నల్లగొండ సిటీ జూన్ 13 : ఆర్టీసీ విలీనానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జ్యోత్స్న పేర్కొన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ విలీన ప్రక్రియ పురోగతిపై సృష్టత ఉందన్నారు. సమ్మె సమయంలో ముఖ్యమైన మూడు అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలించి సానుకూలత వ్యక్తం చేసిందన్నారు. 2021 వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారన్నారు.
ఆర్టీసీ విలీన అంశాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ సమావేశమై విలీనానికి సంబంధించిన అన్ని అంశాలపై సమీక్ష నిర్వహించిందని, సమ్మె కాలంలో మిగిలిన డిమాండ్లపై ఈడీల కమిటీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతున్నదన్నారు. త్వరలో అన్ని డిపోల్లో కార్మికశాఖ పర్యవేక్షణలో యూనియన్ వెరిఫికేషన్ ప్రకియ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా మెజార్టీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రకియలో భాగస్వామ్యం చేస్తామని, వారి నుంచి వచ్చే సూచనలు సలహాలు కేబినెట్ సబ్ కమిటీ పరిశీలనకు పంపి విలీన పక్రియను పూర్తి చేస్తామ న్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ సుచరిత తదితరులు ఉన్నారు.