న్యూఢిల్లీ, ఆగస్టు 5 : బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన గోల్డ్ ధర రూ.1.50 లక్షల పైకి చేరుకున్నది. వరుసగా రెండోరోజూ బుధవారం ఒకేరోజు 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.2,500 లేదా 1.7 శాతం ఎగబాకి రూ.1.50 లక్షలుగా నమోదైంది. అంతకుముందు ఇది రూ.1,47,500గా ఉన్నట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. జూలై 6న నమోదైన రూ.1,50,650 తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి కావడం విశేషం. బంగారంతోపాటు వెండి ధరలు పరుగులు పెట్టాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.6,200 ఎగబాకి రూ.2,32,700కి చేరుకున్నది.
దీంతో వెండి ధరలు నెల గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్టు అయింది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేదానిపై అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉండటం, ఇంధన ఆధారిత ద్రవ్యోల్బణంపై ఆందోళనలు తగ్గుముఖం పట్టడం, ఫెడరల్ రిజర్వు ద్రవ్య కఠినతరం అవుతుందనే అంచనాలు నెలకొనడంతో అతి విలువైన లోహాల ధరలు రివ్వున ఎగిశాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 85.28 డాలర్లు లేదా 2.09 శాతం ఎగబాకి 4,162.76 డాలర్లకు చేరుకోగా, వెండి మూడు శాతం బలపడి 61.35 డాలర్లకు చేరుకున్నది.