Kasi Majili Kathalu Episode 7 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : ఐదుగురు మిత్రుల పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి వరప్రసాదులు అని పిలుస్తుంటారు. ఆ ఐదుగురూ దేశాటనం చేస్తూ వింతైన మర్రిచెట్టు కొమ్మలను ఎక్కి వెళ్లి.. వసంతుడు నిర్జనమైన అడవిలో అచేతనంగా పడి ఉన్నాడు. రెండోవాడైన రాముడు కోయదొర వల్ల కుక్కలా మారాడు. మూడోవాడైన ప్రవరుడు అనుకోకుండా కందర్పకేతునికి మంత్రి అయ్యాడు. కందర్పకేతుడు కుట్రపూరితంగా అపహరించిన.. వసంతుని భార్య కళావతిని కలుసుకొని, మిత్రుల ఎడబాటుకు చలించిపోయాడు.
ప్రవరుడు దుఃఖాన్ని విరమించి, కర్తవ్యం ఆలోచించాడు. కళావతి మందిరం నుంచి బయటికి వస్తూనే, తన మిత్రుల జాడను తెలుసుకోవడానికి.. నాలుగు దిక్కులకూ వేగులను పంపించాడు. రాజధానిలోని ఒక పెద్దసత్రం వద్ద తన చిత్రపటాన్ని వేలాడగట్టి, దానిని సాభిప్రాయంగా చూసినవారిని తనవద్దకు తీసుకురమ్మని కొందరిని అక్కడే కాపలాగా ఉంచాడు.
ఆ తర్వాత కొంతకాలం గడిచింది. ఒకనాడు ఏం జరిగిందంటే..
కందర్పకేతుని పట్టపురాణి.. తన కట్టుపుట్టాలను ఉతకడానికి వేస్తున్నది.
“ఏమే ముత్యాలూ! ఎప్పుడూ ఉత్తచేతులతోనే వచ్చేదానివి. ఈవేళ అంతపెద్ద మూట మోసుకొచ్చావేం?” అడిగింది మహారాణి.
“మంత్రిగారింట్లో కూడా నేనే పని చేస్తున్నాను కదమ్మా! ఈమూట వారింట్లోది” చెప్పింది ముత్యాలు.
“ఏమిటీ! అవన్నీ మన మంత్రిగారి భార్యవా? నీవామెను ఎరుగుదువా? ఏపాటి చక్కనిది? ఎంత వయసుంటుంది?” ఆరా తీసింది మహారాణి.
“మీముందు పొగిడితే మీకు కోపం వస్తుందేమో కానీ అమ్మా! ఆమెలాంటి అందగత్తెను నేనెక్కడా చూడలేదు. మంత్రిగారి భార్య వయసు బింకం ఏపాటిదో ఆమె రైకయే చెబుతుంది. దీన్నోసారి చూడండి. విప్పినా తొడిగినట్లే ఉన్నది” అన్నది ముత్యాలు.. ఓ రైకను మహారాణి చేతికందిస్తూ.
ఆమె చూపించిన చిహ్నాలను చూసిన మహారాణి విస్మయపడింది.
“ఏమే! మా ప్రధాని మొదట యాచకునిగా కుటుంబంతో ఈ ఊరికి వచ్చాడని కదా చెప్పుకొంటారు?! ఆ సామాన్యస్థితిలో ఇంత చక్కని భార్య ఎలా లభించింది?” అంటూ ఆ రైకను తీసుకుని పరీక్షించసాగింది.
ఇంతలో అక్కడికి మహారాజు కందర్పకేతుడు వచ్చాడు.
“రాణీ! ఏమిటది? ఎవ్వరిది? దానినలా పరీక్షిస్తున్నావేం?” అని ప్రశ్నించాడు.
“ప్రాణేశ్వరా! ఈ కంచుకం ఎవ్వరిదో.. దీనిని ధరించిన పడతి వయస్సు ఎంతో ఊహించండి చూద్దాం!” అని పరిహాసంగా పలికింది మహారాణి.
కందర్పకేతుడు తడబడ్డాడు.
“దీని దుంపతెగ.. ఎన్నిసార్లు మడతలు పెట్టి, ఎంతగా నలిపి విడిచినా గుబ్బ విచ్చి నిలబడుతున్నది. ఇది కుట్టినవాని మహత్యమో, ధరించిన సొగసుకత్తె లావణ్యమో ఎవరు చెప్పగలరు?! మీరేమో.. కంకణాన్ని చూసి, ఓ ఆడదాన్ని సముద్రాలు దాటించి తెచ్చినవారు. ఇక ఈ రైక వివరం చెబితే ఏం చేస్తారోనని భయం వేస్తోంది” అన్నది మహారాణి రెప్పలు వాల్చి వేరొక దిక్కును చూస్తూ.. పరిహాసాన్ని కొనసాగిస్తూ.
కందర్పకేతుడు తానూ సిగ్గుపడ్డాడు.
“వింత వస్తువులను చూడాలని ఎవరైనా అనుకుంటారు. చూచినంత మాత్రాన తప్పు పట్టకూడదు కదా?!” అన్నాడు తనను తాను సమర్థించుకుంటూ.
“మహారాజా! ఈ రైక ప్రధానమంత్రిగారి భార్యదని మన ముత్యాలు చెబుతున్నది. ఒకప్పుడు సామాన్యునిగా బతికినవాడికి ఇంత చక్కని భార్య లభించడం అదృష్టం కదా!” అన్నది మహారాణి.
ఆమె మాటలతో కందర్పకేతుడు అబ్బురపడ్డాడు. ఎలాగైనా ఒకసారి ప్రవరుని భార్యను చూడాలనే కోరిక అతని మనసులో కలిగింది. కానీ ఆమెను చూడటానికి ‘మీ ఇంటికి వస్తాను’ అని కానీ, ‘మా ఇంటికి తీసుకురా’ అని కానీ అనలేడు కదా!
అందుకోసం అతడో ఎత్తు వేశాడు. మరునాడే ప్రవరుని పిలిచి..
“మిత్రమా! ఈపూట మనిద్దరం కలిసి భోం చేయాలి” అన్నాడు.
ప్రవరునికి పాపం అంగీకరించక తప్పలేదు. మహారాణి వడ్డిస్తుండగా ప్రవరునితో సరసంగా సంభాషించాడు.
“మిత్రమా! ఈ పండు ఎంత తియ్యగా ఉందో చూశావా? ఈ పాయసంలో మిరియపు పొడి చూశావా? ప్రియుని పెదవిని మునిపంటితో కొరికిన వన్నెలాడి కారపు వలపులా ఉంది కదా! రాణీ.. ఆ నేతి అరిసెలు ఇలా తీసుకురా” అని కందర్పకేతుడు ఉల్లాసం కలిగేలా ఏవేవో మాట్లాడసాగాడు.
మహారాణి భర్తకు కూడా వడ్డించబోయింది. గబుక్కున చేతిని అడ్డంపెట్టి..
“రాణీ! నాకు మరీ ఎక్కువ వడ్డించవద్దు. రేప్పొద్దున నాకు మంత్రిగారి ఇంట్లో విందు జరగబోతుంది. మంత్రిగారి భార్య నీకంటే బాగా వంట చేస్తుందట. కొంచెం కడుపులో ఖాళీ ఉంచుకోవాలి. ఎంతైనా బ్రాహ్మణులకు తెలిసినట్లు భోజన రుచి ఇతరులకు తెలియదు” అంటూ నవ్వేశాడు కందర్పకేతుడు.
మహారాజు మనసులోని మాట తెలిసేటప్పటికి ప్రవరునిలో దిగులు ఆవరించింది. దాన్ని దిగమింగి భోజనం ముగించాడు. కర్పూర తాంబూలం వేసుకుంటున్న సమయంలో..
“మహారాజా! ఇందాకా మీరు పరిహాసానికి అన్నమాట నిజం చేయాలి. రేపు మీరు మా ఇంటికి భోజనానికి రావాలి” అని ఆహ్వానించాడు.
ఆ మాట ప్రవరునిచేత అనిపించుకోడానికే కదా కందర్పకేతుడు ఇంతగా కష్టపడ్డాడు! అయినా తన రాజదర్పానికి తీసిపోనివిధంగా మాట్లాడి చివరికి..
“సరే వస్తాను. కానీ, నాకు పెందరాళే భోజనం వడ్డించాలి మిత్రమా! నేనెక్కువసేపు ఆకలికి ఆగలేను” అని అతణ్ని పంపివేశాడు.
ప్రవరుడు ఇల్లు చేరుకున్నాడు.
తెల్లవారితే మహారాజు తన ఇంటికి భోజనానికి వస్తాడు. రాజంతటివాడు భార్యచేత తనకు వడ్డింప చేశాడు. తానుకూడా భార్యతో కాకుండా మరొకరితో వడ్డింప చేస్తే ఆగ్రహించవచ్చు. కానీ, తనకసలు పెళ్లే కాలేదు కదా!
ఆనాటి రాత్రి గుర్రపుశాలలో పడుకుని ఉంటే, కోటగోడ మీదినుంచి దిగివచ్చిన కాంచనవల్లి తనను నిద్రలేపింది. తనతో రమ్మని ఆమే పిలిచింది. ఆ రాత్రంతా ప్రయాణం చేస్తుండగా ఆ చీకటిలో తానెవరో తెలియక చాలానే కబుర్లు చెప్పింది. ఆనాడు తెల్లవారి తన ముఖం చూసింది మొదలు నేటివరకూ.. తనతో మళ్లీ మాట్లాడి ఎరుగదు. తమ మధ్యలో ఏ వ్యవహారమైనా జరగాలంటే రాయబారిగా ఉన్న ముసలమ్మతో మాట్లాడటమే కానీ, మరో దారిలేదు.
అటువంటి స్త్రీని తన భార్యగా రాజుకు చూపించడం ఎలా? ఆమెను వడ్డనకు నియోగించడం ఎలా?.. ప్రవరుడు తనలో తాను మధనపడుతూ చావిట్లో పడుకున్నాడు.
భోజన సమయం అయింది. ముసలమ్మ వచ్చి..
“బాబూ! భోజనానికి లే” అని పిలిచింది.
ప్రవరుడు లేవకుండా అలాగే పడుకొని..
“అవ్వా! ఈ పూట నాకు ఆకలి లేదు” అన్నాడు.
ప్రవరుని ప్రవర్తనను కిటికీలోనుంచి కాంచనవల్లి గమనిస్తూనే ఉంది. అతనికేదో సమస్య వచ్చిందని తన బుద్ధికుశలతతో గుర్తించగలిగింది. అందులోనూ అప్పుడప్పుడే ఆమెకు ప్రవరునిపై మనసు తిరుగుతున్నది. అది కూడా ఆమె శ్రద్ధకు ఒక కారణం.
అందువల్ల చావడి నుంచి గుమ్మంలో అడుగుపెడుతున్న ముసలవ్వను అక్కడే ఆపి..
“అవ్వా! బుద్ధిమంతులైనవారు అల్పకార్యాల కోసం మనసు కష్టపెట్టుకుని భోజనం మానివేయరు. దైవం ప్రతికూలమైనప్పుడు మిత్రులు మాత్రమేనా.. మనమూ సాయం చేయలేమా? ఇన్నాళ్లుగా వారు మనల్ని పోషిస్తున్నారు. వారిపై మనకు ఆ మాత్రం విశ్వాసం ఉండవద్దా? ముందు భోజనానికి లెమ్మను. ఏదైనా విషయం ఉంటే మాట్లాడుకోవచ్చు” అని ప్రవరునికి వినిపించేలా పలికింది.
ప్రవరుడు భోజనానికి లేచాడు. పెరుగు కలుపుకొంటూ, తన సమస్యనంతా అవ్వతో వివరించి చెప్పాడు.
గుమ్మం వెనుక నుంచి కాంచనవల్లి కూడా అవ్వతోనే..
“ఈమాత్రం దానికి వెనుదీయడం ఎందుకు? రేపు మహారాజును ఉచితరీతిన సత్కరించి పంపుదాం” అని ప్రవరుని మనసుకు ఆనందం కలిగించేలా చెప్పింది.
×××
తెల్లవారింది.
అందుకోసమే ఆగాడేమో అన్నట్లుగా ఇంకా సరిగా పొద్దెక్కకముందే ప్రవరుని ఇంటిముందు రథం దిగాడు కందర్పకేతుడు. భోజనాలు వడ్డించే వేళవరకూ ప్రవరునితో ఇష్టాగోష్ఠి సాగించాడు.
“వడ్డన మొదలుపెట్టబోతున్నాం” అని ముసలవ్వ వచ్చి చెప్పింది.
కందర్పకేతుడు ఒళ్లంతా కళ్లు చేసుకుని భోజనాలగదిలో ప్రవేశించాడు. తెల్లని వస్ర్తాలు ధరించి, తెల్లని పూలు, వజ్రాలు పొదిగిన ఆభరణాలతో కాంచనవల్లి మొదటి వడ్డన పూర్తిచేసింది. కొద్దిసేపటికి వేరొక గదిలోకి వెళ్లిపోయింది.
ప్రవరునితో కబుర్లు చెబుతున్నాడే కానీ కందర్పకేతుని మనసంతా కాంచనవల్లి అందం మీదనే ఉంది. ఆమె మళ్లీ ఎప్పుడు దర్శనమిస్తుందోనని ఎదురు చూస్తున్నాడు. కొంతసేపటికి ఎరుపురంగు వస్త్రాలు, ఎర్రని పూలు, పగడాలు పొదిగిన ఆభరణాలు ధరించి వచ్చి కాంచనవల్లి రెండోమారు వడ్డన చేసింది.
ఆ దెబ్బతో కందర్పకేతునికి మతిపోయింది.
ఎలాగో భోజనం పూర్తిచేసి అంతఃపురానికి చేరుకున్నాడు.
“మహారాణీ! మన ప్రధానమంత్రి ప్రవరునికి ఒక్కతే భార్య అని విన్నాం కానీ, కాదు. అతనికి ఇద్దరు భార్యలున్నారు. అందంలో ఒకరితో మరొకరు తీసిపోరు” అని చెప్పాడు.
విస్తుపోవడం మహారాణి వంతైంది.
కొన్నిదినాలు గడిచాయి. మరోసారి ప్రవరుని భార్యలను చూడాలనే కుతూహలం మాత్రం కందర్పకేతునిలో పోలేదు.
“మిత్రమా! రేపు వైశాఖ పౌర్ణమి. ఆలూమగలు కొంగుముళ్లు వేసుకుని సముద్రస్నానం చేస్తే పుణ్యమని మన పురోహితులు చెబుతున్నారు. మేం వెళుతున్నాం. రేపు నీ భార్యలిద్దరితో కలిసి నువ్వుకూడా వస్తే బాగుంటుంది” అన్నాడు.
ప్రవరునికి మళ్లీ ఒప్పుకోక తప్పలేదు.
పరాయి స్త్రీని, ఇతరులకు భోజనం వడ్డించడానికి నియోగించడం వరకూ పరవాలేదు. కానీ, సరిగంగ స్నానాలు చేయడానికి రమ్మని పిలవడం ఎలా?!
గతంలో లాగే ఈసారి కూడా భోజనం వద్దని ముసలమ్మతో చెప్పాడు. యథాతథంగా కాంచనవల్లి అతని మనోభిప్రాయాన్ని గుర్తించి, సంగతి తెలుసుకుంది.
దిగులు పడవద్దని ప్రవరునికి హామీ ఇచ్చింది.
“తెల్లవారేసరికి ఏడు రకాల కట్టుపుట్టాలు, ఏడు పల్లకీలు గుమ్మంలో ఉండాలి. స్నాన ఘట్టాల వద్ద ఏడు గుడారాలు వేసి ఉంచాలి” అని సూచన చేసింది.
ప్రవరుడు మారుమాట్లాడకుండా ఆమె చెప్పిన ఏర్పాట్లు పూర్తిచేశాడు. తెల్లవారకముందే కాంచనవల్లి ఒక పల్లకీ ఎక్కింది. మరో ఆరు పల్లకీల్లో తన వస్త్రాలు, ఆభరణాలను ఉంచింది.
‘ఒహొం భొహోంభీం’ అని బోయీలు వేసే కేకలకు సముద్రం ఊగి ఆవలిగట్టుకు పొంగిపొర్లి పోతుందేమో అనిపించేలా ఏడు పల్లకీలు స్నానఘట్టానికి చేరాయి. ఏడు గుడారాల్లోనికీ ఆయా సామగ్రి చేరింది.
తడవ తడవకూ చీరలు మార్చుకుంటూ కాంచనవల్లి మొత్తంగా ఏడుసార్లు ప్రవరునితో కలిసి సరిగంగ స్నానాలు చేసింది.
ఆ దృశ్యాలను చూస్తుంటే కందర్పకేతునికి, మహారాణికి మతులు పోతున్నాయి. కాంచనవల్లి చేసిన మాయాజాలం రాజదంపతులకు ఊపిరైనా ఆడకుండా, నోటమాట రాకుండా చేసింది.
సముద్ర స్నానఘట్టం తరువాత ప్రవరునికి మొత్తం ఏడుగురు భార్యలన్న సంగతి స్పష్టమైంది. ఆ మరునాడు కందర్పకేతుడు ఒక తెలివైన పరిచారికను రప్పించాడు. ఏడు పళ్లేల్లో ఏడు జలతారు చీరలు, మరికొన్ని చీరలు ఉంచాడు.
“వీటిని పట్టుకెళ్లి మన ప్రధానమంత్రిగారి భార్యలకు ఇవ్వాలి. ఇవ్వడమే కాదు.. వాళ్ల పేర్లేమిటో స్పష్టంగా కనుక్కుని, జాబితా రాసుకుని రావాలి” అని ఆజ్ఞాపించాడు.
మహారాజు పంపిన కానుకలతో పరిచారిక ప్రవరుని ఇంటికి వచ్చింది. తాను వచ్చిన పనిని ముసలవ్వకు ముందుగా చెప్పింది.
ఆమె మాటలు వినగానే ముసలవ్వ ఫక్కున నవ్వేసింది. “మన మంత్రిగారికి ఏడుగురు భార్యలు కాదమ్మా! మొత్తం ఎనిమిదిమంది. వాళ్లపేర్లు అచ్చంగా శ్రీకృష్ణుడి భార్యల పేర్లే. కాకపోతే వాళ్లందరూ నీకు ఒక్కసారిగా కనిపించరు. ఒకరు ఉన్నదగ్గరికి మరొకరు రాకపోవడం అనే సపత్నీ ధర్మం నువ్వు ఎరగనిది కాదు. ఇకపోతే నిన్న మంత్రిగారి ఎనిమిదో భార్య రుతుస్నాత అయిన కారణంగా సముద్ర స్నానానికి రాలేకపోయింది” అన్నది. ముసలవ్వ చెప్పింది విని పరిచారిక తెల్లబోయింది.
“ఎనిమిదో అమ్మగారికి కానుకలేమీ తేలేదమ్మా! పోనీండి. అమ్మగార్లందరినీ రప్పించండి. ఇంతలో నేను ఎనిమిదో కానుక కూడా తెప్పిస్తాను” అని ముసలమ్మకు సర్దిచెప్పింది.
కాంచనవల్లి ఎనిమిది అలంకారాలతో వచ్చి, కందర్పకేతుడు పంపిన బహుమానాలన్నీ అందుకున్నది. కందర్పకేతుడు ఎన్ని జిత్తులు వేశాడో.. అన్నిటినీ కాంచనవల్లి చిత్తుచిత్తు చేసింది.
ఆమె కొట్టిన ఆఖరు దెబ్బనుంచి తేరుకోవడానికి కందర్పకేతునికి చాలానే సమయం పట్టవచ్చు. అది అలా ఉంచితే…
బహుమానాలు అందుకున్న ఆనాటి రాత్రి..
“ఒక్కసారి వచ్చిపొమ్మను” అంటూ అవ్వద్వారా ప్రవరునికి కబురు పెట్టింది కాంచనవల్లి.
“బాబూ! నిన్న సముద్రస్నానానికి వెళ్లినప్పుడు అమ్మాయికి చేపముల్లు గుచ్చుకుందట. పాపం నొప్పితో నడవలేకపోతున్నది. కొంచెం సాయం చేయకూడదా బాబూ!” అని అనునయంగా అడిగింది ముసలవ్వ.
ఆమాట వింటూనే ప్రవరుడు కలవరపడ్డాడు. కాంచనవల్లి గదిలో ప్రవేశించి..
“ఏ కాలిలో ముల్లు విరిగింది?” అని కలవరపాటుతో ప్రశ్నించాడు.
“నిదానించండి. ఆ పీటమీద కూర్చోండి. ఇంత కంగారుగా ముల్లు తీస్తే నొప్పి కదా!” అన్నది కాంచనవల్లి దట్టమైన చూపులను అతనిపై ప్రసరింప చేస్తూ.
ప్రవరుడు సిగ్గుపడి ఆమె చూపిన పీటమీద కూర్చున్నాడు. కాంచనవల్లి తన కుడిపాదాన్ని మరో చిన్నపీటమీద పెట్టింది. ముట్టుకుంటే కందిపోతుందేమో అనిపిస్తున్న పాదాన్ని చేతితో పట్టుకుని ముల్లుకోసం వెతకగసాగాడు.
అదే అదనుగా తీసుకుని కాంచనవల్లి తన మనసులోని మాటను బయటపెట్టింది.
“మహాత్మా! ఆపదలనే సముద్రంలో నన్ను పడదోసిన భగవంతుడు ‘మీరు’ అనే తెప్పను చూపించాడు. ఇంతకాలం నా చేతిలోనే ఉన్న మణిని గుర్తించలేక గాజుపూస అని భ్రమ
పడ్డాను. మిమ్మల్ని మొట్టమొదట చూసినప్పుడు మీరు ధరించిన వస్ర్తాల వల్ల నాకు అలా అనిపించి ఉండవచ్చు” అన్నది కాంచనవల్లి.
ప్రవరుడేమీ మాట్లాడలేదు.
“వేషధారణను బట్టి మనుషులను అంచనా వేయకూడదని నాకు మిమ్మల్ని చూశాక అర్థమైంది. నేడు దేశమంతా మిమ్మల్ని గౌరవిస్తున్నది. వారందరికంటే ఎక్కువగా మీ గొప్పతనాన్ని ఎరిగిన దాన్ని నేను. ఇంతకాలంగా మీ పోషణలో బతుకుతున్న నాపై, ఏ ఒక్కనాడైనా మీరు ఇంద్రియనిగ్రహం కోల్పోయి ప్రవర్తించి ఉంటే.. నా గతి ఏమై ఉండేది?” సాభిప్రాయంగా అన్నది కాంచనవల్లి. ఆమె తనను పిలిపించింది ముల్లు తీయడానికి కాదని అర్థమై, కాంచనవల్లి పాదాన్ని విడిచిపెట్టేశాడు ప్రవరుడు.
“నేను రాజకుమార్తెను. మా మంత్రిగారి కుమారుడైన జయంతుణ్ని ప్రేమించాను. మా ఇద్దరి మధ్య అంతస్తులు అడ్డ్డుగోడలుగా నిలిచాయి. పారిపోయి వివాహం చేసుకోవాలనుకున్నాం. అంతకుమించి నాలో ఏ దోషమూ లేదు. జయంతుని స్థానంలో ఉన్న మిమ్మల్ని ఆనాడు చీకట్లో పోల్చుకోలేక పోయాను. ఆలోచిస్తే మనల్ని దైవమే కలిపాడనిపిస్తున్నది.
ఆర్యా! నన్ను మీ అర్ధాంగిగా స్వీకరించండి. మీ వంశాన్ని నిలుపుకోండి” అని కాంచనవల్లి అభ్యర్థించింది. ప్రవరుడు ఆమె చేతినందుకున్నాడు. మంచి ముహూర్తంలో వాళ్లిద్దరికీ వివాహం జరిగింది.
అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu Episode 6 ( కాశీ మజిలీ కథలు ) | హేలానగరంలో ప్రవరుడు
Kasi Majili Kathalu Episode 5 | రాముని మెచ్చిన లతాంగి
Kasi Majili Kathalu Episode 4 | చేపమింగిన కంకణం
“Kasi Majili Kathalu Episode 3 | పంజరంలో రామచిలుక”
“Kasi Majili Kathalu Episode 2 | దేవతా వస్త్రాలు”
“Kasi Majili Kathalu Episode 1 | జారిపడ్డ మామిడిపండు”