Kasi Majili Kathalu Episode 8 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశ్మీర దేశానికి చెందిన ఐదుగురు మిత్రులను.. వారి పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి ‘వరప్రసాదులు’ అని పిలుస్తుంటారు. వారందరూదేశాటన చేస్తూ ఒక వింతైన మర్రిచెట్టును చూసి, దానికి నాలుగు దిక్కుల కొమ్మలలోనూ ప్రయాణిస్తూ వింతలను చూస్తున్నారు. ఐదోవాడైన సాంబుడు చెట్టు మొదట్లో కాపలా ఉన్నాడు. నిర్జనారణ్యంలో కొనఊపిరితో ఉన్న వసంతుడు, కుక్కలా మారిపోయిన రాముడు, కందర్పకేతుని మంత్రి అయిన ప్రవరుని కథల తరువాత ఇప్పుడు.. దండుడు, సాంబుల కథలను చదవండి.
వింతైన మర్రిచెట్టు ఉత్తరపు కొమ్మను ఎక్కి వెళ్లినవాడు విశ్వకర్మ కుమారుడైన దండుడు. అతడు నాలుగురోజుల కాలంలో ఆ కొమ్మ చివరివరకూ ప్రయాణించాడు. కొమ్మదిగిన ప్రాంతంలో ఒక అందమైన ఉద్యానవనం ఉంది. అక్కడి వింతలను చూస్తూ ముందుకు వెళ్లిన దండునికి నీలమణులతో నిర్మించిన అందమైన కొలను కనిపించింది. అందులోని కలువలు బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాయి. ఆ కొలనులోని నీరు అమృతంలా ఉంది. ఆ జలంతో దండుడు తన దాహాన్ని తీర్చుకున్నాడు. సుగంధాలు విరజిమ్మే ఒక పూల పొదరింటిలో కొద్దిసేపు విశ్రమించాడు. విశ్రాంతి అనంతరం అక్కడినుంచి బయలు దేరబోతూ పొదరింటి తీగనుంచి ఒక పువ్వు తెంచాడు. ముక్కు దగ్గరపెట్టుకుని వాసన చూశాడు.
అంతే.. దండుడు కాస్తా చిలుకలా మారిపోయాడు. చిలుక రూపం వచ్చినా దండునిలో మొదటి తెలివి పోలేదు.
‘అయ్యో దైవమా! నన్నిలా మార్చేందుకే ఆ చెట్టుపైకి ఎక్కేలా చేశావా? ఇలా పక్షిరూపంలో ఎంతకాలం బతకాలో కదా!’ అని చాలాసేపు చింతించాడు. తనను రక్షించేవారు ఎవరైనా వచ్చేవరకూ ఇలా చిలుకలా కాలక్షేపం చేయక తప్పదు కదా అనుకున్నాడు. ఉద్యానవనంలోని చెట్ల పండ్లను ఆరగిస్తూ ఆకలి తీర్చుకోసాగాడు.
కొంతకాలం గడిచింది. ఒకనాడు ఆ ఉద్యానవనానికి విహారార్థం ఒక విద్యాధర కన్యక వచ్చింది. ఆమె పేరు విద్యుత్ప్రభ. సోమప్రభుడనే విద్యాధర ప్రభువు కుమార్తె. ఆమె.. చిలుకలా మారిన దండుడు ఒక చెట్టుపై పండు తింటూ ఉండటం చూసి ముచ్చటపడింది.
వెంటనే తనతో కూడి వచ్చిన సఖులకు రొద చేయవద్దని సంజ్ఞ చేసింది. పయ్యెదను నడుముకు చుట్టుకుని, మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ఆ చెట్టు వద్దకు వెళ్లింది. చిలుకను చేతిలోకి తీసుకుంది.
ఆ చిలుక కూడా బెట్టు చేయకుండా ఆమె చేతిపై ఒదిగిపోయి పెంపుడు చిలుకలా విద్యుత్ప్రభతో ఆటలాడ సాగింది. ముద్దుముద్దుగా పలకరించ సాగింది. ఆ చిలుకను తీసుకుని విద్యుత్ప్రభ తన పట్టణానికి వెళ్లింది.
అది మొదలుకొని విద్యుత్ప్రభకు, చిలుక రూపంలో ఉన్న దండునికి మైత్రి కుదిరింది. ఎల్లప్పుడూ చిలుకను తన చేతిపై ఆడించుకునే విద్యుత్ప్రభను చూసి, సాక్షాత్తూ సరస్వతిలా ఉన్నావని మేలమాడేవారు.
చిలుక పారిపోయేది కాదు కనుక, విద్యుత్ప్రభ దానికి వేరే పంజరం ఏర్పాటు చేయలేదు. చిలుకగా తనకుండే స్వేచ్ఛప్రకారం విద్యాధర పట్టణంలో దండుడు విహరించేవాడు. విద్యాధర లోకంలో తరచుగా విద్యార్థులకు విమానాలు తయారు చేసే విద్యను గురువులు బోధించేవారు. దండుడు ఆ విద్యనంతా తన సూక్ష్మబుద్ధితో గ్రహించాడు.
కొంతకాలానికి విద్యుత్ప్రభ తన తాత అయిన మయుని పట్టణానికి వెళ్లింది.
“తాతా! నీవు నా కోసం ప్రత్యేకంగా నిర్మించి ఇచ్చిన ఉద్యానవనంలో ఈ చిలుక దొరికింది” అని ముచ్చటగా తాతకు చూపింది.
అప్పుడాయన..
“అమ్మాడీ! చిలుకంటే జ్ఞాపకం వచ్చింది. ఆ ఉద్యానవనంలోని తటాకానికి తూర్పుదిక్కులో ఒక పొదరిల్లు ఉంది. ఆ చెట్టుపూలను ఎప్పుడూ వాసన చూడకు. అలా చూస్తే నువ్వు కూడా చిలుకవు కాగలవు” అన్నాడు
“అమ్మయ్యో!” అన్నది విద్యుత్ప్రభ కళ్లను టపటపలాడిస్తూ. “తెలియకుండా ఒకవేళ వాసన చూస్తేనో తాతా!” అని అడిగింది అమాయకంగా. “ఆ పొదరింటికి వెనుకవైపు పసుపుపూల చెట్టు ఒకటి ఉంది. ఆ పూలను వాసన చూస్తే మళ్లీ నీ అసలు రూపం నీకు వచ్చేస్తుంది” అని మయబ్రహ్మ చెప్పాడు. రెండురోజుల తరువాత దండుని తీసుకుని విద్యుత్ప్రభ తన పట్టణానికి తిరిగి వచ్చేసింది. చిలుకరూపాన్ని పోగొట్టుకునే ఉపాయాన్ని తెలుసుకున్న దండుడు.. మళ్లీ విద్యుత్ప్రభ తనను ఆ ఉద్యానవనానికి ఎన్నడు తీసుకుపోతుందోనని ఎదురు చూడసాగాడు.
* * *
అలా ఉండగా ఒకనాడు.. పట్టణంలోని కొందరు విద్యాధర కన్యకలు ఒకచోట కూడి, కులాసాగా మాట్లాడుకుంటున్నారు. దండుడు వారివద్ద చేరి ఆ మాటలు ఆలకిస్తున్నాడు. “ఏమే రాగమంజరీ! నిన్న మనమందరం భూలోకంలో ఉన్న వింతైన మర్రిచెట్టు వద్దనున్న కొలనులో జలకేళికి వెళ్లాము కదా! నీవు మాతోపాటు రాకుండా జాగు చేశావేం? అక్కడేమైనా కొత్త వింతలు కనబడ్డాయా?!” అని ఒక విద్యాధర కన్యక ప్రశ్నించింది.
అందుకు రాగమంజరి..
“వెనుక నేను వస్తున్నానో లేదో చూసుకోకుండా మీమానాన మీరు వచ్చేసింది కాకుండా.. నన్ను అంటున్నారా?! అక్కడ ఒక్కదాన్ని ఎటువంటి చిక్కుల్లో పడ్డానోనని జాలైనా లేదు కదా! నిన్న చెరువులోనుంచి బయటికి వచ్చేసరికి నా చీరనెవరో మానవుడు దొంగిలించాడు. మీకు తెలుసుకదా? మన చీరను ఏ జగదేకవీరుడు సొంతం చేసుకుంటాడో అతడిని, మనం భర్తగా స్వీకరించవలసి వస్తుందని. నిన్న అదే జరిగింది” అని చెప్పి కొద్దిగా ఆగింది.
“అమ్మయ్యో! ఎంత ప్రమాదం జరిగింది! మరి ఎలా తప్పించుకున్నావే?!” ఆసక్తిగా అడిగింది మరో విద్యాధర కన్యక.
“ఏముంది? మన రహస్యం వాడికి తెలియదు కదా! కాస్తంత బతిమాలేసరికి చీర వెనక్కు ఇచ్చేశాడు. చీర పుచ్చుకుని రాయిలాగా పడి ఉండమని వాడికి శాపంపెట్టి చక్కా వచ్చేశాను” చెప్పింది రాగమంజరి.
“నీ గుండె నిజంగా బండరాయేనే! వాడు పాపం నీ చీర తిరిగి ఇచ్చేశాడు కదా.. శపించకపోతే ఏం పోయింది? కనీసం శాపాంతాన్నయినా చెప్పి వచ్చావా?” అడిగింది మొదటి కన్య.
“వాడిమీద అంత జాలిపుడితే ఓ పనిచెయ్యి. ఆ మర్రిచెట్టు మొదట్లో ఉన్న తీగ ఆకులను తెంపి, చెరువు నీళ్లతో కలిపి ఆ బండరాయిమీద చిలకరిస్తే మళ్లీ మనిషవుతాడు. ఆనక వాణ్ని నువ్వే పెళ్లి చేసుకుని సుఖించు” అన్నది రాగమంజరి అక్కసుగా.
“ఏదో మనసుకు తోచిన ధర్మం చెప్పాను కానీ, నాకంత అవసరమేం లేదు” అంటూ మొదటి కన్య మూతి తిప్పుకొంటూ అక్కడినుంచి వెళ్లిపోయింది.
వారి మాటలన్నీ వింటున్న దండుడు..
‘ఓహో! ఎంతపని జరిగింది? ఆ వింతైన మర్రిచెట్టు మేమందరం ఎక్కి వచ్చింది కాదు కదా! అక్కడ కనబడిన మానవుడు మేమందరం కాపలాగా ఉంచిన మా మిత్రుడు సాంబుడు కాడు కదా! నాకు చిలుకరూపం వచ్చినా, వాడికి పాషాణత్వం ప్రాప్తించినా.. ఇదంతా దైవానుగ్రహం వల్లనే కాబోలు’ అని అనుకున్నాడు.
ఆ తర్వాత మరికొంతకాలం గడిచింది.
* * *
ఒకనాడు విద్యుత్ప్రభ తొలినాటి ఉద్యానవనానికి వెళ్లింది. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న దండుడు పొదరింటి దగ్గరికి ఎగిరివెళ్లి పుసుపు రంగు పూలను వాసన చూశాడు. వెనువెంటనే చిలుక రూపు పోయి మళ్లీ మానవుడిగా మారాడు. ఆ వింతనంతటినీ ఆశ్చర్యంతో పరికించిన విద్యుత్ప్రభ..
“ఆర్యా! మీరెవరు?” అని ప్రశ్నించింది.
“నారీమణీ! నేను మీ తాత మయుని వంశంలోని వాడినే. నాపేరు దండుడు. అనుకోకుండా నీ ఉద్యానవనంలో ప్రవేశించాను. ఆ పువ్వును వాసన చూసినందువల్ల చిలుకగా మారిపోయాను. పుణ్యవశాన నీ ప్రాపు దొరికింది. నీ దయవల్ల నేను విమానాలు తయారుచేసే విద్యను నేర్చుకోగలిగాను. మరి నాకు సెలవిస్తే వెళ్లివస్తాను” అన్నాడు దండుడు. అంటూనే తన రూపాన్ని మార్చిన రెండురకాల పూలనూ కొద్దికొద్దిగా సేకరించుకున్నాడు.
విద్యుత్ప్రభ ముఖం వాడిపోయింది.
“ఆర్యపుత్రా! నీవు విద్యచేతనే కాకుండా రూపం చేత కూడా అసాధారణుడవే. నీవంటివాడు మగువ మనసులోని మాట కనిపెట్టజాలడంటే అంగీకరించలేను” అని సాభిప్రాయంగా అతని వంక చూసింది.
పెదవులపై చిరునవ్వు తొణికిసలాడుతుండగా, దండుడు ఆమెను పాణిగ్రహణం చేశాడు. అదృష్టవంతులకు ప్రతికూలతల్లో కూడా అనుకూల లాభాలే కలుగుతూ ఉంటాయి. ఆ విద్యాధర వనితతో దండుడు కొంతకాలంపాటు ఇష్టభోగాలలో మునిగి తేలాడు.
ఒకనాడు విద్యుత్ప్రభను దగ్గరికి తీసుకుని, తన కథనంతా వివరంగా చెప్పుకొచ్చాడు.
“స్నేహితులతో ఏర్పాటు చేసుకున్న గడువుకాలం తీరిపోయింది. నువ్వు అనుమతిస్తే ఒకసారి వెళ్లివస్తాను” అన్నాడు.
“అయ్యో! వేడుక చవిచూసి, తమకం తీరగానే నీదారిన నీవు వెళ్లిపోతాననడం న్యాయమేనా? నాకంటే స్నేహితులే ఎక్కువా? ఎన్నెన్నో కొత్త తలపులు మనసులో పెట్టుకుని, ఇంకా సిగ్గు సరిగా పోనందువల్ల బయటపెట్టకుండా ఉన్నాను. నా కోరికలలో కొన్నయినా సరిగా తీరకమునుపే వెళ్లిపోతానంటే ఎలా?” అని విద్యుత్ప్రభ అతడిని నిర్బంధించింది.
“దేవీ! నీవు కామరూపిణివి కదా! నేను ఎక్కడినుంచి తలచుకున్నా నీవక్కడికి రాగలవు. నేనెక్కడున్నా నీ అభీష్టం తీర్చుకోవడానికి నీకు స్వేచ్ఛ ఉంది! ఇంత చిన్నవిషయానికి నీవంటి ధీరవనిత ఇలా చిన్నబోవడం తగునా?” అన్నాడు దండుడు.
ఇంకా అనేకరకాలుగా ఆమెకు నచ్చజెప్పి విద్యాధర లోకం నుంచి బయలుదేరాడు.
తాను ఎక్కివచ్చిన మర్రిచెట్టు మొదటికి వచ్చాడు. రాగమంజరి చేత శాపంపొంది రాయిగా మారిన సాంబుడు ఎక్కడున్నాడో వెంటనే కనిపెట్టలేకపోయాడు దండుడు.
మర్రిచెట్టు మొదట్లోని తీగను తెంపి, నీళ్లలో కలిపి అన్ని రాళ్లపైనా చల్లుకుంటూ వెళ్లాడు. చివరికి ఒకరాయి సాంబునిగా రూపుదాల్చింది.
సాంబుడు కళ్లు తెరుస్తూనే దండుని చూసి..
“అన్నా! నువ్వు వచ్చి ఎంతసేపైంది? మిగతా వాళ్లంతా రాలేదా? అన్నా! ఇందాకా ఇక్కడో అమ్మాయి ఉండాలి. ఆమె నాతో ఏదో మాట్లాడుతుండగా తెలియకుండానే నిద్ర పట్టేసింది” అన్నాడు ఆవులింతలను ఆపుకొంటూ.
దండుడు ఆ మాటలకు నవ్వి..
“వెర్రివాడా! ఆ అమ్మాయి పేరు రాగమంజరి. మనిషి కాదు.. విద్యాధర కన్య. నిన్ను రాయిలా మారిపోమని శపించి వెళ్లిపోయింది. నువ్విక్కడ రెండునెలల నుంచి రాయిలా పడి ఉన్నావు” అని వివరించాడు.
సాంబుడు తెల్లబోయాడు.
‘ఎంత మాయ చేసింది?!’ అనుకున్నాడు గుండెలపై చేయివేసుకుని.
“కానీ అన్నా! నా మనసు ఆమెమీదనే ఉంది. ఆమెను చూడకుండా నా ప్రాణాలు నిలబడవు. ఎలాగైనా ఆమెను తిరిగి నా ముందు నిలబెట్టి నన్ను రక్షించుకో” అని వేడుకున్నాడు సాంబుడు.
అతడి బాధ చూడలేక..
“అయ్యో సోదరా! ఎంత వెర్రివాడవురా! సరే నీ కోరికను నేనెందుకు కాదనాలి?! ఒక పని చేద్దాం. ఆ విద్యాధర కన్యలందరూ ప్రతి ఆదివారంనాడూ ఈ కొలనులో జలకేళికోసం వస్తారు. ఆ అదను వచ్చేదాకా ఇక్కడే ఉందాం. నువ్వు మళ్లీ ఆమె చీరను దొంగిలించి చెట్టెక్కి కూర్చో. ఆమె ఎంతగా బతిమాలినా చీర తిరిగి ఇవ్వకు. తర్వాతి కథ నేను చూసుకుంటా” అని హామీ ఇచ్చాడు సాంబుడు.
ఆదివారం రానేవచ్చింది. తోటి సఖులతో కలిసి, రాగమంజరి మళ్లీ చెరువు వద్దకు వచ్చింది. సాంబుడు యథావిధిగా ఆమె చీర తస్కరించి చెట్టెక్కాడు.
రాగమంజరి తన చీరకోసం సాంబుణ్ని ఎన్నోరకాలుగా బతిమాలింది. ఎన్నెన్నో ఇచ్చకాలు చెప్పింది. కానీ, సాంబుడు చీర తిరిగి ఇవ్వలేదు.
కొంతసమయం గడువనిచ్చి దండుడు అక్కడికి వచ్చాడు. తనను చూసి, సిగ్గుపడుతున్న రాగమంజరికి వేరొక చీరను అందించాడు.
దానికి ఆమె..
“పుణ్యాత్మా! మాకు మధ్యవర్తివై ఈ తగువు తీర్చు. ఇతడు నా చీర దొంగిలించాడు. ఎంత బతిమాలినా తిరిగి ఇవ్వడం లేదు. అంతగా ఇష్టమైతే నా చీరనాకిచ్చేసి, నన్ను పెళ్లిచేసుకోమని వేడుకుంటున్నాను. అయినా అతగాడు అంగీకరించడం లేదు” అని చెప్పింది రాగమంజరి.
అందుకు దండుడు..
“వనితా! ఈ తగువు నేను తీర్చేది కాదు. మీ రాజుగారి కూతురైన విద్యుత్ప్రభను ఇక్కడికి రప్పిస్తాను. ఆమెతో చెబుదాం” అని, తన భార్యను స్మరించాడు.
కళ్లుమూసి తెరిచేలోగా విద్యుత్ప్రభ అక్కడికి వచ్చింది. తగువునంతా విన్నది.
“నాథా! మీరు చెప్పినదాన్ని బట్టి మీ స్నేహితుడు వస్త్రచోరుడని అర్థమవుతున్నది. ఇటువంటి దొంగలకు మొయ్యరాని బండబరువు నెత్తిమీద పెట్టి నడిపించడమే సరైన శిక్ష” అని తీర్పునిచ్చింది.
దండుడు హాయిగా నవ్వాడు.
“యదార్థం చెప్పావు. ఇతగాడికి పెళ్లిచేసి గుదిబండను తగిలిస్తే సరిపోతుంది. అంతకంటే పెద్దశిక్ష అక్కర్లేదు. అంతేకదా!” అన్నాడు.
విద్యుత్ప్రభ మెల్లగా రాగమంజరి వద్దకు చేరింది.
“సఖీ! వీరు సామాన్య మానవులు కారు. విద్యాగుణ శీలముల యందు దేవతలను కూడా తిరస్కరించగలరు. కనుక నువ్వితడిని పెళ్లాడి.. నీ సౌందర్యాన్ని సార్థకం చేసుకో” అని అనునయంగా చెప్పి ఒప్పించింది.
రాగమంజరికి సాంబునికి గాంధర్వవిధిగా వివాహం జరిగింది. ఆ రెండుజంటలూ అక్కడే ఉన్న పొదరిళ్లలో హాయిగా కొంతకాలం గడిపాయి.
అటుపైన వసంతుని వెతుక్కుంటూ దండుడు, సాంబుడు ఇద్దరూ వెళ్లారు. వింతైన మర్రిచెట్టు తూర్పుదిక్కు కొమ్మను ఎక్కారు. ఆ దారిలో మొదట ప్రయాణించిన వసంతునికి కనిపించిన వింతలన్నీ వారికి కూడా కనిపించాయి.
కొమ్మకు చివరిలో నిర్జనమైన ఒకానొక పట్టణం, ఆ పట్టణంలోని కోట, కోటలోపలి అంతఃపురం వరకు వసంతుడు వెళ్లినట్లే వాళ్లు కూడా వెళ్లారు. అక్కడ వసంతుడు కొన ఊపిరితో పడి ఉండటం గమనించారు. వసంతుని మంచం పక్కనే సగం అరగదీసి ఉన్న కత్తి ఒరను, దండుడు తిరిగి బాగుచేశాడు.
ఒర బాగుపడుతూనే వసంతుడు నిద్రనుంచి మేల్కొన్నవాడిలా లేచి కూర్చున్నాడు. దండుని, సాంబుని ఆనందంతో కౌగిలించుకున్నాడు.
“మిత్రులారా! నేను వనితాలోలుడనని తెలిసి, మీరే నన్ను వెతుక్కుంటూ వచ్చారా?!” అన్నాడు. అంటూనే కళావతికోసం చుట్టూ వెతికి చూశాడు.
“మిత్రులారా! నా కళావతి కనిపించదేం?” అని ప్రశ్నించాడు.
అందుకు దండుడు..
“అన్నా! ఇక్కడ నువ్వు తప్ప వేరెవ్వరూ మాకు కనబడలేదు. నీ ప్రాణాలను దాచిపెట్టి ఉంచిన ఒరను ఎవరో సగం అరగదీసి విడిచిపెట్టారు. నువ్వు ఎవరికి నీ ఆయువు గుట్టు చెప్పావో, వారే బహుశా ఈ పనికి ఒడిగట్టి ఉండవచ్చు” అని చెప్పాడు.
“ఇది ఆ మాయదారి ముసలిదాని పనే. కళావతి నా గుట్టును దానికి చెప్పి ఉంటుంది. అయ్యో! ఆ ముసలిది నా కళావతిని ఎక్కడికో ఎత్తుకుపోయి ఉంటుంది. నా ప్రాణనాయకీ! కళావతీ! నువ్వు లేకుండా నా ప్రాణం నిలబడదు. కానీ, నువ్వు ఎక్కడున్నావని వెతకను? తిరిగి నిన్నెలా కలుసుకోగలను?” అంటూ వసంతుడు భోరున విలపించసాగాడు.
(వచ్చేవారం.. తిరిగి కలిసిన మిత్రులు)
అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu Episode 7 ( కాశీ మజిలీ కథలు ) | మంత్రిగారి భార్య
Kasi Majili Kathalu Episode 6 ( కాశీ మజిలీ కథలు ) | హేలానగరంలో ప్రవరుడు
Kasi Majili Kathalu Episode 5 | రాముని మెచ్చిన లతాంగి
Kasi Majili Kathalu Episode 4 | చేపమింగిన కంకణం
“Kasi Majili Kathalu Episode 3 | పంజరంలో రామచిలుక”
“Kasi Majili Kathalu Episode 2 | దేవతా వస్త్రాలు”
“Kasi Majili Kathalu Episode 1 | జారిపడ్డ మామిడిపండు”