Praja Vani | మాగనూరు, ఆగస్టు 14: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపే లక్ష్యంతో సోమవారం నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసులు తెలిపారు. నారాయణపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మాగనూరు ఎంపీడీవో కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వివిధ శాఖల కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రజావాణి ద్వారా తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లే అవకాశం కలగనుంది. భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, విద్య, వైద్యం, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, సంక్షేమ పథకాలు తదితర అంశాలపై ప్రజలు ఫిర్యాదులు సమర్పించవచ్చు. స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందించి, వాటి పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సుమారు 23 వివిధ శాఖలకు చెందిన అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల కేంద్రంలోనే ఫిర్యాదు చేసే అవకాశం ప్రజలకు లభించనుంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ప్రజావాణి కేవలం ఫిర్యాదుల స్వీకరణకే పరిమితం కాకుండా, ప్రతి దరఖాస్తుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి నిర్ణీత సమయంలో పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో సమర్పించిన ఫిర్యాదులు పెండింగ్లో ఉంటే వాటిపైనా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మండల స్థాయిలో ప్రారంభం కానున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు, అధికార యంత్రాంగానికి మధ్య వారధిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు.