Kasi Majili Kathalu Episode 6 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : దేశాటనకు బయలుదేరిన ఐదుగురు మిత్రులకు అడవిలో ఒక వింత మర్రిచెట్టు కనిపించింది. ఆ చెట్టుకొమ్మను ఎక్కివెళ్లిన రాజకుమారుడైన వసంతుడు కళావతిని పెళ్లి చేసుకున్నాడు. ఒక మాయదారి ముసలమ్మ కళావతిని ఎత్తుకుపోయి హేలానగరపు చక్రవర్తి కందర్పకేతునికి అప్పగించింది. వసంతుడు ఇంకా నిర్జనమైన దీవిలో కొనప్రాణంతో పడి ఉన్నాడు. రెండోవాడైన రాముడు కోయదొర కారణంగా కుక్కలా మారాడు. మూడోవాడు ప్రవరుడు..
అడవిలో కనిపించిన వింతైన మర్రిచెట్టు పడమటి కొమ్మను ఎక్కినవాడు బ్రాహ్మణ కుమారుడైన ప్రవరుడు. అతడు మూడు దినాలు ఆ చెట్టుకొమ్మపై తిరుగాడాడు. ఆ తరువాత చెట్టుకొమ్మ ఒకానొక అడవిలో అల్లిబిల్లిగా కలిసిపోయింది. తనకు తెలియకుండానే కాకులు దూరని ఆ కారడవిలో అతడు కొంతదూరం నడిచివెళ్లాడు.
ఇంతలో ఎక్కడినుంచి వచ్చారో కానీ, విచ్చుకత్తులతో కొందరు దొంగలు ప్రవరునిపై దాడిచేశారు. అతని వద్దనున్న సొమ్మును, ఆభరణాలను దోచుకున్నారు. అంతటితో విడిచిపెట్టకుండా ప్రవరుని కట్టుబట్టలు సైతం గుంజుకున్నారు. విలువైన ఆ వస్ర్తాలను దొంగల నాయకుడు ధరించి, తన వస్ర్తాలను ప్రవరుని ముఖంపై విసిరికొట్టి దొంగలంతా అడవిలో కలిసిపోయారు. చేసేదిలేక మురికిగా ఉన్న ఆ వస్ర్తాలనే ధరించి ప్రవరుడు ముందుకు సాగాడు. ఆ సాయంకాలానికి ఓ పట్టణానికి చేరుకున్నాడు. ఆరోజు అమావాస్య. అప్పటికే చీకటి పడింది.
పగలంతా ప్రయాణం చేసి బడలిక వల్ల పట్టణ శివారులో కనిపించిన ఒక ఇంటి తలుపు తట్టాడు.
“ఈపూటకి మీ ఇంట్లో తలదాచుకోవచ్చా?” అని ఆ ఇంటి యజమానిని అడిగాడు.
ప్రవరుని వాలకాన్ని గమనించిన యజమాని.. “దొంగ.. దొంగ” అని కేకలు పెట్టాడు.
జనాలు పోగుబడితే తనను మక్కెలు విరగదన్నడం ఖాయమనుకున్న ప్రవరుడు.. అక్కడినుంచి పరుగు లంకించుకున్నాడు. పరుగెత్తి, పరుగెత్తి రాజకోటను ఆనుకుని ఉన్న కందకం వద్దకు చేరుకున్నాడు. ఆ నీళ్లతోనే ముఖం కడుక్కుని, ఆ పక్కనే ఉన్న అశ్వశాల వద్ద కాస్త శుభ్రమైన చోటు చూసుకుని కునుకు తీశాడు. ఒక జాముకు పైగా ఒళ్లు మరిచి నిద్రపోయాడు. కానీ, కడుపులో ఆకలికి అతనికి ఎక్కువ సేపు నిద్ర పట్టలేదు.
ఆ రాత్రి వేళలో.. అటువంటి అవతారంలో ఉన్న తనకు అన్నం ఎవరు పెడతారు?! అందుకని మరోసారి కడుపునిండా నీళ్లయినా తాగుదామని కందకం వద్దకు వెళ్లాడు. నీళ్లు తాగుతుండగా.. కోటమీదుగా గలగలమని ధ్వని వినబడింది. గోడపై నుంచి ఒక ఇనుపగొలుసు కిందికి వేలాడుతున్నది. కొద్దిసేపటికి ఎవరో ఆడమనిషి ఆ గొలుసు పట్టుకుని కిందికి దిగుతున్నది.
ప్రమాదాన్ని శంకించిన ప్రవరుడు, మొదట తాను నిద్రపోయిన చోటికే వెళ్లి నిద్ర నటిస్తూ, ఆ ఆడమనిషి కదలికలను గమనించసాగాడు.
ఆమె కోట గోడ దిగి, నేరుగా ప్రవరుని వద్దకు నడిచి వస్తున్నది. ఆ చిమ్మచీకటిలో తొలకరి మెరుపు ఒకటి తళుక్కనగా, ఆమె మోమును తిలకించిన ప్రవరుడు దిమ్మెరపోయాడు.
పోతపోసిన పాలరాతి శిల్పంలా ఉన్న పదహారేళ్ల పడుచుకత్తె. చూడబోతే రాచకన్యలా ఉంది.
ఆ రాచకన్నె ప్రవరుని సమీపించింది.
“జయంతా! లే లే” అంటూ ప్రవరుని తట్టి లేపింది. మారుమాటాడకుండా ప్రవరుడు లేచి కూచున్నాడు. గుర్రపుశాలలోని ఒక గుర్రాన్ని రాచకన్య అధిరోహించింది. వేరొక గుర్రంపై అతడిని ఎక్కమని సూచించింది.
దూరాన వినబడే మేళాల చప్పుడులో తమ గుర్రాల డెక్కల చప్పుడు వినబడనంత నెమ్మదిగా వాళ్లిద్దరూ ముందుకు సాగారు. పట్టణం దాటిన వెంటనే అడవి మార్గం వెంట దౌడు తీశారు. కొంతదూరం వెళ్లిన తరువాత ఇక భయం లేదనుకుని..
“జయంతా! ఈవేళ దర్బారుకి ఎవరో ఒక వారాంగన వచ్చిందట. ఆమె తన గానపాటవాన్ని పరీక్షించి, జయపత్రికను ఇప్పించమని నాన్నగారిని కోరిందట. ఈ వేళ రాత్రి ఆమె కచ్చేరికి నన్ను కూడా రమ్మని నాన్నగారు చెప్పారు. కానీ, తలనొప్పి వంకపెట్టి తప్పించుకున్నాను. బహుశా మీ నాన్నగారు నిన్ను కూడా రమ్మనే ఉంటారు కదా!” అని అడిగిందామె.
“ఊహూ!” అన్నాడు ప్రవరుడు. తాను జయంతుడను కాదని ఆమెతో చెప్పదలుచుకోలేదు.
“పోనీలే! మంచిదే అయింది. ఒకవేళ పిలిచివుంటే నువ్వు నాలా అబద్ధం చెప్పి తప్పించుకోలేక పోయేవాడివి. చూశావా.. దేశాన్నేలే జయసేన మహారాజుగారి కుమార్తెను నేను. ప్రధానమంత్రిగారి పుత్రరత్నానివి నీవు. కులానికి ఇద్దరమూ సమానమే. కానీ, అంతస్తులు మనల్ని విడదీశాయి. మన మధ్య ఉన్న అనురాగం.. మన తల్లిదండ్రులకు కోపకారణం కావచ్చేమోనన్న అనుమానంతో మనమిలా దేశం కాని దేశానికి వెళ్లిపోవాల్సి వస్తున్నది. మనసులేని మనువు చేసుకుని రాజ్యాలను ఏలడం కంటే.. ప్రేమించిన వాడితో కలోగంజో తాగి బతకడం మేలు కదా!” అన్నదామె.
“హా..” అన్నాడు ప్రవరుడు.
దారి పొడవునా ప్రవరుడు ఆమెతో ఏమీ మాట్లాడలేదు. ఆమె అడిగిన వాటికి ‘ఆ.. ఊ..’ అని మాత్రం సమాధానం ఇచ్చాడు. ఆమె మాత్రం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది.
“జయంతా! ఆ బాల్యపు రోజులెంత బాగుండేవి?! ధనిక, బీద.. ఆడామగ భేదాలు లేకుండా అందరం ఆడుకునేవాళ్లం. ఇద్దరం ఒక గురువు వద్ద చదువుకున్నవాళ్లం. విద్యలో, అందంలో
ఒకరికొకరం తీసిపోం. ఒకరిని వదిలి మరొకరం క్షణమైనా ఉండలేనివాళ్లం. ఈ పాడు యవ్వనం ఎప్పుడైతే ఒంటిమీదికి వచ్చిందో కానీ, ఆనాటి నుంచి నీకూ నాకూ ఎడబాటు మొదలైంది. నేటికది తీరింది. అయితే, కనిపెంచిన తల్లిదండ్రులను విడిచి రావలసి వచ్చిందనే చింత మాత్రం ఉంది” అన్నదామె గొంతు జీరబోతుండగా. ఆ బాధకు తోడుగా ఆమె మోము తెలతెల పోవాల్సి ఉన్నదేమో అన్నట్లుగా.. కప్పుకొన్న నల్లదుప్పటిని తొలగతోసుకుని దిక్కులన్నీ తెల్లబారజొచ్చాయి. తనతోపాటు వస్తున్నవాడు తన కూరిమి చెలికాడు జయంతుడు కాడని, వేరొక పురుషుడని అప్పటికి తెలుసుకున్న ఆ తరుణి మోము చిన్నబోయింది. అంతరంగం తత్తరపాటుకు గురయింది. పొల్లుపొల్లుగా కన్నీరు జాలువారుతుండగా క్రమంగా ఆమె చెంపలు, వక్షస్థలం తడిసి ముద్దయ్యాయి. కానీ, వారిద్దరూ ఒకరినొకరు పలకరించుకోకుండానే ఒకచోట గుర్రాలు దిగి, కాలకృత్యాలు తీర్చుకున్నారు. తిరిగి జాము పొద్దెక్కే వరకూ ప్రయాణించగా ఒక నది వచ్చింది. అక్కడ గుర్రాలను విడిచి, సిద్ధంగా ఉన్న ఒక పడవను ఎక్కారు. పడవలో ఒక ముసలమ్మ రాచకన్యను పలకరించింది.
“అమ్మాయీ! నీ పేరేమిటి?” అని మురిపెంగా అడిగింది.
“కాంచనవల్లి” సమాధానం చెప్పిందామె.
“అమ్మా! నేను బతికి చెడ్డదాన్ని. ఉన్న ఊళ్లో బతుకు సాగించలేక, వలస పోతున్నాను. చూస్తుంటే నువ్వు కలిగిన దానిలా ఉన్నావు. నేను కూడా నీతో వస్తాను. రెండుపూటలా భోజనం పెడితే, నిన్ను కనిపెట్టుకుని ఉంటాను. ఓపినంత సేవ చేస్తాను” బతిమాలింది ముసలామె.
కాంచనవల్లి అంగీకార సూచనగా తల ఊపింది. పడవ సాయంత్రానికల్లా కందర్పకేతుడు ఏలుతున్న హేలానగరానికి చేరింది. ప్రవరుడు, కాంచనవల్లి, ముసలమ్మ ఆ రాత్రికి ఒక సత్రంలో బసచేశారు. మరునాడు ప్రవరుడు స్నాన సంధ్యావందనాలు పూర్తి చేసుకుని విబూది రేఖలతో, పంచాంగాన్ని చేతబట్టి వర్తకులుండే విపణివీధికి వెళ్లాడు. ఏదో బేరం నిమిత్తమై వర్తకులందరూ సమావేశమైన చోటుకు వెళ్లి నిలబడ్డాడు. వారందరూ అతనికి నమస్కరించారు.
వారిని ఆశీర్వదించి..
“అయ్యా! నేను పరదేశస్థుడను. జ్యోతిషశాస్త్రంలో దిట్టను. మీరు నా విద్యను పరీక్షించవచ్చు. మీమీ నక్షత్రాలు రాసి ఇస్తే, జాతక ఫలితాలు చెబుతాను. సరిచూసుకుని, మీరు సంతృప్తి పడితే తగిన రీతిగా నన్ను గౌరవించవచ్చు” అన్నాడు.
కొందరు అతడు కోరిన వివరాలు అందించి, తమ జాతక ఫలితాలను తెలుసుకున్నారు. తమకు తోచిన మొత్తం అతని చేతిలో పెట్టి నమస్కరించారు. అందరిలోనూ పెద్దవర్తకుడొకడు..
“మీరు రత్నపరీక్ష చేయగలరా?” అని ప్రశ్నించాడు.
“చేయగలను” బదులిచ్చాడు ప్రవరుడు.
వర్తకుడు అతడిని తన దుకాణానికి తీసుకుపోయి, తాను నిల్వ ఉంచుకున్న రత్నాలన్నీ అతనిముందు రాశిపోశాడు. ప్రవరుడు కొద్దిసేపటిలోనే వాటిలో మేలిమి రత్నాలేవో, గాజుపూసలేవో వేరు చేసి చూపించాడు. ప్రవరుని ప్రతిభకు ఆ వర్తకుడు ముగ్ధుడైపోయాడు.
“స్వామీ! ఇకనుంచి మీరు నా దగ్గరే ఉండిపోవాలి” అని కోరాడు.
ప్రవరుడు అంగీకరించాడు. ఆవేళే అతడికి ఒక ఇల్లు, సరుకు సంబారాలు సమకూర్చాడు ఆ వర్తకుడు. కాంచనవల్లితోనూ ముసలమ్మతోనూ కలిసి ప్రవరుడు ఆ ఇంటిలో నివాసం ఉండసాగాడు.
ఇలా కొంతకాలం గడిచింది.
ఒకరోజున రాజ్యాన్నేలే కందర్పకేతుని వద్దకు ఒక విదేశీ వర్తకుడు వచ్చాడు. అతడు అతివిలువైన ఒక మేలిమిజాతి వజ్రాన్ని తీసుకువచ్చాడు. మీరు పరీక్ష చేయించుకుని, దీనికి వెలకట్టండి అని దర్పంగా ప్రభువును కోరాడు.
రత్నపరీక్ష కోసం రాజధానిలో ఉన్న వర్తకులందరికీ కందర్పకేతుడు కబురు పంపాడు. అందరూ ఆ వజ్రాన్ని పరీక్షించి, తమకు తోచిన వెలను చెప్పసాగారు. ఏ ఒక్కరూ యాభై లక్షల కంటే తక్కువ చెప్పలేదు. చివరిగా ప్రవరుని వంతు వచ్చింది. అతను వజ్రాన్ని చేతిలోకి తీసుకుని, అటూఇటూ తిప్పి చూశాడు.
“రాజా! ఇది విలువైన వజ్రమైతే రెండుకోట్లకు తక్కువ చేయదు. కానీ, ఇది నిజమైన వజ్రం కాదు. గాజుపూస మాత్రమే. కనుక దీని అందానికి మెచ్చుకుని రాజావారు ఈ వర్తకునికి ఓ రూపాయి బహుమతి చేయవచ్చు” అన్నాడు.
ఆ మాట విని వర్తకుడు గుండెలు బాదుకున్నాడు. కందర్పకేతుడు ఆశ్చర్యపోయాడు.
“వీరందరూ మెచ్చుకున్నదాన్ని నువ్వెలా కాదని నిరూపించగలవు?” అని గద్దించాడు.
ఒక ఇనుప పలక తెప్పించి, దానిమీద ఆ వజ్రాన్ని ఎత్తికొట్టాడు ప్రవరుడు. అది కాస్తా నువ్వుగింజలంత పరిమాణంలో ముక్కలుగా పగిలిపోయింది. వజ్రాల వర్తకుడి గుండె చెరువైపోయింది.
“వీణ్ని పట్టి బంధించండి. వీడి దగ్గరున్న సొమ్ములన్నీ జప్తు చేసి ప్రభుత్వ ఖజానాకు తరలించండి”.. కందర్పకేతుడు ఆజ్ఞాపించాడు.
అప్పుడు ప్రవరుడు..
“మహారాజా! ఈ వర్తకుడు అమాయకుడు. అందరిలాగే ఇది నిజమైన వజ్రమేమోనని ఇతడు కూడా భ్రమపడ్డాడు. మోసం చేసే ఉద్దేశం ఉంటే పరీక్షించమని కోరేవాడే కాదు! దయచేసి విడిచిపెట్టండి” అన్నాడు.
కందర్పకేతుడు సాలోచనగా తల పంకించాడు.
“సరే.. మీరీవేళ నాకు గొప్పనష్టం కలగకుండా కాపాడారు. కనుక మీ మాట మన్నిస్తాను. మీరుకూడా నామాట మన్నించాలి. మిమ్మల్ని నేటినుంచి ముఖ్య ప్రధానిగా నియమిస్తున్నాను” అన్నాడు.
“ధన్యవాదాలు మహారాజా! ఆనందంగా అంగీకరిస్తున్నాను” అని బదులిచ్చాడు ప్రవరుడు.
ప్రవరుడు మంత్రి అయిన తరువాత వంగదేశంలో భారీమార్పులు జరిగాయి. ప్రజల్లో క్రమశిక్షణ పెరిగింది. ప్రజలందరూ ధర్మవర్తనులయ్యారు. వర్తక వాణిజ్యాలు పెరిగాయి. రాజుకు వేళకు శిస్తులు వసూలై ఖజానాకు రాబడి పెరిగింది.
ప్రవరుడు బుద్ధిలో బృహస్పతి అనే నిర్ణయానికి వచ్చాడు కందర్పకేతుడు. మంత్రులందరికంటే అతనికే ఎక్కువ ప్రాధాన్యం, గౌరవం కల్పించాడు. ఆమాటకొస్తే ప్రవరుణ్ని తన మిత్రునిగా చేసుకోవాలని కోరిక ఏర్పడిందతనికి.
‘మిత్రమా!’ అని సంబోధించడం ప్రారంభించాడు. క్రమంగా వారిమధ్య అరమరికలు లేకుండా పోయాయి. కందర్పకేతునికి ప్రవరుడు సన్నిహిత మిత్రునిగా స్థిరపడ్డాడు.
ఒకనాడు ప్రవరుని పిలిచి..
“మిత్రమా! నీవల్ల నా రాజ్యం సుస్థిరమైంది. ఇంక సింహాసనాన్ని గురించి నాకు దిగులు లేదు. కాగా నా మనస్సును పట్టిపీడిస్తున్న సమస్య ఒకటి నీకు చెప్పవలసి ఉంది. నేను కళావతి అనే పేరు కలిగిన త్రిభువన సుందరిని ఒకానొక ద్వీపాంతరం నుంచి రప్పించాను. కానీ, నేటివరకూ నేనామెను తాకలేదు. రోజులన్నీ వృథాగా గడిచిపోతుంటే ఇక, ఆమె అంగీకరిస్తుందనే నమ్మకం పోయింది. నీ బుద్ధికి అసాధ్యమంటూ లేదు కదా! నువ్వేమైనా ఈ విషయంలో నాకు సాయం చేయగలవా?” అని ప్రార్థనగా అడిగాడు కందర్పకేతుడు.
తప్పనిసరి స్థితిలో ప్రవరుడు, మంచి సమయం చూసుకుని కళావతి వద్దకు వెళ్లాడు. ఒక్కసారి ఆమెవంక చూసి, చూపులు పక్కకు తిప్పుకొన్నాడు.
“సాధ్వీ! నేను కొత్తగా వచ్చిన మంత్రిని. నీ వృత్తాంతాన్ని తరచుగా వింటూనే ఉన్నాను. కానీ, రాజును ఎదిరించలేక ఊరుకున్నాను. ఈ దుర్మార్గుడైన రాజు నిన్ను వశపరచమని కోరి, నన్నిక్కడికి పంపాడు. నా ఉద్దేశం అదికాదు. అనుమానం విడిచి, నీ వివరాలు తెలియచేస్తే నాకు తోచిన సాయం చేస్తాను” అన్నాడు ప్రవరుడు.
కళావతి అతడి మాటలకు సంతోషించింది.
“అన్నా! నీ వివేకాన్ని నువ్వు ఉపయోగించిన భాషే తెలియచేస్తున్నది. వివేకవంతులు, మర్యాద కలిగినవారు పరుషపదాలను వినియోగించడానికి ఇష్టపడరు. ఇక నా గురించి ఏమని చెప్పను?! చిన్ననాడే నన్ను నా తల్లిదండ్రుల నుంచి ఒక బ్రహ్మరాక్షసి వేరు చేసింది. నన్నో రహస్య ద్వీపంలో దాచిపెట్టింది. ఒకానొక వటవృక్షం కారణంగా మిత్రుల నుంచి వేరుపడిన వసంతుడనే రాకుమారుడు నన్ను చేపట్టాడు. బ్రహ్మరాక్షసి పీడనుంచి వదిలించాడు. కానీ, ఒకనాడు మేముండే ద్వీపానికి ఓ ముసలామె వచ్చింది. నాచేత నా వసంతుని ఆయువుగుట్టు అడిగించింది. మేము గాఢనిద్రలో ఉండగా నా భర్తకు స్మృతి తప్పించి, నన్ను ఓడమీద ఈ రాజ్యానికి చేర్చింది. ఈ కందర్పకేతుడు మదన పీడితుడై నన్ను ముట్టుకో
బోతుంటే.. ఏదో వ్రతం నెపం పెట్టి ఏడాది గడువు కోరాను. ఇన్నాళ్లకు నిన్ను చూశాక ఆత్మబంధువును చూసినట్లు అనిపిస్తున్నది” అని తన వివరమంతా చెప్పుకొచ్చింది కళావతి.
ఆ వృత్తాంతమంతా వింటున్న ప్రవరునికి మతిపోయినట్లయింది.
“హా వసంతా! మిత్రులకు ఇచ్చిన మాట మరిచిపోయి నేనెంత మిత్రఘ్నుడిని అయ్యాను! అయ్యయ్యో ఎంతపని జరిగింది? వసంతా! నీ ప్రాణాలు కాపాడగలిగిన దండుడు ఎక్కడున్నాడో కదా? ఇంకా ఆ మర్రిచెట్టు వద్దనే ఉన్నాడో లేక, విసిగి ఎటైనా వెళ్లిపోయాడో ఎలా తెలుసుకోగలను?” స్వగతాన్ని పైకే చెప్పుకుంటూ.. పట్టరాని దుఃఖాన్ని అనుభవించసాగాడు ప్రవరుడు.
(వచ్చేవారం..మంత్రిగారి భార్య)
అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu Episode 5 | రాముని మెచ్చిన లతాంగి
Kasi Majili Kathalu Episode 4 | చేపమింగిన కంకణం
“Kasi Majili Kathalu Episode 3 | పంజరంలో రామచిలుక”
“Kasi Majili Kathalu Episode 2 | దేవతా వస్త్రాలు”
“Kasi Majili Kathalu Episode 1 | జారిపడ్డ మామిడిపండు”