంచం పక్కనే చేరి, నాన్న గుండెలపై తల ఆన్చి ఏడ్చాను.
‘నాన్నా..! నన్ను క్షమించు! ఇన్నాళ్లూ మిమ్మల్ని నిరాదరించి, మీకు దూరంగా ఉండిపోయిన ఈ దౌర్భాగ్యుణ్ని ఒక్కసారి క్షమించానని చెప్పు నాన్నా!’.. గుండెల్లో గూడుకట్టుకొన్న దుఃఖం, కన్నీళ్ల రూపంలో పొంగి పొర్లుతోంది తప్ప, మాట బయటకు రావడం లేదు. చుట్టూ చేరిన బంధుమిత్రులు నన్ను లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు.
నాన్న కండ్లు తెరవలేదు.. క్షమించానని చెప్పనూ లేదు. అప్పటికే ఆయన ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. నా వేదన.. అరణ్య రోదనగానే మిగిలిపోయింది.
కటుకోజ్వల మనోహరాచారి
కటుకోజ్వల మనోహరాచారి స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్ల. ఎం.ఏ(తెలుగు) చేశారు. డా.డింగరి రామాచార్య సాహిత్యంపై పరిశోధన చేసి, కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఫిల్ పట్టా అందుకొన్నారు. ప్రస్తుతం కోరుట్ల బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. 1996 నుంచీ కథలు రాయడం మొదలు
పెట్టారు. ఈయన మొదటి కథ.. ‘వర్షంలో వనకన్య’. స్వాతి వీక్లీ సరసమైన కథల పోటీలో ప్రథమ బహుమతి దక్కించుకొన్నది. ఈయన రాసిన 52 కథలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 150 కవితలు, 25 నాటికలు, 50 పాటలు రాశారు. ‘నవ్వుతున్న నేలతల్లి’ కథాసంపుటి, ‘అక్షరం – అభిమతం’ కవితా సంపుటి, ‘మందార మాలిక’ గేయసంపుటితోపాటు ఏకలవ్య, వినాయక చవితి, సుమమాల వంటి ఎనిమిది పుస్తకాలను వెలువరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా స్థాయి విశిష్ట సాహితీ పురస్కారంతోపాటు, అనేక బహుమతులు అందుకొన్నారు.
-కటుకోజ్వల మనోహరాచారి , 9441023599