– చుంచుపల్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట న్యూడెమోక్రసీ ధర్నా
చుంచుపల్లి, సెప్టెంబర్ 18 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం చుంచుపల్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కళావతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ… రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గతంతో పోలిస్తే ఈసారి వర్షపాతం తగ్గడంతో పంటల సాగు కూడా తగ్గిపోయిందని, దీంతో రైతులు అప్పులు, వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని, బోరుబావుల కింద సాగు చేస్తున్న రైతులకు 16 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
రైతులకు ఇబ్బందిగా మారుతున్న యాప్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద 200 పని దినాలు కల్పించి రోజువారీ కూలీని రూ.600కు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు కల్తీ వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే ఉమర్, జిల్లా నాయకులు హిడమ, ఐఎఫ్టీయూ కొత్తగూడెం ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు మోత్కూరి మల్లికార్జునరావు, మంకెన వెంకటేశ్వర్లు, ఎన్.సంజీవ్, పీవైఎల్ పట్టణ అధ్యక్షుడు లిక్కి నరేష్, బత్తుల నాగరాజు, పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు కల్తీ రాములమ్మ, జిల్లా నాయకురాళ్లు బి.వెంకటమ్మ, సంధ్య, రాధా, నందిని, రాజేష్ పాల్గొన్నారు.