Rashmika Mandanna | టాలీవుడ్ ప్రముఖ నటి రష్మికా మందన్నా ప్రస్తుతం గాయం కారణంగా సినిమాలకు దూరంగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెస్ట్ సమయంలో తన ఆలోచనల్లో వచ్చిన మార్పుల గురించి ఆమె ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఎప్పుడూ తీరిక లేకుండా ఉరుకులు పరుగులతో బిజీగా గడిపేవారికి, ఒక్కసారిగా పనులు ఆపేసి విశ్రాంతి తీసుకోవడం మొదట్లో చాలా భయంగా అనిపిస్తుందని రష్మిక తెలిపారు. అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో అలా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే.. గతంలో అలా పిచ్చివాళ్లలా పనుల వెనకే పరిగెత్తిన దినాలు ఇప్పుడు తలచుకుంటే మరింత భయంగా అనిపిస్తాయని, బహుశా జీవితం అంటే ఇదేమో అని ఆమె పేర్కొన్నారు. ఇక ఈ రికవరీ సమయంలో తన దినచర్య ఎలా సాగుతుందో కూడా ఆమె వివరించారు. ఎలాంటి అలారాలు పెట్టుకోకుండా శరీరం కోరిన సమయానికి లేవడం, రోజుకు రెండు పూటల మితంగా భోజనం చేయడం, తన పెంపుడు కుక్క ‘ఆరా’తో సమయం గడపడం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పుస్తకాలు చదవడం, పజిల్స్ చేయడం, ఇష్టమైన షోలు చూడటంతో పాటు పాత ఫోటోలు, వీడియోలను నెమరువేసుకుంటూ ప్రశాంతంగా గడుపుతున్నానని చెప్పారు.
ఈ కష్టకాలంలో తాను త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు, శ్రేయోభిలాషులు పంపిస్తున్న ప్రార్థనలకు, చూపుతున్న ప్రేమానురాగాలకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ చిత్ర షూటింగ్లో భాగంగా ఒక డ్యాన్స్ సీక్వెన్స్ చేస్తుండగా రష్మిక తుంటి భాగంలో గాయమైంది. వైద్యుల సూచన మేరకు ఆమె కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో ప్రస్తుతం పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.
View this post on Instagram