హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వు (జీవో)లను అమలు చేయాలంటూ న్యాయస్థానాలు నేరుగా ఆదేశాలు జారీచేయగలవా? అని హైకోర్టు సందేహం వ్యక్తంచేసింది. వ్యవసాయ రుణాల మాఫీ, ఇన్పుట్ సబ్సిడీ పథకాల అమలును కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు.. ఇలాంటి అంశాల్లో శాసనసభ లాంటి ప్రత్యామ్నాయ వేదికలు అందుబాటులో ఉన్నప్పుడు నేరుగా కోర్టును ఆశ్రయించడంపై ప్రశ్నలు లేవనెత్తింది.
ఈ పిటిషన్లను ప్రజాహిత వ్యాజ్యాలుగా నమోదు చేయడంపై రిజిస్ట్రీ వ్యక్తంచేసిన అభ్యంతరాలను హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది జే రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. రైతుల కోసం ప్రకటించిన ఇన్పుట్ సబ్సిడీ, రుణమాఫీ లాంటి పథకాల అమలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వందల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని అందజేయడం లేదని, రాష్ట్రంలో ఇన్పుట్ సబ్సిడీకి అర్హులైన దాదాపు 10 లక్షల మంది రైతుల్లో కేవలం 10 వేల మందికే చెల్లింపులు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
వరద ప్రభావిత జిల్లాలు, బాధితుల గుర్తింపు, లబ్ధిదారుల సంఖ్య, పరిహారం మంజూరుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని, వాటికి ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపిందని పేరొన్నారు. మహారాష్ట్రలోని విదర్భలో పత్తి రైతుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ప్రజాప్రయోజన అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని వివరించారు. జీవోలు కూడా చట్టబద్ధమైన కార్యనిర్వాహక ఉత్తర్వులేనని, వాటి అమలుకు కార్యనిర్వాహక వ్యవస్థను ఆదేశించే అధికారం కోర్టులకు ఉన్నదని వాదించారు.
అసెంబ్లీలో ఈ అంశాలను ప్రస్తావించినా ఫలితం లేకపోవడంతోనే పిటిషనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. జీవోలను అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించగలదా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు, ప్రాధాన్యతలను బట్టి నిధుల విడుదల జరుగుతుందని, అలా కాకుండా నిధులు విడుదల చేయాలని కోర్టు ఆదేశిస్తే భవిష్యత్తులో ఇలాంటి పిటిషన్లు వెల్లువెత్తుతాయని వ్యాఖ్యానించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు ప్రధానంగా తమ హకులను సాధించుకోలేని బలహీనవర్గాల కోసం ఉద్దేశించినవని పేర్కొన్నది. రిజిస్ట్రీ అభ్యంతరాలపై ఈ నెల 14న వెల్లడిస్తామని ప్రకటిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.