Jagapathi Babu | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ.236 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో సినిమాలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు జగపతిబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో ‘అప్పలసూరి’ పాత్రలో నటించిన జగపతిబాబు, ‘పెద్ది’ తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన సినిమా అని పేర్కొన్నారు. మధ్యలో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ, ఈ సినిమా విడుదల కోసం ప్రత్యేకంగా ఎదురుచూశానని తెలిపారు.
చిత్రం విడుదల తర్వాత ఒక ప్రముఖ దర్శకుడు తనకు ఫోన్ చేసి, “ఇంత గొప్ప పాత్ర చేసినా మీ గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. ఇదే పాత్రను మరో భాష నటుడు చేసి ఉంటే ఇప్పటికే ఎన్నో అవకాశాలు వచ్చేవి” అని చెప్పినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో నటులకు లభించే గుర్తింపు గురించి కూడా జగపతిబాబు మాట్లాడారు. “చాలా సందర్భాల్లో పరభాష నటులకు ఎక్కువ గౌరవం దక్కుతుంది. నేను ఇతర భాషల్లో పని చేసినప్పుడు కూడా అలాంటి ఆదరణను చూశాను. అయితే నాకు దానిపై ఎలాంటి అసంతృప్తి లేదు. కానీ ‘పెద్ది’ కోసం నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు” అని అన్నారు. షూటింగ్ సమయంలో తన పాత్రకు వచ్చిన స్పందనను గుర్తుచేసుకుంటూ, ప్రతి సన్నివేశం పూర్తైన తర్వాత యూనిట్ సభ్యులు చప్పట్లు కొట్టేవారని చెప్పారు. సినిమా కోసం నా శక్తి మేరకు పనిచేశాను. అందుకే ఈ పాత్రకు మరింత గుర్తింపు రావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. ఈ సినిమా కోసం నేను నా ప్రాణం పెట్టాను. అందుకే గుర్తింపు అడిగే హక్కు నాకు ఉంది. మిగతా సినిమాల విషయంలో నేను ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు అని స్పష్టం చేశారు.
ఇక ‘పెద్ది’లో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల గురించి కూడా జగపతిబాబు స్పందించారు. నటీనటులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేయడం సరికాదని అన్నారు.జాన్వీ కపూర్ తనకు అప్పగించిన పాత్రను దర్శకుడు చెప్పిన విధంగానే చేసింది. ఒక పాత్ర లేదా కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. కానీ దాని కోసం నటిని వ్యక్తిగతంగా విమర్శించడం సరైంది కాదు. కొన్నిసార్లు మంచి ఉద్దేశంతో చేసిన అంశాలు కూడా ప్రేక్షకుల వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అంతమాత్రానికే ఒక ఆర్టిస్టును మానసికంగా ఇబ్బంది పెట్టేలా ట్రోల్ చేయడం మంచిది కాదు. ఈ విషయంలో నేను పూర్తిగా జాన్వీకి మద్దతు ఇస్తాను” అని చెప్పారు.