అంబర్పేట: వైద్యులు, నర్సింగ్ అధికారుల కొరతతో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ ఆగమాగమవుతోంది. అక్కడ ఆయాలే రోగులకు స్లైన్లు పెడుతున్నారు. మందులు వేస్తున్నారు. నిరక్షరాస్యులైన ఆయాలు రోజువారీ అనుభవంతో రోగులకు తోచిన వైద్యసేవలు అందిస్తుండడంతో గ్రహచారం బాగాలేక ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సిబ్బంది కొరతతో వైద్యశాల నిర్వహణ గందరగోళంగా మారిందని రోగులు ఆరోపిస్తున్నారు. అసలే వర్షాకాలం. ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలయ్యాయి. వారం పది రోజుల్లో సీజనల్ వ్యాధులు మొదలవుతాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్, మలేరియా, డెంగీ, చిగున్ గున్యా, డిప్తీరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలే సమయంలో ఫీవర్ హాస్పిటల్ను సిబ్బంది కొరత వేధిస్తుండడంపై రోగుల్లో ఆందోళన మొదలైంది.
సరిపడా సిబ్బంది లేక..
330 పడకల సామర్థ్యంగల ఫీవర్ హాస్పిటల్కు నిత్యం 200నుంచి 500 మంది రోగులు ఓపీ సేవలకోసం వస్తుంటారు. సీజనల్లో అయితే ఈ సంఖ్య 800 వరకు చేరుకుంటుంది. ఇదిలా ఉండగా ఫీవర్ హాస్పిటల్లో మొత్తం 52 మంది నర్సింగ్ అధికారులు ఉండగా గత 2024లో 22 మంది స్టాఫ్ నర్సులు బదిలీ అయ్యారు. వారి స్థానంలో ఇప్పటివరకు ఒక్కరు కూడా భర్తీ కాలేదు. ప్రస్తుతం ఉన్న 29 మంది నర్సింగ్ సిబ్బందిలో కూడా ఇప్పుడు సీనియారిటీ ప్రకారం బదిలీలు జరుగుతున్నాయి. దీంతో నర్సింగ్ సిబ్బంది కొరత ఏర్పడి, రోగులకు స్లైన్లు పెట్టడం, మందులు ఇవ్వడం వంటవన్నీ ఆయాలే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వైద్యుల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ముగ్గురు ప్రొఫెసర్లు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం సూపరింటెండెంట్ ఒక్కరే ప్రొఫెసర్ ఉన్నారు. దీంతో పీజీలు, జూనియర్ డాక్టర్లతోనే కాలం వెల్లదీస్తున్నారు.
సగం టెస్టులు బయటకే…
వైరల్ ఫీవర్స్, డెంగీతో పాటు పలు ఇతర వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలను బయటకు రాస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. దవాఖానలో కనీసం బీపీ టెస్టు చేసే పరికరాలు కూడా సరిగ్గా పని చేయడంలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోగులకు కొన్ని రకాల మందులు కూడా బయటకు రాస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు.
ఓ రోగికి ఎదురైన చేదు అనుభవం
అంబర్పేటకు చెందిన బాలుడు(11) నాలుగు రోజుల కిందట వాంతులు, వీరేచనాలతో బాధపడుతుండగా తల్లిదండ్రులు వెంటనే నల్లకుంట ఫీవర్ దవాఖానకు తీసుకువచ్చారు. డాక్టర్లకు చూపిస్తే మందులు రాసి అడ్మిట్ చేసుకున్నారు. డయేరియా వార్డు(ఒకటో వార్డు)లో అడ్మిట్ చేసుకొని 11 నంబర్ బెడ్ను కేటాయించారు. బాగానే ఉంది. కానీ నాలుగు రోజులైనా డాక్టర్లు సరిగ్గా పట్టించుకోవడం లేదు. వాంతులు, విరేచనాలు తగ్గకపోగా, ఆ అబ్బాయికి తీవ్ర గొంతునొప్పి కూడా మొదలైంది. బీపీ తగ్గడం ప్రారంభమైంది. ఆదివారం ఉదయం పరిస్థితి విషమించడంతో వార్డులో ఉన్న నర్సులను అడుగుదామంటే వాళ్లు కూడా డ్యూటీ దిగి వెళ్లిపోయారు. ఆయాలు లేరు. ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి. తల్లిదండ్రుల్లో టెన్షన్. వెంటనే వాళ్లు తన కుమారుడిని తీసుకొని వేరే ప్రైవేటు దవాఖానకు తీసుకుపోయారు. ఇలాంటి సంఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయని పలువురు అంటున్నారు.