Kasi Majili Kathalu Episode 5 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశ్మీరదేశపు రాజు శూరసేనుడి కుమారుడు వసంతుడు. అతడు తన నలుగురు స్నేహితులతో కలిసి దేశాటనకు వెళ్లాడు. దారిలో వాళ్లకు ఒక వింతైన మర్రిచెట్టు దర్శనమిచ్చింది. ఆ చెట్టు తూర్పుకొమ్మను ఎక్కి వెళ్లిన వసంతునికి కళావతి పరిచయం అయింది. అనుకోని రీతిలో అతని ఆయువు గుట్టు తెలుసుకున్న ఒక మాయదారి వృద్ధురాలు కళావతిని అతడి నుంచి దూరంచేసింది. దక్షిణపు కొమ్మను ఎక్కి వెళ్లిన రామునికి ఒక గుహలో సిద్ధపురుషుడు కనిపించాడు.
‘స్వామీ! నేను బయలుదేరిన చోటికి నన్ను చేర్చండి’ అని రాముడు ఆ సిద్ధపురుషుణ్ని కోరుకొంటే సరిపోయేది. కానీ, అతడలా కోరుకోలేదు.
‘ఈ గుహనుంచి బయటికి చేర్చండి’ అని మాత్రమే కోరుకున్నాడు. కన్నులు తెరిచి చూసేసరికి, అతడు ఒకానొక దుర్గమారణ్యంలో ఉన్నాడు. సాయంకాలం వరకూ తిరిగినా ఏ గ్రామాన్నీ చేరుకోలేకపోయాడు. చివరికి ఒక మామిడిచెట్టును ఆశ్రయించి, ఆ రాత్రి గడపాలని రాముడు నిశ్చయించుకున్నాడు.
క్రూరమృగాలకు బలైపోకుండా చెట్టుపైకి ఎక్కి, నిద్ర పట్టక జాగారం చేస్తున్నాడు. ఆ చెట్టుమీద అప్పటికే రెండు గరుడ పక్షులున్నాయి. అవి రెండూ రాత్రంతా కబుర్లు చెప్పుకొంటున్నాయి. పక్షుల భాష తెలిసిన రాముడు వాటి మాటలను ఆసక్తిగా ఆలకిస్తున్నాడు.
“నాథా! ఈవేళ మీరు చూసివచ్చిన వింతలు, విశేషాలేమిటో చెప్పండి” అని ఆడపక్షి అడిగింది.
అందుకు మగపక్షి.. “కాంతా! ఈవేళ నేనేమీ వింతలు చూడలేదు. కానీ, గూటికి తిరిగివచ్చే వేళ ఒక విశేషం గమనించాను. ఇక్కడికి రెండు యోజనాల దూరంలో కుంతలదేశపు రాజధాని నగరం ఉంది. ఆ నగరాన్ని ఏలే రాజుకు లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆమె చక్కదనానికి ముల్లోకాలలోని స్త్రీలు చాలరు. కానీ, పాపం ఆ ముద్దుగుమ్మకు యుక్తవయస్సు వచ్చేనాటికి రెండు కళ్లూ కనిపించడం మానేశాయి. గుడ్డిదైపోయింది. తండ్రి లక్షల కొద్దీ ధనం వ్యయం చేసి కూతురికి వైద్యం చేయించాడు. ఫలితం లేదు” అని చెప్పింది.
“అయ్యో పాపం. ఆమెకు ఆ నేత్రరోగం తగ్గే అవకాశమే లేదా?” అన్నది ఆడపక్షి.
“లేకేం! మన గూటిలో ఉన్న పసికాష్టాన్ని అరగదీసి, ఆ గంధాన్ని కన్నులకు అద్దితే ఆమె రోగం తగ్గుతుంది. వేరొకరకంగా ఆమెకు కన్నులు రావు” వివరించింది మగపక్షి.
ఆ పక్షుల మాటలను రాముడు శ్రద్ధగా ఆలకించాడు. సూర్యోదయం కాగానే పక్షులు రెండూ ఆహారం కోసం గూడు వదిలి ఎగిరిపోయాయి. రాముడు గూటిలోని పసికాష్టాన్ని సేకరించి తన చొక్కాలో దాచుకున్నాడు.
మగపక్షి చెప్పిన దిక్కుగా రెండు యోజనాల దూరం ప్రయాణించి, కుంతల దేశం చేరుకున్నాడు. అక్కడ ఒక బ్రాహ్మణ గృహంలో భోజనం పూర్తి చేసుకుని, కూడలిలోకి వచ్చాడు.
క్కడ కొందరు పౌరులు రాకుమారి నేత్రరోగాన్ని గురించి మాట్లాడుకోవడం విన్నాడు. వారిమధ్యకు వెళ్లి.. “ఆమె కన్నులను నేను చక్కబరుస్తాను” అన్నాడు. అతడి మాటలు నమ్మిన పౌరులు అతడిని రాజాస్థానానికి తీసుకువెళ్లారు.
“చాలు చాలు. ఇలాంటి వైద్యులు ఇప్పటికి వందమంది అయ్యారు. అమ్మాయి కళ్లు బాగుపడక పోగా, లేనిపోని ప్రయాసలకు గురవుతున్నది. బాబూ! దయచేసి వెళ్లిరా!” అన్నాడు కుంతల దేశాధీశుడైన శ్రుతకీర్తి మొదట.
“ఒక్క అవకాశం ఇప్పించండి” అని రాముడు వినయంగా కోరిన మీదట అంగీకరించాడు.
రాకుమారి పద్మగంధి ఎదుటకు రాముణ్ని ప్రవేశపెట్టారు. ఆమె చక్కదనానికి అచ్చెరువొందుతూ, పసికాష్టాన్ని అరగదీసి ఆమె కన్నులకు రాశాడు.
పద్మగంధి అదృష్టం పండింది. అప్పటివరకూ చిమ్మచీకటి తప్ప మరేమీ ఎరుగని ఆమె కన్నుల ఎదుట, అపూర్వ తేజస్సుతో అలరారే అశ్వినీ దేవతవలె రాముడు కనిపించాడు. మేను పులకరిస్తుండగా, అతనికి నమస్కరించింది.
“నా కుమార్తె కన్నులు బాగుచేసిన వారికి, ఆమెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాను. మీకు సమ్మతమైతే..” అన్నాడు శ్రుతకీర్తి.
చక్కదనాల చుక్క పద్మగంధితో నవమన్మథుడైన రామునికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. రాజ్యంతోపాటు రూపవతి కూడా అతడికి లభించింది. కొన్ని రోజులపాటు రాముడు ఈడుకు తగిన వేడుకలను అనుభవించాడు.
ఒకనాడు భార్యను చేరబిలిచి..
“ప్రేయసీ! మేము ఐదుగురం స్నేహితులం. దేశాటన చేస్తూ, ఒక మర్రిచెట్టును ఎక్కి నేనిక్కడికి వచ్చాను. మిగిలినవారంతా తలోదిక్కుకూ వెళ్లారు. ఏడాది లోపుగా మళ్లీ మేం కలుసుకోవాలని గడువు పెట్టుకున్నాం. ఒకసారి నేను మా మిత్రులను కలిసి, త్వరలోనే తిరిగివస్తాను” అని చెప్పాడు రాముడు.
పద్మగంధి ఎన్నెన్నో ప్రతికూల వాక్యాలు చెప్పింది. భర్తను ఇల్లు కదలకుండా చేయాలని పట్టుదలగా ప్రయత్నించింది. చివరికి అతడు చెప్పిన అనునయ వాక్యాలకు లోబడి, ప్రయాణానికి ఒప్పుకొన్నది.
మరునాడే గుర్రాన్ని అధిరోహించి రాముడు బయలుదేరాడు. రెండు జాముల పొద్దెక్కే వరకూ ఏకబిగిన ప్రయాణించి, అడివిలో ఒకచోట విడిది చేశాడు. ఒక చెట్టునీడలో గుర్రాన్ని కట్టివేసి, ఫలహారం చేసి కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నాడు.
అటువంటి సమయంలో..
దిక్కుల గోడలు బద్దలై, ఈ బ్రహ్మాండ గోళంపై మరో బ్రహ్మాండం విరుచుకుపడుతోందేమో అన్నట్లుగా.. పెద్దగా చప్పుడైంది. నిరాయుధుడైన రాముడు ఆ భయంకర స్వరాన్ని వినగానే తన ఆయుధాన్ని అందుకోబోయాడు. కానీ, అంతలోనే తోకను విదులుస్తూ, అనంత వేగంతో లంఘించిన సింహం ఒకటి, రాముని మేలుజాతి గుర్రాన్ని మెడబట్టి కరుచుకుని అడివిలోకి పోయింది.
ఆ సంఘటన నుంచి పూర్తిగా తేరుకున్న రాముడు, మెల్లగా నడవ సాగాడు. కాటుక నలుపు చీకట్లు దిక్కులను ఆవరించుకున్నాయి. ఆకాశంలో మేఘాలు కమ్మి ఉరుములు, మెరుపులతో వర్షం కురవడం ఆరంభించింది. ఆ జడివానకు గజగజ వణుకుతూ నడుస్తుండగా, అతనికో అమ్మవారి ఆలయం దర్శనమిచ్చింది. మంచిచెడ్డలు ఆలోచించడం మాని, రాముడు ఆలయపు తలుపులు తోసుకుని లోపలికి జొరబడ్డాడు. గర్భాలయంలో ఉగ్రరూపంతో చండీమాత కొలువుదీరి ఉంది. తడి వస్ర్తాలను పిండుకుని, వెచ్చదనం కోసం వేచి చూడసాగాడు రాముడు.
అంతలో ఉరుముల పెళపెళార్భటుల మధ్య, ఒక అబల ఆక్రందన వినవచ్చింది. భయంకరాకారులైన ఇద్దరు దొంగలు ఒక స్త్రీని బలాత్కారంగా గుళ్లోకి లాక్కొచ్చారు. వారికి కనబడకుండా రాముడు చండీమాత విగ్రహం మాటున దాక్కున్నాడు. అప్పుడప్పుడు తళుక్కుమంటున్న మెరుపు వెలుగుల మధ్య జరుగుతున్నదంతా గమనిస్తూనే ఉన్నాడు. కొద్దిసేపటికి ఆ దొంగలిద్దరూ నెగడు వెలిగించారు. చేతులు కట్టివేసి ఉండగా ఆ స్త్రీ ఒక మూల కూలబడి రోదిస్తోంది. ఆ దొంగలిద్దరూ విశ్రాంతిగా కూర్చుని తమలో తాము ఇలా మాట్లాడుకుంటున్నారు.
“ఒరేయ్ భుజంగా! మనం ఇప్పటివరకూ ఈ అమ్మవారికి తొంభైతొమ్మిది మంది రాజకన్యలను బలిచ్చాం. దీనితో మన వ్రతం పూర్తవుతుంది. రేపటికల్లా చండిక మన కోరికను నెరవేరుస్తుంది”.
“నిజమేరా చార్వాకా! మనం కాబట్టి ఇంత కఠినమైన వ్రతాన్ని తేలిగ్గా పూర్తి చేయగలిగాం. ఇంత చేసిన మనకు వరమివ్వకుండా అమ్మవారు ఏ చెరువు నీరు తాగగలదు?”.
“ఏ మాటకామాటే చెప్పుకోవాలిరా! మనం బలిచ్చిన రాకుమార్తెలలో ఇంత చక్కనైనది లేదు సుమా!”.
“లేదని సందేహంగా పలుకుతున్నావేం? ఆ కత నీకు తెలియదు కాబోలు. రెండేళ్ల నుంచి ఈమె తండ్రి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నాడు. దేశదేశాల రాకుమారులు వచ్చినా కానీ, తన చక్కదనానికి సరిపోలేదని ఎవ్వరినీ వరించింది కాదు”.
“ఇటువంటి యోగం రాసిపెట్టి ఉండగా, ఎందుకు వరిస్తుంది? కానీ ఒరే భుజంగా! ఈ కామినిని చూసిన మీదట నాకొకటి అనిపిస్తున్నది. ఒకసారి భోగించిన తరువాత అమ్మవారికి బలిద్దాం”.
“ఛఛ! అలా చేస్తే అమ్మవారికి కోపం వచ్చి వరమివ్వదు సుమా!”.
“ఆఁ.. పోనిద్దూ! అమ్మవారిచ్చే వరం తనతో సంభోగసుఖం కంటే ఎక్కువా?”.
“కాదా మరి! అమ్మవారికి కోపం వస్తే మనల్ని బుగ్గి చేసేయదా?”.
“అలా అయితే నేను ఈ కన్యను పెళ్లాడతాను. అమ్మవారికి ఇంకో రాజకన్యను తెచ్చి బలిద్దాం”.
“నేనేమైనా తక్కువ తిన్నానా? అసలు మొదట చూసినవాణ్నే నేను! నేనే పెళ్లాడతాను”.
.. ఇలా వాళ్లిద్దరూ తమలో తాము కలహించుకుంటుండగా రెండు చేతులలోనూ విచ్చుకత్తులను పూని, రాముడు వారిముందుకు ఉరికాడు. ఊహించని పరిణామానికి వాళ్లిద్దరూ బెదిరిపోయారు.
“దుర్మార్గులారా! పదండి. అమ్మకు మొక్కండి. ఒక్క కత్తివేటుతో మీ శిరస్సులను ఖండిస్తాను. అమ్మకు బలివ్వడానికి తెచ్చిన వనితను, చెరచడానికి ప్రయత్నించిన పాపం ఊరికే పోతుందా? నేను అమ్మవారి బంటును. నేటితో మీ ఆయువు తీరిపోయింది” అని రాముడు హూంకరించాడు. అతడి ఉగ్రరూపాన్ని చూసి, వాళ్లిద్దరూ కొయ్యల్లా బిగుసుకుపోయారు. అదను చూసి, రాముడు వాళ్లిద్దరి తలలు నరికేశాడు.
అప్పటికి పూర్తిగా తెల్లవారింది. బందీగా పడిఉన్న స్త్రీకి కట్లు ఊడదీశాడు. ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్న ఆమె, దైవప్రేరణగా వచ్చి రక్షించినందుకుగానూ కృతజ్ఞతా సూచకంగా రామునికి వందనం చేసింది.
ఆమెను లేవదీసి.. “నారీమణీ! ఎవరు నువ్వు? వీరికి ఎలా చిక్కావు?” అని ఆదరంతో ప్రశ్నించాడు రాముడు.
“ఆర్యా! నేను కుంతల దేశాధీశుడైన శ్రుతకీర్తి మహారాజు కూతురిని. నా పేరు లతాంగి. చిన్ననాడే మా అమ్మ తన చెల్లెలికి నన్ను దత్తత ఇచ్చింది. కనుక మాళవ రాజ్యంలో పెరిగాను. మొన్నటి రాత్రి నిద్రలో ఉండగా, ఈ దొంగలు నన్ను మత్తుమందు చల్లి ఎత్తుకొచ్చారు. నిన్నంతా నన్ను అడవిలో హైరానా పెట్టి, నడిపిస్తూ ఇక్కడికి లాక్కొచ్చి పడేశారు” అని తన వివరమంతా చెప్పుకొచ్చింది.
ఆ మాటలు విన్న రాముడి ముఖంపై చిరునవ్వు మెరిసింది. ఆమెకు కూడా ఆనందం కలిగేలాగా.. “నేను మీ అక్క అయిన పద్మగంధి భర్తను. ఆమెకు కన్నులిచ్చి, పెళ్లాడిన వాడిని నేనే. నువ్వు నా మరదలివి” అని చెప్పాడు.
లతాంగి సిగ్గుతెరల మాటున.. “మా అక్కతో పాటుగా నన్ను కూడా స్వీకరించండి” అన్నది. అప్పటికప్పుడే వారికి, చండిక ఎదుట గాంధర్వ వివాహం జరిగింది.
* * *
అక్కడినుంచి బయలుదేరి వారిద్దరూ ఆ సాయంకాలానికి, ఒకానొక కోయపల్లెకు చేరుకున్నారు. పల్లెజనాలు వాళ్లిద్దరినీ స్వాగతించారు. గూడెం దొర వాళ్లిద్దరికీ తన ఇంట్లో ఆతిథ్యమిచ్చాడు. పాలు, తేనె, మధురఫలాలను ఇచ్చి ఆకలి తీర్చాడు. ప్రయాణపు బడలిక వల్ల రాముడు లతాంగి ఆ రాత్రి ఆదమరిచి నిద్రపోయారు.
అర్థరాత్రి కావస్తుండగా గుడిసె తలుపులను మెల్లిగా తోసుకుని దొర ప్రవేశించాడు. తన చేతిలో ఉన్న మంత్రపు గింజలను నిద్రిస్తున్న రామునిపై చల్లాడు. వెనువెంటనే రాముడు కుక్కలాగా మారి మొరగసాగాడు.
ఆ అలికిడికి లతాంగి నిద్రలేచింది. ఎదురుగా దొర కనిపించాడు. తన పక్కన రాముణ్ని కాక, కుక్కను చూసి కలవర పడింది లతాంగి.
గూడెం దొర మెల్లిగా లతాంగిని సమీపించి.. “బుల్లీ! కంగారు పడమాకు. నేను నిన్ను వలచాను. నీకు ఏ కొదవ లేకుండా చూసుకుంటాను. నన్ను మనువాడి ఈ కోయరాజ్యాన్ని పాలించుకో” అంటూ ఇంకా ఏవేవో చెబుతున్నాడు.
జరిగిన విషయం అంతా లతాంగి నెమ్మదిమీద గ్రహించగలిగింది.
‘నా భర్త కుక్కగా మారిపోవడం వల్ల ఇప్పుడతను నన్ను రక్షించలేడు. నన్ను నేనే రక్షించుకోవాలి. నా భర్తను కూడా ఈ దొర బారినుంచి తప్పించాలి’ అనుకుంటూ తక్షణ కర్తవ్యాన్ని తెలివిగా ఆలోచించి నిర్ణయించుకుంది.
లేని చిరునవ్వును పెదవుల మీద మొలిపించుకుని..
“దొరా! నా పూర్వపుణ్యం చేత నువ్వు నాకు లభించావు. కానీ ఒక్కటే భయంగా ఉంది. నీ భార్య నన్ను సవితిగా ఒప్పుకొంటుందా?” అన్నది.
మాటతోచక దొర దిక్కులు చూశాడు.
మళ్లీ లతాంగియే.. “ఒక పని చేద్దాం. ఈ అడవికి దూరంగా ఒక చండీ ఆలయం ఉంది. అక్కడికి వెళ్లి మనిద్దరం పెళ్లి చేసుకుందాం” అని సలహా చెప్పింది.
కోయదొర వెంటనే ఒప్పుకొని అప్పటికప్పుడే ఆమెను బయలుదేర దీశాడు. లతాంగి ఒక మెడతాడుతో కుక్కగా మారిన రాముణ్ని కట్టివేసి, అతడి కత్తిని తాను ధరించి దొర వెంట వెళ్లింది.
అడవి తోవ వెంట ఆ రాత్రంతా వాళ్లు ప్రయాణించారు. తెల్లవారింది మొదలు లతాంగి మెప్పు పొందడం కోసం కోయదొర వింతవింత వెకిలి చేష్టలు చేయడం మొదలుపెట్టాడు. వాటన్నిటినీ భరిస్తూ అతణ్ని మరింత ఉద్రేకపరుస్తూ మతి చెడేలా మాట్లాడసాగింది లతాంగి.
అదును చూసుకుని.. “దొరా! నీ మంత్రశక్తిని మెచ్చుకోవాలి. చెట్టంత మనిషిని కాస్తా చిటికెలో కుక్కని చేశావు కదా! ఏదీ మళ్లీ ఇతణ్ని మనిషిని చెయ్యి చూద్దాం” అన్నది కవ్విస్తూ.
ఆ మాటతో దొర బిక్కమొహం వేశాడు.
“ఆ చదువు నేను చెప్పుకోలేదు బుల్లీ! మా అడివినుంచి అప్పుడప్పుడూ కస్తూరి, జవ్వాది, తేనెలాంటివి తీసుకుని వంగదేశపు రాజధాని హేలానగరానికి వెళ్లి అమ్ముకొస్తూ ఉంటాను.
క్కడో సాధువుతో నాకు పరిచయం అయింది. ఆయన నాకు తన విద్దెలన్నీ చెప్పాడు. కానీ, ఈ ఒక్క రహస్యం మాత్రం చెప్పలేదు” అన్నాడు బేలగా.
కళావతి సాలోచనగా తల ఊపింది.
సాయంత్రం కావచ్చింది. ఇద్దరూ చండీ ఆలయానికి చేరుకున్నారు. ముందుగా లతాంగి అమ్మవారిని పూలతో పూజించి, మోకాళ్లపై వంగి అమ్మవారికి మొక్కింది. కళ్లుమూసుకుని కొంతసేపు దేవిని ధ్యానించింది.
“దొరా! నువ్వుకూడా అమ్మకు మొక్కు. మనిద్దరం పెళ్లి చేసుకుందాం” అన్నది.
లతాంగి చేసినట్లే దొర కూడా చేయడం మొదలుపెట్టాడు. అతడు కన్నులు మూసుకోగానే, లతాంగి కత్తి తీసుకుని అతని తలను ఒక్కవేటున నరికేసింది. అమ్మకు కృతజ్ఞతలు అర్పించి ఆలయం నుంచి వెలుపలికి వచ్చింది. కుక్కరూపంలో ఉన్న రాముని తీసుకుని, హేలానగరానికి మార్గాన్ని అన్వేషించడానికి బయలుదేరింది.
(వచ్చేవారం హేలానగరంలో ప్రవరుడు)
అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu Episode 4 | చేపమింగిన కంకణం
“Kasi Majili Kathalu Episode 3 | పంజరంలో రామచిలుక”
“Kasi Majili Kathalu Episode 2 | దేవతా వస్త్రాలు”
“Kasi Majili Kathalu Episode 1 | జారిపడ్డ మామిడిపండు”